-
రైతుల ‘వేలం’వర్రీ!
సాక్షి, హైదరాబాద్: పాడి గేదెల పెంపకం కోసమో, వ్యవసాయ యంత్రాల కొనుగోలు, ఇతరత్రా అవసరాల కోసమో తీసుకున్న దీర్ఘకాలిక రుణాలను సహకార బ్యాంకులు రైతుల ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నాయి. కొన్నిచోట్ల వారు తాకట్టు పెట్టిన భూముల్ని వేలం వేసి మరీ బకాయిలను రాబట్టుకుంటున్నాయి. దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు, పంట రుణాలు తిరిగి చెల్లించాలంటూ నోటీసులు జారీ చేస్తున్న వివిధ జిల్లాల కేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీలు).. నిస్సహాయ పరిస్థితుల్లో రుణాలు చెల్లించని వారి భూములు, ఇతర ఆస్తులను వేలం వేస్తున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతాంగంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఫలానా రోజు ఫలానా రైతు భూమిని వేలం వేస్తున్నామంటూ గ్రామాల్లో చాటింపు వేయిస్తుండటంతో పరువు పోతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెల్లించాల్సిన రుణం తక్కువగా ఉన్నా మొత్తం భూమిని డీసీసీబీలు వేలం వేస్తుండటంతో తమకు భూమి లేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల విషయంలోనే కఠిన వైఖరి? రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు (టెస్కాబ్) ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది. దాని పరిధిలో జిల్లా స్థాయిలో డీసీసీబీలు ఉంటాయి. వాటి కింద ప్యాక్స్ పని చేస్తుంటాయి. ఇవి ప్రధానంగా రైతుల కోసమే పనిచేయాల్సి ఉంటుంది. వీటి చైర్మన్లను, డైరెక్టర్లను రైతులే ఎన్నుకుంటారు. డీసీసీబీల చైర్మన్లు టెస్కాబ్ చైర్మన్ను ఎన్నుకుంటారు. ఈ బ్యాంకులు రైతులకు అవసరమైన పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది. వాణిజ్య బ్యాంకుల మాదిరిగానే డీసీసీబీలు ప్రతి ఏటా వేలాది కోట్లు రైతులకు రుణాలు అందిస్తుంటాయి. రైతులతోపాటు ఇతరులకు కూడా గృహ, విద్య రుణాలు కూడా ఇస్తుంటాయి. రైతులకైతే ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు కొనేందుకు, భూములను చదును చేసుకునేందుకు, వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి, చేపలు, గొర్రెల పెంపకం తదితరాల ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకునేందుకు దీర్ఘకాలిక రుణాలు ఇస్తుంటారు. అయితే పలుకుబడి కలిగి కోట్ల రూపాయలు తీసుకునే వారిపై, రాజకీయ నాయకుల విషయంలో మెతక వైఖరి అవలంభించే డీసీసీబీలు రైతుల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. పెద్దల విషయంలో కోట్లు రికవరీ చేయలేక నష్టాలను చవిచూస్తున్న అనేక సహకార సంఘాలు, రైతులను మాత్రం ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఎలాగోలా చెల్లిస్తామని రైతులు వేడుకుంటున్నా కనికరించడం లేదు. భూములను వేలం వేస్తున్నాయి. వేలం పాటలో ఆయా గ్రామాల ఇతర రైతులు ఎవరూ పాల్గొనకపోతే డీసీసీబీలే స్వాదీనం చేసుకుంటున్నాయి. మరోవైపు చెల్లించాల్సిన రుణం కంటే ఎక్కువ విలువున్న భూములను వేలం వేయడంపై రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదనంగా వచ్చే డబ్బును రైతులకే ఇస్తున్నామని అధికారులు అంటున్నా, కొద్దిపాటి భూమిని కూడా తమకు ఉంచడం లేదని రైతులు అంటున్నారు. అప్పుకు మించి భూమిని అమ్మే హక్కు సహకార బ్యాంకులకు ఎక్కడ ఉందని నిలదీస్తున్నారు. మరీ విచిత్రంగా కేవలం రూ.50 వేల రుణం ఉన్న రైతుల ఆస్తులను కూడా వేలం వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్క ఉమ్మడి మహబూబ్నగర్లో 202 మందికి నోటీసులు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా డీసీసీబీ పరిధిలో 78 ప్యాక్స్ ఉన్నాయి. వీటి పరిధిలో 22 డీసీసీబీ బ్రాంచీలు ఉన్నాయి. గత ఏడాది (2023–24) పంట రుణాల కింద 62 వేల మంది రైతులకు రూ. 672 కోట్లు, దీర్ఘకాలిక రుణాల కింద 1,100 మందికి రూ.70 కోట్లు, గృహ రుణాల కింద 200 మందికి రూ.18 కోట్లు, విద్యా రుణాల కింద 180 మందికి రూ.14 కోట్లు అందజేశాయి. ఇందులో దీర్ఘకాలిక రుణాలు పెండింగ్లో ఉన్న 202 మందికి బ్యాంక్ అధికారులు లీగల్ నోటీసులు జారీ చేసి రూ.8 కోట్లు రికవరీ చేశారు. ఈ క్రమంలో కొందరు రైతుల భూములు, ఆస్తులను కూడా వేలం వేయడం గమనార్హం. నిజామాబాద్లో 71 మందికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో డీసీసీబీలో ఇళ్లు, వ్యవసాయ భూములు, ఇతరత్రా ఆస్తులు తాకట్టు పెట్టి కొందరు రైతులు రుణాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో 71 మందికి డీసీసీబీ అధికారులు నోటీసులు జారీచేశారు. అయినా అప్పులు చెల్లించని రైతుల ఆస్తులను వేలం వేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో కూడా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి ఏటా వానాకాలం, యాసంగి సీజన్లలో డీసీసీబీలు పంట రుణాలు ఇస్తాయి. గడిచిన వానాకాలంలో రూ.469.82 కోట్లు, యాసంగి సీజన్లో రూ.126.68 కోట్లు పంట రుణాలుగా ఇచ్చాయి. అలాగే రూ. 236.38 కోట్ల దీర్ఘకాలిక రుణాలు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో రుణాలు తిరిగి చెల్లించని రైతులకు నోటీసులు జారీ అయ్యాయి. రైతులు రుణాలు చెల్లించకుంటే ఆస్తులను వేలం వేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. డీసీసీబీలు నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాయి రైతులు తీసుకున్న దీర్ఘకాలిక రుణాలు, పేరుకు పోయిన ఇతరత్రా రుణాలను రికవరీ చేయాల్సిన బాధ్యత డీసీసీబీలపై ఉంటుంది. రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం అవి పనిచేయాలి. రైతులు తమ భూములు, ఇళ్లు, ఇతరత్రా ఆస్తులను తనఖా పెట్టి దీర్ఘకాలిక రుణాలు తీసుకుంటారు. అయితే ఏళ్లుగా పేరుకుపోయిన మొండి బకాయిలను వసూలు చేసే క్రమంలో రైతులకు నోటీసులు ఇస్తున్నారు. పలు జిల్లాల్లో భూములు, ఇతర ఆస్తులు వేలం వేస్తున్నారు. నిబంధనల ప్రకారమే డీసీసీబీలు వ్యవహరిస్తున్నాయి. – నేతి మురళీధర్రావు, ఎండీ, టెస్కాబ్ – నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం ఐనోలు గ్రామానికి చెందిన ఓ రైతు పాల వ్యాపారం చేసేందుకు గాను గేదెలను కొనుగోలు చేయాలని భావించి 2017 డిసెంబర్లో తనకున్న 2.30 ఎకరాల భూమిని తాకట్టుపెట్టి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లో రూ.7.20 లక్షల దీర్ఘకాలిక రుణం తీసుకున్నాడు. మూడు కిస్తీలు కట్టాడు. ఆ తర్వాత గేదెలు చనిపోవడంతో నష్టం వాటిల్లింది. కిస్తీలు చెల్లించకపోవడంతో అసలు, వడ్డీ కలిపి రూ.9.68 లక్షలు బకాయి చెల్లించాల్సి ఉండగా.. రైతు తాకట్టు పెట్టిన భూమిని బ్యాంకు అధికారులు వేలం వేసి నగదు జమ చేసుకున్నారు. – జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ప్యాక్స్) పరిధిలోని పెద్దపోతులపాడు గ్రామానికి చెందిన చంద్రకాంత్రెడ్డి తండ్రి సంజీవరెడ్డి కొన్నేళ్ల క్రితం ట్రాక్టర్ కోసం మూడెకరాలు తాకట్టు పెట్టి రూ.1,66,000 రుణం తీసుకున్నాడు. మూడేళ్ల అనంతరం లోన్ సరిగా చెల్లించడంలేదని ట్రాక్టర్ను సీజ్ చేశారు. దీంతో చంద్రకాంత్రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా కేసు నడుస్తోంది. ఇలావుండగా పొలం వేస్తున్నామంటూ ఇటీవల ప్యాక్స్ అధికారులు నోటీసులు పంపించారు. దీంతో చంద్రకాంత్ తమ ట్రాక్టర్ సీజ్ చేశారని, పొలం ఎలా వేలం వేస్తారని నిలదీసినా ఫలితం లేకపోయింది. ఎకరం రూ.12.10 లక్షల చొప్పున మరో రైతుకు విక్రయించారు. అయితే రెవెన్యూ రికార్డుల్లో ఆ సర్వే నంబర్లో ఉన్న మొత్తం 4.12 ఎకరాలు రెడ్మార్క్లో పెట్టడంతో రైతు లబోదిబోమంటున్నారు. -
మళ్లీ రెడీ.. మోసం గ్యారంటీ
రైతాంగానికి చంద్రబాబు చేసిన దగా అంతా ఇంతా కాదు. అసలు వ్యవసాయమే దండగ అని చెప్పిన ఘనుడు. నేల తల్లిని నమ్ముకున్న రైతుల్ని నిట్టనిలువునా ముంచేశారు. రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలన్నింటినీ బేషరతుగా మాఫీ చేస్తానని పీఠంపైకి ఎక్కిన తర్వాత అన్నదాతల పీక నులిమేశారు. చివరికి అధికారంలోకి రావడానికి వక్రమార్గాలన్నీ ఎంచుకుని అబద్ధాలతో ఐదేళ్లపాటు రైతుల జీవితాలతో ఆడుకున్నారు. ఆయన జీవితమంతా అబద్ధాలతోనే గడిచిపోయింది. ‘పులి–బంగారు కడియం’ కథలో మాదిరిగా బాబు గద్దెనెక్కడానికి చేయని వాగ్దానం లేదు. కుర్చీ ఎక్కగానే వ్యవసాయ రుణాల మాఫీలో కోతలకు కోటయ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఫలితంగా రూ.87,612 కోట్ల రుణాలను రూ.25 వేల కోట్లకు కుదించి, చివరికి రూ.15 వేల కోట్ల లోపే మాఫీ చేసిన జిత్తులమారి ‘నారా’ కపట నాటకానికి రైతులు ఆత్మార్పణం చేసుకోవలసి వచి్చంది. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా కూడా ఎగ్గొట్టిన మోసకారి చంద్రబాబు. అలాంటాయన ఇప్పుడు మళ్లీ మన ముందుకు సరికొత్త కపట హామీలతో వస్తున్నారు. సాక్షి, అమరావతి: వ్యవసాయ రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానంటూ 2014 ఎన్నికల సభల్లో హామీలు గుప్పించిన చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చాక మాట మార్చేశారు. వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని తాను చెప్పలేదన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వ్యవసాయ రుణాల మాఫీ ఫైలుపై తొలి సంతకం చేస్తానని పేర్కొన్న చంద్రబాబు తీరా ప్రమాణం స్వీకారం చేసిన తరువాత ఫైలుపై సంతకం చేయకపోగా, రుణ మాఫీలో ఎలా కోతలు పెట్టాలనే అలోచనతో కోటయ్య కమిటీ ఏర్పాటు చేస్తూ తొలి సంతకం చేశారు. అదీ పంట రుణాల మాఫీకి మా త్రమే లబ్ధిని పరిమితం చేశారు. కోటయ్య కమిటీ లో చంద్రబాబు తనకు అత్యంత ఇషు్టడైన కుటుంబరావును చేర్చారు. అప్పటి నుంచి వ్యవసాయ రు ణాల మాఫీని ఎలా కుదించాలనే దానిపై కసరత్తు చేశారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటూ కొత్త విధానా న్ని తీసుకువచ్చి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టారు. షరతులతో కత్తెరలు రైతులకు బ్యాంకులు నిర్ధారించిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కన్నా ఎక్కువ పంట రుణాలిస్తే ఆ రుణాలు మాఫీ పరిధిలోకి రావంటూ కత్తెర పెట్టారు. ఆ తరువాత వ్యవసాయ అవసరాలకు రైతులు బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలపై ఆంక్షలు విధించారు. ఒక కుటుంబంలో ఎంత మంది ఎంత రుణం తీసుకున్నా ఆ కుటుంబం మొత్తానికి రూ.1.50 లక్షల వరకే మాఫీ అని షరతు విధించారు. బ్యాంకుల్లో బంగారాన్ని తాకట్టు పెట్టుకునే సమయంలో పంట రుణాలని రాయకపోతే వాటిని రుణ మాఫీ నుంచి తొలగించేశారు. రైతులు ఆధార్, రేషన్ కార్డులు ఇస్తేనే మాఫీ వర్తిస్తుందని షరతు విధించారు. తొలుత 2014 మార్చి వరకు ఉన్న రుణాలు, వడ్డీ మాఫీ చేస్తామని చెప్పి తరువాత 2013 డిసెంబర్ నెలాఖరు వరకు ఉన్న రుణాలు, వడ్డీ మా త్రమే మాఫీ చేస్తామని ప్రకటించారు. ఒకే సారి రుణ మాఫీ సాధ్యం కాదని, దశల వారీగా చేస్తామ ని ఎక్కువ మంది రైతుల ఖాతాలను తప్పించేశారు. మాట మార్చి.. రైతులను ఏమార్చి 2014 జూన్ 29న చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో వ్యవసాయ రుణాలు రూ.87,612 కో ట్లు, డ్వాక్రా సంఘాల రుణాలు రూ.14,204 కోట్లు ఉన్నాయ ని బ్యాంకర్ల కమిటీ స్పష్టం చేసింది. ఒకే సారి రైతులు, డ్వాక్రా సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తే అభ్యంతరం లేదని ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభుత్వానికి తెలిపారు. అయితే రుణాల మాఫీ తరువాత చూద్దమని ముందుగా గత ఖరీఫ్లో కరువు, తుఫాను ప్రభావం గల 575 మండలాల్లో రైతుల రుణాలను రీ షెడ్యూల్పై ఆర్బీఐతో మాట్లాడాల్సిందిగా చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆర్బీఐ మొత్తం మండలాల్లో రైతు ల రుణాల రీ షెడ్యూల్ సాధ్యం కాదని స్పష్టం చేసింది. వడపోతలు, ఏరివేతలు తరువాత మొత్తం రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల్లో కేవలం 25 వేల కోట్లకు రుణ మాఫీని కుదించేసి నాలుగు దశల్లో చెల్లిస్తామని షరతులు విధించింది. తొలుత రూ.50 వేలలోపు చెల్లిస్తామని, రూ.50 వేలు దాటిన రుణాలకు రైతు ధ్రువీకరణ పత్రాలను చెల్లిస్తామని మోసం చేశారు. నమ్మక ద్రోహానికి ఫలితంగా ఆత్మహత్యలు 2019 ఎన్నికల ముందు నాటికి కేవలం రూ.15 వేల కోట్ల లోపు మాత్రమే రుణ మాఫీకి చంద్రబాబు సర్కారు హామీ ఇచ్చింది. అరకొర రుణ మాఫీతో రైతులు మరింత అప్పులు ఊబిలోకి కూరుకుపోయారు. వడ్డీ భారం అమాంతం పెరిగిపోయింది. మరో పక్క 2015 ఏడాది నుంచి 2016 వరకు వ్యవసాయ రుణాల కోసం బంగారం బ్యాంకుల్లో కుదువ పెట్టి 35,24,549 మంది రైతులు రూ.26,055.18 కోట్లు పంట రుణాలు తీసుకుంటే అందులో సవాలక్ష షరతులు విధించి కేవలం రూ.3,366.80 కోట్లకు మాఫీని కుదించారు. దీంతో బంగారంపై రుణాల తీసుకున్న రైతుల పేర్లతో బ్యాంకులు వేలం నోటీసులు ఇవ్వడమే కాకుండా వాటిపై పత్రికల్లో ప్రకటనలు వేశాయి. దీంతో చాలా మంది రైతుల ఆత్మాభిమానం కోల్పోయి అవమాన భారాన్ని తట్టుకోలేక ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకున్నారు. -
కౌలు రైతులకు భరోసానిస్తున్నా బాధేనా రామోజీ?
సాక్షి, అమరావతి: గతంలో ఎన్నడూ లేనివిధంగా కౌలురైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుంటే రామోజీరావు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా వారికి మేలు జరుగుతుంటే విషపురాతలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. గత ప్రభుత్వాలు ఆలోచన కూడా చేయని పంట సాగు హక్కుదారుల చట్టం–2019 తీసుకురావడమే కాదు.. సీసీఆర్సీల ఆధారంగా వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం, పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీతో పాటు వివిధ కారణాలతో చనిపోయిన రైతు కుటుంబాలకు రూ. 7 లక్షల పరిహారం అందిస్తున్నారు. అంతేకాదు కౌలురైతులకు ఈక్రాప్ నమోదు ప్రామాణికంగా సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ), ఉచిత పంటల బీమా వంటి పథకాలు అందిస్తున్నారు. ఈ క్రాప్లో నమోదే ప్రామాణికంగా పండించిన పంటలను ఆర్బీకేల ద్వారా అమ్ముకోగలుగుతున్నారు. చంద్రబాబు హయాంలో కౌలు రైతులకు మేలు చేసే ఊసేలేదు. వాస్తవాలకు ముసుగేసి తప్పుడు కథనాలతో రామోజీరావు నిత్యం బురదజల్లడమే పనిగాపెట్టుకున్నారు. వ్యవసాయాన్ని పండుగలామార్చిన వైఎస్ జగన్ ప్రభుత్వంపై అభాండాలు వేస్తూ ‘కౌలురైతు నోట్లో మట్టి’ అంటూ ఈనాడు పత్రికలో రోతరాతలు రాశారు. ఆరోపణ: కౌలు రైతులను ఆదుకోవడంలో 100 శాతం విఫలం వాస్తవం: భూయజమాని హక్కులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా, వారి హక్కుల రక్షణకల్పిస్తూనే వాస్తవ సాగుదారులకు పంట సాగుదారు హక్కు పత్రాల(సీసీఆర్సీ)ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తోంది. ఇందుకోసం ఏటా ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు రెవెన్యూ శాఖతో కలిసి ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలో అవగాహనా సదస్సులు నిర్వహిస్తోంది. 2019 నుంచి ఇప్పటివరకు 25.82 లక్షల మంది కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు మంజూరు చేశారు. ఆరోపణ: కౌలురైతులకు పంట రుణాలేవి వాస్తవం: వాస్తవ సాగు దారులందరికి పంట రుణాలివ్వాలన్న సంకల్పంతో పీఏసీఎస్లను ఆర్బీకేలతో అనుసంధానం చేశారు. సీసీఆర్సీ కార్డులున్న వారికి రుణాలు అందిస్తున్నారు. సీసీఆర్సీ లేని కౌలు రైతులతో జాయింట్ లయబిలిటీ గ్రూపు (జేఎల్జీ)లను ఏర్పాటు చేసి ఈ గ్రూపుల ద్వారా వారికి రుణాలు అందేలా చేస్తున్నారు. ఇలా 2019 నుంచి ఇప్పటివరకు 13.49 లక్షల మంది కౌలుదారులకు రూ. 7,959.49 కోట్ల రుణాలు అందించారు. ఆరోపణ: రైతు భరోసాకు మొండిచేయి వాస్తవం: దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారు. భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతో పాటు అటవీ, దేవదాయ భూమి సాగుదారులకు కూడా రూ. 13,500 చొప్పున మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా అందిస్తోంది. కౌలుదారుల్లో 6 శాతం మందికి మాత్రమే రైతు భరోసా అందుతుందనడంలో వాస్తవంలేదు. మెజార్టీ కౌలు దారులు సొంత భూమి కూడా కలిగి ఉన్నారు. వీరందరికీ భూ యజమానిగా వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందుతోంది. సీసీఆర్సీ కార్డుల ఆధారంగా వైఎస్సార్ రైతు భరోసా కింద ఈ 50 నెలల్లోనే దాదాపు 5.38 లక్షల మంది కౌలు రైతులకు రూ. 697.32 కోట్లు, 3.99 లక్షల అటవీ భూములు (ఆర్వోఎఫ్ఆర్) సాగు చేసే గిరిజనులకు రూ. 522.36 కోట్లు కలిపి మొత్తం 9.38 లక్షల మందికి రూ. 1,219.68 కోట్లు పెట్టుబడి సహాయంగా అందించారు. ఆరోపణ: కౌలురైతులకు అందని సంక్షేమ ఫలాలు వాస్తవం: కౌలుదారులకు సంక్షేమ ఫలాలు అందడం లేదనడంలో ఎంతమాత్రం వాస్తవం లేదు. వైఎస్సార్ రైతు భరోసాతో సహా భూయజమానులకు వర్తింçప చేసే సంక్షేమ ఫలాలన్నీ భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాగుదారులకు కూడా వర్తింప చేస్తున్నారు. సీసీఆర్సీ కార్డు ఉన్నా లేకున్నా కూడా అందిస్తున్నారు. ఈ క్రాప్ ఆధారంగా లక్ష లోపు పంటరుణాలు పొందిన కౌలుదారులకు వైఎస్సార్ సున్నావడ్డీ రాయితీ కూడా అందేలా చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 30 వేల మందికి రూ.6.26 కోట్ల సున్నా వడ్డీ రాయితీని అందించారు. అలాగే 3.55లక్షల మందికి రూ.731.08 కోట్ల పంటల బీమా పరిహారం, 2.41లక్షల మందికి 253.56 కోట్ల పంట నష్ట పరిహారం బాబు హయాంలో కౌలురైతులను ఆదుకున్నదేది? చంద్రబాబు హయాంలో కౌలు రైతులకు కనీసంగా అంటే కనీసంగా కూడా ఆదుకున్న దాఖలాలు లేవు. ఏటా అరకొరగా తమకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే ఎల్ఈసీ కార్డులు జారీ చేయడం తప్ప ప్రభుత్వ పరంగా ఏ ఒక్క సంక్షేమ ఫలాలు అందించిన జాడే లేదు. కౌలుదారుల్లో 80 శాతం మందికి పైగా భూయజమానులతో ఎలాంటి లిఖిత పూర్వక ఒప్పందం లేకుండా భూమిని కౌలుకు తీసుకుంటారు. అధీకృత ఒప్పందాల్లేక పోవడం వలన ప్రభుత్వ పథకాలు, ప్రోత్సహాకాలు, రాయితీలే కాదు కనీసం పంట రుణాలు కూడా దక్కేవి కావు. టీడీపీ హయాంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతులకు రూ. 5 లక్షల పరిహారం ఇచ్చేవారు. కానీ దీన్లో రూ.1.5 లక్షల్ని అప్పులకు జమ చేసుకుని, మిగిలిన 3.5 లక్షలు కూడా విత్డ్రా చేసుకునేందుకు వీలు లేకుండా డిపాజిట్ చేసి, దానిపై వచ్చే వడ్డీని మాత్రమే వాడుకునే పరిస్థితి కల్పించేవారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పరిహారాన్ని రూ.5 లక్షలనుంచి రూ.7 లక్షలకు పెంచడమే కాదు. ఆ మొత్తాన్ని నేరుగా ఆత్మహత్యలకు పాల్పడే రైతు కుటుంబాల ఖాతాలకు జమ చేస్తోంది. కౌలు రైతు అయినా వ్యవసాయ కారణాలతో చనిపోతే దేశంలో రూ.7 లక్షల పరిహారం ఇస్తున్నది ఒక్క మన రాష్ట్రంలోనే. కౌలుదారుల కుటుంబాలకునేరుగా పరిహారం వ్యవసాయాధారిత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్న కౌలుదారులకు సీసీఆర్సీ కార్డు ఉంటే రూ. 7 లక్షలు, లేకుంటే వైఎస్సార్ బీమా కింద రూ.లక్ష పరిహారం నేరుగా బాధిత కౌలురైతు కుటుంబ సభ్యుల ఖాతాకు జమ చేస్తున్నారు. ఇలా 2019 నుంచి ఇప్పటి వరకు 1,270 కేసులకు సంబంధించి రూ.88.90 కోట్ల పరిహారం చెల్లించారు. ఇందులో 485 మంది కౌలురైతులుండగా, ఆ కుటుంబాలకు రూ. 33.95 కోట్ల ఆర్థిక సాయం అందించారు. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రైతు ఆత్మహత్యలపై పునర్విచారణ జరిపి 474 మందికి రూ. 23.70 కోట్ల పరిహారం చెల్లించగా, వీరిలో కూడా 212 మంది కౌలురైతులున్నారు. వీరికి రూ. 10.60 కోట్ల పరిహారం చెల్లించారు. -
రైతు పంట రుణాలపై ఆర్థిక సాయం
-
బంగారు రుణాలపై గురి
సాక్షి, అమరావతి: రైతుల వ్యవసాయ, కుటుంబ అవసరాలను తీర్చడంలో సహకార బ్యాంకులు వాణిజ్య బ్యాంకులతో పోటీ పడుతున్నాయి. పంట రుణాలకే పరిమితం కాకుండా ఇతర రుణాల మంజూరులోనూ ముందుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో నాలుగేళ్లలో బంగారంపై రికార్డు స్థాయిలో రూ.15,076 కోట్ల రుణాలు మంజూరు చేశాయి. ఈ ఏడాది కనీసం రూ.10 వేల కోట్ల విలువైన గోల్డ్ లోన్లు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. బంగారు ఆభరణాలపై రుణాలిచ్చే విషయంలో వాణిజ్య బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, కార్పొరేట్ ఫైనాన్స్ వ్యాపార సంస్థలు ముందుంటున్నాయి. మెజార్టీ జాతీయ బ్యాంకులు తమకు నిర్ధేశించిన పంట రుణ లక్ష్యాలను అధిగమించేందుకు పెద్దఎత్తున బంగారంపై రుణాలు ఇస్తూ వాటిని పంట రుణాలుగా చూపిస్తున్నాయి. కార్పొరేట్ ఫైనాన్స్ సంస్థలు రెండు నిమిషాల్లోనే బంగారు రుణాలంటూ భారీ వ్యాపారం చేస్తున్నాయి. ఇవి డిమాండ్ను బట్టి ఏకంగా 15 నుంచి నుంచి 36 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి. నెల రోజులకు ఒకలా.. రెండు నెలలకు మరోలా.. ఆరు నెలలు, ఏడాది కాల పరిమితితో ఒక్కో రీతిలో వడ్డీ వసూలు చేస్తున్నాయి. నాలుగేళ్లలో రూ.15,076 కోట్ల రుణాలు నాలుగేళ్ల క్రితం ఏటా రూ.500 కోట్లకు మించి బంగారు రుణాలిచ్చే పరిస్థితి ఉండేది కాదు. అలాంటిది ప్రస్తుతం ఏటా రూ.3,769 కోట్లకుపైగా రుణాలు ఇస్తున్నారు. 2018–19 వరకు ఏటా వెయ్యి కోట్లకు మించి బంగారు రుణాలు మంజూరు చేసే పరిస్థితి ఉండేది కాదు. బంగారు రుణాలపై వసూలు చేసే వడ్డీ శాతాన్ని తగ్గించడంతో పాటు పీఏసీఎస్ స్థాయి వరకు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడంతో పాటు నాలుగేళ్లలో రికార్డు స్థాయిలో రుణాలు మంజూరు చేస్తున్నారు. సీఎం ఆదేశాలతో బంగారు రుణాలకు ప్రాధాన్యత సహకార బ్యాంకులు బలోపేతం అయ్యేందుకు బంగారు ఆభరణాలపై రుణాల మంజూరుకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆప్కాబ్ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో సహకార బ్యాంకులు పంట రుణాలతో సంబంధం లేకుండా పెద్ద ఎత్తున గోల్డ్ లోన్స్ను సైతం ప్రోత్సహిస్తున్నాయి. ఇందుకోసం మూడేళ్ల క్రితం వడ్డీ రేట్లను సవరించడం కలిసొచ్చింది. గతంలో 2 లక్షలకు పైబడిన గోల్డ్ లోన్లపై 10.6 శాతం ఉన్న వడ్డీ రేటును 8.50 శాతానికి.. రూ.2 లక్షల లోపు రుణాలపై 10.1 శాతంగా ఉన్న వడ్డీ రేటును 8 శాతానికి తగ్గించాయి. ఆరు నెలలకే తిరగరాసేలా మార్పు చేశారు. ఫలితంగా బంగారు రుణాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ప్రత్యేక దృష్టి పెట్టాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రైతులకు అండగా నిలిచేలా పంట రుణాలతో పాటు వ్యవసాయ, కుటుంబ అవసరాల కోసం మంజూరు చేసే బంగారు రుణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. రైతుల అవసరాలకు తగినట్టుగా తక్కువ వడ్డీకే బంగారు రుణాలు మంజూరు చేస్తున్నాం. ఏటా లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ముందుకెళ్తున్నాం. – మల్లెల ఝాన్సీ, చైర్పర్సన్, ఆప్కాబ్ -
రూ. 2 లక్షల పంట రుణాలు తీసుకోండి.. మాఫీ చేస్తాం
సాక్షి, హైదరాబాద్: రైతులు బ్యాంకుల నుంచి రెండు లక్షల రూపాయల వరకు పంట రుణాలు తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. ఆ విధంగా తీసుకున్న రుణాలను తాము అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామని భరోసా ఇచ్చారు. రైతు సంక్షేమం కోసం తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. చేవేళ్ల నియోజకవర్గంలోని శంకర్పల్లికి చెందిన పలువురు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహా్వనించారు. వచ్చే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏర్పడే ఇందిరమ్మ రాజ్యంలో నెలకు రూ.4 వేల పింఛన్ ఇస్తామని పునరుద్ఘాటించారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడి కారి్మకులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, పైలేరియా, డయాలిసిస్ పేషంట్లకు నెలకు రూ.4 వేల పింఛన్ ఇస్తామన్నారు. ఒక్క హామీ నెరవేర్చని కేసీఆర్ తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని చెప్పిన కేసీఆర్, అధికారంలోకి వచ్చాక పేదల సంక్షేమాన్ని విస్మరించారని రేవంత్రెడ్డి మండిపడ్డారు. రైతు వ్యతిరేకి అయిన కేసీఆర్ సీఎం అయ్యాక రాష్ట్రంలో 88 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర సంపదను తన కుటుంబసభ్యులకు దోచి పెడుతున్నారని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. వేల ఎకరాల భూములను ఆక్రమించుకున్నారని, ఇదేమని ప్రశ్నిస్తే పోలీసులను పంపి కేసులు పెడుతున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు భరిస్తామని, ఇల్లు కట్టుకునే ప్రతి పేదవాడికి రూ.5 లక్షల సాయం చేస్తామని రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. -
కౌలు రైతులకూ భరోసా
సాక్షి, అమరావతి: కౌలు రైతులకు వెన్నుదన్నుగా నిలవాలని ప్రభుత్వం సంకలి్పంచింది. గడచిన నాలుగేళ్ల కంటే మిన్నగా ఈ ఏడాది కౌలు కార్డులు (పంట హక్కు సాగు పత్రాలు–సీసీఆర్సీ) జారీ చేసింది. అర్హులైన ప్రతి కౌలు రైతుకూ పంట రుణాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా నిర్వహించిన ప్రత్యేక మేళాల్లో రికార్డు స్థాయిలో కౌలుదారులకు సీసీఆర్సీలు జారీ చేసింది. గతంలో కౌలు రైతులకు సంక్షేమ ఫలాలు అందేవి కాదు. ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.1.60 లక్షల వరకు పంట రుణం అందించే అవకాశం ఉన్నప్పటికీ ఆంక్షల పేరిట బ్యాంకులు మొండిచేయి చూపడంతో ప్రైవేటు వ్యక్తుల నుంచి రూ.3, రూ.5 వడ్డీలకు అప్పులు తెచ్చి సాగు చేసేవారు. కౌలు, వడ్డీలు కట్టలేక అప్పుల ఊబిలో కూరుకుపోయేవారు. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2019లో తీసుకొచి్చన పంట సాగుదారుల హక్కుపత్రాల (సీసీఆర్సీ) చట్టం కింద 11 నెలల కాల పరిమితితో కౌలు కార్డులు జారీ చేస్తున్నారు. సీసీఆర్సీల ద్వారా సంక్షేమ ఫలాలు సీసీఆర్సీల ద్వారా నాలుగేళ్లుగా పంట రుణాలతో పాటు అన్ని రకాల సంక్షేమ ఫలాలను కౌలు రైతులకు ప్రభుత్వం అందిస్తోంది. 2019–20 సీజన్లో 2,72,720 మందికి, 2020–21లో 4,14,770 మందికి, 2021–22 సీజన్లో 5,24,203 మందికి, 2022–23లో 5,49,513 మందికి సీసీఆర్సీ కార్డులు జారీ చేసింది. నాలుగేళ్లలో 9 లక్షల మంది కౌలుదారులకు రూ.6,668.64 కోట్ల పంట రుణాలు మంజూరు చేసింది. 3.92 లక్షల మంది కౌలుదారులకు వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.529.07 కోట్ల పెట్టుబడి సాయం అందించింది. పంటలు దెబ్బతిన్న 2.34 లక్షల మంది కౌలుదారులకు రూ.246.22 కోట్ల ఇన్పుట్ సబ్సిడీతో పాటు 1.73 లక్షల మందికి రూ.487.14 కోట్ల ఉచిత పంటల బీమా పరిహారాన్ని అందించింది. రికార్డు స్థాయిలో సీసీఆర్సీలు జారీ 2023–24లో కనీసం 8.81 లక్షల మందికి సీసీఆర్సీల జారీ చేయాలనే లక్ష్యంతో ఆర్బీకేల ద్వారా సీసీఆర్సీ మేళాలు నిర్వహించారు. ఈ మేళాల ద్వారా రికార్డు స్థాయిలో 7,77,417 మందికి సీసీఆర్సీలు జారీ చేశామని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ తెలిపారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు 4,51,545 మంది ఉండగా.. ఇతర వర్గాలకు చెందిన 3,25,872 మంది ఉన్నారు. ఈ ఏడాది కూడా రైతు భరోసా సాయం అందించేందుకు సీసీఆర్సీలు పొందిన వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారి వివరాలను రైతు భరోసా పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నారు. సెప్టెంబర్లో వీరికి వైఎస్సార్ రైతు భరోసా కింద తొలి విడత సాయం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది కనీసం రూ.4 వేల కోట్ల పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ఏటా కౌలు కార్డు ఇస్తున్నారు రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకుని పంటలు వేస్తున్నా. ఈ ఏడాది మినుము, వరి వేశా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఏటా కౌలు కార్డు ఇస్తున్నారు. గతేడాది రైతు భరోసా కింద రూ.13,500 జమయ్యాయి. ఈ ఏడాది కూడా కౌలుకార్డు తీసుకున్నా. రైతు భరోసా పోర్టల్లో అప్లోడ్ చేశామని చెప్పారు. చాలా ఆనందంగా ఉంది. – కంపమళ్ల రమీజ, రుద్రవరం, కర్నూలు జిల్లా కౌలు కార్డు ద్వారా రూ.లక్ష రుణం తీసుకున్నా నేను రెండెకరాలు కౌలుకు చేస్తున్నా. ఈ ఏడాది వరి, మొక్కజొన్న వేశాను. కౌలు కార్డు కోసందరఖాస్తు చేశా. ఎలాంటి సిఫార్సులు లేకుండా సీసీఆర్సీ కార్డు ఇచ్చారు. ఈ కార్డు ద్వారా రూ.లక్ష పంట రుణం తీసుకున్నా. రైతు భరోసా సాయం కోసం అప్లోడ్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. – వీరంకి గోపీకృష్ణ, మోరంపూడి, దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా -
అన్నదాత.. అప్పు గోస!
► వికారాబాద్ జిల్లా ‘దోమ’కు చెందిన రైతు బాయిని వెంకటయ్య ఆరు నెలల క్రితం పంట రుణం కోసం బ్యాంకులో దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు ఇతర బ్యాంకుల నుంచి నోడ్యూస్ సర్టిఫికెట్ తేవాలన్నారు. వెంకటయ్య ఇతర బ్యాంకుల చుట్టూ తిరిగి నోడ్యూస్ సర్టిఫికెట్ తీసుకువచ్చి దరఖాస్తు చేసుకున్నారు. యాసంగి సాగు మొదలైనా ఇంకా రుణం మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట సాగు కోసం అప్పు చేయాల్సిన పరిస్థితి ఉందని వాపోయారు. ► సూర్యాపేట జిల్లా మోతె మండలానికి చెందిన సావిత్రమ్మ.. యాసంగిలో పంట రుణం కోసం బ్యాంకును ఆశ్రయించారు. కానీ బ్యాంకు అధికారులు కొర్రీలు పెట్టారు. ఇతర బ్యాంకుల్లో పంట రుణం తీసుకోనట్టు/ఎలాంటి బాకీ లేనట్టుగా ‘నో డ్యూస్’ సర్టిఫికెట్ తీసుకురావాలని.. లేకుంటే రుణం ఇచ్చే మాటే లేదని చెప్పారు. దీనితో ఆమె ఆ మండలంలోని ప్రధాన బ్యాంకుల చుట్టూ తిరిగి నో డ్యూస్ సర్టిఫికెట్పై సంతకాలు చేయించుకొచ్చారు. ఆ తర్వాతే పంట రుణం అందింది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పంట రుణాల కోసం రైతులు గోసపడుతున్నారు. బ్యాంకర్లు ఏదో ఓ కొర్రీ పెడుతూ రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. సదరు మండలంలోని ఇతర బ్యాంకులకు వెళ్లి నోడ్యూస్ సర్టిఫికెట్లు తేవాలని ఒత్తిడి తెస్తున్నారు. మరికొన్నిచోట్ల ఇప్పటికే ఉన్న పంట రుణాలు మాఫీ కాకపోవడంతో కొత్తగా రుణాలు ఇవ్వబోమని తేల్చి చెప్తున్నారు. దీనితో రైతులు బ్యాంకుల చుట్టూ తిరగలేక అవస్థ పడుతున్నారు. చివరికి పంట పెట్టుబడుల కోసం అధిక వడ్డీలకు ప్రైవేటు అప్పులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. లక్ష్యం ఘనం.. ఇచ్చేది కొంచెం.. పంటరుణాల మంజూరుకు బ్యాంకులు, ప్రభుత్వం ఘనంగానే లక్ష్యాలు నిర్దేశించుకుంటున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో బ్యాంకర్లు మాత్రం పంట రుణాల కోసం వస్తున్న రైతులకు చుక్కలు చూపుతున్నారు. ఏదో ఒక కొర్రీ పెడుతూ తిప్పుకొంటున్నారు. ఈ విషయంలో రైతులకు బాసటగా నిలవాల్సిన వ్యవసాయ శాఖ ఏమీపట్టనట్టుగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. యాసంగి మొదలై రెండు నెలలైనా రైతులకు ఇప్పటివరకు అరకొరగానే రుణాలు అందుతున్నాయి. 2022–23 వానాకాలం సీజన్లో పంటరుణాల మంజూరు లక్ష్యం రూ.40,718 కోట్లుకాగా.. సీజన్ పూర్తయ్యే నాటికి బ్యాంకులు రూ. 21,272 కోట్లు మాత్రమే ఇచ్చాయి. అంటే లక్ష్యంలో 52 శాతమే రుణాలు అందించాయి. ప్రస్తుత యాసంగి సీజన్కు లక్ష్యం రూ.27,146 కోట్లుకాగా.. ఇప్పటివరకు ఇచ్చింది రూ.5వేల కోట్లలోపేనని వ్యవసాయ వర్గాలు చెప్తుండటం గమనార్హం. ధరణితో సాంకేతిక సమస్యలంటూ.. గతంలో రైతుల పట్టాదారు పాస్బుక్కులు తనఖాగా పెట్టుకుని బ్యాంకర్లు రుణాలు ఇచ్చేవారు. ఇప్పుడు కొత్త విధానం తీసుకువచ్చారు. ప్రతి జాతీయ బ్యాంకుకు ధరణి పోర్టల్లో లాగిన్ అయ్యేందుకు అవకాశం కల్పించారు. బ్యాంకర్లు ధరణి పోర్టల్లోకి లాగిన్ అయి సర్వే నంబర్లు, ఇతర వివరాలు సరిచూసుకుని పంట రుణాలు ఇస్తున్నారు. కానీ ధరణిలో సాంకేతిక సమస్యలతో బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. ఇటీవల నాలుగైదు సార్లు వ్యవసాయ శాఖతో జరిగిన సమావేశాల్లో బ్యాంకర్లు ధరణి సమస్యల వల్ల రుణాలు ఇవ్వలేకపోతున్నామని చెప్పినట్టు తెలిసింది. ధరణి పోర్టల్లో సాంకేతిక సమస్యల వల్ల రైతుల సర్వే నంబర్లు నమోదు కావడం లేదు. పాస్బుక్లు ఉన్నా బ్యాంకర్ల లాగిన్లో కనిపించడం లేదు. కొన్నింట్లో బ్యాంకర్లు ఎంట్రీ చేయడానికి ప్రయత్నించినా నమోదు కావడం లేదు. పలు గ్రామాలు ఇంకా ధరణిలో నమోదుగాకపోవడం, కొన్ని గ్రామాల్లో సర్వే నంబర్లలో ఉన్న భూమికి, ధరణిలో నమోదైన భూమికి తేడాలు ఉండటం వంటి సమస్యలు నెలకొన్నాయి. ఇలాంటి ఇబ్బందులున్న రైతులకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. దీనితో లక్షల మంది రైతులకు పంట రుణం అందకుండా పోతోంది. రుణమాఫీ పూర్తిస్థాయిలో జరగక.. రైతులకు రూ.లక్ష వరకు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగకపోవడంతోనూ రైతులకు రుణాలు అందని పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇప్పటివరకు రూ.37 వేల వరకు బకాయిలున్న రైతులకే రుణమాఫీ చేసింది. ఆపై రుణాలున్న వారికి మాఫీ కావాల్సి ఉంది. రైతులు బ్యాంకు రుణాలను రెన్యువల్ చేసుకోవాలని, ప్రభుత్వం తర్వాత చెల్లిస్తుందని మంత్రులు ప్రకటించినా.. కొందరే అలా రెన్యువల్ చేసుకున్నారు. చాలా మంది రైతులు ప్రభుత్వం నుంచి రుణమాఫీ సొమ్ము వచ్చిన తర్వాతే రెన్యువల్ చేసుకునేందుకు ఎదురుచూస్తున్నారు. దీనివల్ల లక్షలాది మంది రైతులు డిఫాల్టర్లుగా మారిపోయారు. వారికి బ్యాంకులు పంట రుణాలు ఇవ్వడం లేదు. మరోవైపు 2018నాటికి ఉన్న బకాయిలపై వడ్డీ, చక్రవడ్డీ కలిసి తడిసి మోపెడవుతోంది. కొన్నిచోట్ల బ్యాంకు అధికారులు రైతుబంధు సొమ్మును బకాయిల కింద జమ చేసుకుంటున్నారని.. అలా చేయవద్దని ప్రభుత్వం ఆదేశించినా బ్యాంకర్ల తీరు మారడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోడ్యూస్ సర్టిఫికెట్ తెస్తేనే.. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన రాజు పంటరుణం కోసం ఏపీజీవీబీని సంప్రదించారు. కానీ బ్యాంకు అధికారులు ఆయనను దొమ్మాట, చేగుంట, నార్లాపూర్లలోని ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకుల నుంచి ‘నోడ్యూస్’ సర్టిఫికెట్ తీసుకురావాలన్నారు. ఆయన పది రోజులు తిరిగి అన్ని బ్యాంకుల్లో సంతకాలు తీసుకొచ్చిన తర్వాతే రుణం మంజూరు చేశారు. -
సాగుకు భరోసా.. విరివిగా పంట రుణాలు
వ్యవసాయరంగానికి జగన్ సర్కార్ అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. పంట పెట్టుబడుల కోసం బ్యాంకుల ద్వారా రైతులకు విరివిగా రుణాలు ఇస్తోంది. అందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లో అంచనాకు మించి పంట రుణాలు మంజూరు చేసింది. రూ.11,957 కోట్ల వార్షిక రుణప్రణాళిక లక్ష్యంలో రెండో త్రైమాసికం ముగిసేలోపు అంటే సెప్టెంబర్ నెలాఖరుకే రూ.9,077 కోట్లతో 76 శాతం సాధించిన బ్యాంకర్లు గడువులోగా వంద శాతం సాధించే దిశగా అడుగులేస్తున్నారు. అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలుస్తోంది. విత్తు నుంచి పంట విక్రయం వరకు తోడుగా ఉంటోంది. పంట పెట్టుబడులకు బ్యాంకుల ద్వారా రుణాలు సకాలంలో ఇప్పించి వ్యవసాయం సాఫీగా సాగేలా చూస్తోంది. ఖరీఫ్లో సాగుకు వీలుగా ఏటా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు బ్యాంకుల ద్వారా రైతులకు రుణాలు మంజూరు చేస్తారు. ఈ ఏడాది ఖరీఫ్లో రూ.3,204.24 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా ఏకంగా 127 శాతంతో రూ.4,068.62 కోట్లు ఇచ్చారు. ప్రస్తుతం రూ.2,226.68 కోట్లు లక్ష్యంగా రబీ రైతులకు పంట రుణాల మంజూరు కొనసాగుతోంది. వ్యవసాయ టర్మ్ లోన్ల లక్ష్యం రూ.1,545.32 కోట్లు కాగా.. 121 శాతంతో రూ.1,869.81 కోట్లు మంజూరు చేశారు. ఇక అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద రూ.16.61 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాల కింద రూ.92.18 కోట్లు ఇచ్చారు. ఇలా... మొత్తంగా వ్యవసాయ, అనుబంధ రంగాల కింద రైతులు, ఇతర లబ్ధిదారులకు రూ.6,047.22 కోట్లు ఇవ్వడం గమనార్హం. ఇతరత్రా రంగాలకూ విరివిగా రుణాలు వ్యవసాయంతో పాటు ఇతర రంగాలకూ విరివిగా రుణాలు అందించారు. అందులో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ప్రోత్సాహం కింద రూ.795.15 కోట్లు, ఇతర ప్రాధాన్యత రంగాల కింద రూ.97.61 కోట్లు, నాన్ ప్రయారిటీ సెక్టార్ కింద రూ.1,780.72 కోట్లకు గానూ 116 శాతంతో ఏకంగా రూ.2,081.90 కోట్లు మంజూరు చేశారు. ఇలా రూ.11,957.94 కోట్ల వార్షిక రుణప్రణాళిక (లోన్ క్రెడిట్ప్లాన్–2022–23) అమలులో భాగంగా రెండో త్రైమాసికం ముగిసేనాటికే 76 శాతంతో రూ.9,077.42 కోట్లు పూర్తయింది. 2023 మార్చి 31 వరకు గడువు ఉన్నందున ఈ ఏడాది లక్ష్యాన్ని అధిగమించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పెరిగిన బ్యాంకింగ్ నెట్వర్క్ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇటీవల జిల్లా వ్యాప్తంగా బ్యాంకింగ్ నెట్వర్క్ బాగా పెరిగింది. ప్రభుత్వ రంగ, ప్రైవేట్ బ్యాంకులతో పాటు సహకార, గ్రామీణ బ్యాంకులు దాదాపు 43 ప్రిన్సిపల్ బ్యాంకులు వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నాయి. వ్యవసాయ, అనుబంధ రంగాల రుణాల మంజూరులో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు (ఏపీజీబీ) రూ.1,567 కోట్లు, స్టేట్బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ.1,429 కోట్లతో పోటీపడుతూ మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాత యూనియన్ బ్యాంకు, కెనరాబ్యాంకు, ఇండియన్ బ్యాంకు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ), బ్యాంకు ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంకు, కరూర్ వైశ్యాబ్యాంకు, ఐడీబీఐ తదితర ప్రభుత్వ, ప్రైవేట్, సహకార, గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. మొత్తమ్మీద చూస్తే... ప్రభుత్వరంగ బ్యాంకుల ద్వారా రూ.4,453 కోట్లు, ప్రైవేట్ వాణిజ్య బ్యాంకుల ద్వారా రూ.4,201 కోట్లు ఇవ్వగా తర్వాత గ్రామీణ, సహకార బ్యాంకుల ద్వారా రైతులు, అనుబంధ రంగాలకు విరివిగా రుణాలు అందించాయి. రుణాల మంజూరుకు పోటీ రైతులతో పాటు అన్ని రంగాల అభివృద్ధి, అన్ని వర్గాల పురోభివృద్ధికి ఇటీవల కాలంలో బ్యాంకర్లు పోటీ పడి రుణాలు మంజూరు చేస్తుండటం మంచి పరిణామం. దీంతో వార్షిక లక్ష్యంలో గణనీయమైన పురోగతి సాధించి గడువులోగా వంద శాతం చేరుకునే దిశగా రుణాల మంజూరు కొనసాగుతోంది. రైతులతో పాటు మహిళా సంఘాలు, విద్యా, వాహన, గృహ, పరిశ్రమలు, వ్యక్తిగత రుణాలు... ఇలా అన్నింటికీ అవసరమైన రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు మొగ్గుచూపుతున్నారు. – బి.నాగరాజారెడ్డి, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ (ఎల్డీఎం) రూ.85 వేల పంట రుణం నాకు 2.75 ఎకరాల పొలం ఉంది. బొమ్మగానిపల్లి కెనరా బ్యాంకులో రూ.85 వేల పంట రుణం ఇచ్చారు. దీని వల్ల సకాలంలో పంట పెట్టుబడికి ఉపయోగపడింది. 2021లో తీసుకున్న పంట రుణాలకు వైఎస్సార్ పంట రుణాల సున్నావడ్డీ కింద ఇటీవల రూ.3 వేల వడ్డీ రాయితీ కూడా జమ కావడం సంతోషంగా ఉంది. – విరుపాక్షి, రైతు, ముప్పాలకుంట, బ్రహ్మసముద్రం మండలం -
ఏది నిజం ?: ‘సున్నా వడ్డీ’లోనూ వక్రమార్కుడు.. రామోజీ విషపు రాతలు
బురదజల్లుడు, అబద్ధాలు అచ్చేయడం, అర్థంపర్థంలేని వార్తలు వండి వార్చడంలో తన రికార్డులను తానే బద్దలుకొట్టుకుంటున్న ఎల్లో జర్నలిస్ట్ రామోజీరావు ఎప్పటిలాగే టీడీపీ వైపు తన చేతివాటాన్ని మరోసారి ప్రదర్శించారు. ఈసారి ఆయన రూటు సాగువైపు మళ్లింది. ‘వడ్డీ రాయితీ పెద్ద సున్నా’ అంటూ ఆయన తాజాగా అచ్చోసిన అసత్యాల కథనం నిజంగానే నిజాల్ని దాచి వండిన వంటకం. పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి ఎంత హానికరమో ఈనాడు పత్రిక కూడా ఆ పాఠకులకు అంతే హానికరం. ఎందుకంటే.. రాష్ట్రంలో చిన్న, సన్నకారు, వాస్తవ సాగుదారులు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పంట రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ‘వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకానికి’ 2019లో శ్రీకారం చుట్టింది. రూ.లక్షలోపు తీసుకున్న పంట రుణాలను ఏడాదిలోపు తిరిగి చెల్లించిన రైతులకు మరుసటి సీజన్ రాకముందే వారు చెల్లించిన వడ్డీ మొత్తాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమచేస్తూ వారికి అండగా నిలుస్తోంది. కానీ, టీడీపీ ఐదేళ్లలో 40.61 లక్షల మందికి కేవలం రూ.685.46 కోట్లు చెల్లిస్తే, గడిచిన 3.5 ఏళ్లలో 73.88 లక్షల మంది వాస్తవ సాగుదారులకు ప్రస్తుత వైఎస్ జగన్ సర్కారు రూ.1,838.61 కోట్లు చెల్లించింది. వీటిలో రూ.1,180.66 కోట్లు టీడీపీ ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలే. ఇలా బాబు ఎగ్గొట్టిన బకాయిలతో సహా ఏటా క్రమం తప్పకుండా అర్హతగల ప్రతీ రైతుకు అణా పైసలతో సహా వడ్డీ రాయితీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంటే చంద్రబాబు అడుగులకు మడుగులొత్తే ఈనాడు రామోజీరావు కళ్లున్న కబోదిలా ప్రవర్తిస్తూ ఆ పత్రికల పాఠకులపై చిమ్ముతున్న విషానికి అంతులేకుండా పోతోంది. నిజానికి.. గతంలో ఇంతపెద్ద ఎత్తున, ఇంత పారదర్శకంగా డీబీటీ విధానంలో నేరుగా రైతుల ఖాతాల్లో జమయ్యేలా వడ్డీ రాయితీ పథకాన్ని అమలుచేసిన దాఖలాల్లేవు. అయినా ఇవేమీ ఎల్లో జర్నల్ అయిన ఈనాడుకు కన్పించవు. అర్హుల జాబితా ప్రదర్శించినా అక్కసే.. మరోవైపు.. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకానికి మరింత మెరుగులద్ది పారదర్శకంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తోంది. వడ్డీ రాయితీ చెల్లింపుల్లో జాప్యానికి తావులేకుండా ఉండేందుకు ఏడాదిలోపు రుణం చెల్లించిన లబ్ధిదారుల డేటా బ్యాంకుల ద్వారా ఎస్వీపీఆర్ పోర్టల్లో అప్లోడ్ చేసేలా ఏర్పాటుచేశారు. ఈ డేటా ఈ–క్రాప్ డేటాతో ధ్రువీకరించి అర్హులైన రైతుల జాబితాను గుర్తించి సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. అంతేకాదు.. మొబైల్ ద్వారా ఎస్వీపీఆర్ (సున్నా వడ్డీ పంట రుణాల) పోర్టల్ https://karshak. ap. gov. in/ ysrsvpr/లోకి వెళ్లి హోంపేజీలో ‘know your status‘ అనే విండో ఓపెన్ చేసి తమ ఆధార్ నంబరుతో చెక్ చేసుకునే వెసులుబాటు రైతులకు కల్పించారు. ఒకవేళ ఏడాదిలోగా రూ.లక్షలోపు రుణాలు తిరిగి చెల్లించి వడ్డీ రాయితీకి అర్హత పొంది, జాబితాలో తమ పేర్లు లేకపోతే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కూడా కల్పించారు. ఇలా అర్హత పొందిన రైతుల ఖాతాల్లో వారు చెల్లించిన నాలుగు శాతం వడ్డీ రాయితీని రాష్ట్ర ప్రభుత్వం ఏటా క్రమం తప్పకుండా జమచేస్తున్నా ఈనాడు తట్టుకోలేకపోతోంది. అంతేకదా.. రామోజీ. ఎక్కువమంది లబ్ధి పొందేలా విస్తృత ప్రచారం ఇక రూ.లక్ష లోపు రుణం సకాలంలో చెల్లించడం ద్వారా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని వడ్డీ భారం నుంచి రైతులు విముక్తి పొందేందుకు వీలుగా రైతుభరోసా కేంద్రాల ద్వారా గ్రామస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కల్పిస్తోంది. కరపత్రాలు, వాల్ పోస్టర్లు, వాట్సాప్ గ్రూపుల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గత నెల 28న రబీ 2020–21, ఖరీఫ్ 2021 సీజన్లలో అర్హత పొందిన 8.22 లక్షల మంది రైతులకు రూ.160.55 కోట్ల వడ్డీ రాయితీని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరుగా రైతుల పొదుపు ఖాతాలకు జమచేశారు. ఇలా గడిచిన మూడున్నరేళ్లలో పాత బకాయిలు కలిపి 73.88 లక్షల మందికి రూ.1,838.61 కోట్లు చెల్లించారు. పాత బకాయిలకు సంబంధించే కాదు గడిచిన మూడేళ్లకు సంబంధించి కూడా ఎలాంటి బిల్లులు పెండింగ్లో లేకుండా అర్హుల ఖాతాల్లోకి సున్నా వడ్డీ రాయితీ జమచేశారు. అయినా ఇవన్నీ విస్మరించి ఎందుకు రామోజీ ఈ వయస్సులో అబద్ధాల సాగుకు అంత ఆయాసం..? రూ.1,180.66 కోట్ల బకాయిలు ఈనాడుకు కన్పించవు కానీ, ఈ పరిస్థితులకు వైఎస్ జగన్ సర్కార్ చెక్ పెట్టింది. వడ్డీ రాయితీని నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ (డీబీటీ) చేసేలా మార్పుచేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకానికి శ్రీకారం చుట్టారు. అంతేకాదు.. టీడీపీ హయాంలోని బకాయిల చెల్లింపునకూ ముందుకొచ్చి రైతులపట్ల తనకున్న చిత్తశుద్ధిని ఆయన చాటుకున్నారు. ఇలా 2014–15లో రూ.3.46 కోట్లు, 2015–16లో రూ.1.91 కోట్లు, 2016–17లో రూ.212.33 కోట్లు, 2017–18లో రూ.345.18 కోట్లు, 2018–19లో రూ.617.78 కోట్లు కలిపి మొత్తం 39.08 లక్షల మంది రైతులకు రూ.1,180.66 కోట్ల బకాయిలను చెల్లించారు. బాబు ఎగ్గొట్టిన ఈ బకాయిలపై ‘ఘనత వహించిన’ ఈనాడు ఏనాడు దీనిపై వార్త రాసిన పాపానపోలేదు. అలాగే, ఐదేళ్లలో కేవలం 40.61 లక్షల మందికి రూ.685.46 కోట్లే చెల్లిస్తే ఎందుకింత తక్కువ చెల్లించారని కూడా ప్రశ్నించడానికి రామోజీకి పెన్ను పెగలలేదు. రామోజీ.. అప్పట్లో అప్పులకు జమచేసుకోలేదా? వాస్తవానికి ప్రతీ సీజన్లో వ్యవసాయ అవసరాల కోసం రైతులు బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకుంటారు. రూ.లక్షలోపు రుణాన్ని ఏడాదిలోపు చెల్లిస్తే బ్యాంకులు వసూలుచేసే ఏడు శాతం వడ్డీలో 3 శాతం కేంద్రం రాయితీ ఇస్తుంది. మిగిలిన 4 శాతం రైతులు భరించేవారు. గతంలో ‘వడ్డీలేని రుణ పథకం’ కింద రైతులు చెల్లించిన వడ్డీ రాయితీని బడ్జెట్ కేటాయింపులను బట్టి ఏడాదికో.. రెండేళ్లకో వీలునుబట్టి బ్యాంకులకు అరకొరగా జమచేసేవారు. ఈ మొత్తం జమకాగానే బ్యాంకులు వెంటనే రైతులు చెల్లించాల్సిన అప్పు ఖాతాలకు సర్దుబాటు చేసేసేవారు. అలాగే, గతంలో క్లెయిమ్స్ డేటాను అప్లోడ్ చేయడానికి నోడల్ బ్రాంచీలకు మాత్రమే వీలుండేది. దీంతో ఎంతమంది అర్హత పొందారు.. వారికి ఎంత వడ్డీ రాయితీ జమైందో రైతులకే కాదు.. సంబంధిత బ్యాంకు శాఖలకు కూడా తెలిసేది కాదు. సామాజిక తనిఖీ కోసం బ్యాంకుల వద్ద కానీ, ప్రభుత్వ కార్యాలయాల వద్ద కానీ జాబితాలు ప్రదర్శించే పరిస్థితులు ఉండేవి కాదు. -
రైతులకు మరింత ధీమా
కడప సిటీ: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సున్నా వడ్డీ, ఇన్పుట్సబ్సిడీ రాయితీ పథకాలు అన్నదాతలకు మరింత ధీమాను ఇస్తున్నాయని కలెక్టర్ విజయరామరాజు, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఆప్కాబ్ చైర్ పర్సన్ మల్లెల ఝాన్సీరాణిలు సంయుక్తంగా పేర్కొన్నారు. సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 2020–21 సంవత్సరానికి రబీ సీజన్కు సంబంధించి, 2021 ఖరీఫ్ కాలానికి వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాలు, 2022 ఖరీఫ్లో ఇన్పుట్ సబ్సిడీ కింద లబ్ధి మొత్తాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్లోని వీసీ హాలు నుంచి కలెక్టర్ విజయరామరాజుతోపాటు మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, నగర మేయర్ సురేష్బాబు, ఆప్కాబ్ చైర్ పర్సన్ మల్లేల ఝాన్సీరాణి, జేసీ సాయకాంత్వర్మ, వ్యవసాయ సలహా మండలి జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్రెడ్డి, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, పులివెందుల మార్కెట్యార్డు చైర్మన్ చిన్నప్ప, వ్యవసాయ సలహా మండలి సభ్యులు బలరామిరెడ్డి, వేణుగోపాల్రెడ్డి తదితరులు హాజరయ్యారు. అన్నదాతలకు కొండంత అండ : కలెక్టర్ విజయరామరాజు ఈ సందర్భంగా కలెక్టర్ విజయరామరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సున్నా వడ్డీ, ఇన్పుట్ సబ్సిడీ పథకాలు అన్నదాతలకు కొండంత అండగా నిలుస్తున్నాయన్నారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం ద్వారా 2020–21 రబీ సీజన్కు సంబంధించి రూ. లక్షలోపు పంట రుణాలు తీసుకుని సకాలంలో తిరిగి చెల్లించిన 12,112 మంది జిల్లా రైతులకు మంజూరైన రూ. 2.69 కోట్లు, 2021 ఖరీఫ్ సీజన్కు సంబంధించి 24,920 మంది రైతులకు రూ. 6.05 కోట్లు, అలాగే 2020 ఖరీఫ్ సీజన్కుగాను సున్నా వడ్డీ కింద 30233 మంది వివిధ కారణాలతో జమకాని రైతులకుగాను రూ. 7.30 కోట్లు జమ అయిందన్నారు. మొత్తంగా జిల్లాలో 67,265 మంది రైతులకు రూ. 16.04 కోట్లు లబ్ధి చేకూరిందన్నారు. అలాగే 2022 ఖరీఫ్ కాలానికి ఇన్పుట్ సబ్సిడీ కింద జిల్లాలో 3855 మంది రైతులకు రూ. 4.33 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశారని తెలిపారు. మెగా చెక్కు అందజేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీసీ అనంతరం సున్నా వడ్డీ, ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన మెగా చెక్కులను కార్యక్రమానికి హాజరైన అతిథులందరూ కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ►ఈ కార్యక్రమంలో వీరపునాయునిపల్లె ఎంపీపీ రఘునాథరెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి నాగేశ్వరరావు, పశుసంవర్థకశాఖ జేడీ శారద, డీసీఓ సుభాషిణి, వ్యవసాయ ఏడీలు నరసింహారెడ్డి, సుబ్బారావు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. రైతు పక్షపాత ప్రభుత్వం: ఎస్.రఘురామిరెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే తమది రైతు పక్షపాత ప్రభుత్వమని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పేర్కొన్నారు. ప్రతి రైతు తలెత్తుకుని జీవించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమన్నారు. రైతు దేశానికి వెన్నముక అని, రైతు బాగుంటేనే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని ప్రభుత్వం భావించి రైతులను అన్ని విధాలా ఆదుకుంటోందన్నారు. అన్నదాతల కోసం అమూల్య పథకాలు : సురేష్బాబు, నగర మేయర్ అన్నదాతల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమూల్యమైన పథకాలను అమలు చేస్తున్నారని నగర మేయర్ సురేష్బాబు తెలిపారు. వరుసగా మూడవ సంవత్సరం సజావుగా సున్నా వడ్డీ, ఇన్పుట్ సబ్సిడీలను రైతులకు అందిస్తున్న ఘనత మన ముఖ్యమంత్రిదేనన్నారు. పథకాలను సద్వినియోగం చేసుకోవాలి : మల్లెల ఝాన్సీరాణి, ఆప్కాబ్ చైర్ పర్సన్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను రైతన్నలు సద్వినియోగం చేసుకోవాలని ఆప్కాబ్ చైర్ పర్సన్ మల్లెల ఝాన్సీరాణి తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. రైతు భరోసా కేంద్రాలు రైతులకు కల్పతరువులు : సంబటూరు ప్రసాద్రెడ్డి, వ్యవసాయ సలహా మండలి జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు రైతులకు అన్ని విధాలా కల్పతరువుగా మారాయని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సంబటూరు ప్రసాద్రెడ్డి పేర్కొ న్నారు. ప్రభుత్వం విత్తనం నుంచి అమ్మకం వరకు రైతులకు అండగా నిలుస్తోందన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని సేవలు అందుతున్నాయన్నారు. రైతు బాంధవుడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు బాంధవుడిగా మారి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని నమ్మిన నాయకుడు జగనన్న. ప్రభుత్వ మద్దతు ధరతో పండించిన పంటలను ఆర్బీకేల ద్వారా విక్రయించుకోగలిగాను. – భాస్కర్, రైతు, యల్లారెడ్డిపల్లె, కమలాపురం జగనన్నే ముఖ్యమంత్రిగా ఉండాలి వ్యవసాయ రంగంలో రైతుల అభ్యున్నతికి అనేక మార్పులు తెచ్చి ఆపన్నహస్తం అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగానే ఉండాలని కోరుకుంటున్నాను. – పి.వీరారెడ్డి, చౌటపల్లె, కడప రైతు శ్రేయస్సు కోరే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు శ్రేయస్సు కోరే ముఖ్యమంత్రిగా ఘనత సాధించారు. అనేక పథకాలను రైతుల కోసం ప్రవేశపెట్టారు. ఇలాంటి ముఖ్యమంత్రి కలకాలం ఉండాలన్నదే మా అందరి ఆకాంక్ష. – ఎం.సుబ్బిరెడ్డి, చౌటపల్లె, కడప -
రుణాలు బడా వ్యాపారులకేనా.. రైతులకు ఇవ్వరా?
సాక్షి, హైదరాబాద్: బడా పారిశ్రామికవేత్తలకు వేల కోట్ల రూపాయలను నిరర్ధక ఆస్తుల(ఎన్పీఏ) కింద రద్దు చేసే పాలకులు, ఆరుగాలం కష్టపడే రైతుకు రుణమాఫీ చేయమంటే మాత్రం వెనకాడుతారెందుకని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. అంబానీ, అదానీ, ఇతర సంపన్నులు బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.12 లక్షల కోట్ల రుణాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. గురువారం ఇక్కడి సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ రైతు ప్రభుత్వమా? లేక కార్పొరేట్ల ప్రభుత్వమా? అని నిలదీశారు. తెలంగాణ పర్యటనకు వచ్చి వెళ్లిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రైతు రుణమాఫీ గురించి చొరవ చూపితే బాగుండేదని హితవు పలికారు. బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి రైతులకు రుణాలు ఇప్పించి ఉంటే బాగుండేదన్నారు. కానీ, కేంద్రమంత్రి పర్యటన ఉపన్యాసాలకే పరిమితం కావడం విచారకరమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏకకాలంలో రైతు రుణమాఫీ అమలు చేయకపోవడంతో రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదని, దీంతో రైతులు ఎక్కువ వడ్డీకి ప్రైవేట్ అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాలు, నకిలీ విత్తనాలతో పంట దిగుబడి రాక ప్రైవేటు అప్పులు తీర్చలేని పరిస్థితిల్లో రైతులు ఉన్నారని, ఈ దుస్థితి వారి ఆత్మహత్యలకు దారితీస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందు సీఎం కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహించి సమీక్ష నిర్వహించి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయడంతోపాటు బ్యాంకర్ల నుంచి కొత్త రుణాలు ఇప్పించాలని భట్టి డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: ‘నన్ను అవమానిస్తున్నారు’.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గవర్నర్ తమిళిసై ఫైర్ -
అన్నదాతకు ఆలంబన
సాక్షి, అమరావతి: సన్న, చిన్నకారు రైతులతో పాటు వాస్తవ సాగుదారులకు పంట రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించే వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని మరింత మంది అన్నదాతలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2020–21 రబీలో రూ.లక్ష లోపు రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన రైతులకు వచ్చే నెలలో వడ్డీ రాయితీని జమ చేయనుంది. ఇప్పటికే ఈ సీజన్లో 7.20 లక్షల మంది అర్హులున్నట్టుగా గుర్తించారు. వడ్డీతో సహా రుణాలు చెల్లించేందుకు ఈ నెల 31వ తేదీ వరకు గడువున్నందున మరింత మందికి పథకం కింద లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 31 లోగా రుణాలు చెల్లించేందుకు ఆర్బీకేల ద్వారా రైతుల్లో అవగాహన కల్పిస్తోంది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం తీసుకున్న పంట రుణాలపై బ్యాంకులు 7 శాతం వడ్డీని వసూలు చేస్తాయి. ఇందులో 3 శాతం వడ్డీని కేంద్రం చెల్లిస్తుంది. మిగతా 4 శాతం వడ్డీని అర్హులైన రైతులకు వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ పథకం కింద 2019 ఖరీఫ్లో 14.27 లక్షల మంది రైతులకు రూ.289.42 కోట్లు, 2019–20 రబీలో 5.61లక్షల మందికి రూ.92.39 కోట్లు, 2020 ఖరీఫ్లో 6.67 లక్షల మందికి రూ.112.70 కోట్లు చెల్లించింది. అంతేకాకుండా 2014–15 నుంచి 2018–19 మధ్య 42.32 లక్షల మంది రైతులకు గత ప్రభుత్వం చెల్లించని రూ.1180.66 కోట్ల బకాయిల్లో ఇప్పటివరకు 38.42 లక్షల మంది రైతులకు రూ.688.25 కోట్లు జమ చేసింది. 2020–21 రబీలో రికార్డు స్థాయిలో 38.76 లక్షల మంది రైతులకు రూ.72,724 కోట్ల వ్యవసాయ రుణాలు ఇచ్చారు. వీటిలో 12.70 లక్షల మందికి రూ.19 వేల కోట్లు పంట రుణాలుగా ఇచ్చారు. వీరిలో లక్ష లోపు రుణాలు తీసుకుని ఇప్పటికే తిరిగి చెల్లించిన వారు 7.20 లక్షల మంది. మిగతా వారు కూడా రుణాలు చెల్లించి, ఈ పథకానికి అర్హత పొందేలా ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పిస్తోంది. ఈ పథకం కింద రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్ల వరకు రైతులకు లబ్ధి కలుగుతుంది. అర్హత పొందాలంటే.. ఏ పంటపై రుణం తీసుకున్నారో ఆ పంటే సాగు చెయ్యాలి. పంట వివరాలను తప్పనిసరిగా ఈ క్రా‹ప్లో నమోదు చేయించాలి. రుణాన్ని వడ్డీతో సహా ఏడాదిలోగా (మార్చి 31వ తేదీ) చెల్లించాలి. దీనిపై ఆర్బీకే సిబ్బంది ద్వారా రైతుల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. బ్యాంకులతో సమన్వయం చేసుకుంటూ ఒక ఆధార్ నంబరుపై ఒక అకౌంట్ నంబర్ను మాత్రమే మ్యాప్ అయ్యేలా డేటాను అప్డేట్ చేస్తున్నారు. గడువులోగా రుణాలు చెల్లించిన రైతుల జాబితాను సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల వద్ద ప్రదర్శిస్తారు. అర్హులైన రైతుల వివరాలను బ్యాంకుల ద్వారా వైఎస్సార్ ఎస్వీపీఆర్ పోర్టల్లో ఏప్రిల్ 7వ తేదీలోగా అప్లోడ్ చేస్తారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ పథకం కింద రైతులకు 4 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది, రూ.లక్ష లోపు పంట రుణాలు తీసుకొని, మార్చి 31 లోపు వడ్డీతో సహా రుణం మొత్తాన్ని చెల్లించిన వారు బ్యాంక్ను సంప్రదించి పోర్టల్లో నమోదు చేయించుకోవాలి. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి. – హెచ్.అరుణ్కుమార్, వ్యవసాయ శాఖ కమిషనర్ -
అసలైన సాగుదారులకు దన్నుగా..
సాక్షి, అమరావతి: భూ యజమాని హక్కులకు భంగం వాటిల్లకుండా వాస్తవ సాగుదారులకు మరింత మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధంచేసింది. గడిచిన ఖరీఫ్ సీజన్లో ఈ–క్రాప్ నమోదు పగడ్బందీగా చేపట్టారు. రైతుభరోసా యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ (ఆర్బీయూడీపీ) ద్వారా తొలిసారిగా సర్వే నెంబర్ల వారీగా సాగు వివరాలను నమోదు చేశారు. కానీ, చాలాచోట్ల వాస్తవ సాగుదారుల స్థానంలో భూ యజమానుల పేర్లు నమోదైనట్లుగా గుర్తించారు. దీంతో ప్రస్తుత రబీ సీజన్లో సాగుచేసే ప్రతీ అసలైన రైతు వివరాలు ఈ–క్రాప్లో నమోదుకు చర్యలు చేపట్టారు. నిజానికి.. ఈ–క్రాప్ విధానం అమలులోకి వచ్చాక ఖరీఫ్–2020 సీజన్లో 124.92 లక్షల ఎకరాల్లో 49.72 లక్షల మంది రైతులు సాగుచేస్తున్నట్లుగా నమోదు కాగా.. రబీ 2020–21లో 34.65 లక్షల మంది రైతులు 86.77లక్షల ఎకరాలు సాగుచేస్తున్నట్లుగా నమోదయ్యాయి. అలాగే, ఖరీఫ్–2021లో 45.02 లక్షల మంది రైతులు సాగుచేస్తున్న 102.23 లక్షల ఎకరాలు నమోదు చేశారు. వీరిలో కౌలురైతులు 2.92 లక్షల మంది ఉన్నారు. కానీ, వాస్తవంగా రాష్ట్రంలో 16.56 లక్షల మంది కౌలుదారులున్నారు. వారిలో 60–70 శాతానికి పైగా సెంటు భూమి కూడా లేనివారే. సాగువేళ వీరిలో ప్రభుత్వ ప్రయోజనాలందుకుంటున్న వారు 10–20 శాతం లోపే ఉంటున్నారు. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ ప్రతీ వాస్తవసాగుదారుడు లబ్ధిపొందేలా ప్రభుత్వం ప్రస్తుత రబీ సీజన్లో ఈ–క్రాప్ నమోదులో మార్పులు తీసుకొచ్చింది. వీటిపై వాస్తవ సాగుదారులు–భూ యజమానులకు అర్ధమయ్యే రీతిలో ఆర్బీకే స్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. సాగుదారుల గుర్తింపు ఇలా.. ► విత్తిన వారంలోపు ఆర్బీకేల్లో ఆధార్, బ్యాంకు ఖాతా, ఫోన్ నెంబర్లతో సహా క్రాప్ కల్టివేషన్ రైట్ కార్డు (సీసీఆర్సీ) నకళ్లను అందజేయాలి. ► ఒకవేళ సీసీఆర్సీ లేకున్నా, భూ యజమాని అంగీకరించకపోయినా సరే తాము ఏ సర్వే నెంబర్, ఎంత విస్తీర్ణంలో ఏఏ పంటల సాగుచేస్తున్నామో ఆ వివరాలను ఆర్బీకేలో తెలియజేసి ఈకేవైసీ (వేలిముద్రలు) చేయించుకుంటే రెండు వారాల్లోపు ఆర్బీకే సిబ్బంది పొలానికి వెళ్లి చుట్టుపక్కల రైతులను విచారించి వాస్తవ సాగుదారుడెవరో గుర్తిస్తారు. ► ఇలా నమోదైన వివరాలను సామాజిక తనిఖీలో భాగంగా ఆర్బీకేల్లో వారం రోజులపాటు ప్రదర్శిస్తారు. తప్పులుంటే సవరిస్తారు. ► అభ్యంతరాలొస్తే మరోసారి క్షేత్రస్థాయి పరిశీలన చేసి వాస్తవ సాగుదారులను గుర్తిస్తారు. సీసీఆర్సీ అంటే.. సీసీఆర్సీ పత్రం అంటే భూ యజమానికి, సాగుదారునికి మధ్య అవగాహనా ఒప్పంద పత్రం. వలంటీర్/వీఆర్ఓ వద్ద ఉండే దరఖాస్తులో వివరాలు నింపి భూ యజమాని లేదా వారి ప్రతినిధి, సాగుదారు–గ్రామ వీఆర్వోలు సంతకం చేస్తే సరిపోతుంది. పంట కాలంలో ఎప్పుడైనా ఈ పత్రాన్ని పొందవచ్చు. దరఖాస్తు చేసుకున్న 3 రోజుల్లోనే ఈ పత్రం జారీచేస్తారు. దీని కాలపరిమితి జారీచేసిన తేదీ నుంచి కేవలం 11 నెలలు మాత్రమే. ఈ కార్డుపొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల రైతులు వైఎస్సార్ రైతుభరోసా కింద రూ.13,500 పెట్టుబడి సాయం పొందేందుకు అర్హులు. ఈ–క్రాప్తో ప్రయోజనాలు.. ► దీని ఆధారంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణం పొందవచ్చు. ► రూ.లక్షలోపు పంట రుణం ఏడాదిలోపు చెల్లిస్తే సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద 4 శాతం వడ్డీ రాయితీ పొందవచ్చు. ► ఉచిత పంటల బీమా సౌకర్యం వర్తిస్తుంది. ► వైపరీత్యాల్లో పంట నష్టానికి పెట్టుబడి రాయితీ పొందొచ్చు. ► అలాగే, పంటలను ఆర్బీకేల ద్వారా కనీస మద్దతు ధరలకు అమ్ముకోవచ్చు. భూ యజమానులకు పూర్తి రక్షణ ఈ–క్రాప్లో వాస్తవ సాగుదారుల వివరాలు నమోదు ద్వారా భూ యజమానుల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదు. ఈ వివరాలేవీ రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయరు. కోర్టులో సాక్షులుగా కూడా చెల్లవు. ఈ–క్రాప్ ఆధారంగా పొందిన పంట రుణం కట్టకపోయినా, ఎగ్గొట్టినా భూ యజమాని/భూమిపై ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉండదు. కేవలం బకాయి వసూలు సందర్భంగా ఫలసాయంపై మాత్రమే బ్యాంకులకు హక్కు ఉంటుంది. -
TS: మొండిచెయ్యి.. సగం రుణాలూ ఇవ్వలేదు..
సాక్షి, హైదరాబాద్: రైతులకు పంట రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఈ ఏడాది వానాకాలం సీజన్ లక్ష్యంలో సగం రుణాలు కూడా ఇవ్వకపోడం విచారకరం. ఈ సీజన్లో రూ.35,665 కోట్లు ఇవ్వా లనేది లక్ష్యం కాగా, ఇప్పటివరకు కేవలం రూ. 15,500 వేల కోట్ల మేరకే రుణాలు మంజూరు అయ్యాయి. వాస్తవానికి సీజన్ ప్రారంభానికి ముందుగానే రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలి. ఆ ప్రకారం జూన్లో ప్రారంభమయ్యే వానాకాలం సీజన్కు మే నెల నుంచే రుణాలు ఇవ్వాలి. కానీ రైతులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రాలేదు. దీంతో రైతులు గత్యంతరం లేక ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల వద్ద అప్పులు చేయాల్సి వచ్చింది. బ్యాంకుల తీరును ఎప్పటికప్పుడు సమీక్షించి పరిస్థితిని చక్కదిద్దాల్సిన వ్యవసాయశాఖ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది వానాకాలం సీజన్ ఐదు రోజుల క్రితం ముగిసింది. పంటల సాగు 111 శాతం ఉండగా రుణాల మంజూరు మాత్రం మరీ నిరాశాజనకంగా ఉంది. 1.19 కోట్ల ఎకరాల్లో సాగు రాష్ట్రంలో నీటి వనరులు గణనీయంగా పెరిగాయి. సాగునీటి ప్రాజెక్టులు అందుబాటులోకి రావడంతో రెండు మూడేళ్లుగా వ్యవసాయ పంటల విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుంది. రాష్ట్రంలో 63 లక్షల మంది రైతులున్నారు. వానాకాలం పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.16 కోట్ల ఎకరాలు కాగా, 1.19 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో వరి 61.94 లక్షల ఎకరాల్లో సాగైంది. సాధారణం కంటే వరి ఏకంగా 182 శాతం సాగైంది. వాస్తవంగా వరి రైతులే ఎక్కువగా రుణాలు తీసుకుంటారు. అయితే వరి సాగైనంత స్థాయిలో బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడం గమనార్హం. ఇక పత్తి 46.42 లక్షల ఎకరాల్లో, కంది 7.64 లక్షల ఎకరాల్లో సాగైంది. కానీ ఈ పంటలకు కూడా రుణాలు ఆ స్థాయిలో అందలేదు. (2021–22కు సంబంధించిన మొత్తాలు వానాకాలం సీజన్వే) రూ. 5 వేల కోట్ల ప్రైవేట్ అప్పులు! 2021–22 రెండు సీజన్లలో రూ. 59,440 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అందులో ఈ సీజన్కు రూ. 35,665 కోట్లు ఇవ్వాలనుకున్నారు. కానీ ఇప్పటివరకు అందులో 43.45% మేరకే రుణాలు ఇచ్చినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. బ్యాంకుల తీరు కారణంగానే రైతులు రుణాలు పొందలేక పోయారనే విమర్శలున్నాయి. కొద్దిపాటి రుణాలు తీసుకోవడానికి రైతులు ఎలాం టి తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. కానీ పా సు పుస్తకాలు తీసుకొని పంట రుణాలు ఇచ్చా యి. నిస్సహాయ పరిస్థితుల్లో రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్థుల వద్ద అప్పులు చేశారు. ఒక అంచనా ప్రకారం రూ.5 వేల కోట్ల ప్రైవేట్ అప్పులు చేసినట్లు అంచనా. మరి ముఖ్యంగా రైతుబంధుకు కాని, బ్యాంకు రుణాలకు కాని నోచుకోని కౌలు రైతుల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. వీరికి ప్రైవేట్ రుణాలు తప్ప మరో ఆధారం లేదని రైతు సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఏడాదికేడాదికీ తగ్గుతున్న రుణాలు 2011–12 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రాంతంలో బ్యాంకులు తాము నిర్దేశించుకున్న లక్ష్యానికి మించి 115 శాతం పంట రుణాలు ఇచ్చాయి. ఆ ఏడాది రూ.10,233 కోట్లు ఇవ్వాలనేది లక్ష్యం కాగా, రూ. 11,787 కోట్లు ఇచ్చాయి. ఇక 2012–13లో ఏకంగా 121 శాతం, 2013–14లో 103 శాతం ఇచ్చాయి. అయితే తెలంగాణ ఏర్పాటయ్యాక 2014–15లో పంట రుణాల లక్ష్యంలో 93 శాతమే ఇచ్చాయి. అలా క్రమంగా రుణాల మంజూరు తగ్గిస్తూ వస్తున్నాయి. -
వ్యవసాయం.. గ్రామీణాభివృద్ధికి పెద్దపీట
సాక్షి, అమరావతి: వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డ్) పెద్దపీట వేస్తోందని బ్యాంక్ రాష్ట్ర చీఫ్ జనరల్ మేనేజర్ సుధీర్కుమార్ జన్నావర్ చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయ రంగంలో పంట రుణాలతో పాటు దీర్ఘకాలిక రుణాలు కూడా సహకార బ్యాంకుల ద్వారా ఇప్పించేందుకు చొరవ తీసుకుంటున్నామని తెలిపారు. అతి తక్కువ వడ్డీ రేటుతో వ్యవసాయ మౌలిక వసతుల నిధి నుంచి రుణాలు తీసుకుని పంట కోతల అనంతర పనులకు, గిడ్డంగుల నిర్మాణాలకు వినియోగించుకోవచ్చని రైతులకు సూచించారు. ఆదివారం ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. వ్యవసాయ మౌలిక వసతుల కల్పనకు రుణాలు వివిధ కారణాల వల్ల వ్యవసాయ రంగానికి దీర్ఘకాలిక రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు వెనుకబడ్డాయి. ఈ రంగంలో మౌలిక వసతులు ఏర్పడాలంటే దీర్ఘకాలిక రుణాలు అవసరం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల బ్యాంకర్ల సమావేశంలో అదే విషయం చెప్పారు. ఆయన విజ్ఞప్తి మేరకు నాబార్డ్ ఏం చేయగలుగుతుందనే దానిపై చర్చిస్తున్నాం. నాబార్డ్ ఆధ్వర్యంలో రూ.లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక వసతుల నిధి (ఏఐఎఫ్) ఏర్పాటైంది. దీని నుంచి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకునే వెసులుబాటు ఉంది. ఈ నిధిని పంట కోతల అనంతర కార్యకలాపాలు అంటే ధాన్యం నిల్వ కోసం గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు, వేర్ హౌస్లు, అదనపు విలువ జోడింపు గదులు వంటి వాటి కోసమే ఇస్తారు. 324 ఎఫ్పీవోలకు ప్రోత్సాహం... రాష్ట్రంలో ప్రస్తుతం 324 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను (ఎఫ్పీవోలు) ప్రోత్సహిస్తోంది. వీటిలో 259 సంఘాలు రిజిస్టర్ అయ్యాయి. ఇవి చాలా పురోగతిని సాధిస్తున్నాయి. ఆ సంఘాలు తమ ఉత్పత్తులను తామే అమ్ముకునే దశకు వచ్చాయి. వీటికి పరపతి సౌకర్యం కూడా బాగుంది. భవిష్యత్ అంతా ఎఫ్పీవోల పైనే ఆధారపడే పరిస్థితి రావొచ్చు. వర్షాధారిత ప్రాంతాల్లో వాటర్ షెడ్ పథకాలకు నాబార్డ్ అండగా నిలుస్తుంది. 200 వాటర్ షెడ్ పథకాలను ప్రోత్సహిస్తున్నాం. -
మాఫీ.. వారంతా హ్యాపీ
సాక్షి, చేవెళ్ల( రంగారెడ్డి): రుణమాఫీ రెండో విడతకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈనెల 16వ తేదీ నుంచి రూ.50వేల రుణాలు ఉన్నవారికి మాఫీ వర్తింపచేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల జరిగిన మంత్రల కేబినెట్ సమాశంలో రెండో విడత రుణమాఫీ నిధులు విడుదల చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. జిల్లాలో అర్హత సాధించిన రైతుల్లో 30–40 శాతానికిపైగా రెండో విడతలో లబ్ధి పొందే అవకాశం ఉంది. ఎన్నో రోజులుగా ఊరిస్తున్న రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ► ప్రభుత్వం ఎన్నికలకు ముందు 2014 ఏప్రిల్ 1 నుంచి 2018 డిసెంబర్ 11 నాటికి బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన రైతులకు కుటుంబానికి రూ.లక్ష వడ్డీతో కలుపుకొని నాలుగు విడుతల్లో మాఫీ చేస్తామని ప్రకటించింది. ► దీని ప్రకారం గత ఏడాది తొలివిడత రూ.25వేల లోపు రుణం ఉన్న రైతులకు వర్తింపచేశారు. ► ఇది జిల్లాలోని 10 శాతం మంది రైతులకు మాత్రమే వర్తించింది. కొంతమంది అర్హులైన వారికి పలు కారణాలతో వర్తించ లేదు. ► రుణాలు పొందిన రైతులు మాఫీ వస్తుందని బ్యాంకులకు బాకీలు కట్టడం మానేశారు. ► ప్రభుత్వం రుణమాఫీ ఎప్పుడిస్తోందో తెలియక బ్యాంకర్లు బాకీలు కట్టాలని రైతులపై ఒత్తిడి చేయడం పరిపాటిగా మారింది. ► రెండో విడత రుణమాఫీపై ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చింది ప్రభుత్వం. ► ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతుండటంతో వెంటనే రెండో విడత రుణమాఫీ విడుదలపై నిర్ణయం తీసుకుంది. ► ఈ నెల 16నుంచి రైతుల ఖాతాల్లోకి పంట రుణమాఫీ డబ్బులు జమ చేయనున్నట్లు ప్రకటించడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత.. ► జిల్లాలో మొత్తం 1,46,417 మంది రైతులు రుణమాఫీ పొందేందుకు అర్హులని అధికారులు గుర్తించారు. ► ఇందులో మొదటి విడతలో రూ.25వేల లోపు రుణాలున్న పది శాతం మందికి మాత్రమే వర్తించింది. ► ఇప్పుడు రెండో విడతలో రూ.50వేల లోపు రుణాలున్న రైతులకు మాఫీ చేసేందుకు నిర్ణయించడంతో 30 నుంచి 40 శాతం మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరనుందని అంచనా వేస్తున్నారు. ► రూ.50 వేల లోపు ఉన్న రైతులకు సంబంధించి రెండో విడతలో అమలు చేసేందుకు బ్యాంకర్ల నుంచి పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు. ► ఒకటి, రెండు రోజుల్లో జిల్లావ్యాప్తంగా పక్కా సమాచారం అందుతుందని జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి తెలిపారు. ► జిల్లాలో మొదటి విడతలో రూ.25వేల లోపు రుణాలున్న వారిని 17,943 మందిగా గుర్తించగా ఇందులో 10,928 మందికిగాను రూ.16.73కోట్లు విడుదల చేసింది. ► మిగతావారికి వివిధ కారణాలతో రుణమాఫీ వర్తించలేదు. వారికి ఇప్పుడు రెండో విడతలో వడ్డీతో కలుపుకొని రూ.50వేలలోపు రుణమాఫీ కానుందని అధికారులు చెబుతున్నారు. -
నేడు రైతుల ఖాతాల్లోకి ‘వైఎస్సార్ సున్నా వడ్డీ’
సాక్షి, అమరావతి: రైతులు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా వడ్డీలేని రుణాలు ఇస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన మాట మేరకు.. అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం అమలు చేస్తున్నారు. లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని, ఏడాది లోపు ఆ రుణం తిరిగి చెల్లించిన రైతులందరికీ సున్నా వడ్డీ పంట రుణాల పథకం వర్తింపజేస్తున్నారు. రైతులకు ఇప్పటివరకు రూ.1,132.54 కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం అందజేసింది. ఇప్పుడు రెండో ఏడాది కూడా.. అంటే 2019–20 రబీ సీజన్లో లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని ఏడాదిలోపు తిరిగి చెల్లించిన 6,27,906 మంది రైతులకు వడ్డీ రాయితీ కింద రూ.128.47 కోట్లు చెల్లిస్తున్నారు. సీఎం జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి ఈ మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు. ఈ–క్రాప్లో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే సున్నా వడ్డీ పంట రుణాల పథకం వర్తింపజేయాలని తొలుత నిర్ణయించారు. అయితే ఈ–క్రాప్లో 2,50,550 మంది రైతులు మాత్రమే నమోదు చేసుకున్నారు. మిగిలిన రైతులలో బ్యాంకర్లు అర్హులుగా గుర్తించిన వారందరికీ ఇప్పుడు సీఎం జగన్ ఉదారంగా ఈ పథకాన్ని వర్తింజేసి వడ్డీ రాయితీ చెల్లిస్తున్నారు. వైఎస్సార్ సున్నా వడ్డీ చెల్లింపుల కోసం సోమవారం ఆర్థికశాఖ నిధులు విడుదల చేయగా వ్యవసాయశాఖ పరిపాలన అనుమతి మంజూరు చేసింది. గత ప్రభుత్వం 2014–15 నుంచి 2018–19 వరకు పెట్టిన రూ.1,180 కోట్లు వడ్డీ లేని రుణాల బకాయిలను కూడా ఈ ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఆ మేరకు ఇప్పటి వరకు అర్హులైన రైతులకు రూ.850.68 కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం చెల్లించింది. సున్నా వడ్డీ పంట రుణాల పథకం ద్వారా 2019 ఖరీఫ్కి సంబంధించి 14.27 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.281.86 కోట్లు జమచేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతన్నల సంక్షేమమే ధ్యేయంగా ఇప్పటివరకు వివిధ పథకాల ద్వారా అన్నదాతలకు రూ.61,400 కోట్ల సాయం చేసింది. (చదవండి: ప్రతి ‘పార్లమెంట్’ పరిధిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్) -
అర్జీ ఇవ్వండి.. రుణం తీసుకెళ్లండి
యాచారం: రైతులకు వ్యవసాయ పంట రుణాలు ఇవ్వడానికి యాచారం పీఏసీఎస్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు కలిగి ఉండి ఏ బ్యాంకులో రుణం పొందని రైతులకు రుణాలు ఇచ్చేందుకు పీఏసీఎస్ పాలకవర్గం కృషిచేస్తుంది. కమర్షియల్ బ్యాంకులకు ధీటుగా రైతులకు పీఏసీఎస్ సేవలు అందేలా చూస్తున్నారు. యాచారం పీఏసీఎస్లో దాదాపు 7 వేలకు పైగా సభ్యులు ఉన్నారు. ఇందులో 4,985 మంది రైతులు దీర్ఘకాలిక, స్వల్పకాలిక, వ్యవసాయ తదితర పద్దుల కింద రూ.40 కోట్లకు పైగా రుణాలు పొందారు. ప్రస్తుతం దీర్ఘకాలిక రుణాల కోసం 200 మందికి పైగా అర్జీలు పెట్టుకున్నారు. గ్రామాల్లో ముమ్మర ప్రచారం.. ఈ ఏడాది యాచారం పీఏసీఎస్లో రూ.2 కోట్లకు పైగా వ్యవసాయ పంట రుణాలు ఇచ్చేందుకు సంఘం నిర్ణయించింది. మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో వ్యవసాయ భూమి కలిగి ఉన్న ప్రతి రైతును పీఏసీఎస్లో భాగాస్వామ్యం(రుణాలు కల్పించి సభ్యత్వం ఇవ్వడం) చేసే విధంగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయా గ్రామాల్లో పీఏసీఎస్ డైరెక్టర్ల ద్వారా రైతుల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు. అప్పు పరిమితి పట్టిక(క్రెడిట్ లిమిట్) తయారు చేసి డీసీసీబీకి ప్రతిపాదనలు పంపిస్తున్నారు. ఇప్పటికే డీసీసీబీ నుంచి యాచారం పీఏసీఎస్కు రూ.50 లక్షలు మంజూరయ్యాయి. మరో రూ.1.50 కోట్ల నిధుల మంజూరుకు పీఏసీఎస్ అధికారులు అర్జీలు స్వీకరిస్తున్నారు. వ్యవసాయ పంట రుణాలు ఇలా..(ఎకరాకు) వరి, పత్తి తదితర మెట్ట పంటలకు రూ.30 వేలు కూరగాయల పంటలకు రూ.38 వేలు ప్రతి రైతుకు రుణం ఇస్తాం మండలంలోని 24 గ్రామాల్లో వ్యవసాయ భూమి కలిగి ఉండి పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్న ప్రతి రైతుకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించాం. ఇందులో భాగంగా వ్యవసాయ పంట రుణాలు ఇచ్చేందుకు అర్జీలు స్వీకరిస్తున్నాం. ప్రతి రైతుకు సభ్యత్వం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. – తోటిరెడ్డి రాజేందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్, యాచారం -
అధికారుల చేతివాటం.. ఓ మహిళా రైతు రూపంలో..
చెన్నై : పంట రుణమాఫీలో సహకార సంఘాల్లోని సిబ్బంది మాయాజాలం ప్రదర్శించి ఉండడం వెలుగుచూసింది. రశీదు కోసం వచ్చే రైతుల వద్ద లంచం పుచ్చుకోవడమే కాదు, మాయాజాలం రూపంలో రూ. 25 లక్షల మేరకు మోసాలకు పాల్పడినట్టుగా విజిలెన్స్ విచారణలో తేలింది. సహకార బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తూ సీఎం పళనిస్వామి ప్రకటించడమే కాదు, తక్షణంలో అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. రుణాల మాఫీకి సంబంధించిన రశీదులను రైతులకు అందించే పనిలో సాగుతోంది. అయితే సహకార సంఘాలు, బ్యాంకుల్లో పనిచేస్తున్న కొందరు సిబ్బంది మాయాజాలం, అవినీతి రూపంలో రుణమాఫీపై విమర్శలు బయలుదేరాయి. రశీదుల కోసం వచ్చే రైతుల వద్ద లంచం కోరడం, అధిక మొత్తంలో రుణాల్ని మాఫీ చేయాల్సి ఉంటే, అందులో మాయాజాలం ద్వారా లక్షలు దండుకునే పనిలో కొందరు సిబ్బంది ఉండడం వెలుగులోకి వచ్చింది. ఈ మాయాజాలం వ్యవహారంలో ఓ మహిళా రైతు రూపంలో వెలుగులోకి వచ్చింది. తిరువణ్ణామలై జిల్లా వందవాసి సమీపంలోని తీర్చుర్ సహకార బ్యాంక్లో రూ. 50 వేలు రుణమాఫీకి సంబంధించిన రశీదు కోసం మహిళా రైతు శ్రీదేవి ప్రయతి్నంచారు. అయితే, అక్కడి కార్యదర్శి అన్నాదురై చేతులు తడపాల్సిందేనని పట్టుబట్టారు. తనకు రూ.5 వేలు ఇస్తేనే, రశీదు అని స్పష్టం చేయడంతో ఆ మహిళా రైతు విజిలెన్స్ వర్గాల్ని ఆశ్రయించారు. పథకం ప్రకారం శుక్రవారం సాయంత్రం అన్నాదురైను పట్టుకునేందుకు విజిలెన్స్ వర్గాలు సిద్ధమయ్యాయి. ఆయన ఆమె ఇచ్చిన డబ్బును చేతిలో తీసుకోకుండా, బల్లపై పెట్టి వెళ్లి పోవాలని సూచించడంతో రెడ్హ్యాండెడ్గా పట్టుకోలేని పరిస్థితి. శనివారం సియామంగంలోని ఆ కార్యదర్శి ఇళ్లు, తీర్చుర్ కార్యాలయంలో సోదాల్లో నిమగ్నం కావడం గమనార్హం. ఒక్క తిరువణ్ణామలై జిల్లాలోనే రూ. 25 లక్షల మేరకు రుణమాఫీ పేరిట మాయ సాగినట్టు తేలడంతోనే విజిలెన్స్ విచారణ, సోదాలు ముమ్మరంగా సాగుతుండడం గమనార్హం. కోవైలో ఓ రైతు వద్ద లంచం పుచ్చుకుంటూ పొల్లాచ్చి మహాలింగపురం సహకార బ్యాంక్లో పనిచేస్తున్న సెల్వరాజ్, ఆర్ముగంలో విజిలెన్స్కు రెడ్హ్యాండెడ్గా పట్టుబడడంతో సహకార సంఘాలు, బ్యాంక్లపై విజిలెన్స్ పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. -
అన్నదాతకు 'ఆర్థిక దన్ను'
సాక్షి, అమరావతి: ఆరుగాలం శ్రమించే అన్నదాతకు ప్రభుత్వం అండగా ఉండటంతో వారికి మరింత చేయూత లభిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అన్నదాతకు రుణాల మంజూరుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయి. రైతులతోపాటు కౌలుదారులకు కూడా విరివిగా రుణాలు మంజూరు చేస్తున్నాయి. సీజన్ ఆరంభం కాగానే పెట్టుబడికి అవసరమైన రుణాల కోసం అన్నదాతల అగచాట్లు వర్ణనాతీతంగా ఉండేవి. చెప్పులరిగేలా బ్యాంకుల చుట్టూ తిరిగినా అదునుకు రుణాలందేవి కావు. దీంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, దళారుల వద్ద ఎక్కువ వడ్డీకి డబ్బు తీసుకోవాల్సి వచ్చేది. వచ్చిన పంటను అప్పు ఇచ్చినవాళ్ల చేతిలో పెట్టగా మిగిలిందే రైతులకు దిక్కయ్యేది. ఒకవేళ పంట విపత్తు బారిన పడితే ఆ అప్పులు తీర్చేదారి కనిపించేదికాదు. రెండేళ్లుగా ఈ పరిస్థితిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. సీజన్ ప్రారంభానికి ముందే చేతికందుతున్న వైఎస్సార్ రైతుభరోసాతో నారుమళ్లు పోసుకునేందుకు ఇబ్బందిలేకుండా ఉంది. 2019–20లో 94.47 లక్షల మందికి రూ.1.14 లక్షల కోట్ల రుణాలు ప్రభుత్వం రైతుకు దన్నుగా ఉండటంతో వారికి రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయి. 2019–20 వ్యవసాయ సీజన్లో రూ.1.15 లక్షల కోట్ల రుణాలివ్వాలన్నది లక్ష్యం కాగా.. 94,47,103 మంది రైతులకు రూ.1,13,998 కోట్ల రుణాలిచ్చాయి. ఖరీఫ్లో పంట రుణాలు 48.60 లక్షల మందికి రూ.52,669 కోట్లు, టర్మ్ రుణాలు 6,36,266 మందికి రూ.12,908 కోట్లు ఇవ్వగా.. రబీలో పంటరుణాలు 34,48,181 మందికి రూ.36,604 కోట్లు, టర్మ్ రుణాలు 5,02,656 మందికి రూ.11,817 కోట్లు ఇచ్చాయి. 2020–21లో రూ.1.28 లక్షల కోట్ల రుణవితరణ లక్ష్యం 2020–21 వ్యవసాయ సీజన్లో రూ.1,28,659 కోట్ల రుణాలు మంజూరు చేయాలని బ్యాంకులకు లక్ష్యంగా నిర్దేశించారు. బ్యాంకులు జనవరి 20 నాటికి 69,87,298 మంది రైతులకు రూ.90,558 కోట్ల రుణాలు మంజూరు చేశాయి. గడిచిన ఖరీఫ్లో రూ.75,237 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, 56,74,500 మంది రైతులకు రూ.74,155 కోట్లు (99శాతం) ఇచ్చాయి. దీన్లో 48,19,306 మంది రైతులకు రూ.57,575 కోట్ల పంటరుణాలు, 8,55,194 మందికి రూ.16,580 కోట్ల టర్మ్ రుణాలు ఉన్నాయి. 2019 ఖరీఫ్తో పోలిస్తే గడిచిన ఖరీఫ్లో పంటరుణాలు రూ.4,906 కోట్లు, టర్మ్రుణాలు రూ.3,672 కోట్లు అదనంగా ఇచ్చాయి. రబీలోను అదే జోరు ప్రస్తుత రబీ సీజన్లో రూ.53,422 కోట్లు రుణాలు ఇవ్వాలన్నది బ్యాంకులకు లక్ష్యంకాగా.. ఇప్పటివరకు 13,12,798 మంది రైతులకు రూ.16,403 కోట్లు ఇచ్చాయి. పంటరుణాలు రూ.36,407 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు 11,33,185 మంది రైతులకు రూ.12,584 కోట్లు అందజేశాయి. టర్మ్రుణాలు రూ.17,015 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు 1,79,613 మంది రైతులకు రూ.3819 కోట్లు ఇచ్చాయి. సీసీఆర్సీపై రూ.లక్ష రుణమిచ్చారు. నాకు సొంతంగా ఎకరం ఉంది. ఆరెకరాలు కౌలుకు తీసుకున్నా. దాళ్వాలో కంద, క్యాబేజీ, మినుము సాగుచేస్తున్నా. కౌలుకార్డు (సీసీఆర్సీ) ఇచ్చారు. ఆ కార్డుపైనే మా గ్రామంలో సహకార బ్యాంకులో అప్పు కోసం దరఖాస్తు చేశా. రూ.లక్ష మంజూరు చేశారు. గతంలో ఇలా కార్డుపై ఎప్పుడూ రుణం పొందలేదు. చాలా సంతోషంగా ఉంది. – పావులూరి మురళీకృష్ణ, కౌలురైతు, పెద ఓగిరాల, కృష్ణాజిల్లా లక్ష్యానికి మించే రుణాలిస్తాం గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా లక్ష్యానికి మించే రుణాలిస్తాం. ఖరీఫ్లో 99 శాతం రుణాలిచ్చాం. రబీలో ఇప్పటికే రూ.16 వేల కోట్ల రుణాలిచ్చాం. వచ్చే రెండు నెలల్లో లక్ష్యానికి అనుగుణంగా రైతులకు రుణాలిస్తాం. – బ్రహ్మానందరెడ్డి, కన్వీనర్, ఎస్ఎల్బీసీ కౌలురైతులకు విరివిగా రుణాలు 2020–21 వ్యవసాయ సీజన్లో బ్యాంకులు 1,81,102 మంది కౌలుదారులకు రూ.760 కోట్ల రుణాలు మంజూరు చేశాయి. 4,13,278 మంది సాగుదారులకు క్రాప్ కల్టివేటర్స్ రైట్ కార్డు (సీసీఆర్సీ) జారీచేయగా, వారిలో 58,772 మందికి వ్యక్తిగతంగా రూ.318 కోట్ల రుణాలు మంజూరయ్యాయి. ఈ కార్డుదారులతో ఏర్పాటైన 16,387 జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ (జేఎల్జీ), రైతుమిత్ర గ్రూపు (ఆర్ఎంజీ)ల్లోని 1,22,330 మందికి రూ.442 కోట్ల రుణాలు మంజూరు చేశారు. -
రైతుల శ్రమ తెలిసిన ప్రభుత్వం ఇది..
ఇది రైతు పక్షపాత ప్రభుత్వం. సీఎం స్థానంలో మీ బిడ్డ కూర్చున్నారు. విత్తనం నుంచి పంట అమ్మకాల వరకు సహాయపడే విధంగా 10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. రైతులకు ఎంత చేసినా తక్కువే. దేశంలో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతులకు మన ప్రభుత్వం భరోసా ఇచ్చింది. రైతుల పట్ల మమకారం, బాధ్యతతో గత సర్కారు బకాయి పెట్టిన సున్నా వడ్డీ సొమ్ము రూ.1,180 కోట్లు చెల్లించాం. ఈ నెలాఖరుకు ఏడాదిన్నర పాలన పూర్తవుతుంది. ఈలోగానే మేనిఫెస్టోను ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్లా భావించి 90 శాతం హామీలు అమలు చేశామని సగర్వంగా చెప్పగలుగుతున్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం కాబట్టే, ప్రజా ప్రతినిధులు ధైర్యంగా తలెత్తుకుని గ్రామాల్లోకి, ప్రజల్లోకి వెళ్తున్నారు. – సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గతంలో ధర్నాలు చేసినా పరిహారం వచ్చేది కాదు గతంలో పంట నష్టపోతే రోడ్డెక్కి ధర్నాలు చేసినా పరిహారం డబ్బులు వచ్చేవి కావు. ఇప్పుడు పంట నష్టపోయిన నెల రోజుల్లోనే పంట నష్టపరిహారం ఇవ్వడం రికార్డు. రైతుల పాలిట మీరు దేవుడు. నేను ఐదు ఎకరాల పొలంలో వేరుశనగ వేశాను. వర్షాలు సకాలంలో పడ్డాయి. అయితే అధిక వర్షాల వల్ల పంట కొంత లాస్ అయ్యాం. వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి నష్టం అంచనా వేశారు. నెల తిరక్కుండానే పరిహారం అందింది. – శ్రీధర్, ఆత్మకూరు, అనంతపురం జిల్లా సాక్షి, అమరావతి : ఇది రైతుల పక్షపాత ప్రభుత్వమని, రైతుల శ్రమ తెలిసిన ప్రభుత్వమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. సకాలంలో పంట రుణాలు చెల్లిస్తే ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుందనే ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్ని రైతుల్లో కలిగించామన్నారు. 2019 ఖరీఫ్కు సంబంధించి 14.58 లక్షల మంది రైతులకు వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.510.32 కోట్లను మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి చెల్లించారు. అలాగే రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత నెల అక్టోబర్లో వరదల కారణంగా పంటలు నష్టపోయిన 1.97 లక్షల మంది రైతులకు నెల తిరగకుండానే ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.132 కోట్లు చెల్లించారు. ఈ రెండు కార్యక్రమాలకు సంబంధించి కంప్యూటర్లో బటన్ నొక్కి ఆన్లైన్ ద్వారా రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ జిల్లాల్లో సున్నా వడ్డీ, ఇన్పుట్ సబ్సిడీ లబ్ధిదారులైన రైతులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రైతులను ఆదుకోవడంలో ఈ రోజు నిజంగా మరో ఘట్టం అన్నారు. ఈ కార్యక్రమం వల్ల రైతులకు సకాలంలో పంట రుణాలు చెల్లించడం ఒక అలవాటు అవుతుందని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా భరోసా ఇవ్వలేదని, మొదటిసారిగా ఆ నమ్మకం కలిగిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రతి మూడు కుటుంబాలలో ఒక కుటుంబానికి అంటే దాదాపు 50 లక్షల రైతుల కుటుంబాలకు ఏటా రూ.13,500 చొప్పున రైతు భరోసా అందుతోందని వివరించారు. సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. వైఎస్సార్ సున్నా వడ్డీ సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రులు వేణుగోపాలకృష్ణ, కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు తదితరులు గతంలో ఏం జరిగింది? ► గతంలో రైతులను ఎలా మోసం చేశారో చూశాం. రుణ మాఫీ చేస్తామని చెప్పి చేయలేదు. 2015–16లో రైతులు రుణమాఫీ అవుతుందని ఆశించారు. వారు బ్యాంకులకు రుణాలు చెల్లించలేదు. కానీ వారికి నిరాశే మిగిలింది. ► 2015–18 వరకు సున్నా వడ్డీ బకాయిలు కట్టకపోవడంతో దాదాపు రూ.1,180 కోట్లు బకాయి పడితే రైతుల మీద బాధ్యత, మమకారంతో మన ప్రభుత్వమే చెల్లించిందని గర్వంగా చెబుతున్నాను. మనం ఏం చేస్తున్నాం? ► ఏ సీజన్లో పంట నష్టాన్ని అదే సీజన్లో ఇస్తామని చెప్పాము. ఆ మేరకు ఈ ఏడాది ఖరీఫ్లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు జరిగిన పంట నష్టానికి సంబంధించి పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ)గా గత నెలలో 1.66 లక్షల రైతు కుటుంబాలకు దాదాపు రూ.136 కోట్లు వారి వారి ఖాతాల్లో జమ చేశాం. ► అక్టోబర్లో జరిగిన నష్టానికి సంబంధించి ఇవాళ 1,97,525 రైతు కుటుంబాలకు రూ.132 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ చెల్లిస్తున్నాం. లక్ష లోపు రుణాలు తీసుకుని సకాలంలో తిరిగి చెల్లిస్తే, వారి వడ్డీ ప్రభుత్వమే కడుతోంది. ఎవరికైనా ఈ పథకాలు మిస్ అయితే గ్రామ సచివాలయాల్లో సంప్రదించాలి. లేదా వలంటీర్ను కలిసి చెప్పాలి. ► వైఎస్సార్ జలకళ ద్వారా ఉచితంగా బోర్ల తవ్వకం మొదలైంది. పేద రైతులకు మోటార్లు కూడా ఉచితంగా అందించబోతున్న ప్రభుత్వం మనది మాత్రమే. రైతుల కోసం బకాయిలు చెల్లించాం ► గత ప్రభుత్వం ఎగనామం పెట్టిన రూ.8,655 కోట్లు ఉచిత విద్యుత్ బకాయిలు, రూ.960 కోట్లు ధాన్యం కొనుగోళ్ల బకాయిలు, రూ.384 కోట్లు విత్తనాల సబ్సిడీ బకాయిలు, సున్నా వడ్డీ రాయితీకి సంబంధించి రూ.1,180 కోట్లు ఇస్తున్నాం. ► రైతులకు పగలే నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలంటే ఆ స్థాయిలో ఫీడర్లు లేవు. కేవలం 58 శాతం ఫీడర్లు మాత్రమే ఆ కెపాసిటీతో ఉన్నాయి. దాంతో దాదాపు రూ.1,700 కోట్లు ఖర్చు చేసి వాటి సామర్థ్యం పెంచి, దాదాపు 90 శాతం ఫీడర్లు రెడీ చేసి నాణ్యమైన విద్యుత్ పగటి పూటే ఇవ్వగలుగుతున్నాం. మిగిలిన 10 శాతం ఫీడర్లు కూడా ఈ నెలాఖరులోగా సిద్ధమవుతాయని అధికారులు చెబుతున్నారు. వచ్చే నెలలోనే బీమా క్లెయిమ్స్ ► పంటల బీమా కింద రైతులు తమ వాటాగా కేవలం రూ.1 చెల్లిస్తే, ప్రభుత్వం పూర్తి ప్రీమియమ్ (రైతుల వాటా రూ.506 కోట్లు సహా) దాదాపు రూ.1,031 కోట్లు చెల్లిస్తోంది. ఆ బీమాకు సంబంధించి సుమారు రూ.1,800 కోట్ల బీమా క్లెయిమ్ డిసెంబర్లో చెల్లించే కార్యక్రమం జరుగుతుంది. అన్నదాతల కోసం ఎన్నెన్నో చేస్తున్నాం ► 13 జిల్లాలలో అగ్రి ల్యాబ్లు, 147 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తున్నాం. రైతులు, అక్క చెల్లెమ్మలకు ఇంకా ఆదాయం వచ్చేలా, ఈ నెల 26 నుంచి అమూల్ ద్వారా తొలి దశగా పాల సేకరణ ప్రారంభిస్తున్నాం. ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాలలో తొలి దశ పాల సేకరణ మొదలవుతుంది. ► పాల సేకరణ కోసం మొత్తం 9,800 బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్లు (బీఎంసీయూ) ఆర్బీకేల పక్కనే ఏర్పాటు చేస్తున్నాం. ► 2019–20లో దాదాపు రూ.15 వేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేశాం. కోవిడ్ సమయంలోనూ రూ.3,200 కోట్లతో పంటలు కొనుగోలు చేశాం. రూ.666 కోట్లు పత్తి కొనుగోలు కోసం ఖర్చు చేశాం. ఎంతో ఆశ్చర్యపోతున్నాం సీఎంగా జగన్మోహన్రెడ్డి ఏది చెప్పినా సాధ్యం అవుతోంది. ఇది రైతులతో సహా మమ్మల్ని ఆశ్చర్య పరుస్తోంది. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు చేసిన ప్రచారానికి, ఆచరణలో చేసిన దానికి ఎక్కడా పొంతన లేదు. కానీ మీరు (వైఎస్ జగన్) వచ్చాక చెప్పింది చెప్పినట్లు జరుగుతోంది. – కె.కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి మీ హయాంలో సాగు సులభమైంది మేం వ్యవసాయం వదిలేద్దామనుకున్నాం. మీరు వచ్చాక తిరిగి సాగు సులభమైంది. నేను లక్ష రూపాయలు రుణం తీసుకున్నాను. నాకు రూ.3,218 వడ్డీ మాఫీ వచ్చింది. మా ఉమ్మడి కుటుంబంలో 8 మందికి రూ.3 వేలు చొప్పున రూ.24 వేలు వడ్డీ మాఫీ వచ్చింది. ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ కూడా మీరే కడుతున్నారు. వివిధ పథకాల ద్వారా మా కుటుంబానికి రూ.2 లక్షల వరకు లబ్ధి కలిగింది. – ఎర్రినాయుడు, పెంట శ్రీరాంపురం, గంట్యాడ మండలం, విజయనగరం జిల్లా సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న గుంటూరు జిల్లా నంబూరు రైతులు మీ పట్ల నమ్మకం పెరిగింది మనసుంటే మార్గం ఉంటుందని మీరు నిరూపించారు. నా ఖాతాలో వడ్డీ రాయితీ రూ.3,876 జమ అయింది. మీ పనితీరు పట్ల ప్రజల్లో పూర్తిగా నమ్మకం కలిగింది. సెప్టెంబర్లో నా పంట దెబ్బతింది. రైతు భరోసా కేంద్రానికి వెళ్లి నమోదు చేసుకుంటే.. డబ్బులు వస్తాయంటే మా నాన్న అవేమీ రావన్నాడు. కానీ మీరు నెల రోజుల్లోనే పంట నష్టానికి డబ్బులు వేశారు. కౌలు రైతులను గుర్తించింది మీరే. – విజయభాస్కర్రెడ్డి, సత్తెనపల్లి మండలం, గుంటూరు జిల్లా -
ఆ అవినీతి మూట.. రూ.23 కోట్లపై మాటే
ఓ సారి అధికారం ఇస్తే పది కాలాలపాటు ప్రజల సేవలో తరించాలనుకోవాలి...ప్రజల మన్ననలు పొందుతూ వారి మదిలో పదిలంగా స్థానం సంపాదించాలని ప్రజాప్రతినిధి తపన పడాలి. కానీ టీడీపీ హయాంలో ప్రజాప్రతినిధులంటే నిధుల స్వాహాకే వచ్చినట్టుగా...అందుకే పదవిని చేపట్టినట్టుగా యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారు. ఆ ఐదేళ్లే కాకుండా రానున్న ఐదేళ్లలో కూడా దోపిడీకి స్కెచ్ వేసుకొని మరీ స్వాహాకు ఉపక్రమించడం మరీ విడ్డూరం. అదృష్టవశాత్తూ వారు అధికారానికి దూరమయ్యారు కాబట్టి సరిపోయింది గానీ లేదంటే నిలువు దోపిడీ జరిగేది. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: పచ్చ నేతల ముందు చూపుతో సహకార సంఘాల్లో కోట్ల రూపాయలను కొల్లగొట్టారు. జిల్లాలోని ఏ సహకార సంఘాన్ని కదిలించినా గత టీడీపీ ఏలుబడిలో ఎటు చూసినా అవినీతి కుంభకోణాలు బట్టబయలవుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ అండాదండా చూసుకుని తెలుగు తమ్ముళ్లు చెలరేగిపోయారు. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమనే ధీమాతో టీడీపీ నేతలు సహకార సంఘాల్లో దొంగలు పడ్డట్టుగా చొరబడి దొరికినంత దోచుకున్నారు. చంద్రబాబు మరోసారి సీఎం అవుతారు, పంట రుణాలు మాఫీ చేస్తారని ఆ పార్టీ ఏలుబడిలోని సహకార సంఘాల పాలక వర్గాలు సార్వత్రిక ఎన్నికలకు ముందు గట్టి నమ్మకంతో ఉన్నారు. అతి విశ్వాసంతోనే బినామీ పేర్లతో కోట్లు రుణాలు లాగేశారు. తీరా ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి ఘోర పరాభవాన్ని రుచి చూపించారు. ఈ పరిస్థితుల్లో తెలుగు తమ్ముళ్లు పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. ప్రభుత్వం వచ్చేస్తుంది, చంద్రబాబు రుణ మాఫీ అమలవుతుందనే గుడ్డి నమ్మకంతో జిల్లాలోని పలు సహకార సంఘాల ప్రతినిధులు నకిలీ పాస్ పుస్తకాలు, బినామీ పేర్లతో రూ.కోట్లకు పడగలెత్తారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్గా అనంత ఉదయభాస్కర్ బాధ్యతలు స్వీకరించాక ఈ కుంభకోణాలను ఒకటొకటిగా ఛేదిస్తున్నారు. గతం దొంగల దోబూచులాట కొన్ని సంఘాలు, బ్రాంచీల్లో కోట్ల రూపాయలు కొల్లగొట్టిన కుంభకోణాలు బయటకు రాకుండా సంఘాల్లో పనిచేస్తున్న అధికారులు దాచిపెడుతున్నారు. గత పాలకవర్గాల్లో సంఘాలపై పడి నిలువునా దోచుకున్న వారే కావడం గమనార్హం. గత టీడీపీలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ వరుపుల రాజా, సీఈఓల హయాంలో డీసీసీబీ, సహకార సంఘాలు కుంభకోణాలమయంగా మారిపోయాయి. ఈ కుంభకోణాల గుట్టును ‘సాక్షి’ వరుస కథనాలతో రట్టు చేస్తున్న సంగతి పాఠకులకు విదితమే. ఇలా ఏజెన్సీలోని మొల్లేరు, మెట్ట ప్రాంతంలో లంపకలోవ, కోనసీమలో వద్దిపర్రు...తదితర సొసైటీలపై పడి రూ.కోట్లు కొట్టేసిన వైనాన్ని సాక్షి’ వెలుగులోకి తేవడం, డీసీసీబీ చైర్మన్ అనంతబాబు విచారణ జరిపించి బాధ్యులపై చర్య తీసుకుంటున్నారు. గండేపల్లిలో తాజాగా... ఈ వరుసలోనే తాజాగా మెట్ట ప్రాంతంలోని గండేపల్లి సహకార సంఘం, గండేపల్లి డీసీసీ బ్రాంచీలో రూ.కోట్లు కొల్లగొట్టిన కుంభకోణం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. 2017 నవంబరు నెల నుంచి గండేపల్లి బ్రాంచి పరిధిలోని గండేపల్లి పీఏసీఎస్లో నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ బాండ్లు, బినామీ రైతుల పేరుతో స్వాహా బాగోతమిదీ. గండేపల్లి డీసీసీబీ బ్రాంచి సూపర్వైజర్గా నేదూరి వాసుదేవరెడ్డి గతేడాది అక్టోబరు 28న జాయినయ్యారు. 2020 జనవరి 30న జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం, చైర్మన్ ఆదేశాల మేరకు గండేపల్లి సొసైటీ రికార్డులను బ్యాంకులో పరిశీలించేందుకు సూపర్వైజర్ ప్రయత్నించారు. అందుకు సొసైటీ, బ్రాంచిల నుంచి సహాయ నిరాకరణ ఎదురైంది. ఈ క్రమంలో 2017 నవంబరు 28 నుంచి ఇచ్చిన రుణాలకు సంబంధించి రికార్డులు బ్యాంక్కు ఇవ్వలేదనే విషయం గుర్తించారు. గండేపల్లి బ్రాంచిలో సైతం రికార్డులను దాచిపెట్టారు. లోతుగా పరిశీలించే క్రమంలో బ్యాంకులో ఉన్న షాడో రిజిస్టర్, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాల ద్వారా కొంత సమాచారాన్ని సూపర్వైజర్ సేకరించడంతో విషయం డీసీసీబీ ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లిందని విశ్వసనీయ సమాచారం. సూపర్వైజర్ సంతకం లేకుండానే.. సూపర్వైజర్ సంతకం లేకుండా పది మంది సభ్యుల రుణాలు రెన్యువల్ చేసిన వైనం ఆ సందర్భంలోనే బయటపడింది. తన ప్రమేయం లేకుండా రుణాలు రెన్యువల్ చేయడంతో ఇందులో పెద్ద కుంభకోణమే దాగి ఉందనే అనుమానం, ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడ తన మెడకు చుట్టుకుంటుందనే భయం వెరసి సూపర్వైజర్ డీసీసీబీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారని తెలియవచ్చింది. ఈ క్రమంలోనే రికార్డులు పరిశీలించే సరికి తీగ లాగితే డొంక కదిలినట్టు గండేపల్లి సొసైటీలో కోటి రూపాయల బినామీ రుణాల బాగోతం బయటకు వచ్చిందంటున్నారు. 10 మంది సభ్యుల రుణాలకు సంబంధించి అడ్వాన్సు స్టేట్మెంట్, రికవరీ స్టేట్మెంట్పై సొసైటీ సూపర్వైజర్ సంతకాలు లేకపోవడం గమనార్హం. మేనేజర్ ఒక్క కలం పోటుతో రూ.99,93,000 లక్షలు స్వల్పకాలిక, దీర్ఘకాలిక పంట రుణాలను 2020, ఫిబ్రవరి 17న రెన్యువల్ చేయడం విశేషం. మొదట గుర్తించిన పది మంది సభ్యుల బినామీ రుణాలు రెన్యువల్ చేయడంతో మరిన్ని రుణాలు ఇదే రీతిన రెన్యువల్ చేశారని తెలియవచ్చింది. అలా గండేపల్లి సొసైటీలో మొత్తం 156 మంది సభ్యుల పేరుతో బినామీ పాస్పుస్తకాలు, నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ బాండ్ పేపర్లతో సుమారు రూ.23 కోట్లు రుణాలు అప్పటి పాలకవర్గం హయాంలో విడుదలయ్యాయి. ఈ 156లో మొత్తం 50 మంది సభ్యుల(బినామీలు) రుణాలను రెన్యువల్ చేయగా, మిగిలిన 106 మంది రెన్యువల్ చేసే క్రమంలోనే విషయం బయటకు పొక్కడంతో బ్రేక్ పడిందంటున్నారు. ఈ నకిలీ పాస్పుస్తకాలు, డాక్యుమెంట్ల కోసం ప్రత్యేకంగా ఒక ప్రింటింగ్ మెషీన్ను గండేపల్లిలో ఏర్పాటు చేశారని, చివరకు బాండు పేపర్లను సబ్ రిజిస్ట్రార్ సీల్ను కూడా టేంపరింగ్ చేశారని విశ్వసనీయంగా తెలిసింది. ఈ బినామీ రుణాలకు సంబంధించిన మొత్తం జాబితా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్కు కూడా చేరినట్టు తెలిసింది. ఈ జాబితా ఆధారంగా డీసీసీబీ నిష్పక్షపాతమైన విచారణ జరిపితే కుంభకోణం వెలుగులోకి రానుంది. ఇంకా మా దృష్టికి రాలేదు గండేపల్లి బ్రాంచ్ పరిధిలో రుణాల అవకతవకల విషయం నా దృష్టికి రాలేదు. జిల్లాలో ఏ సొసైటీ, బ్రాంచ్లో అవకతవకలు జరిగినట్టు మా దృష్టికి వచ్చినా వెంటనే చైర్మన్ అనంతబాబు ఆదేశాల మేరకు విచారణ చేస్తున్నాం. బాధ్యులపై చర్యలు తీసుకుని రికవరీ కూడా చేస్తున్నాం. గండేపల్లి సొసైటీ విషయం చైర్మన్తో మాట్లాడతాను. – ప్రవీణ్కుమార్, డిసీసీబీ ఇన్చార్జ్ సీఈవో -
గత ఏడాది లక్ష్యానికి మించి పంట రుణాలు
సాక్షి, అమరావతి: గత ఆర్థిక సంవత్సరం (2019–20)లో ఖరీఫ్, రబీతో కలిపి బ్యాంకర్లు రైతులకు లక్ష్యాన్ని మించి పంట రుణాలను అందించాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని పునరుద్ధరించడమే కాకుండా గత ప్రభుత్వం బకాయి పెట్టిన సున్నా వడ్డీ సొమ్మును కూడా చెల్లిస్తామని ప్రకటించడంతో బ్యాంకులు లక్ష్యానికి మించి పంట రుణాలను మంజూరు చేశాయి. నిజానికి గత ఏడాది ఖరీఫ్ రుణాల లక్ష్యం రూ.51,240 కోట్లు కాగా.. రూ.51,511 కోట్లను అందించాయి. అలాగే.. గత రబీలో పంట రుణాలు రూ.32,760 కోట్లకుగాను రూ.37,762 కోట్లను బ్యాంకులు మంజూరు చేశాయి. ఇది లక్ష్యంలో 115.27 శాతం. మొత్తం వ్యవసాయ రంగానికి గత ఆర్థిక ఏడాది రూ.1,15,000 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా.. రూ.1,13,997 కోట్ల రూపాయల మేర బ్యాంకులు రుణాలను మంజూరు చేశాయి. ఇది లక్ష్యంలో 99.13 శాతం. సర్కారు దన్నుతో రుణాలకు బ్యాంకుల ఆసక్తి ఇదిలా ఉంటే.. ఈ ఆర్థిక ఏడాది ఇప్పటికే మంచి వర్షాలు పడుతుండటంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఈ సంవత్సరం ఖరీఫ్, రబీ కలిపి రూ.94,524 కోట్లు పంట రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ధారించగా ఇప్పటికే రూ.18,323 కోట్లను బ్యాంకులు మంజూరు చేశాయి. అలాగే, ఖరీఫ్, రబీ కలిపి వ్యవసాయ టర్మ్ రుణాల కింద రూ.34,036 కోట్లను మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ధారించగా ఇప్పటికే రూ.1,639 కోట్లను మంజూరు చేశాయి. సకాలంలో పంట రుణాలను చెల్లించే రైతులకు సున్నా వడ్డీని వర్తింపజేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో బ్యాంకులు కూడా పంట రుణాలను మంజూరు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. -
కౌలు రైతులకూ పంట రుణాలు
సాక్షి, అమరావతి: రైతులకు అన్నివిధాలా అండదండలు అందిస్తూనే.. కౌలు రైతులకూ పంట రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. ఇందుకోసం ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు పంట రుణాల పక్షోత్సవాలు నిర్వహించనున్నామన్నారు. ఈ సందర్భంగా కిసాన్ క్రెడిట్ కార్డులపై అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కౌలు రైతులందరికీ పంట సాగు హక్కు పత్రాలు ఇప్పించేలా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. బుధవారం సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏమన్నారంటే.. రైతుల హక్కులకు భంగం కలగదు: పిల్లి సుభాష్చంద్రబోస్ ► వ్యవసాయ రంగం అభివృద్ధిపై సీఎం వైఎస్ జగన్ దృష్టి సారించారు. ► రైతులతో పాటు కౌలుదారులకు కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో నూతన సాగుదారుల చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ► ఈ చట్టం వల్ల భూ యజమానులైన రైతుల హక్కులకు ఎటువంటి భంగం కలగదు. ► 11 నెలల సాగు అనంతరం కౌలు హక్కులు వీడిపోయేలా చట్టం రూపొందించాం. ► కౌలుదారుల వివరాలను అధికారులకు చెప్పాల్సిన నైతిక బాధ్యత రైతులపై ఉంది. ► కేంద్ర ప్రభుత్వం కేవలం రైతులకు మాత్రమే పంట రుణాలిస్తోంది. ఏపీలో రైతులతో పాటు కౌలుదారులకూ రుణాలు అందించాలని సీఎం నిర్ణయించారు. కౌలు రైతులకు రూ.8,500 కోట్ల రుణాలు : కురసాల కన్నబాబు ► రుణ పక్షోత్సవాల్లో భాగంగా ప్రతి గ్రామంలోనూ సమావేశాలు నిర్వహించి పంట సాగు హక్కు పత్రం (సీసీఆర్సీ) కార్డులు పొందిన కౌలు రైతులందరికీ పంట రుణాలు అందిస్తాం. ► రాష్ట్రంలో ఇప్పటివరకు 4,02,229 మందికి సీసీఆర్సీ కార్డులు అందజేశాం. మరో లక్షన్నర వరకూ కార్డులు అందిస్తాం. రూ.8,500 కోట్లను కౌలుదారులకు పంట రుణాలుగా అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యంగా నిర్దేశించారు. ► త్వరలో జిల్లాలు, మండల స్థాయిలో వ్యవసాయ సలహా బోర్డులు ఏర్పాటు చేయబోతున్నాం. అభ్యుదయ రైతు అధ్యక్షతన ఏర్పాటయ్యే ఈ బోర్డులు పంటల ప్రణాళికలో కీలక పాత్ర పోషిస్తాయి. ► రైతులకు వడ్డీ లేని రుణ బకాయిల కింద రూ.1,150 కోట్ల బకాయిలను ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసింది. ► ఈ విషయంలో బ్యాంకర్లు సైతం హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఇది మా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. రూ.200 కోట్లతో పొగాకు కొనుగోళ్లు ► పొగాకు కొనుగోళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లను విడుదల చేసింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా అన్ని ప్లాట్ఫారాల్లో కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. ► రాష్ట్రంలో వర్షపాతం సాధారణం కంటే 55.5 శాతం అధికంగా కురవటం శుభసూచకం. ఖరీఫ్ పనులు ఆశాజనకంగా ఉన్నాయి. ఇప్పటికే 32 శాతం వరి నాట్లు పూర్తయ్యాయి. ► సీఎం జగన్మోహన్రెడ్డి దూరదృష్టితో తీసుకున్న చర్యల కారణంగా ఈ ఏడాది మే నాటికే 12.61 లక్షల మంది రైతులకు 8.43 లక్షల క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలు అందజేశాం. ఇప్పటికే రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందజేశాం. ► ప్రస్తుత వర్షాల కారణంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల నారుమడులు ముంపునకు గురైనట్టు సమాచారం అందుతోంది. వివరాలు అందజేయాలని అధికారుల్ని ఆదేశించాం. సంబంధిత రైతులను ఆదుకుంటాం.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
సీబీఎస్ఈ పది, పన్నెండవ తరగతి ఫలితాలు విడుదల
ఎవరి లెక్క వారిదే..!
ఓటరు తీర్పు... ఈవీఎంలలో భద్రం
రాయల్ ఎన్ఫీల్డ్ దగ్ధం
వైఎస్సార్సీపీ గెలుపుకోసం పనిచేసిన వారికి ధన్యవాదాలు
దళిత మహిళా సర్పంచ్పై జనసేన దాడి
రామతీర్థంలో వైభంగా పూర్ణాహుతి
గ్రామాల్లో ద్రాక్ష పంట
చికెన్
పశువుల ఎరువుతో భూసారం పెంపు
తప్పక చదవండి
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement