-
బంధన్ బ్యాంక్కు సీఈవో గుడ్బై
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ సంస్థ బంధన్ బ్యాంక్ వ్యవస్థాపకుడు, సీఈవో సీఎస్ ఘోష్ బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. ప్రస్తుత సర్వీసు 2024 జూలై9తో ముగియనుండటంతో పదవీవిరమణ చేయనున్నట్లు బ్యాంక్ తెలిపింది. వరుసగా మూడుసార్లు ఎండీ, సీఈవోగా దాదాపు దశాబ్ద కాలం బ్యాంకుకు నాయకత్వం వహించిన తాను బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు బోర్డుకు రాసిన లేఖలో ఘోష్ పేర్కొన్నారు. -
నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీగా సౌరభ్ వత్స
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ మోటర్ ఇండియా ఎండీగా సౌరభ్ వత్స నియమితులయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నియామకం అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న రాకేశ్ శ్రీవాస్తవ మార్చి 31తో రిటైరవుతున్నారు. ఇటీవల జనవరి 15నే కంపెనీలో ఆయన డిప్యుటీ ఎండీగా నియమితులయ్యారు. అనుభవజు్ఞడైన వత్స సారథ్యం .. కంపెనీ తదుపరి వృద్ధికి దోహదపడగలదని నిస్సాన్ ఇండియా ఆపరేషన్స్ విభాగం ప్రెసిడెంట్ ఫ్రాంక్ టోరెస్ తెలిపారు. -
రిటైర్మెంట్ ప్రకటించిన కాంగ్రెస్ సీనియర్ నేత
యూపీఏ- 2 హయాంలో హోం మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే రిటైర్మెంట్ ప్రకటించారు. తన బదులు తన కుమార్తె ప్రణితి షిండే వచ్చే లోక్సభ ఎన్నికల్లో షోలాపూర్ నుండి పోటీ చేస్తారని ఆయన ప్రకటించారు. సుశీల్ కుమార్ శంభాజీ షిండే 1941, సెప్టెంబర్ 4న మహారాష్ట్రలో జన్మించారు. షిండే కాంగ్రెస్ పార్టీ నేతగా పలు కీలక పదవులు చేపట్టారు. 2003లో తొలిసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 2004 వరకు ఈ పదవిలో ఉన్నారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా వ్యవహరించారు. 2006 వరకు ఈ పదవిలో కొనసాగారు. సుశీల్ కుమార్ షిండే 2006 నుండి 2012 వరకు కేంద్ర ఇంధనశాఖ మంత్రిగా పనిచేశారు. 2012లో హోం మంత్రిగా నియమితులయ్యారు. 2014 వరకు ఈ పదవిలో ఉన్నారు. 1971లో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకోవడంతో క్రియాశీల రాజకీయాల్లో షిండే కెరీర్ ప్రారంభమైంది. 1974 నుండి 1992 వరకు మహారాష్ట్ర శాసనసభలో సభ్యునిగా ఉన్నారు. 1992 నుండి మార్చి 1998 వరకు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. 1999లో ఆయన ఉత్తరప్రదేశ్లోని అమేథీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ప్రచార నిర్వాహకునిగా బాధ్యతలు నిర్వహించారు. షిండే రిటైర్మెంట్ ప్రకటనతో ఆయన కుమార్తె ప్రణితి షిండే(42) తన తండ్రి సంప్రదాయ సీటు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆమె షోలాపూర్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ప్రత్యేక ఆహ్వానిత సభ్యురాలుగా ఉన్నారు. ఈసారి షోలాపూర్ ఎంపీ స్థానం కాంగ్రెస్కే దక్కుతుందని ప్రణితి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: డబుల్ ఇంజిన్ సర్కారులో డబుల్ అనారోగ్యం: ఖర్గే -
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర భట్ పదవీ విరమణ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర భట్ రిటైరయ్యారు. ఆఖరి పనిదినమైన శుక్రవారం ఆయనకు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సహ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ మాట్లాడుతూ..న్యాయవ్యవస్థ కోసం ముఖ్యంగా రాజ్యాంగ సంబంధ అంశాల్లో ఆయన అందించిన సేవలు నిరుపమానమని కొనియా డారు. 1979 నుంచి ఆయనతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆదిష్ అగర్వాల్ పాల్గొన్నారు. 2019 సెప్టెంబర్ 23న జస్టిస్ భట్ సుప్రీంకోర్టులో నియమితులై నాలుగేళ్లపాటు సేవలందించారు. పలు చారిత్రక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. 1958లో మైసూరులో జన్మించిన జస్టిస్ భట్ 1982లో ఢిల్లీ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్నారు. -
ధోని నోట రిటైర్మెంట్ మాట ఎప్పటికి క్లారిటీ వచ్చింది..
-
ఆయనో జంటిల్మన్ జడ్జి
న్యూఢిల్లీ: జస్టిస్ దినేశ్ మహేశ్వరిని ‘జెంటిల్మ్యాన్ జడ్జి’అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ అభివర్ణించారు. 2019లో సుప్రీంకోర్టులో నియమితులై నాలుగేళ్ల కు పైగా సేవలందించిన జస్టిస్ మహేశ్వరి ఈ నెల 14న పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటైన జస్టిస్ మహేశ్వరి వీడ్కోలు కార్యక్రమానికి జస్టిస్ డీవై చంద్రచూడ్ అధ్యక్షత వహించారు. ‘అలహాబాద్ హైకోర్టులో ఉన్నప్పటి నుంచి జస్టిస్ మహేశ్వరితో నాకు పరిచయం ఉంది. ఇద్దరం అలహాబాద్, లక్నో బెంచ్ల్లో ఉండేవాళ్లం. లక్నోలో ఆయన నా సీనియర్. జస్టిస్ మహేశ్వరి జెంటిల్మ్యాన్ జడ్జి, ఫ్రెండ్లీ జడ్జి’అని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు.‘విధుల్లో ఉండగా చివరిసారిగా నిగ్రహాన్ని ఎప్పుడు కోల్పోయారనే విషయం ఆయనకు కూడా గుర్తులేదని కచ్చితంగా చెప్పగలను. టెంపర్ అనేది జస్టిస్ మహేశ్వరి డిక్షనరీలోనే లేదు. ఆయన అంతటి సహనం, ప్రశాంతతలతో ఉంటారు’అని కొనియాడారు. అనంతరం జస్టిస్ మహేశ్వరి ప్రసంగించారు. ‘ఇతరుల సహకారం లేకుండా ఏ వ్యక్తి ఈ విధులను నిర్వహించలేడు. మనమంతా కలిసి పనిచేశాం’అంటూ ఉద్విగ్నభరితమయ్యారు. సుప్రీంకోర్టులో మోస్ట్ సీనియర్ జడ్జిల్లో జస్టిస్ మహేశ్వరి ఆరోవారు. ప్రస్తుతం పూర్తి సామర్థ్యంతో నడుస్తున్న సుప్రీంకోర్టులో జస్టిస్ మహేశ్వరి రిటైర్మెంట్తో జడ్జీల సంఖ్య 33కు తగ్గనుంది. ‘ఈ–ఫైలింగ్ 2.0’ ప్రారంభం సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఈ–ఫైలింగ్ 2.0 సదుపాయాన్ని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ శుక్రవారం ప్రారంభించారు. దీనిద్వారా న్యాయవాదులు ఏ సమయంలోనైనా కేసులు ఆన్లైన్ ద్వారా ఫైల్ చేయొచ్చన్నారు. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఈ–ఫైలింగ్ సాఫ్ట్వేర్ ద్వారా కేసులు ఫైల్ చేయడంతోపాటు తర్వాత వాటి స్థితిగతులను ఇతర కోర్టులు, ట్రిబ్యునళ్లలో ఉన్న కేసుల స్టేటస్ను సైతం తెలుసుకోవచ్చని వెల్లడించారు. -
Nitin Gadkari: రాజకీయాలకు ‘వీడ్కోలు దుమారం’పై గడ్కరీ స్పందన
రాజకీయాలకు కేంద్ర రవాణ మంత్రి నితిన్ గడ్కరీ గుడ్ బాయ్ చెబుతున్నారు అంటూ వార్తలు గుప్పుమన్నాయి. పలు మీడియాల్లో కథనాలు హల్చల్ చేశాయి. ఈ మేరకు కేంద్ర మంత్రి గడ్కరీ ఆ ఆరోపణలకు స్పందించారు. ఆ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. వాటిల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పారు. తనకు రాజకీయాలకు రిటైర్మంట్ చెప్పే ఉద్దేశం అస్సలు లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ..ముంబై గోవా జాతీయ రహదారి నిర్మాణ పనులను గురువారం తనిఖీ చేశామని, దాదాపు పనుల్ని పూర్తియినట్లు తెలియజేశారు. ముండై-గోవా జాతీయ రహదారి కొంకణ్లోని ప్రధాన పర్యాటక ప్రాంతాలను కలిపే హైవే అని చెప్పారు. ఇది పర్యాటకానికి మంచిగా ఉపయోగపడుతుందన్నారు. అలాగే ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలను కలుపుతూ రోడ్డు ఉన్నందున పారిశ్రామికాభివృద్ధి కూడా మంచిగా ఊపందుకుంటుందని చెప్పారు. పన్వేల్ ఇందాపూర్ల కోసం భూసేకరణ, పర్వావరణ అనుమతులే ఈ ముంబై-గోవా జాతీయ రహదారిని ఆలస్యం చేశాయని చెప్పారు. ఇక ఈ అడ్డంకులన్నీ తొలగిపోయాయని, కర్నాల్ అభయారణ్యంలో ఫ్లైఓవర్ను తొలగించి పర్యావరణ సమస్యను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా..గురువారం ఉదయం రూ.కోటి విలువైన మూడు జాతీయ రహదారుల పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. రాయ్గఢ్ జిల్లాలోని పలాస్పే గ్రామం వద్ద 63,900 కి.మీ రూ.414.68 కోట్లతో రహదారి నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులు జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ, డిఘి అనే రెండు ఓడరేవుల వద్ద ఆర్థిక వృద్ధిని పెంచుతాయని గడ్కరి చెప్పారు. అయితే పన్వెల్ నుంచి కాసు హైవే వరకు శంకుస్థాపన చేయడం వల్ల ప్రయాణ వేగం తోపాటు ఇంధనం కూడా ఆదా అవుతుందన్నారు గడ్కరీ. (చదవండి: ‘అమృత్పాల్ సింగ్ లొంగిపోకూడదు.. 1984 తరహాలోనే పాక్కు పారిపోవాలి’) -
రిటైరైన జస్టిస్ నజీర్
న్యూఢిల్లీ: జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా విశేష సేవలందించారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కొనియాడారు. బుధవారం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ వీడ్కోలు సభలో ఆయన ప్రసంగించారు. ‘‘జస్టిస్ నజీర్ది బహుముఖీన వ్యక్తిత్వం. సాధారణ కుటుంబంలో జన్మించి స్వయం కృషితో ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ప్రజా న్యాయమూర్తిగా పేరుగడించారు’’ అన్నారు. న్యాయ వ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యం తగినంత లేకపోవడం బాధాకరమని జస్టిస్ నజీర్ అన్నారు. జూనియర్ లాయర్లకు మంచి వేతనాలు, మరిన్ని అవకాశాలు కావాలని అభిప్రాయపడ్డారు. -
జులన్... ఐదో ర్యాంక్తో ముగింపు
గతవారం అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన భారత మహిళల జట్టు పేస్ బౌలర్ జులన్ గోస్వామి తన కెరీర్ను ఐదో ర్యాంక్తో ముగించింది. మంగళవారం విడుదల చేసిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్లో 39 ఏళ్ల జులన్ బౌలర్ల విభాగంలో 698 పాయింట్లతో తన ఐదో ర్యాంక్ను నిలబెట్టుకుంది. బ్యాటర్ల ర్యాంకింగ్స్లో భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఐదో ర్యాంక్లో... స్మృతి మంధాన ఆరో ర్యాంక్లో నిలిచారు. -
జులన్కు క్లీన్స్వీప్ కానుక
లండన్: అంతర్జాతీయ మహిళల క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్, భారత సీనియర్ పేసర్ జులన్ గోస్వామి కెరీర్ విజయంతో ముగిసింది. ఇంగ్లండ్ జట్టుతో శనివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలోని టీమిండియా 16 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. ఈ విజయంతో భారత్ సిరీస్ను 3–0తో నెగ్గి కెరీర్లో చివరి మ్యాచ్ ఆడిన 39 ఏళ్ల జులన్ గోస్వామికి క్లీన్స్వీప్ కానుకగా ఇచ్చింది. మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ 45.4 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. స్మృతి మంధాన (50; 5 ఫోర్లు), దీప్తి శర్మ (68 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్ను స్మృతి, దీప్తి శర్మ ఆదుకున్నారు. ఐదో వికెట్కు వీరిద్దరు 58 పరుగులు జత చేశారు. స్మృతి అవుటయ్యాక ఒకవైపు వికెట్లు పడుతుంటే మరోవైపు దీప్తి పట్టుదలతో ఆడి అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. ఇంగ్లండ్ బౌలర్లలో కేటీ క్రాస్ (4/26), ఫ్రేయా కెంప్ (2/24), ఎకిల్స్టోన్ (2/27) రాణించారు. అనంతరం 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 43.3 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. కెరీర్లో చివరి మ్యాచ్ ఆడిన జులన్ గోస్వామి బ్యాటింగ్లో ‘డకౌట్’కాగా... బౌలింగ్లో 10 ఓవర్లలో మూడు మెయిడెన్లు వేసి 30 పరుగులిచ్చి 2 వికెట్లు తీసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రేణుక సింగ్ (4/29), స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ (2/38) కూడా ఇంగ్లండ్ను దెబ్బ తీశారు. మొత్తం 340 పరుగులు చేసి రెండు వికెట్లు తీసిన హర్మన్ప్రీత్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది. 355: జులన్ గోస్వామి మూడు ఫార్మాట్లలో కలిపి తీసిన వికెట్ల సంఖ్య. జులన్ 12 టెస్టుల్లో 44 వికెట్లు... 204 వన్డేల్లో 255 వికెట్లు... 68 టి20ల్లో 56 వికెట్లు పడగొట్టింది. 7: మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ చేయడం భారత జట్టుకిది ఏడోసారి (బంగ్లాదేశ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లపై ఒకసారి... శ్రీలంకపై మూడుసార్లు). ఇంగ్లండ్పై తొలిసారి. -
‘ప్రపంచకప్ గెలవకపోవడమే లోటు’
లండన్: రెండు దశాబ్దాలకు పైగా భారత మహిళా క్రికెట్ మూలస్థంభాల్లో ఒకరిగా నిలిచిన దిగ్గజ పేస్ బౌలర్ జులన్ గోస్వామి ఆటకు ముగింపు పలుకుతోంది. నేడు భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే చివరి వన్డేతో రిటైర్ కానున్న జులన్ ఆఖరిసారిగా లార్డ్స్ మైదానంలో బరిలోకి దిగనుంది. భారత్ ఇప్పటికే సిరీస్ను గెలుచుకున్న నేపథ్యంలో అందరి దృష్టీ జులన్పైనే ఉంది. ఆమెకు విజయంతో ఘనంగా వీడ్కోలు ఇవ్వాలని హర్మన్ బృందం భావిస్తోంది. ఈ నేపథ్యంలో తన కెరీర్ విశేషాల గురించి జులన్ శుక్రవారం మీడియాతో మాట్లాడింది. వన్డే లేదా టి20 ప్రపంచకప్లలో తాము ఒకటి గెలిచి ఉంటే బాగుండేదని ఆమె వ్యాఖ్యానించింది. ‘2005, 2017 వన్డే వరల్డ్కప్లలో మేం ఫైనల్ చేరాం. వీటిలో ఒకటి గెలిచి ఉండాల్సింది. ప్రతీ క్రికెటర్కి అదే లక్ష్యం ఉంటుంది. నాలుగేళ్ల పాటు ఎంతో కష్టపడి అక్కడి దాకా వచ్చాక కప్ గెలిస్తే కల నిజమయ్యేది. టి20 ప్రపంచకప్ సహా మేం మూడు ఫైనల్స్ ఆడినా ఒక్కటి గెలవలేకపోయాం. అది చాలా బాధిస్తుంది. నా కెరీర్లో అదే లోటు’ అని జులన్ చెప్పింది. గత రెండేళ్లుగా చాలా సార్లు రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తూ వచ్చానని, చివరకు ఇప్పుడు తప్పుకుంటున్నానని జులన్ భావోద్వేగంతో చెప్పింది. ‘రెండేళ్లుగా ప్రతీ సిరీస్ నాకు చివరి సిరీస్లాగానే అనిపించేది. కోవిడ్ వల్ల మ్యాచ్లు వాయిదాపడుతూ రావడంతో పాటు వరుసగా గాయాలపాలయ్యాను. శ్రీలంక సిరీస్తోనే ముగిద్దామనుకున్నా. అయితే ఫిట్గా లేక ఆ సిరీస్ ఆడలేదు. దాంతో మళ్లీ ఎన్సీఏకు వెళ్లాను. రాబోయే టి20 వరల్డ్కప్కు ముందు ఇదే చివరి వన్డే సిరీస్ కాబట్టి ఆటను ముగిస్తున్నా’ అని ఈ బెంగాల్ పేసర్ పేర్కొంది. కోల్కతాలో 1997 వన్డే వరల్డ్కప్ ఫైనల్లో బాల్బాయ్గా పని చేసిన తర్వాత దేశానికి ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నానని, ఇన్నేళ్లు కొనసాగగలనని అనుకోలేదన్న జులన్... కెరీర్లో తొలి మ్యాచే అన్నింటికంటే ప్రత్యేకమైందని గుర్తు చేసుకుంది. వచ్చే ఏడాది జరి గే తొలి మహిళల ఐపీఎల్లో పాల్గొనడం గురించి తాను ఇప్పుడే చెప్పలేనని జులన్ స్పష్టం చేసింది. -
US Open 2022: సరిలేరు సెరెనాకెవ్వరు
2007 ఆస్ట్రేలియన్ ఓపెన్... ఆ సమయంలో 81వ ర్యాంక్లో ఉన్న సెరెనా విలియమ్స్ అన్సీడెడ్గా బరిలోకి దిగింది. అప్పటికి ఆమె గ్రాండ్స్లామ్ మాత్రమే కాదు, ఏదైనా డబ్ల్యూటీఏ టైటిల్ గెలిచి సరిగ్గా రెండేళ్లయింది. ఆట, శరీరం రెండూ గతి తప్పాయంటూ వరుసగా విమర్శలు వస్తున్నాయి... విపరీతంగా బరువు పెరిగిపోయి మైదానంలో చురుకైన కదలికలు లోపించాయి... టోర్నీలో తొలి మ్యాచ్కు ముందు ‘నైకీ’ ప్రతినిధి ఒకరు ప్లేయర్స్ లాంజ్లోకి వచ్చి సెరెనాను కలిశాడు. ఆశించిన స్థాయిలో సెరెనా ఆట లేదని, ఇలాగే సాగితే ఒప్పందం రద్దు చేసుకుంటాం అని హెచ్చరిక జారీ చేశాడు. కనీసం క్వార్టర్ ఫైనల్ అయినా చేరాల్సిందేనని గట్టిగా చెప్పి వెళ్లాడు. అప్పటికే 7 గ్రాండ్స్లామ్స్ ఆమె ఖాతాలో ఉన్నా సరే, ఒక స్టార్ క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నా సరే, ఆటతో పాటు కోర్టు బయట కూడా సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి... ఇలాంటి తీవ్ర ఒత్తిడి మధ్య సెరెనా ఆడింది. తన కసినంతా ప్రదర్శిస్తూ వరుసగా ఒక్కో ప్రత్యర్థిని దాటుకుంటూ ఫైనల్ చేరింది. అక్కడ షరపోవాను ఓడించి సగర్వంగా ట్రోఫీని అందుకుంది. గెలుపు అనంతరం తన ఆగ్రహాన్ని దాచుకోకుండా ‘ఓడాలని ఎవరూ కోరుకోరు. ఇలాంటి విజయాలే నన్ను మానసికంగా బలంగా మారుస్తాయి. విమర్శకులందరికీ ఇదే నా సమాధానం’ అంటూ గట్టిగా ప్రకటించింది. కెరీర్ ఆసాంతం ఇదే పోరాటపటిమ సెరెనాను గొప్పగా నిలిపింది. అద్భుతమైన సర్వీస్, పదునైన గ్రౌండ్స్ట్రోక్లు, రిటర్న్స్లో ధాటి, చురుకైన అథ్లెట్ లక్షణాలు, అన్నింటికి మించి మానసిక దృఢత్వం... లోపాలు లేని ప్లేయర్గా సెరెనాను ఆల్టైమ్ గ్రేట్గా నిలిపాయి. తనకంటే ముందు తరంలో అనేక మంది దిగ్గజాలతో పోలిస్తే ప్రత్యర్థిపై విరుచుకుపడే దూకుడు, పవర్ గేమ్ ఆమెను ప్రత్యేకంగా మార్చాయి. 14 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్గా ప్రారంభమైన ఆ ప్రస్థానం 18 ఏళ్ల పాటు ఘనంగా సాగి ఇప్పుడు ఆఖరి అంకానికి చేరింది. ఆటలోని అంకెలు మాత్రమే కాదు అంతకు మించిన ఆత్మవిశ్వాసం ఆమెను అందరికీ స్ఫూర్తిగా మార్చాయి. బాల్యం నుంచి స్టార్గా మారిన తర్వాత కూడా పలు సందర్భాల్లో నల్ల జాతీయురాలిగా ఎదుర్కొన్న వివక్షను అధిగమించి శిఖరానికి చేరగలగడం ఆమెకే సాధ్యమైంది. తనపై కొందరు వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా సొంత దేశంలోనే ఒక ప్రతిష్టాత్మక టోర్నీలో 14 ఏళ్లు ఆడకుండా స్వీయ వనవాసం పాటించిన ఆమె... లింగ వివక్షపై కూడా టెన్నిస్ కోర్టులోనే తన ఆగ్రహాన్ని ప్రదర్శించడంలో వెనక్కి తగ్గలేదు. అమెరికాలో పేదరికానికి కేరాఫ్ అడ్రస్ లాంటి కాంప్టన్ పట్టణంలో పెరిగిన నాటి నుంచి ప్రపంచాన్ని జయించే వరకు కూడా సెరెనాను అదే పట్టుదల, ఓటమిని అంగీకరించని తత్వం నడిపించాయి. తన విజయాలతోనే కాదు తన ప్రతీ అడుగుతో, ఆడిన ప్రతీ షాట్తో క్రీడా ప్రపంచంపై మరచిపోలేని ముద్ర వేసి సెరెనా తన శకాన్ని ముగిస్తోంది. విజయ ప్రస్థానం... ఓపెన్ శకంలో (1968 నుంచి) సింగిల్స్లో అత్యధిక గ్రాండ్స్లామ్ టైటిల్స్తో దిగ్గజంగా ఎదిగినా సెరెనా మొదటి ట్రోఫీ మాత్రం మిక్స్డ్ డబుల్స్లో రావడం విశేషం. 1998లో మ్యాక్స్ మిర్నీతో కలిసి వింబుల్డన్ గెలుచుకున్న సెరెనా ఆ తర్వాత యూఎస్ ఓపెన్నూ సొంతం చేసుకుంది. తర్వాతి ఏడాది పారిస్ ఇండోర్ టోర్నీ గెలవడంతో ఆమె ఖాతాలో మొదటి సింగిల్స్ టైటిల్ చేరింది. ఆ తర్వాత టెన్నిస్ ప్రపంచాన్ని సెరెనా శాసించడం లాంఛనమే అయింది. కొత్త మిలీనియంలో పాత స్టార్లంతా మెల్లగా నిష్క్రమిస్తూ రిటైర్మెంట్ బాట పట్టిన సమయంలో సెరెనా శకం మొదలైంది. 2002లో వరుసగా మూడు గ్రాండ్స్లామ్లు నెగ్గి ఆ తర్వాత 2003లో ఆస్ట్రేలియన్ ఓపెన్తో కెరీర్ స్లామ్ పూర్తి చేసుకోవడంతో ఆమె స్థాయి పెరిగింది. అద్భుత విజయాల ఫలితంగా సహజంగానే నడిచొచ్చిన వరల్డ్ నంబర్వన్ ర్యాంక్తో సెరెనా మరింత ఎత్తుకు ఎదిగింది. ఆ తర్వాత దశాబ్ద కాలానికి పైగా తిరుగులేని ప్రదర్శనతో సెరెనా సత్తా చాటింది. ప్రత్యర్థి ఎవరైనా నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడే తత్వం ఆమెను అగ్రస్థానాన నిలబెట్టింది. తన సమకాలీన ప్రత్యర్థులపై ఆమె ఆడిన మ్యాచ్ రికార్డు చూస్తే సెరెనా ఆధిక్యం ఎలా సాగిందో అర్థమవుతుంది. వీనస్ విలియమ్సపై 19–12, మార్టినా హింగిస్పై 7–6, కాప్రియాటిపై 10–7, హెనిన్పై 8–6, అజరెంకాపై 18–5తో సెరెనా పైచేయి సాధించింది. అయితే ఒకదశలో సమ ఉజ్జీలుగా నిలుస్తారని, హోరాహోరీ సమరాలు ఖాయమని టెన్నిస్ ప్రపంచం భావించిన మరో ప్రత్యర్థి మారియా షరపోవాపై సెరెనా ఆధిపత్యం తిరుగులేనిది. 2004 వింబుల్డన్ ఫైనల్లో సెరెనాపై 6–1, 6–4తో గెలవడంతో పాటు అదే ఏడాది డబ్ల్యూటీఏ ఫైనల్లో కూడా షరపోవాదే పైచేయి అయింది. కానీ ఆ తర్వాత వీరిద్దరు 17 సార్లు తలపడగా అన్ని సార్లూ సెరెనానే గెలిచి (ఓవరాల్గా 18–2) తానేంటో చూపించింది. 2014 యూఎస్ ఓపెన్ నుంచి వరుసగా మళ్లీ నాలుగు గ్రాండ్స్లామ్లు గెలిచి రెండోసారి ఈ ఫీట్ను సాధించడం సెరెనాకే సాధ్యమైంది. దీంతో పాటు ఆమె సాధించిన మూడు ఒలింపిక్ స్వర్ణాలు కెరీర్కు అదనపు హంగును జోడించాయి. గాయాలను అధిగమించి... టెన్నిస్లో 30 ఏళ్ల వయసు అంటే రిటైర్మెంట్కు చేరువైనట్లే. గాయాలు, ఇతర ఫిట్నెస్ సమస్యలు సహజంగానే వెంటాడుతాయి. కానీ సెరెనా తన చివరి 10 గ్రాండ్స్లామ్లను 30 ఏళ్లు దాటిన తర్వాతే అందుకుంది. కెరీర్ మొదలు పెట్టిన దాదాపు 15 ఏళ్ల తర్వాత మళ్లీ నంబర్వన్ ర్యాంక్ సాధించడం అసాధారణ ఘనత. మొదటి నుంచి కూడా సెరెనాను పలు మార్లు గాయాలు ఇబ్బంది పెట్టాయి. మోకాలు, పొత్తికడుపు, చీలమండ, వెన్ను నొప్పి, కండరాలు, మోచేయి, భుజం, కాలికి గాయం, తొడ, బొటన వేలు, పొరపాటున గాజు పెంకులు గుచ్చుకోవడం... ఈ జాబితా చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. గాయంతో టోర్నీల ప్రారంభానికి ముందే తప్పుకోవడం, టోర్నీ మధ్యలో నిష్క్రమించడం చాలాసార్లు జరిగాయి. అయితే పట్టుదల, పోరాటతత్వం సెరెనాను మళ్లీ బలంగా పైకి లేచేలా చేశాయి. కోలుకుని వచ్చి అదే జోరులో విజయాలు సాధించి చూపడం ఆమెకే చెల్లింది. ఎనిమిది వారాల గర్భవతిగా ఉంటూ 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించిన ఆమె బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత 2020 ఆరంభంలో ఆక్లాండ్ ఓపెన్ను గెలిచి మరోసారి అందరి దృష్టి తనపై పడేలా చేసింది. తొలి ప్రత్యర్థి: దిగ్గజ ఆటగాళ్లు కెరీర్లో ఎన్ని విజయాలు సాధించినా తొలి మ్యాచ్కు ఉండే ప్రాధాన్యతే వేరు. ప్రొఫెషనల్ డబ్ల్యూటీఏ కెరీర్లో సెరెనా తొలిసారి కెనడాలోని క్వాబెక్ సిటీలో జరిగిన ‘బెల్ చాలెంజ్’ టోర్నీలో వైల్డ్కార్డ్తో బరిలోకి దిగింది. ప్రపంచ ర్యాంకింగ్స్లో అప్పుడు 149వ స్థానంలో ఉన్న యానీ మిల్లర్ (అమెరికా) చేతిలో 1–6, 1–6 తేడాతో తొలి రౌండ్లోనే ఓడింది. గాయాలను అధిగమించి... టెన్నిస్లో 30 ఏళ్ల వయసు అంటే రిటైర్మెంట్కు చేరువైనట్లే. గాయాలు, ఇతర ఫిట్నెస్ సమస్యలు సహజంగానే వెంటాడుతాయి. కానీ సెరెనా తన చివరి 10 గ్రాండ్స్లామ్లను 30 ఏళ్లు దాటిన తర్వాతే అందుకుంది. కెరీర్ మొదలు పెట్టిన దాదాపు 15 ఏళ్ల తర్వాత మళ్లీ నంబర్వన్ ర్యాంక్ సాధించడం అసాధారణ ఘనత. మొదటి నుంచి కూడా సెరెనాను పలు మార్లు గాయాలు ఇబ్బంది పెట్టాయి. మోకాలు, పొత్తికడుపు, చీలమండ, వెన్ను నొప్పి, కండరాలు, మోచేయి, భుజం, కాలికి గాయం, తొడ, బొటన వేలు, పొరపాటున గాజు పెంకులు గుచ్చుకోవడం... ఈ జాబితా చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. గాయంతో టోర్నీల ప్రారంభానికి ముందే తప్పుకోవడం, టోర్నీ మధ్యలో నిష్క్రమించడం చాలాసార్లు జరిగాయి. అయితే పట్టుదల, పోరాటతత్వం సెరెనాను మళ్లీ బలంగా పైకి లేచేలా చేశాయి. కోలుకుని వచ్చి అదే జోరులో విజయాలు సాధించి చూపడం ఆమెకే చెల్లింది. ఎనిమిది వారాల గర్భవతిగా ఉంటూ 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించిన ఆమె బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత 2020 ఆరంభంలో ఆక్లాండ్ ఓపెన్ను గెలిచి మరోసారి అందరి దృష్టి తనపై పడేలా చేసింది. భారత్తో బంధం 2008 మార్చి... అప్పటికే సెరెనా ఎనిమిది గ్రాండ్స్లామ్లు గెలిచి స్టార్గా వెలుగొందుతోంది. అలాంటి సమయంలో కూడా ఆమె టెన్నిస్కు పెద్దగా ప్రాధాన్యత లేని భారత్లో... అదీ ఒక టియర్–2 టోర్నీలో పాల్గొనడం విశేషం. అదే బెంగళూరు ఓపెన్. ఈ టోర్నీలో ఆమెనే విజేతగా నిలిచింది. సెరెనా కెరీర్లో అది 29వ టైటిల్. ఆట ముగిసె... సుమారు 24 వేల మంది ప్రేక్షకులు... గ్రాండ్స్లామ్ గెలుపు ప్రస్థానాన్ని ప్రారంభించిన సొంతగడ్డపై చివరి సారి బరిలోకి...ఆఖరి సారిగా ఆ రాకెట్ పదును వీక్షించేందుకు వచ్చిన ఫ్యాన్స్ సె–రె–నా... సె–రె–నా... అంటూ హోరెత్తిస్తున్నారు... భారీ స్క్రీన్పై గత రెండు మ్యాచ్ల తరహాలోనే కెరీర్ అత్యుత్తమ క్షణాలతో ‘మాంటేజ్’ వీడియో ప్రదర్శన... అది ముగిశాక సెరెనా విలియమ్స్ కోర్టులోకి అడుగు పెట్టింది. అప్పటికే ఆమె ప్రత్యర్థి ఐలా తొమ్లాయనోవిచ్ సిద్ధంగా ఉంది...ప్రతీ షాట్, ప్రతీ పాయింట్, ప్రతీ గేమ్, ప్రతీ సెట్... సెరెనా ప్రతీ అడుగు అభిమానులను అలరించింది. 185 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన సమరం చివరకు ఒక దిగ్గజం కెరీర్ను ముగించింది. కెరీర్లో తాను ఆడిన 1,014వ మ్యాచ్లో ఆస్రేలియా ప్రత్యర్థి చేతిలో ఓడి సెరెనా నిష్క్రమించింది. భావోద్వేగంతో కన్నీళ్లపర్యంతమవుతూ ఇంటర్వ్యూ ఇచ్చిన అనంతరం కోర్టంతా కలియతిరుగుతూ తనదైన శైలిలో ‘ట్విర్ల్’ తర్వాత అభివాదం చేస్తూ ఆమె కోర్టును వీడిన క్షణంతో ఒక అత్యద్భుత కెరీర్కు తెర పడింది. న్యూయార్క్: మహిళల టెన్నిస్ ఆల్టైమ్ గ్రేట్ సెరెనా విలియమ్స్ ఆటకు వీడ్కోలు పలికింది. యూఎస్ ఓపెన్లో మూడో రౌండ్లో పరాజయంతో ఆమె రిటైర్మెంట్ ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ మ్యాచ్లో సెరెనా 5–7, 7–6 (7/4), 1–6 తేడాతో ఐలా తొమ్లాయనోవిచ్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓటమిపాలైంది. తొలి సెట్లో ఇద్దరూ పోటాపోటీగా తలపడ్డారు. ఒకదశలో సెరెనా 5–3తో ఆధిక్యంలో నిలిచింది. అయితే కోలుకున్న తొమ్లాయనోవిచ్ స్కోరు సమం చేయడంతో పాటు మరో రెండు గేమ్లు కూడా గెలిచి సెట్ను సొంతం చేసుకుంది. రెండో సెట్ కూడా ఇదే తరహాలో సాగింది. ఇక్కడా సెరెనా 5–2తో ఆధిక్యంలో నిలిచినా ఆసీస్ ప్రత్యర్థి పోరాడటంతో సెట్ టైబ్రేకర్ వరకు వెళ్లింది. ఈ దశలో తన అనుభవాన్నంతా వాడి సెరెనా సెట్ను గెలుచుకోవడంతో పోరు ఆసక్తికరంగా మారింది. అయితే చివరి సెట్లో మాత్రం తొమ్లాయనోవిచ్ ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. రెండో గేమ్ తర్వాత స్కోరు 1–1తో సమంగా ఉన్నా ఆ తర్వాత వరుసగా నాలుగు గేమ్లు గెలిచి ఐలా 5–1తో విజయానికి చేరువైంది. ఏడో గేమ్లో ఆరు మ్యాచ్ సెరెనా ఆరు మ్యాచ్ పాయింట్లు కాపాడుకొని అభిమానులను అలరించినా...చివరకు ఫోర్ హ్యాండ్ అన్ఫోర్స్డ్ ఎర్రర్తో ఓటమి ఖాయమైంది. కొన్ని వివాదాలూ... ఆటలో ఎక్కడా దూకుడు తగ్గించని నైజంతో దూసుకుపోయిన సెరెనా సుదీర్ఘ కెరీర్లో అప్పుడప్పుడు వచ్చిన వివాదాలు కొంత చర్చ రేపినా, అవి ఆమె గొప్పతనాన్ని తగ్గించేవిగా మారలేదు. 2000 వింబుల్డన్లో వీనస్ చేతిలో సెరెనా చిత్తుగా ఓడినప్పుడు మ్యాచ్ ఫలితాన్ని తండ్రి రిచర్డ్ నిర్ణయించాడని, ఇది మ్యాచ్ ఫిక్సింగ్ అని విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత 2001 ఇండియన్ వెల్స్ టోర్నీ సెమీస్కు ముందు ఆమె ప్రత్యర్థి వీనస్ గాయం పేరు చెప్పి అనూహ్యంగా తప్పుకోవడంతో ప్రేక్షకులు జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. దాంతో తీవ్ర ఆవేదనకు లోనైన తర్వాతి 14 ఏళ్ల పాటు ఆ టోర్నీలో ఆడలేదు. చెయిర్ అంపైర్లతో వాదనలు, అందుకు జరిమానాలతో పాటు బాల్ బాయ్ను కూడా ‘గొంతు కోస్తా’ అన్నట్లు రాకెట్తో హెచ్చరించడం వరకు చాలా సందర్భాల్లో సెరెనా తనపై నియంత్రణ కోల్పోయింది. 2018 యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఒసాకాతో మ్యాచ్ సందర్భంగా ఆమె ప్రవర్తన, రాకెట్ను నేలకు కొట్టడంవంటి ఘటనలతో బాగా చెడ్డపేరు వచ్చింది. అయితే ఆమెలోని అద్భుతమైన ఆట అలాంటి తప్పులను కాచేలా చేయగలిగింది. ఇవి కన్నీళ్లు కాదు. ఆనంద భాష్పాలు. నా తల్లిదండ్రులే ఈ ఘనతకు కారణం. వారికి ఏం ఇచ్చినా తక్కువే. ఇక అక్క వీనస్ లేకపోతే చెల్లి సెరెనా లేదు. సెరెనా ప్రతీ విజయం వెనక వీనస్ ఉంది. ఇదో అత్యద్భుత ప్రయాణం. నా కెరీర్లో ఎప్పుడూ చివరి వరకు కూడా ఓటమిని అంగీకరించలేదు. ఇప్పుడు కూడా అలాగే పోరాడాను. ఇన్నేళ్లుగా నాకు కోర్టులో మద్దతునిచ్చిన అందరికీ కృతజ్ఞతలు. నా జీవితమంతా టెన్నిస్ ఆడాను. నేను కోరుకున్నదంతా సాధించాను. ఇకపై ఆటకు దూరంగా భిన్నంగా జీవితాన్ని గడపాలనుకుంటున్నా. రెండోసారి అమ్మను కావాలని భావిస్తున్నా. –సెరెనా –సాక్షి క్రీడా విభాగం -
సినిమాలకు గుడ్బై చెప్పబోతున్న నాజర్!, కారణం ఇదేనా?
టాలీవుడ్ స్టార్ యాక్టర్స్లో నటుడు నాజర్ ఒకరు. దక్షిణాదిన అయన విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. స్టార్ హీరోలందరి సినిమాల్లో ఆయన ప్రధాన పాత్రలు పోషిస్తూ ఆడియన్స్ను అలరిస్తూ వస్తున్నారు. నాజర్ లేకుండ ఎలాంటి పెద్ద సినిమా లేదు అనేంతగా ఆయన గుర్తింపు పొందారు. తండ్రిగా, పోలీసు ఆఫీసర్గా, విలన్గా, కమెడియన్గా ఏ పాత్రలో అయిన ఇట్టే ఒదిగిపోయే ఆయన ఇటీవల కాలంలో సినిమాలను బాగా తగ్గించారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ ఇండస్ట్రీలో హాట్టాపిక్గా నిలిచింది. త్వరలోనే ఆయన నటనకు గుడ్బై చెప్పబోతున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. చదవండి: నటి మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం యాక్టింగ్కు రిటైర్మెంట్ ప్రకటించాలని ఆయనే స్వయంగా నిర్ణయించుకున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆనారోగ్య కారణాల దృష్ట్యా నాజర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. లాక్డౌన్ సమయంలో నాజర్ గుండె సంబంధిత సమస్యలతో బాధపడ్డారు. అప్పటి నుంచే ఆయన పలు సెలక్టెడ్ చిత్రాలనే చేస్తున్నారు. ఇక శాశ్వతంగా నటనకు బ్రేక్ ఇచ్చి పూర్తిగా ఆరోగ్యంపైనే ఆయన దృష్టి పెట్టాలనుకుంటున్నారట. అందుకే యాక్టింగ్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాలని ఆయన అనుకుంటున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. అయితే దీనిపై నాజర్ నుంచి కానీ ఆయన కుటుంబ సభ్యుల నుంచి కానీ ఎలాంటి అధికారిక సమాచారం లేదు. చదవండి: అది చెత్త సినిమా.. దానివల్ల ఏడాది పాటు ఆఫర్స్ రాలేదు: పూజా హెగ్డే కాగా ‘కళ్యాణ అగత్తిగళ్’ చిత్రంతో నాజర్ నటుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత నటుడిగా తనని తాను నిరూపించుకుంటూ గొప్ప నటుడిగా ఎదిగారు. ఆయన సౌత్లోనే కాదు హిందీలో కూడా పలు చిత్రాలు చేశారు. ఇక బాహుబలిలో ఆయన పోషించిన బిజ్జలదేవ పాత్రను ఎవరు మర్చిపోలేరు. ఇది మాత్రమే కాదు ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల గుండెల్లో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన ఆయన ఇక సినిమాల్లో కనిపించరంటే ప్రతి ఒక్కరు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇదే నిజమైతే సినీ పరిశ్రమ మరో గోప్ప నటుడిని మిస్ అవుతుందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
‘శభాష్’ అనిపించుకోగలిగాను!
2005... మెదక్ పట్టణంలో ఒక చిన్నస్థాయి క్రికెట్ టోర్నీ... అమ్మాయిలు క్రికెట్ ఆడటమే అరుదు అనుకుంటే కొందరు స్థానికుల చొరవతో టోర్నమెంట్ కూడా జరుగుతోంది. ఒక మ్యాచ్లో సరిగా చూస్తే మిథాలీ రాజ్ బ్యాటింగ్ చేస్తోంది. ఆమె భారత క్రికెట్ జట్టు తరఫున ఆడటం మొదలు పెట్టి అప్పటికే ఆరేళ్లు దాటింది... కానీ అక్కడ బరిలోకి దిగడానికి ఆమె సంకోచించలేదు... ఇలాంటి అంకితభావమే ఆమెను గొప్పగా తీర్చిదిద్దింది. ఆటపై ఉన్న అభిమానమే ఏకంగా 23 ఏళ్లు దేశం తరఫున ఆడేలా చేసింది. ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీ రాజ్ ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన పలు విశేషాలు... బయోపిక్... బయోగ్రఫీ... రిటైర్మెంట్ తర్వాతి కెరీర్పై కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. నాకు తెలిసిన విద్య క్రికెట్ మాత్రమే కాబట్టి ఆటకు సంబంధించిందే అవుతుంది. ప్రస్తుతం నా బయోపిక్ ‘శభాష్ మిథూ’ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నాను. నా బాల్యం నుంచి పెద్ద స్థాయికి ఎదిగే వరకు వేర్వేరు అంశాలతో సినిమా ఉంటుంది. అయితే ఎక్కడితో సినిమాను ముగిస్తున్నామో ఇప్పుడే చెప్పను. తాప్సీ చక్కటి నటి కావడంతో పాటు మహిళా ప్రధాన చిత్రాలు కూడా కొన్ని చేసింది కాబట్టి బయోపిక్ కోసం ఆమెను సరైన వ్యక్తిగా అనుకున్నాం. దీంతో పాటు నా ఆటోబయోగ్రఫీ పని కూడా నడుస్తోంది. త్వరలోనే పుస్తకం విడుదలవుతుంది. లోటుగా భావించడం లేదు ప్రపంచకప్ గెలవాలనేది నా కల. ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పాను కూడా. అయితే చివరకు అది లేకుండానే కెరీర్ ముగిసింది. కానీ అది లేనంత మాత్రాన నా ఇన్నేళ్ల ప్రదర్శన విలువ తగ్గదు. భారత పురుషుల క్రికెట్లోనూ చూస్తే ప్రపంచకప్ గెలిచిన టీమ్లో భాగం కాకపోయినా, క్రికెట్ చరిత్రలో గొప్ప ఆటగాళ్లుగా నిలిచినవారు ఎంతో మంది ఉన్నారు. రెండు ప్రపంచకప్లలో జట్టును ఫైనల్కు చేర్చడం కూడా చెప్పుకోదగ్గ ఘనతే కాబట్టి విచారం ఏమీ లేదు. సుదీర్ఘ కెరీర్కు అదే కారణం చాలా ఎక్కువగా కష్టపడే తత్వమే నన్ను ఈ స్థాయికి చేర్చింది. నిలకడగా, మార్పు లేకుండా ఇన్నేళ్ల పాటు ఒకే తరహా ‘టైమ్ టేబుల్’ను అమలు చేశాను. అత్యుత్తమంగా ఎదిగేందుకు సన్నద్ధత, ప్రతీ రోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడం, ఆటకు మెరుగులు దిద్దుకోవడం, అదే ప్రాక్టీస్, అదే డ్రిల్స్ను ఏకాగ్రత చెదరకుండా 23 ఏళ్ల పాటు కొనసాగించగలిగాను. రోజూ ఇదేనా అనే భావన లేకుండా మైదానంలోకి వచ్చేదాన్ని. నా సాధన నాకు ఎప్పుడూ బోర్ కొట్టలేదు. అందుకే ఇలాంటి కెరీర్ సాధ్యమైంది. సమాజంలో కొందరు నేను క్రికెట్ ఆడటంపై కామెంట్లు చేసినా... మైదానంలో మాత్రం ఎప్పుడూ, ఎలాంటి వివక్ష ఎదుర్కోలేదు. అలా అనుకోలేదు ఎన్నో గంటల ప్రాక్టీస్ తర్వాత కూడా ఆడింది చాలు, కొంత విరామం తీసుకుందాం, కొంచెం విశ్రాంతిగా కూర్చుందాం అనే ఆలోచన రాలేదు. చాలా ఎక్కువగా కష్టపడుతున్నాను కదా, ఇంత అవసరమా అనుకోలేదు. సరిగ్గా చెప్పాలంటే నాపై నేను ఎప్పుడూ జాలి పడలేదు. 23 ఏళ్ల కెరీర్లో నేను గాయాలపాలైంది కూడా చాలా తక్కువ. అప్పుడప్పుడు గాయపడినా సిరీస్ మొత్తానికో, ఒక టోర్నీకో ఎప్పుడూ దూరం కాలేదు. రక్తం కారినప్పుడు కూడా బయటకు వెళ్లాలనే భావన రాలేదు. నొప్పి, బాధను భరిస్తూనే ఆడేందుకు ప్రయత్నించా. ఆట ముగిసిన తర్వాతే కోలుకోవడంపై దృష్టి పెట్టా. ఇన్నేళ్ళలో ఇది కూడా నన్ను ప్రత్యేకంగా నిలబెట్టింది. ఒక్క 2009లో మాత్రమే మోకాలి గాయంతో చాలా బాధపడ్డా. రిటైర్మెంట్ ఇద్దామని అనుకున్న క్షణమది. అయితే అదృష్టవశాత్తూ కొన్నాళ్ల క్రితమే అధికారికంగా బీసీసీఐలోకి రావడంతో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) సౌకర్యాలను తొలిసారి ఉపయోగించుకునే అవకాశం కలిగి కోలుకోగలిగాను. అన్ని చోట్లా ఆడాను కెరీర్ ఆరంభంలో బీసీసీఐ సహకారం లేని సమయంలో ఆర్థికపరంగా మేం ఎదుర్కొన్న సమస్యలు, వాటిని పట్టించుకోకుండా ఆడటం గురించి అందరికీ తెలుసు. అయితే మరో అంశం గురించి నేను చెప్పాలి. క్రికెట్పై ఆ సమయంలో నాకున్న అపరిమిత ప్రేమ, పిచ్చి ఎక్కడికైనా వెళ్లేలా చేసింది. భారత్ తరఫున అరంగేట్రం చేసి ఆరేళ్లు దాటిన తర్వాత కూడా నేను ‘ఇన్విటేషన్ టోర్నమెంట్’లకు వెళ్లడం మానలేదు. చిన్న పట్టణాల్లో, హైస్కూల్ మైదానాల్లో జరిగిన మ్యాచ్లలో కూడా పాల్గొన్నాను. టర్ఫ్ వికెట్, మ్యాట్ వికెట్ ఏదైనా సరే... ఆడే అవకాశం వస్తే చాలని అనిపించేది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే కాస్త ఆశ్చర్యంగా అనిపించినా, మంచి జ్ఞాపకాలవి. టి20లు కలిసి రాలేదు నేను అంతర్జాతీయ క్రికెట్ మొదలు పెట్టినప్పుడు టి20లు లేవు. మహిళల క్రికెట్లోనూ టెస్టులు ఉండి ఉంటే దాంతో పాటు వన్డేలను ఎంచుకొని అసలు టి20 ఆడకపోయేదాన్నేమో. కానీ టెస్టులు లేకపోవడంతో రెండో ఫార్మాట్ అవసరం ఏర్పడింది. నేను మూడో టి20 ఆడే సమయానికే నా అంతర్జాతీయ కెరీర్ పదేళ్లు పూర్తి చేసుకుంది. ఇంత ఆలస్యంగా మొదలు పెట్టడంతో నేను సర్దుకోవడానికే టైమ్ పట్టింది. ఓపెనర్గా వచ్చే సాహసం చేశాక పరిస్థితి కొంత మెరుగుపడింది. అయితే ఆశించినంత స్థాయిలో ఫలితాలు రాలేదు. కోచ్ రమేశ్ పొవార్తో వివాదంతో నా కెరీర్ ముగియలేదు. ఆ తర్వాతా రెండు సిరీస్లు ఆడి ఇక చాలనుకున్నాను. అందుకే రిటైర్మెంట్ ప్రకటించాను. ప్రస్తుత క్రికెటర్లతో పోల్చరాదు వాణిజ్యపరంగా నాకు ఆశించినంత గుర్తింపు రాలేదనేది వాస్తవం. వాస్తవికంగా చూస్తే సగంకంటే ఎక్కువ కెరీర్ నన్ను ఎక్కువ మంది కనీసం గుర్తు కూడా పట్టని విధంగానే సాగింది. అలాంటప్పుడు కార్పొరేట్లు ఎలా ముందుకొస్తాయి. సరిగా గమనిస్తే 2017 వన్డే వరల్డ్కప్ ఫైనల్ తర్వాతి నుంచి భారత మహిళల ప్రతీ మ్యాచ్ టీవీలో లైవ్గా వచ్చింది. అంతకుముందు అసలు టీవీల్లో కూడా కనిపిస్తే కదా! స్మృతి మంధాన, హర్మన్ప్రీత్లతో పోలిస్తే నా ప్రయాణం పూర్తిగా భిన్నం. వీరితో పోలిస్తే ఇప్పుడే వచ్చిన షఫాలీ, రిచాలు కూడా భిన్నం. కాబట్టి పోలిక అనవసరం. భారత మహిళల క్రికెట్ ఎదుగుదలలో నేనూ కీలక భాగం కావడమే అన్నింటికంటే ఎక్కువ సంతృప్తినిచ్చే అంశం. -
ఆర్మీ కొత్త చీఫ్ మనోజ్ పాండే
న్యూఢిల్లీ: దేశ 29వ ఆర్మీ చీఫ్గా జనరల్ మనోజ్ పాండే(60) బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత చీఫ్ జనరల్ ఎంఎం నరవణే శనివారం రిటైర్ కావడంతో ఆయన స్థానంలో జనరల్ పాండే బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆర్మీ వైస్ చీఫ్గా ఉన్న జనరల్ పాండే, కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ విభాగం నుంచి ఈ అత్యున్నత పదవికి ఎంపికైన మొదటి వ్యక్తి. చైనా, పాకిస్తాన్ సరిహద్దు ఉద్రిక్తతలు సహా దేశం భద్రతాపరమైన అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ జనరల్ పాండే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా పగ్గాలు చేపట్టడం గమనార్హం. ప్రస్తుతం ఆయన కీలకమైన చైనాతో సరిహద్దు ఉన్న ఈస్టర్న్ ఆర్మీ కమాండ్కు నేతృత్వం వహిస్తున్నారు. ఆర్మీ చీఫ్గాను, నావిక, వైమానిక దళాలతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా థియేటర్ కమాండ్స్ను అమలు చేయాల్సి ఉంటుంది. దేశ మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ థియేటర్ కమాండ్స్ బాధ్యతలు నిర్వహించేవారు. ఆయన హెలికాప్టర్ దుర్ఘటనలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో ప్రభుత్వం మరొకరిని నియమించాల్సి ఉంది. మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన పాండే.. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ అనంతరం 1982లో కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్లో చేరారు. సుదీర్ఘ కెరీర్లో పలు కీలక బాధ్యతలు చేపట్టిన ఆయనకు చైనా సరిహద్దులు, జమ్మూకశ్మీర్ సహా అన్ని రకాల ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం ఉంది. దేశంలో ఏకైక త్రివిధ దళాల కమాండ్ ఉన్న అండమాన్ నికోబార్ కమాండ్కు చీఫ్గా కూడా వ్యవహరించారు. -
మీలో ‘ఫైర్’ ఉందా..?
వృద్ధాప్యం పలకరించే వరకు (60 ఏళ్లు) సంపాదన కోసం పరుగులు పెట్టడం పాత తరం నమూనా.. 45–50 ఏళ్లకే ఆర్థిక స్వాతంత్య్రం సాధించడం.. 50–55 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకోవడం.. నేటి తరం కోరుకుంటున్న విధానం. సాధ్యమైనంత త్వరగా సంపాదించాలి. భారీగా కూడబెట్టాలి. ముసలితనానికి ముందే ఉద్యోగం లేదా వృత్తి జీవితానికి స్వస్తి చెప్పి మిగిలిన జీవితాన్ని మనసుకు నచ్చినట్టు పూర్తి సంతోషంగా రైడ్ చేయాలి. ఇలా అనుకునే వారు పెరుగుతున్నారు. ఈ క్రమంలో పుట్టుకొచ్చిందే ఫైర్ (ఎఫ్ఐఆర్ఈ). ఆ ఫైర్ మీలో ఉందా..? అందుకోసం ఏం చేయాలో చర్చించేదే ఈ కథనం. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ (ఎఫ్ఐ)/రిటైర్ ఎర్లీ (ఆర్ఈ). ఫైర్ అంటే ఇదే. కావాల్సినంత ఆర్థిక స్వేచ్ఛ సాధించడం/ముందుగా రిటైర్ కావడం అన్నదే సంక్షిప్తంగా ఫైర్. జీవితాంతం కూర్చుని తినేందుకు సరిపడా, అన్ని అవసరాలను తీర్చేంత సంపదను వీలైనంత ముందుగా సమకూర్చుకోవడం ఇందులోని అంతరార్థం. ఒక ఉదాహరణ చూద్దాం. 30 ఏళ్ల వ్యక్తికి ప్రస్తుతం నెలవారీగా ఖర్చులు రూ.75,000గా ఉన్నాయని అనుకుందాం. అంటే ఏడాదికి జీవన ఖర్చు రూ.9 లక్షలు. అతని వద్ద రూ.18 లక్షల నిధి కూడా ఉంది. ఇక్కడి నుంచి ప్రతీ నెలా రూ.80,000 చొప్పున 15ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు నెలవారీ సిప్ను ఏటా 8 శాతం పెంచుతూ వెళ్లాడు. పెట్టుబడులు 12 శాతం రాబడి రేటు ప్రకారం వృద్ధి చెందాయని, ద్రవ్యోల్బణం 7 శాతంగా ఉందనుకుంటే.. అప్పుడు 45 ఏళ్ల వయసు వచ్చేసరికి రూ.7.2 కోట్లు సమకూరతాయి. ఆ సమయంలో అతని వార్షిక వ్యయాలు రూ.22.8 లక్షలకు చేరతాయి. అదే సమయంలో తన ఖర్చులకు 32 రెట్లు నిధి సమకూరి ఉంటుంది. దీన్ని కదపకుండా మెరుగైన రాబడినిచ్చే సాధనంలో మరో 5–10 ఏళ్లు కొనసాగించినా నిండు నూరేళ్లపాటు నిశ్చితంగా జీవించొచ్చు. ఫైర్లో పలు రకాలున్నాయి. ఇందులో ఏదో ఒక ఫైర్ ఉన్నా ముందే ఆర్థిక స్వాతంత్య్రాన్ని సాధించొచ్చు. నార్మల్ ఫైర్ ఇప్పటి మాదిరే జీవితాంతం రాజీ లేకుండా జీవించడం. భవిష్యత్తులోనూ విహార యాత్రలు, ఖర్చులు, రెస్టారెంట్ భోజనాలు, వినోదం, వైద్యం అన్నింటి అవసరాలను తీర్చుకునేందుకు కావాల్సినంత సమకూర్చుకోవడం. 45 ఏళ్ల వ్యక్తి అప్పటి తన వార్షిక జీవన వ్యయానికి 35 రెట్ల సంపదను సమకూర్చుకుని ఉంటే ‘నార్మల్ ఫైర్’ సాధించినట్టు అర్థం చేసుకోవాలి. లీన్ ఫైర్ లీన్ ఫైర్ అంటే మీ ఖర్చులు, జీవన విధానంలో కొంత రాజీ పడడం. నార్మల్ ఫైర్తో పోలిస్తే కొంత సర్దుకుపోవడం. ఈ విధానంలో తక్కువ వ్యయాలతో జీవించేందుకు సిద్ధం కావాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో నార్మల్ ఫైర్ను సాధించడం సాధ్యం కాకపోవచ్చు. అటువంటప్పుడు ప్రస్తుత వ్యయాల్లో 75 శాతంతోనే సరిపెట్టుకోవాల్సి రావచ్చు. ఇది కూడా ఫైర్ కిందకే వస్తుంది. 45 ఏళ్ల వ్యక్తి తన వార్షిక వ్యయానికి 25–28 రెట్ల మేర సంపద కూడబెడితే లీన్ ఫైర్ సాధించినట్టుగా అర్థం చేసుకోవాలి. ఫ్యాట్ ఫైర్ లీన్ఫైర్కు విరుద్ధమైనదే ఫ్యాట్ఫైర్. రాజీకి చోటు లేకుండా రాజులా జీవించడం. అనుకున్నంత స్వేచ్ఛగా ఖర్చు చేస్తూ జీవించడం. ఎందులోనూ రాజీపడక్కర్లేదు. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవక్కర్లేదు. ఈ తరహా ఫైర్ కోసం ఎక్కువ మొత్తమే కావాలి. 45 ఏళ్ల వ్యక్తి తన వార్షిక వ్యయాలకు 45–50 రెట్ల మేర నిధిని సమకూర్చుకోగలిగితే అతను ఫ్యాట్ఫైర్ సాధించినట్టే. ఇలా సమకూర్చుకున్నప్పుడు మిగిలిన జీవితాంతం 125–140 శాతం అధికంగా ఖర్చు చేస్తూ సాగిపోవచ్చు. కోస్ట్ ఫైర్ మిగిలిన జీవితానికి సరిపడా ముందుగా సమకూర్చుకోవడమే కోస్ట్ ఫైర్. దీంతో భవిష్యత్తులో ఎటువంటి అదనపు పెట్టుబడులు అవసరం లేకుండానే ఆ మొత్తం వృద్ధి మరింత వృద్ధి చెందుతుంది. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి ప్రతీ నెలా రూ.2 లక్షలు సంపాదిస్తున్నట్టయితే.. 50 ఏళ్లకు ఫైర్ సాధించడం కోసం అతను రూ.6 కోట్ల నిధిని సమకూర్చుకోవాలి. అటువంటి సందర్భంలో లక్ష్య సాధనకు ప్రతీ నెలా తన ఆదాయం నుంచి 60 శాతాన్ని (రూ.1.2 లక్షలను) పెట్టుబడి పెడుతూ వెళ్లాలి. ఇలా చేస్తే మొదటి పదేళ్లలోనే 40 ఏళ్ల వయసు వచ్చేనాటికి రూ.2.5 కోట్లు సమకూరుతుంది. దీంతో రూ.6 కోట్ల లక్ష్యాన్ని తర్వాతి 10 ఏళ్లలో చేరుకునేందుకు అతను అక్కడి నుంచి రూపాయి కూడా అదనంగా ఇన్వెస్ట్ చేయక్కర్లేదు. అప్పటి వరకు సమకూరిన రూ.2.5 కోట్ల నిధి ఏటా 10 శాతం రాబడినిచ్చే సాధనంలో ఉంచినా తదుపరి పదేళ్ల కాలంలో రూ.6 కోట్లు అవుతుంది. ముందే ఆర్థిక స్వాతంత్య్రాన్ని చేరుకుంటారు. దాంతో ఒత్తిడితో కూడిన పనిని విడిచిపెట్టి.. వేతనం తక్కువైనా నచ్చిన పనికి మారిపోవచ్చు. మీ ఫైర్ ఏది? తాము ఏ ఫైర్ను చేరుకుంటామన్నది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. మీ సంపాదన, ఖర్చులు, జీవన స్థితిగతులు వీటన్నింటి పాత్ర ఉంటుంది. వీటన్నింటి మధ్య మీకున్న సౌకర్యం ఏపాటిది? ఆలోచించుకోవాలి. లీన్ఫైర్లో రాజీపడాల్సి ఉంటుంది. కొన్ని అంచనాలు, పరిస్థితులు మారినా అనుకున్నది నెరవేరకపోవచ్చు. అన్నింటిలోకి నార్మల్ ఫైర్ ఆచరణీయం. కనీసం లీన్ఫైర్తో ఆరంభించి.. కొన్నేళ్ల తర్వాత అయినా నార్మల్ ఫైర్ లక్ష్యం దిశగా అడుగులు వేయాలి. మెరుగైన సంపాదన ఉండి, ఎక్కువ భాగాన్ని వెనకేసుకునే అవకాశం ఉన్నవారికి ఫ్యాట్ ఫైర్ ఆచరణీయం. ఫైర్ సాధిస్తే పని మానవచ్చా? అది మీ ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది. కావాలనుకుంటే ఉద్యోగం లేదా వ్యాపారం లేదా వృత్తికి అంతటితో విరా మం చెప్పేసుకోవచ్చు. ఒకవేళ చేస్తున్న పని బోర్గా అనిపించకపోతే.. ఒత్తిళ్లతో కూడుకున్నది కాకపోతే కొనసాగడమే మంచిది. దీనివల్ల అదనపు నిధి సమకూరుతుంది. అప్పుడు మీ జీవితానికి మరింత జోష్ను తెచ్చుకున్నట్టుగానే భావించాలి. ఇందంతా మీ ఇష్టా అయిష్టాలపై, మానసిక పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. ఫైర్ ఎందుకు అవసరం? 60 ఏళ్ల వరకు ఉద్యోగంలో కొనసాగడం అంటే కష్టమైన పనే. ప్రైవేటు రంగంలో 58 ఏళ్లకే తప్పుకోవాలి. పైగా ఉద్యోగ భద్రత పాళ్లు తక్కువ. ఆరోగ్యం అందరికీ సహకరించకపోవచ్చు. వృద్ధాప్యంలోనూ సంపాదించుకునే శక్తి ఉంటుందన్న భరోసా పని చేయకపోవచ్చు. ముందుగానే ఫైర్ను సాధిస్తే మీపై ఒత్తిడి తగ్గిపోతుంది. మీకు నచ్చినట్టు, మీదైన దారిలో సాగిపోయే స్వేచ్ఛ లభిస్తుంది. ఎవరో ట్యూన్కు మీరు డ్యాన్స్ కట్టాల్సిన ఇబ్బంది తప్పుతుంది. అభద్రతా భావం నుంచి బయటకు వస్తారు. మీ డిమాండ్లపై పట్టుబట్టే ధైర్యం లభిస్తుంది. ఫైర్ అంత ఈజీనా..? కాదనే చెప్పుకోవాల్సి ఉంటుంది. మనదేశంలో చాలా మంది 60 దాటిపోయిన తర్వాత కూడా సంపాదన కోసం శ్రమకోరుస్తూనే కనిపిస్తుంటారు. పైగా రిటైర్మెంట్ ప్రణాళిక విషయంలో చాలా మందిలో శ్రద్ధ కనిపించదు. దీంతో 60 వచ్చినా మిగిలిన జీవితానికి చాలినంత నిధి కనిపించదు. ఆర్థిక ప్రణాళికల్లేకుండా సాగిపోవడం వల్ల అసలు తత్వం అప్పుడు కానీ బోధపడదు. ఒకవేళ ముందుగా ఫైర్ సాధించినప్పటికీ అది మంచి రాబడుల వల్ల కాదు.. సంపాదనలో అధిక మొత్తాన్ని పొదుపు చేస్తూ రావడం వల్లే. అందుకే ఫైర్ ఉంటే కాదు.. దాన్ని సాధించే పక్కా ఆచరణ, ప్రణాళికలు కూడా మీ దగ్గర ఉండాలి. ఇవి కీలకం.. ► వ్యయాలను అదుపులో పెట్టుకోవాలి. సంపాదనలో సాధ్యమైనంత తక్కువ వ్యయాలకే పరిమితం కావాలి. ఎందుకంటే ఇక్కడ ఫైర్ అన్నది సంపద. ఆ సంపదకు సంపాదన, వ్యయ నియంత్రణ కీలకం. ► నెల సంపాదన రూ.2లక్షలు. చేస్తున్న వ్యయం రూ.25వేలు. అప్పుడు వ్యయాలకు ఎనిమిదిరెట్లు అధికంగా సంపాదిస్తున్నట్టు. ఇటువంటి వారు చాలా వేగంగా ఫైర్ సాధిస్తారు. ► కొందరికి వ్యయ నియంత్రణ సాధ్యపడదు. పైగా పోనుపోను జీవనశైలిని మరింత మెరుగు పరుచుకుంటూ జీవించేస్తారు. ఇటువంటి వారు ఫైర్ను కోల్పోవాల్సి వస్తుంది. ► మంచి ఆదాయానికి బాటలు వేసుకోవాలి. ► ఆదాయం నుంచి కనీసం 60 శాతాన్ని అయినా ఆదా చేసుకుని ద్రవ్యోల్బణాన్ని మించి అధిక రా బడులను ఇచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ► రాబడులు అంచనాలను అందుకోకపోతే, ద్రవ్యోల్బణం అనుకున్నదానికంటే ఎక్కువే ఉంటే ఫైర్ కష్టంగా మారుతుంది. ► దుబారాకు దూరంగా ఉండి, సాధారణ జీవితం గడపాలి. అలా అని ఆనందం, కోర్కెల విషయంలో రాజీపడొద్దు. ► ఫైర్ సాధించిన తర్వాత.. వాటిపై క్రమం తప్పకుండా రాబడులు వచ్చేలా (క్యాష్ ఫ్లో) ఇన్వెస్ట్మెంట్ సాధనాలు ఉండాలి. పెట్టుబడులు ఇరుక్కుపోయే వాటిల్లో ఉంచొద్దు. ► ఎవరికివారు తమకు అనుకూలమైన ఫైర్ దిశగా అడుగులు వేసేందుకు ఎంతో క్రమశిక్షణ అవసరం. ఈ విషయంలో స్పష్టత కోసం ఆర్థిక సలహాదారుల సేవలు తీసుకోవడం సూచనీయం. -
Mithali Raj: వన్డే వరల్డ్కప్ తర్వాత క్రికెట్కు వీడ్కోలు!
న్యూఢిల్లీ: తన సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్లో అందనిద్రాక్షగా ఉన్న వన్డే వరల్డ్కప్ టైటిల్ కోసం వచ్చే ఏడాది మరోసారి ప్రయత్నిస్తానని భారత మహిళా స్టార్ క్రికెటర్ మిథాలీ రాజ్ వ్యాఖ్యానించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్లో జరిగే వన్డే వరల్డ్కప్ తర్వాత తాను ఆటకు వీడ్కోలు పలికే అవకాశాలున్నాయని ఈ హైదరాబాదీ క్రికెటర్ సంకేతాలు ఇచ్చింది. ‘అంతర్జాతీయ క్రికెట్లో 21 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. 2022 నా కెరీర్లో చివరి ఏడాది కావొచ్చు. కొన్నిసార్లు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాను. అయినప్పటికీ నా ఫిట్నెస్పై పూర్తి దృష్టి కేంద్రీకరిస్తున్నాను. వయసు పెరుగుతున్నకొద్దీ ఫిట్నెస్కు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో నాకు తెలుసు’ అని శనివారం వర్చువల్గా జరిగిన ‘1971: ది బిగినింగ్ ఆఫ్ ఇండియాస్ క్రికెటింగ్ గ్రేట్నెస్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మిథాలీ రాజ్ వ్యాఖ్యానించింది. ‘వన్డే వరల్డ్కప్లో పాల్గొనేముందు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో ద్వైపాక్షిక సిరీస్లు ఉన్నాయి. ఇప్పటి నుంచి ప్రతి సిరీస్ మాకు ముఖ్యమే. వరల్డ్కప్ కోసం పటిష్ట జట్టును రూపొందించే పనిలో ఉన్నాం. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో మనం కొంచెం బలహీనంగా ఉన్నాం. సీనియర్ జులన్ గోస్వామి రిటైరైతే ఆమె స్థానాన్ని భర్తీ చేసేవారు కావాలి’ అని 38 ఏళ్ల మిథాలీ తెలిపింది. 1999లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన మిథాలీ రాజ్ ఇప్పటివరకు 10 టెస్టులు, 214 వన్డేలు, 89 టి20 మ్యాచ్లు ఆడింది. ప్రత్యర్థి జట్టుపై ఎప్పుడూ దూకుడుగా వ్యవహరించాలని... ఈ విషయంలో విరాట్ కోహ్లిని మిథాలీ రాజ్ బృందం ఆదర్శంగా తీసుకోవాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ సూచించారు. -
ప్రభుత్వ సాయంతోనే ఇది సాధ్యమైంది: నిమ్మగడ్డ రమేష్
-
ప్రభుత్వ సాయంతోనే ఇది సాధ్యమైంది: నిమ్మగడ్డ
సాక్షి, విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం నుంచి తనకు పూర్తి సహకారం లభించిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. రాష్ట్ర ఎన్ఈసీగా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు(మార్చి 31) పదవీ విరమణ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి, మీడియా ద్వారా అపూర్వ సహకారం అందిందన్నారు. తనకు అందించిన సహకారం ఎంతో విలువైనదని, ఎన్నికల కమిషనర్గా విధులు నిర్వహించడం సంతృప్తి కలిగించిందన్నారు. ఎక్కడా రీపోలింగ్కు అవకాశం లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరిపామని, అధికారులు సిబ్బంది ఎంతో నిబద్దతతో పనిచేసి ఎన్నికలు సజావుగా నిర్వహించారని ప్రశంసించారు. ప్రభుత్వం పూర్తి సహకారం అందిందని, ప్రభుత్వ సాయంతోనే ఇదంతా సాధ్యమైందన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించాలి ‘సీఎస్, డీజీపీ సహా కలెక్టర్లు ఎస్పీలు పూర్తిగా సహకరించారు. రాష్ట్రంలో ఎన్నికలు పారదర్శకంగా జరపాలని హైకోర్టు ఆదేశించింది. మా బాధ్యతలు నిర్వహించడంలో హైకోర్టు మాకు సంపూర్ణ సహకారంగా అందించింది. రాజ్యాంగ వ్యవస్థలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి. చట్ట సభలపట్ల పూర్తి విశ్వాసం ఉండాల్సిందే. నేను 7 ఏళ్లపాటు గవర్నర్ కార్యదర్శిగా కూడా గతంలో పనిచేశాను. రాజ్యాంగ వ్యవస్థలపై నాకు అపార విశ్వాసం ఉంది. నామినేషన్ల ఉపసంహరించడంపై హైకోర్టు ఆదేశాలను శిరసావహించా. వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన మంచి పద్దతి అమల్లో ఉంది. అన్నింటినీ నివేదిక రూపంలో క్రోడీకరించి వాటిని అమలు చేయాలని గవర్నర్కు నివేదిక అందిస్తా. చేయాల్సిన సంస్కరణలపై నివేదికలో పొందుపరిచా. సిఫార్సులు అమలు చేస్తే శాశ్వత ప్రయోజనాలు కలుగుతాయి. నాకు వారసులుగా నీలం సాహ్ని ఎస్ఈసీగా బాధ్యతలు నిర్వహిస్తారు. ఎస్ఈసీ నీలం సాహ్నికి అభినందనలు తెలియజేశాను. నేనెప్పుడూ అధికారిక సమాచారాన్ని బయటకు లీక్ చేయలేదు. వ్యవస్థకు సంబంధించి స్వతంత్రత, నిబద్దతపై ఎవరూ రాజీ పడటానికి వీల్లేదు. రాజ్యాంగ వ్యవస్థలు స్వతత్రంగా పనిచేయాలనేదే నా అభిప్రాయం. ప్రభుత్వంతో స్నేహపూర్వక వాతావరణం, తోడ్పాటు ఉన్నప్పుడే మెరుగైన పనితీరు వస్తుంది. అందరి సహకారం వల్లే ఎన్నికలను సజావుగా నిర్వహించగలిగాను.’ అని పేర్కొన్నారు. చదవండి: విజయవాడ రిటైనింగ్ వాల్కు సీఎం జగన్ శంకుస్థాపన నిమ్మగడ్డకు నో అపాయింట్మెంట్ -
కొత్త సీజేఐ పేరును సూచించండి
-
కొత్త సీజేఐ పేరును సూచించండి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే ఏప్రిల్ 23వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. అంటే మరో నెల రోజులే ఆయన పదవిలో ఉంటారు. తదుపరి ప్రధాన న్యాయమూర్తి కోసం ప్రభుత్వం అన్వేషిస్తోంది. నూతన ప్రధాన న్యాయమూర్తి నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఎవరైతే బాగుంటుందో మీరే సూచించాలని జస్టిస్ బాబ్డేను కేంద్ర ప్రభుత్వం కోరినట్లు అధికార వర్గాలు శనివారం తెలిపాయి. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ జస్టిస్ బాబ్డేకు ఒక లేఖ పంపారు. నిబంధనల ప్రకారం.. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో అత్యంత సీనియర్ను ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు. నూతన ప్రధాన న్యాయమూర్తిని నియమించే విషయంలో పదవీ విరమణ చేయబోయే ప్రధాన న్యాయమూర్తి నుంచి ప్రతిపాదనలు స్వీకరించడం ఒక సంప్రదాయంగా వస్తోంది. సీనియర్ న్యాయమూర్తుల్లో ఒకరి పేరును ఆయన ప్రతిపాదిస్తే కేంద్ర న్యాయశాఖ మంత్రి ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తారు. ప్రధానమంత్రి కూడా అంగీకారం తెలియజేస్తే సదరు సీనియర్ న్యాయమూర్తి చీఫ్ జస్టిస్గా ఎంపికైనట్లే. ఆయనను నియమించాలని కోరుతూ రాష్ట్రపతికి ప్రధానమంత్రి సిఫార్సు చేస్తారు. ఒకవేళ సీనియర్ మోస్ట్ జడ్జి ఈ పోస్టుకు అర్హుడు కాడని భావిస్తే.. ఇతర న్యాయమూర్తులతో సంప్రదింపులు జరిపి, ఒకరి పేరును ఎంపిక చేస్తారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో జస్టిస్ ఎన్.వి.రమణ అత్యంత సీనియర్. 2022 ఆగస్టు 26 వరకూ జస్టిస్ ఎన్.వి.రమణ పదవీ కాలం ఉంది. -
అటు యూసుఫ్... ఇటు వినయ్...
భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఆపై దేశవాళీ క్రికెట్లోనూ తమదైన ముద్ర వేసిన ఇద్దరు క్రికెటర్లు ఒకే రోజు ఆటకు గుడ్బై చెప్పారు. 38 ఏళ్ల బరోడా ఆల్రౌండర్ యూసుఫ్ పఠాన్ తన రిటైర్మెంట్ను ప్రకటించగా... 37 ఏళ్ల కర్ణాటక పేస్ బౌలర్ వినయ్ కుమార్ కూడా వీడ్కోలు పలికాడు. టీమిండియా తరఫున ఆడి చాలా కాలమే అయినా... గత సీజన్ వరకు కూడా వీరిద్దరు రంజీ ట్రోఫీలో బరిలోకి దిగారు. యూసుఫ్ పఠాన్ భారీ హిట్టర్గా గుర్తింపు పొందిన యూసుఫ్ పఠాన్ అంతర్జాతీయ కెరీర్ ఘనంగా ఆరంభమైంది. భారత జట్టు గెలిచిన 2007 టి20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ (పాకిస్తాన్పై)తోనే అతని కెరీర్ అరంగేట్రం జరిగింది. మొత్తం 22 టి20 మ్యాచ్లు ఆడిన యూసుఫ్ 146.58 స్ట్రయిక్రేట్తో 236 పరుగులు చేయడంతో పాటు తన ఆఫ్ స్పిన్తో 13 వికెట్లు పడగొట్టాడు. టి20లకంటే అతని వన్డే కెరీర్ మెరుగ్గా సాగింది. 57 వన్డేల్లో పఠాన్ 113.60 స్ట్రయిక్రేట్తో 810 పరుగులు సాధించాడు. ఇందులో 2 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2011లో ధోని సారథ్యంలో వన్డే వరల్డ్కప్లో చాంపియన్గా నిలిచిన భారత జట్టులోనూ సభ్యుడైన అతను ఈ టోర్నీలో 6 మ్యాచ్లు ఆడాడు. ఐపీఎల్ ద్వారా యూసుఫ్ క్రికెట్ అభిమానులకు మరింత చేరువయ్యాడు. తన దూకుడైన బ్యాటింగ్తో అతను పలు అద్భుత ప్రదర్శనలు నమోదు చేశాడు. 2008 తొలి ఐపీఎల్ ఫైనల్లో రాజస్తాన్ రాయల్స్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’గా నిలిచిన యూసుఫ్ కోల్కతా నైట్రైడర్స్ తరఫున 2012, 2014 టైటిల్స్ విజయాల్లో కూడా భాగస్వామి. 2010లో 37 బంతుల్లోనే అప్పటి ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన యూసుఫ్... 2014లో 15 బంతుల్లో హాఫ్ సెంచరీతో అప్పటి ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని కూడా తన పేరిటే లిఖించాడు. మొత్తంగా 174 ఐపీఎల్ మ్యాచ్లలో 142.97 స్ట్రయిక్రేట్తో 3,204 పరుగులు చేసిన యూసుఫ్ 2018, 2019 సీజన్లలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. గత రెండు ఐపీఎల్ వేలంలో అతడిని ఎవరూ జట్టులోకి తీసుకోలేదు. 100 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు కూడా ఆడిన ఈ బరోడా స్టార్... 2010లో హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన దులీప్ ట్రోఫీ ఫైనల్లో (సౌత్జోన్పై) ఆడిన ఇన్నింగ్స్ ఎప్పటికీ మరచిపోలేనిది. వెస్ట్జోన్ తరఫున ఆడిన యూసుఫ్ 190 బంతుల్లోనే 19 ఫోర్లు, 10 సిక్సర్లతో చెలరేగి అజేయంగా 210 పరుగులు చేయడంతో వెస్ట్ జోన్ జట్టు 536 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించడం విశేషం. కెరీర్లో ఒక్క టెస్టు కూడా ఆడే అవకాశం రాని యూసుఫ్ 2012లో చివరిసారి భారత్కు ప్రాతినిధ్యం వహించాడు. వినయ్ కుమార్ రంజీ ట్రోఫీలో సూపర్ స్టార్గా గుర్తింపు పొందిన ఆటగాళ్లలో వినయ్ కుమార్ కూడా ఒకడు. దావణగెరెకు చెందిన ఈ పేస్ బౌలర్ 139 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో ఏకంగా 504 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రంజీ ట్రోఫీలో సాధించినవే 442 (115 మ్యాచ్లు) ఉన్నాయి. అత్యధిక రంజీ వికెట్లు సాధించిన జాబితాలో రాజీందర్ గోయల్ (637), వెంకట్రాఘవన్ (530), సునీల్ జోషి (479) తర్వాత నాలుగో స్థానంలో వినయ్ ఉండగా... పేస్ బౌలర్లలో అతనిదే అగ్రస్థానం. సుదీర్ఘ కాలం సొంత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తర్వాత కెరీర్ చివరి ఏడాది అతను పుదుచ్చేరి తరఫున ఆడాడు. కర్ణాటక కెప్టెన్గా వినయ్ రికార్డు ఘనంగా ఉంది. 2013–14 సీజన్లో వినయ్ నాయకత్వంలో కర్ణాటక రంజీ ట్రోఫీ, ఇరానీ కప్, విజయ్ హజారే ట్రోఫీ గెలవగా... 2014–15 సీజన్లో కూడా ఇదే ‘ట్రిపుల్’ పునరావృతం కావడం విశేషం. తొలి సీజన్ ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వినయ్ ఐపీఎల్ కెరీర్లో 105 మ్యాచ్లలో 105 వికెట్లు తీశాడు. 2014 (కోల్కతా), ముంబై (2015, 2017) ఐపీఎల్ టైటిల్స్ విజయాల్లో అతనూ సభ్యుడు. 2018 తర్వాత మళ్లీ అతనికి లీగ్లో అవకాశం రాలేదు. భారత్ తరఫున మాత్రం వినయ్ కుమార్ కెరీర్ గొప్పగా సాగలేదు. ఒకే ఒక టెస్టు ఆడి 1 వికెట్ తీసిన అతను... 31 వన్డేల్లో 38 వికెట్లు, 9 టి20ల్లో 10 వికెట్లు పడగొట్టాడు. దేశవాళీ క్రికెట్లో కొన్ని గొప్ప ప్రదర్శనలు చేసినా... 2013 తర్వాత అతనికి మళ్లీ టీమిండియాకు ఆడే అవకాశం రాలేదు. ఐపీఎల్ ట్రోఫీతో... -
సింధు ట్వీట్ స్మాష్
న్యూఢిల్లీ: ఒక్క ట్వీట్తో భారత క్రీడాభిమానులకు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ‘డెన్మార్క్ ఓపెన్ నా చివరి టోర్నీ. నేను రిటైరయ్యా’ అని సింధు చేసిన ట్వీట్తో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. ఆ ట్వీట్తో పాటు కోవిడ్–19 స్థితిగతులు, దాని ప్రభావంపై ఆమె సుదీర్ఘ ప్రకటన చేసింది. దీంతో కరోనా నేపథ్యంలో నిజంగానే ఆమె ఆటకు దూరంగా వెళ్తుందేమోనని అందరూ బోల్తా పడ్డారు. కానీ ట్వీట్ చివర్లో నెగెటివిటీ, అనవసరపు విశ్రాంతి, భయం నుంచి తాను రిటైర్ అవుతున్నానని ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొంత కాలంగా అనవసరపు అనిశ్చితితో బాధపడుతున్నానని, ఇక దానికి స్వస్తి పలుకుతానంటూ ఆమె ట్వీట్ను మొదలుపెట్టింది. ‘ఆటలో ఇన్నాళ్లూ పోరాడాను. కానీ కంటికి కనిపించని ఈ వైరస్ను ఎలా ఎదుర్కోవాలో ఎవరికీ తెలియట్లేదు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో ఎన్నో కథనాలు చదువుతూ ఇంటి నుంచి అడుగు బయటపెట్టేందుకు ఆలోచించా. కానీ ఈ అనిశ్చితి నుంచి రిటైరవ్వాలని నిర్ణయించుకున్నా. భయం, నెగెటివిటీ, అవాస్తవికతకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. పోరాడకుండా నేనెప్పుడూ ఓటమి ఒప్పుకోను. భారత్కు ప్రాతినిధ్యం వహించకుండా ఉండటం డెన్మార్క్ ఓపెన్తోనే ముగిస్తున్నా’ అని ఇకపై ఆడతాననే తన అభిలాషను సింధు విశ్లేషణాత్మకంగా వివరించింది. దీనిపై కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ ‘సింధు! నాకు మినీ షాక్ ఇచ్చావ్. కానీ నాకు నీ అకుంఠిత దీక్ష, సంకల్పంపై పూర్తి నమ్మకం ఉంది. దేశానికి ఇంకా ఎన్నో పురస్కారాలు అందిస్తావనే విశ్వాసం ఉంది’ అని రిజిజు ట్వీట్ చేశారు. -
క్రికెట్కు వాట్సన్ గుడ్బై
చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తరఫున ఆస్ట్రేలియా ప్లేయర్ షేన్ వాట్సన్ చివరి మ్యాచ్ ఆడేశాడు. 2018 నుంచి ఓపెనర్గా చెన్నై విజయాల్లో కీలకంగా వ్యవహరించిన వాట్సన్ ఆదివారం ఫ్రాంచైజీ క్రికెట్ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. చివరి లీగ్ మ్యాచ్లో పంజాబ్పై గెలుపు అనంతరం వాట్సన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్రాంచైజీ వర్గాలు వెల్లడించాయి. 2016లోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న 39 ఏళ్ల వాట్సన్ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న టి20 క్రికెట్ టోర్నమెంట్లలో ఆయా ఫ్రాంచైజీలకు ఆడుతున్నాడు. ఆదివారంతో ఇక అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు సీఎస్కే సహచరులతో వాట్సన్ చెప్పాడు. ‘డ్రెస్సింగ్ రూమ్లో ఈ విషయాన్ని పంచుకుంటూ వాట్సన్ ఉద్వేగానికి గురయ్యాడు. చెన్నై ఫ్రాంచైజీకి ఆడటాన్ని గౌరవంగా భావిస్తున్నానని అతను అన్నాడు’ అని జట్టు వర్గాలు తెలిపాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై కన్నా ముందు రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు వాట్సన్ ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్లోనే కాకుండా కరీబియన్ ప్రీమియర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్ సూపర్లీగ్, బిగ్బాష్ లీగ్లలో కూడా వాట్సన్ బరిలోకి దిగాడు. ఓవరాల్గా వాట్సన్ తన టి20 కెరీర్లో 343 మ్యాచ్లు ఆడి 8,821 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 53 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 216 వికెట్లు కూడా పడగొట్టిన వాట్సన్ 101 క్యాచ్లు తీసుకున్నాడు. -
క్రికెట్కు ఉమర్ గుల్ గుడ్బై
కరాచీ: పాకిస్తాన్ సీనియర్ పేస్ బౌలర్ ఉమర్ గుల్ ఆటకు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం జరుగుతున్న పాక్ దేశవాళీ టోర్నీ టి20 కప్లో చివరి మ్యాచ్ ఆడిన గుల్... అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 13 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో 47 టెస్టుల్లో 163 వికెట్లు పడగొట్టిన గుల్... 130 వన్డేల్లో 179 వికెట్లు తీశాడు. 60 అంతర్జాతీయ టి20ల్లో గుల్ మరో 85 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. సుమారు దశాబ్దకాలం పాటు పాక్ జట్టు ప్రధాన పేసర్గా పలు చిరస్మరణీయ విజయాల్లో భాగమైన గుల్ కెరీర్ వరుస గాయాలతో ఒడిదుడుకులకు లోనైంది. అంతర్జాతీయ టి20ల్లో టాప్–10లో రెండు అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనలు (5/6, 5/6) నమోదు చేసిన బౌలర్గా అతను గుర్తింపు పొందాడు. యార్కర్ స్పెషలిస్ట్గా ప్రత్యేకత ప్రదర్శించిన గుల్... 2007 టి20 ప్రపంచకప్లో అత్యధిక వికెట్లు పడగొట్టి పాకిస్తాన్ను ఫైనల్ చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. రెండేళ్ల తర్వాత పాక్ గెలుచుకున్న టి20 వరల్డ్ కప్లో కూడా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గుల్ కావడం విశేషం. పాకిస్తాన్ తరఫున తన చివరి మ్యాచ్ను అతను నాలుగేళ్ల క్రితం 2016లో ఆడాడు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
'దేవర' ఫియర్ సాంగ్ వచ్చేసింది
హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
తారక్ అభిమానుల మంచి మనసు.. 'రా ఎన్టీఆర్ 2.0' టీమ్ రక్తదానం
నా ఆల్టైమ్ ఫేవరెట్ క్రికెటర్ అతడే: టీమిండియా స్టార్
సెంటరాఫ్ అట్రాక్షన్గా ఉండాలనే తపన ..!
14 ఏళ్ల వయస్సులోనే కల.. ఎవరీ ‘ఐస్క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’
ఎస్బీఐకి మొట్టికాయలు గట్టిగానే పడ్డాయిగా?
నిద్రను దూరం చేసేవి ఇవే! నివారించాలంటే..!
క్లాసెన్ మాస్ క్యాచ్.. బ్యాటర్ మైండ్బ్లాంక్! వీడియో
ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్!.. శుభవార్త చెప్పిన కంపెనీ
తప్పక చదవండి
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement