-
మహిళల సమస్యలపై ‘సాహస్’ అస్త్రం
సాక్షి, హైదరాబాద్: పని ప్రదేశాల్లో మహిళా ఉద్యోగులు ఎదుర్కొనే లైంగిక వేధింపులు, ఇతర సమస్యలపై ‘సాహస్’పోర్టల్లో ఫిర్యాదు చేయవచ్చని మహిళా భద్రత విభాగం అధికారులు తెలిపారు. ఉద్యోగం చేసే మహిళలు ఈ పోర్టల్లో తమ సమస్యలు చెప్పుకునేందుకు ‘గెట్ హెల్ప్’ఆప్షన్ ఉన్నట్టు వారు వెల్లడించారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజూ ఉదయం 10–30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 7331194540 నంబర్లోనూ ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచించారు. సాహస్ పోర్టల్ను ఇప్పటికే ప్రారంభించామని, మహిళల్లో అవగాహన కోసం దీనిపై మరింత ప్రచారం చేస్తున్నామని పేర్కొన్నారు. పని ప్రదేశంలో మహిళా ఉద్యోగుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలు మొదలు.. లైంగిక వేధింపులపై ఎలా ఫిర్యా దు చేయాలి, న్యాయ సాయం ఎలా పొందాలో పోర్టల్లో పొందుపరిచినట్టు తెలిపారు. ఫిర్యాదులకు https:// womensafetywing. telangana. gov. in/ sahas/ లో క్లిక్చేసి వివరాలు పొందవచ్చని వివరించారు. -
మహిళలు, విద్యార్థినులపై వేధింపులు.. భద్రతకు కొత్త ఫోన్ నంబర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మహిళా భద్రత విభాగం కొత్త ఫోన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చినట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు మహిళా భద్రత విభాగం ట్విట్టర్ (ఎక్స్)లో నూతన నంబర్లను వెల్లడించారు. ఏ రకమైన వేధింపులున్నా మహిళలు, విద్యార్థినులు 8712656858 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేశారు. 8712656856 నంబర్కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ రెండు నంబర్లు గుర్తు లేకపోతే డయల్ 100కు ఫోన్ చేయాలని సూచించారు. చదవండి: షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు: కిషన్ రెడ్డి #WomenSafetyWing is dedicated & committed to your well-being & safety. Don't hesitate to call us!#Dial: #918712656858 #Chat: #9187126 56856 For EMERGENCY DIAL 100.#SuicideAwarenes #AskForHelp #Telangana #Help #MentalHealthMatters #MentalHealthAwareness #Support pic.twitter.com/HELLdkKCLP — Women Safety Wing, Telangana Police (@ts_womensafety) September 8, 2023 -
‘భరోసా’ మరింత పెంచేలా..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మహిళ భద్రతా విభాగం ఆధ్వర్యంలో పనిచేస్తున్న భరోసా కేంద్రాల్లో బాధితులకు భరోసా మరింత పెంచడంపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. భరోసా కేంద్రాలకు సాయం కోసం వచ్చిన బాధితుల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. లైంగికదాడులు, అత్యాచార కేసుల్లో బాధిత మహిళలు, చిన్నారులకు ఒకే వేదికలో పోలీస్, న్యాయ, వైద్య సాయం అందించేందుకు రూపొందించిన ఈ కేంద్రాల్లో.. సిబ్బంది పనితీరు ఎలా ఉంటోంది? సకాలంలో స్పందిస్తున్నారా? ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదు చేశారు? భరోసా సెంటర్కు అదే రోజు తీసుకెళ్లారా? మీతో లేడీ కానిస్టేబుల్ వచ్చారా? పోలీసులు వారి వాహనంలోనే తీసుకెళ్లారా? భరోసా సెంటర్లో సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంది? కేసుల ఫాలోఅప్ సక్రమంగా ఉంటోందా? లైంగిక దాడులకు గురైన చిన్నారుల విషయంలో కేంద్రాల సిబ్బంది సరైన రీతిలో స్పందిస్తున్నారా? సేవల్లో ఇంకేమైనా లోపాలున్నాయా? వంటి ప్రశ్నలు అడుగుతున్నారు. అంతేకాదు.. బాధిత మహిళలకు మరింత అండగా నిలిచేందుకు ఇంకా ఏయే చర్యలు తీసుకోవాలని సలహాలు, సూచనలు కూడా కోరుతున్నట్లు అధికారులు తెలిపారు. బాధితుల ఫీడ్బ్యాక్ ఆధారంగా క్షేత్రస్థాయిలో మార్పులు చేయనున్నట్టు పేర్కొన్నారు. -
బాధితులకు భరోసా..
సాక్షి, హైదరాబాద్: ఎవరు అవునన్నా, కాదన్నా.. పురుషాధిక్య సమాజంలో మహిళలంటే చిన్నచూపే. లైంగిక దాడికి గురైన బాధితులంటే మరీనూ. బయటికొస్తే చాలు అవమానపు మాటలు, అనుమానపు చూపులతో బతకడమే వృథా అనే పరిస్థితులను అధిగమించి.. కొత్త జీవితాన్ని ప్రారంభించాలంటే ఎంతో మనోధైర్యం, భరోసా అవసరం. ఇలాంటివారి జీవితాల్లో వసంతాన్ని నింపేందుకు తెలంగాణ మహిళా భద్రతా విభాగం సరికొత్త కార్యక్రమానికి ప్రణాళిక రచిస్తోంది. బాధిత మహిళలు సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు అవసరమైన ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందుకోసం మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఇంక్యుబేటర్ వీ–హబ్తో చేతులు కలిపింది. బాధిత మహిళలకు జీవనోపాధికి అవసరమైన ఆర్ధిక భరోసా, సాంత్వన అందించనుంది. ఎంపిక ఎలా? ఎలాంటి వ్యాపారాలు? మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నడుస్తున్న భరోసా కేంద్రాల ద్వారా లైంగిక దాడికి గురైన బాధితులను ఎంపిక చేస్తారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, పథకాలు గురించి వారికి అవగాహన కల్పిస్తారు. సొంతంగా వ్యాపారం, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్న ఆసక్తి, నైపుణ్యం ఉంటే.. వారితో మాట్లాడి, ఆలోచనలకు కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారు. వారి ఆర్ధిక వనరుల గురించి అధ్యయనం చేసి, చేయూతనిస్తారు. స్వీట్లు, బిస్కెట్లు, చాక్లెట్లు, బేకరి ఉత్పత్తులు వంటి తినుబండారాల వ్యాపారం, బ్యూటీపార్లర్, కుట్లు అల్లికలు, జ్యువెలరీ తయారీ వంటి చిన్న తరహా వ్యాపారాలు చేసుకునేందుకు సహకరిస్తారు. వందకు పైగా బాధితులకు శిక్షణ.. తొలి దశలో మేడ్చల్, వరంగల్ వంటి ఏడు జిల్లాల నుంచి వందకు పైగా బాధిత మహిళలను ఎంపిక చేసినట్లు తెలిసింది. తొలి సెషన్లో బాధితులు, వారి కుటుంబ సభ్యులతో చర్చించి, వారి వ్యాపార ఆలోచనల గురించి తెలుసుకున్నామని, ఆయా వ్యాపార అవకాశాలపై వారికి అవగాహన కల్పిచామని వీ–హబ్ ప్రతినిధి ఒకరు తెలిపారు. త్వరలో రెండో సెషన్ నిర్వహించి, ఎవరు ఏ కేటగిరీ వ్యాపారాలకు సెట్ అవుతారో అధ్యయనం చేసి, ఎంపిక చేస్తామన్నారు. వీ–హబ్ ఏం చేస్తుందంటే? ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఎదురయ్యే ప్రధాన ఇబ్బంది గుర్తింపు లేకపోవటమే. బాధిత ఎంటర్ప్రెన్యూర్లకు ఆ ఇబ్బంది ఉండదు. ఏ తరహా వ్యాపారానికి ఎలాంటి లైసెన్స్లు అవసరం దగ్గరి నుంచి డాక్యుమెంటేషన్, మార్కెటింగ్, పథకాలు, ఆర్ధిక వనరుల వరకూ అన్ని వైపుల నుంచి సహాయసహకారాలు అందిస్తారు. వీ–హబ్ మెంటార్షిప్తో పాటు క్రెడిట్ లింకేజ్ కోసం రుణ దాతలు, రుణ గ్రహీతలను కలుపుతారు. ప్రాథమిక దశలో ఉంది.. మహిళల భద్రతే షీ టీమ్స్, ఉమెన్ సేఫ్టీ వింగ్ తొలి ప్రాధాన్యం. లైంగిక దాడి బాధితులకు కావాల్సిన సహాయం చేసేందుకు నిత్యం సిద్ధంగా ఉంటాం. బాధిత మహిళలకు అండగా నిలవడం కోసం చేపట్టిన ఈ కార్యక్రమం ప్రస్తుతం ప్రారంభ దశలో ఉంది. – శిఖా గోయల్, అదనపు డీజీ, ఉమెన్ సేఫ్టీ వింగ్ -
Asha Malviya: మహిళల భద్రత దిశగా ఆశా యాత్ర
మనదేశంలో మహిళల భద్రత, మహిళాసాధికారత సాధన కోసం ఆశా మాలవీయ దేశపర్యటనకు సిద్ధమయ్యారు. విజయవంతంగా సాగుతున్న ఆమె యాత్ర తెలుగు రాష్ట్రంలో ప్రవేశించింది. మహిళల భద్రత విషయంలో ఆంధ్రప్రదేశ్ ఆదర్శవంతంగా ఉందని చెప్పారామె. ఆశా మాలవీయది మధ్యప్రదేశ్ రాష్ట్రం, రాజ్ఘర్ జిల్లా సతారామ్ గ్రామం. ఆమె క్రీడాకారిణి, పర్వతారోహణలో అభిరుచి మెండు. మహిళాభ్యుదయం లక్ష్యంగా సాగుతున్న ఆమె సైకిల్ పర్యటనలో స్త్రీ సాధికారత, భద్రత గురించి సమాజాన్ని చైతన్యవంతం చేస్తోంది. ఆమె పర్యటన ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆమె సోమవారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఆమె తన లక్ష్యాన్ని వివరించారు. అపోహను తొలగిస్తాను! ‘‘నేను స్పోర్ట్స్లో నేషనల్ ప్లేయర్ని. పర్వతారోహణలో రికార్డు హోల్డర్ని. ప్రస్తుతం 25వేల కిలోమీటర్ల సంపూర్ణ భారత యాత్ర చేస్తున్నాను. నవంబర్ ఒకటిన భోపాల్లో ప్రారంభమైన నా సైకిల్ యాత్రలో ఎనిమిది వేల కిలోమీటర్లు పూర్తయ్యాయి, విజయవాడ చేరుకున్నాను. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో యాత్ర నిర్వహించాలనేది లక్ష్యం. ఇప్పటికే ఏడు రాష్ట్రాల్లో యాత్ర పూర్తయింది. భారతదేశం మహిళలకు అంత సురక్షితమైన దేశం కాదని విదేశాల్లో తప్పుడు అభిప్రాయం ఉంది. మహిళలకు భారతదేశంలో పూర్తి భద్రత ఉందని నేను ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంటున్నాను. ‘దిశ’ బాగుంది సీఎం జగన్ గారిని కలవడం ఎంతో ఉద్వేగంగా, గర్వంగా ఉంది. దేశం అభివృద్ధితో పాటు మహిళల భద్రతలాంటి విషయాలపై ముఖ్యమంత్రి గారి అభిప్రాయాలు ఎంతో గొప్పగా ఉన్నాయి. మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది. ఏపీలో మహిళల భద్రత కోసం ప్రవేశపెట్టిన దిశ యాప్ డౌన్న్లోడ్ చేసుకున్నాను. ఈ యాప్ చాలా బాగా పనిచేస్తోంది. ఏపీలో మహిళలే కాదు, ప్రజలంతా సురక్షితంగా ఉన్నారు. ముఖ్యమంత్రిగారు నన్ను ప్రశంసలతో ముంచెత్తడంతోపాటు నా ఆశయం కోసం 10లక్షల రూపాయల ప్రోత్సాహకం ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. తిరుపతి వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటి నుంచి నాకు ప్రత్యేక రక్షణ అందించారు. స్కూల్స్, కాలేజీల్లో అమ్మాయిల కోసం ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఎంతో మంచివి. దేశానికే ఆదర్శంగా నిలిచిన జగన్న్మోహన్న్రెడ్డి లాంటి మఖ్యమంత్రిని కలవడం సంతోషంగా ఉంది’’ అన్నారు ఆశా మాలవీయ. మహిళల భద్రత, సాధికారతతోపాటు ప్రపంచదేశాల ముందు మనదేశం గౌరవాన్ని ఇనుమడింపచేయాలనే ఆమె ఆశయం ఉన్నతమైనది. ఈ యాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని ఆమెను ఆశీర్వదిద్దాం. – సాక్షి, ఏపీ బ్యూరో -
అతివలకు భరోసా.. హైదరాబాద్లో సైబర్ షీ–టీమ్స్ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు, యువతులకు మరింత భరోసా ఇవ్వడానికి హైదరాబాద్ నగర పోలీసు విభాగం చర్యలు చేపట్టింది. ఈ మేరకు కొత్తగా సైబర్ షీ–టీమ్స్ను ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నిర్ణయించారు. ఈ బృందాల్లో సాంకేతిక నిపుణులతోపాటు ఎథికల్ హ్యాకర్లు కూడా ఉండనున్నారు. ఈవ్టీజింగ్ సహా వివిధ రకాల వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు, యువతులు, బాలికల కోసం షీ–టీమ్స్ పని చేస్తున్నాయి. ఈవ్టీజర్లపై కన్నేసి రెడ్çహ్యాండెడ్గా పట్టుకోవడం దగ్గరి నుంచి కుటుంబ సమస్యల పరిష్కారం వరకు అనేక విధాలుగా అండగా నిలుస్తున్నాయి. కానీ ఇటీవల కాలంలో వేధింపుల తీరు మారింది. స్మార్ట్ఫోన్, సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ‘ఈ–పోకిరీ’లు పెరిగిపోయారు. వారు బాహ్య ప్రపంచంలో కాకుండా సోషల్ మీడియా ద్వారా రెచి్చపోతున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్.. ఇలా వివిధ రకాల ప్లాట్ఫామ్స్ కేంద్రంగా వేధింపులకు పాల్పడుతున్నారు. వారికి చెక్ చెప్పడానికే సైబర్ షీ–టీమ్స్ ఏర్పాటు చేయనున్నారు. బయటికి చెప్పుకోలేక భరిస్తూ.. ఆన్లైన్ వేధింపుల బారినపడుతున్న అతివల్లో అనేక మంది తమకు ఎదురైన ఇబ్బందులను బయటికి చెప్పుకోలేకపోతున్నారు. వేధింపులకు పాల్పడుతున్నవారి నుంచి వస్తున్న బెదిరింపులకు తోడు పరువు పోతుందనే ఉద్దేశంతో మిన్నకుండిపోతున్నారు. ఈ పరిస్థితిని అలుసుగా తీసుకుంటున్న మోసగాళ్లు మరింతగా రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ షీ–టీమ్స్కు వస్తున్న ఫిర్యాదుల్లో 60శాతం దాకా ఆన్లైన్ వేధింపులకు సంబంధించినవే ఉంటున్నాయి. శాంతిభద్రతల విభాగం, సైబర్ క్రైమ్ ఠాణాలకు వస్తున్న సైబర్ కేసుల్లోనూ వేధింపులకు సంబంధించినవే అధికంగా ఉంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే.. 2022లో సైబర్ నేరాల కేసులు 9,815 నమోదుకాగా.. వీటిలో సైబర్ వేధింపులకు సంబంధించినవి 1,118, అశ్లీల సందేశాలు పంపడానికి సంబంధించినవి 141 ఉన్నాయి. ఈ వేధింపులు, అశ్లీల సందేశాల కేసుల్లో బాధితులు మహిళలు, యువతులే. దీనికితోడు ఇటీవలి కాలంలో ప్రేమ ముసుగులో జరిగే ‘ఈ–నేరాలు’ పెరిగిపోయాయి. వాటితో యువతులు, మహిళలు వ్యక్తిగతంగా, మానసికంగా, ఆర్థికంగా నష్టపోతున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో.. సైబర్ వేధింపులు ఎదురైన బాధితులు నేరుగా షీ–టీమ్స్ వద్దకు రావాల్సిన అవసరం లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఫోన్, వాట్సాప్, ఫేస్బుక్.. ఇలాంటి మార్గాల్లోనూ ఫిర్యాదు చేయవచ్చని చెప్తున్నారు. బాధితుల వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సైబర్ షీ–టీమ్స్కు వచ్చే ఫిర్యాదులకు సంబంధించిన అంశాలను దర్యాప్తు చేయడం, నిందితులను గుర్తించి పట్టుకోవడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతోపాటు ప్రత్యేక టూల్స్ వినియోగించనున్నారు. ఆయా అంశాల్లో నిష్ణాతులైన వారిని బృందాల్లో నియమించనున్నారు. అవసరమైతే డార్క్నెట్ను కూడా ఛేదించే నైపుణ్యమున్న ఎథికల్ హ్యాకర్ల సేవలను వినియోగించుకుంటారు. ఇప్పటికే సిటీ పోలీసు విభాగం మహేశ్ బ్యాంకు కేసు సహా పలు సైబర్ నేరాల దర్యాప్తు కోసం ఎథికల్ హ్యాకర్ల సేవలు వినియోగించుకుంది. స్మార్ట్ఫోన్ కూడా చేటుకు కారణం! ఒకప్పుడు ఫోన్ విలాసవస్తువు. ఇప్పుడు స్మార్ట్ఫోన్ నిత్యావసరంగా మారిపోయింది. ఇవి వచ్చాక ఎవరికి వారికి ‘స్వేచ్ఛ’ పెరిగింది. ఆకర్షణను ప్రేమగా భావిస్తున్న యువతులు అపరిచితులతోనూ హద్దులు దాటుతున్నారు. కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత అంశాలను రికార్డు చేయడాన్నీ పట్టించుకోవడం లేదు. ఓ దశలో ఇవే వారి పాలిట శాపంగా మారుతున్నాయి. ఏటా నమోదవుతున్న సైబర్ నేరాల్లో ఈ తరహాకు చెందినవి పెద్ద సంఖ్యలో ఉంటున్నాయి. సైబర్ షీ–టీమ్స్ ఏర్పాటుతో పరిస్థితులు మారే అవకాశం ఉంది. – సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవల షీ–టీమ్స్కు వచ్చిన ‘ఈ–కేసు’ల్లో కొన్ని... ► బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొంతకాలం హైదరాబాద్లోని ఓ మలీ్టనేషనల్ కంపెనీలో పనిచేశాడు. అప్పట్లో తన సహోద్యోగిని అయిన యువతిపై ఆన్లైన్లో వేధింపులకు పాల్పడ్డాడు. ఈ–మెయిల్స్, సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ద్వారా అభ్యంతరకర ప్రచారానికి దిగాడు. పోలీసులు సదరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ను అరెస్టు చేశారు. ► హైదరాబాద్లోని బోయిన్పల్లికి చెందిన ఓ మరుగుజ్జు యువకుడు ఫేజ్బుక్లో తనదేనంటూ ఓ అందమైన యువకుడి ఫొటో పెట్టాడు. ఓ యువతి ‘ఫ్రెండ్’గా పరిచయం కావడంతో చాటింగ్ ప్రారంభించాడు. ప్రేమ పేరుతో వలవేసి.. అనేక కారణాలు చెప్పి ఆమె నుంచి రూ.3 లక్షల నగదు, 50 తులాల బంగారం స్వాహా చేశాడు. ► ఓ వ్యక్తి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. గతంలో ప్రాజెక్టు వర్క్ నేపథ్యంలో పరిచయమైన యువతిని ప్రేమించాడు. ఆమె తిరస్కరించడంతో కక్షగట్టాడు. ఓ ల్యాప్టాప్, డేటాకార్డ్ కొనుగోలు చేసి.. సదరు యువతి మెయిల్ ఐడీని హ్యాక్ చేశాడు. ఆమె బంధువులు, స్నేహితులకు ఆమే పంపిస్తున్నట్టుగా అసభ్య చిత్రాలు, సందేశాలు పంపాడు. చదవండి: Telangana: గ్రూప్–4లో 8,039 పోస్టులే! -
Hyderabad: మహిళలపై పెరుగుతున్న నేరాలు.. ఈ ఏడాదిలోనే ఎన్ని కేసులంటే!
సాక్షి, హైదరాబాద్: ‘మహిళల భద్రత, రక్షణే ప్రథమ కర్తవ్యం’ ఇదీ రాష్ట్ర పోలీసు యంత్రాంగం నినాదం. కానీ, ఇది ఆచరణలో ఆమడదూరంలో ఉంది. ఇంటా బయటా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఎన్ని చట్టాలు, శిక్షలు అమలు చేస్తున్నా స్త్రీలకు భద్రత కరువైంది. గృహ హింస, అత్యాచారం, హత్యలు, వరకట్న మరణాలు, అపహరణలు ఇలా ఎన్నెన్నో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఏటా మహిళలపై నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. గతేడాది గ్రేటర్లో మహిళలపై 7,459 నేరాలు జరగ్గా... ఈ ఏడాది 7,578 నేరాలు నమోదయ్యాయి. అన్ని రంగాల్లోనూ పురుషులతో పోటీ పడుతున్న ఈ రోజుల్లో కూడా స్త్రీలపై గృహ హింసలు, వేధింపులే జరగడం బాధాకరం. ఏటేటా ఈ తరహా కేసులు పెరుగుతుండటం గమనార్హం. గతేడాది హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్లలో కలిపి 4,674 వేధింపుల కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 4,891లకు పెరిగాయి. అయితే అత్యాచారాలు, పోక్సో కేసులు కాస్తా తగ్గుముఖం పట్టాయి. 2021లో 1,089 అత్యాచారాలు జరగ్గా.. ఈ ఏడాది 984లకు తగ్గాయి. అలాగే గతేడాది చిన్నారులపై 1,161 అఘాయిత్యాలు జరగగా.. ఈ ఏడాది 1,052 పోక్సో కేసులు నమోదయ్యాయి. తెలిసినోళ్లే తోడేళ్లు.. ఈ ఏడాది రాచకొండలో 372 అత్యాచారాలు జరగగా.. ఇందులో స్నేహితులు, కుటుంబ సభ్యులు రేప్ చేసిన సంఘటనలే ఎక్కువ. స్నేహితులు రేప్ చేసిన కేసులు 352 కాగా.. చుట్టుపక్కల వాళ్లు 4, కుటుంబ సభ్యులు 2 రేప్ కేసులున్నాయి. ఇతరుల చేసిన అత్యాచార కేసులు 14 ఉన్నాయని వార్షిక నివేదికలో వెల్లడైంది. సైబరాబాద్, హైదరాబాద్తో పోలిస్తే ఈ ఏడాది రాచకొండలో పోక్సో కేసులు ఎక్కువయ్యాయి. గతేడాది 394 పోక్సో కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 442కు పెరిగాయి. పోకిరీల భరతం.. విద్యా సంస్థలు, కార్యాలయాలు, బస్స్టాప్లు, రైల్వే స్టేషన్లు, బహిరంగ ప్రదేశాల్లో మహిళలను వేధిస్తున్న ఆకతాయిల భరతం పడుతుంది షీ టీమ్స్. ఈ ఏడాది 7,521 మంది పోకిరీలను మూడు కమిషనరేట్ల షీ టీమ్స్ పోలీసులు పట్టుకున్నారు. ఆయా నిందితులకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. రెండోసారి పోలీసులకు చిక్కిన ఆకతాయిలపై ఎఫ్ఐఆర్లు, పెట్టీ కేసులు నమోదు చేస్తున్నారు. ఈ ఏడాది రాచకొండలో 176 మంది పోకీరీలపై ఎఫ్ఆర్లు, 195 మందిపై పెట్టీ కేసులు నమోదు చేశారు. అలాగే హైదరాబాద్లో 137 మందిపై ఎఫ్ఆర్లు, 426 మందిపై పెట్టీ కేసులు, సైబరాబాద్లో 82 మందిపై ఎఫ్ఆర్లు, 1,306 మందిపై పెట్టీ కేసులు నమోదు చేశారు. -
Andhra Pradesh: శభాష్.. ‘దిశ’
అనంతపురానికి చెందిన లావణ్య విజయవాడలో ఇంటర్ చదువుతోంది. ఇటీవల సెలవులకు ఇంటికి వెళ్లింది. తిరిగి కళాశాల వద్దకు వచ్చి దిగబెట్టడానికి తండ్రికి వీలుపడలేదు. బస్సు ఎక్కిద్దామని బస్టాండ్కు వచ్చాడు. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే సెల్ఫోన్లోని ‘దిశ’ యాప్ను ఉపయోగించమని చెప్పాడు. ఇలా ఉపయోగించాలని చూపించబోగా ‘నాన్నా.. నాకు తెలుసులే’ అని లావణ్య చెప్పడంతో జాగ్రత్తలు చెప్పి వెనుదిరిగాడు. ఇలా లక్షలాది మందికి ‘దిశ’ ఓ ఫ్రెండ్గా, ఓ సోదరుడిగా, ఓ బాడీగార్డ్గా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. సాక్షి, అమరావతి: సినిమాల్లో చివరి సీన్లోనే పోలీసులు వస్తారని ఎన్నో దశాబ్దాలుగా చూపిస్తున్నారు. దుర్ఘటన జరిగాక తీరిగ్గా పోలీసులు వస్తారు తప్ప.. వెంటనే రక్షణ కల్పించరనే అపప్రద దేశ వ్యాప్తంగా పోలీసులపై ఉంది. కానీ, రాష్ట్ర పోలీసు శాఖ ఆ చరిత్రను తిరగరాస్తోంది. ఆపదలో ఉన్నామని ఇలా చెబితే చాలు అలా క్షణాల్లో అక్కడకు చేరుకుని భద్రత కల్పిస్తోంది. మహిళలు సంప్రదించగానే తక్షణం భద్రత కల్పించే వ్యవస్థను రూపొందించాలన్న సీఎం వైఎస్ జగన్ ఆలోచనలకు ఆచరణ రూపమే దిశ మొబైల్ యాప్. ఇది రక్షణ కోసం మహిళలకు ప్రభుత్వం అందించిన అస్త్రం. ఆధునిక సమాచార సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ రూపొందించిన ఈ యాప్ మహిళా భద్రతకు పూర్తి భరోసానిస్తోంది. ఈ యాప్ను రికార్డు స్థాయిలో మహిళలు డౌన్లోడ్ చేసుకుంటుండటమే అందుకు నిదర్శనం. ఇప్పటి వరకు 1,10,40,102 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఏ మొబైల్ యాప్ను కూడా ఇంత భారీ స్థాయిలో ఎవరూ డౌన్లోడ్ చేసుకుని, రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. క్షణాల్లో ఆపన్న హస్తం.. ఇప్పటి వరకు దిశ యాప్ ద్వారా 9.60 లక్షల ఎస్ఓఎస్ వినతులు దిశ కమాండ్ కంట్రోల్కు చేరాయి. యాప్ డౌన్లోడ్ చేసుకోగానే యాప్ పని తీరు పరీక్షించేందుకు చేసే ఎస్ఓఎస్ వినతులూ అత్యధికంగా ఉన్నాయి. అలాగే, ఇప్పటి వరకు చర్యలు తీసుకోదగిన 23,039 ఎస్ఓఎస్ వినతులు వచ్చాయి. పోలీసులు తక్షణం స్పందించి చర్యలు చేపట్టారు. ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్న 1,237 మందికి భద్రత కల్పించారు. నేరాలకు యత్నించిన కేసుల్లో 2,323 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మొత్తంగా 3,560 ఘటనల్లో బాధితులకు అండగా నిలిచారు. పటిష్ట వ్యవస్థతో సమర్థ పర్యవేక్షణ దిశ యాప్ సమర్థవంతంగా పని చేసేందుకు రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఒక అదనపు ఎస్పీ, ఒక డీఎస్పీ, 15 మంది ఇతర అధికారులతో కూడిన బృందం 24/7 కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. దిశ యాప్ పని తీరును సాంకేతిక సమస్యల్లేకుండా చూసేందుకు 51 మందితో కూడిన సహాయక బృందాన్ని కూడా నెలకొల్పింది. ఇక గస్తీ విధుల కోసం 900 ద్విచక్ర వాహనాలతోపాటు 163 బోలెరో వాహనాలను సమకూర్చింది. దాదాపు 3 వేల పోలీసు వాహనాలకు జీపీఎస్ ద్వారా దిశ కంట్రోల్ రూమ్తో అనుసంధానించారు. ఫోరెన్సిక్ సైన్స్ విభాగాన్నీ బలోపేతం చేసింది. కేంద్ర హోంశాఖ ప్రమాణాల ప్రకారం 60 రోజుల్లోపే రాష్ట్ర పోలీసులు అత్యధిక కేసుల్లో చార్జ్షీట్ దాఖలు చేస్తున్నారు. దోషులను గుర్తించి సకాలంలో శిక్షలు పడేలా చూస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అత్యాచారం–హత్య కేసుల దర్యాప్తునకు సగటున 222 రోజులు సమయం పట్టగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కేవలం సగటున 58 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేస్తున్నారు. జాతీయ స్థాయిలో 19 అవార్డులు దిశ యాప్ ప్రభావంతో రాష్ట్రంలో మహిళలపై దాడులు, వేధింపులు తగ్గాయని జాతీయ నేర గణాంకాల నివేదిక (ఎన్సీఆర్బీ)–2021 వెల్లడించింది. ప్రతి లక్ష జనాభాకు తెలంగాణలో మహిళలపై నేరాల కేసులు 111.2 నమోదవుతుండగా కేరళలో 73.3 కేసులు ఉన్నాయి. అదే ఏపీలో 67.2 కేసులు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మహిళలపై అత్యాచారం–హత్య కేసులు గణనీయంగా తగ్గాయి. 2019లో ఆరు, 2020లో ఐదు కేసులు నమోదు కాగా 2021లో రెండు కేసులు నమోదయ్యాయి. అత్యాచారయత్నం కేసులు 2019లో 177, 2021లో 162 కేసులు నమోదయ్యాయి. బాలికలపై అత్యాచార యత్నం కేసులు 2019లో 45, 2020లో 40, 2021లో 35 నమోదయ్యాయి. మహిళలపై దాడుల కేసులు ఎనిమిది శాతం తగ్గాయి. ఇంత సమర్థవంతంగా పని చేస్తున్న దిశ యాప్కు జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు 19 అవార్డులు వచ్చాయి. దిశ వ్యవస్థ దేశానికి ఆదర్శం మహిళా భద్రతను ప్రథమ ప్రాధాన్యత అంశంగా తీసుకున్నాం. ఇందుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా దిశ యాప్పై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. డౌన్ లోడ్, రిజిస్ట్రేషన్లపై శ్రద్ధ తీసుకున్నాం. దాంతో ఏపీలో మహిళలపై వేధింపులు తగ్గాయని జాతీయ నేర గణాంకాల నివేదిక వెల్లడించింది. దిశ యాప్ పనితీరును ఇతర రాష్ట్రాల పోలీసు శాఖలు కూడా పరిశీలించాయి. దిశ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. – కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, డీజీపీ దిశ యాప్ మహిళలకు ఒక వరం ఆపదలో ఉన్న మహిళలకు దిశ యాప్ ఎంతోగానో ఉపయోగపడుతుంది. పోలీస్ అవసరం ఉన్న వారు ఎస్ఓఎస్ బటన్ నొక్కడం ద్వారా సత్వర సహాయం అందుతుంది. ఆపదలో ఉన్నప్పుడు కాల్ చేసే అవకాశం లేకపోతే ఫోన్ను నాలుగైదుసార్లు షేక్ చేస్తే చాలు.. పోలీసులకు సమాచారం అందుతుంది. ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ మహిళలపై దాడులు ఆపలేకపోతున్న పరిస్థితుల్లో దిశ యాప్ ఒక వరం లాంటిది. – కె శ్యామల, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, పోక్సో కోర్టు యాప్పై అవగాహన పెంచుకోవాలి దిశా యాప్ మహిళలకు అండగా నిలుస్తోంది. విద్యార్థినులకు ఎంతో ధైర్యాన్ని ఇస్తోంది. పెద్దగా చదువుకోని మహిళలు కూడా ఈ యాప్ను సులువుగా ఉపయోగించవచ్చు. మహిళలు, విద్యార్థినులు ఈ యాప్పై అవగాహన పెంచుకోవాలి. – పి.రమణమ్మ, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు, విజయనగరం. విజయనగరం జిల్లా పూసపాటిరేగలో ఓ యువతిని రాంబాబు అనే యువకుడు ప్రేమిస్తున్నానని నమ్మించాడు. వారి పెళ్లికి పెద్దలు కూడా సమ్మతించారు. కానీ, ఆ యువతిపై అనుమానం పెంచుకున్న రాంబాబు ఆమెను అడ్డు తొలగించుకోవాలని భావించాడు. ఆమె ఇంట్లోకి ప్రవేశించి, ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీన్ని గుర్తించిన ఆ యువతి సోదరి దిశ యాప్ ద్వారా పోలీసులను సంప్రదించగా వారు కేవలం ఆరు నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరుకుని బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న రాంబాబును అరెస్టు చేశారు. విజయవాడలో ఓ బిడ్డకు తల్లి అయిన ఒంటరి మహిళను ఓ యువకుడు నమ్మించి మోసగించాడు. దాంతో ఆమె విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన బిడ్డను సంరక్షించమని దిశ యాప్ ద్వారా పోలీసులను కోరింది. పోలీసులు కేవలం 3 నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించి ప్రాణాపాయం నుంచి తప్పించారు. ఆమెను మోసగించిన యువకుడిపై కేసు నమోదు చేశారు. మహిళలకు ఒక భరోసా ప్రయాణ సమయంలో దిశ యాప్లో ఉండే ట్రాక్ మై ట్రావెల్ ఆప్షన్ ఉపయోగించి గమ్య స్థానాన్ని నమోదు చేస్తే అనుక్షణం ట్రాకింగ్ చేస్తుంది. ప్రయాణించే వాహనం దారి తప్పితే దిశ కమాండ్ కంట్రోల్ రూమ్కు తెలుస్తుంది. అప్పుడు పోలీసులు వెంటనే స్పందించే తీరు హర్షణీయం. సీఎం వైఎస్ జగన్ మహిళల భద్రతకు ఏర్పాటు చేసిన దిశ యాప్ ఎంతో భరోసా కల్పిస్తోంది. – జి.రత్నకుమారి, గృహిణి, గుంటూరు -
చైన్ స్నాచర్స్, ఈవ్ టీజర్లకు చెక్!..'శక్తి స్క్వాడ్' ఎంట్రీ
జార్ఖండ్: దసరా నవరాత్రుల సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు దేవాలయాలకు వెళ్లి పూజలు నిర్వహిస్తుంటారు. ఇదే అదనుగా చేసుకుని ఈవ్ టీజర్లు, చైన్ స్నాచర్స్, పోకిరి వెధవలు రెచ్చిపోతుంటారు. అందుకోసం అని ఈ పండుగ సందర్భంగా మహిళల రక్షణ కోసం 'శక్తి స్క్వాడ్' ఏర్పాటు చేస్తున్నట్లు జంషేడ్పూర్ పోలీసు అధికారులు తెలిపారు. మహిళలను నిర్భయంగా పూజలు నిర్వహించునేలా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఉండేలా 'శక్తి స్క్వాడ్' పేరుతో మహిళా మొబైల్ పోలీసు బలగాలు నగరమంతా మోహరిస్తారని అధికారులు తెలిపారు. ఈ మేరకు సూపరింటెండెంట్ పోలీస్ ప్రభాత్ కుమార్, జిల్ మెజిస్ట్రేట్ నందకుమార్ శుక్రవారం మహిళల భద్రత కోసం లాంఛనంగా ఈ శక్తి స్క్వాడ్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ శక్తి స్క్వాడ్ సుమారు 25 పింక్ స్కూటీలతో ఈ పండగ సీజన్లో నగరమంతా గస్తీ కాస్తారని అన్నారు. ముఖ్యంగా దుర్గా పూజ కోసం మహిళలు నిర్భయంగా దేవాలయాలకు వెళ్లి పూజలు చేసుకోవాలనే ఉద్దేశంతో, వారి భద్రత కోసం ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఒకవేళ ఏదైన సమస్య తలెత్తితే పింక్ స్కూటీ పెట్రోలింగ్ సభ్యులు 100కి డయల్ చేయడం లేదా సీనియర్ అధికారులను సంప్రదిస్తారని తెలిపారు. అవసరమనుకుంటే మరింతమంది సిబ్బందిని రంగంలోకి దింపుతామని కూడా చెప్పారు. ఈ పండుగ సీజన్లో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకూడదనే లక్ష్యంతో ఈ ఏర్పాట్లు చేశామని తెలిపారు. అంతేగాదు తాము సోష్ల్ మీడియాపై కూడా నిఘా ఉంచామని చెప్పారు. ఎవరైన అసభ్యకరమైన వీడియోలు, మెసేజ్లు పెట్టడం లేదా ఫార్వార్డ్ చేయడం వంటివి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. (చదవండి: మాజీ మంత్రిపై బెదిరింపుల ఆరోపణలు) -
Dovely: హైదరాబాద్లో తొలిసారిగా మహిళల కోసం
హైదరాబాద్లో సిటీ సర్వీసుల సంఖ్య గణనీయంగా తగ్గపోయింది. ఎంఎంటీఎస్ రైళ్లు ఇంకా పూర్తి స్థాయిలో పట్టాలెక్కలేదు. మెట్రోరైలు ఉన్నా రాత్రి వేళలో సర్వీసులు లేవు. ఈ తరుణంలో అత్యవసర సమయంలో బయటకు వెళ్లాలనుకునే మహిళల కోసం నగరంలో డోవ్లీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మహిళ సేఫ్టీకే అధిక ప్రాధాన్యం ఇస్తూ ఈ సర్వీసును ప్రారంభించారు. మహిళలు.. మహిళలు నగరానికి చెందిన జైనాబ్ కాతూన్, ఉజ్మా కాతూన్, మసరట్ ఫాతిమాలు డోవ్లీ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. వీరికి ఓబైదుల్లా ఖాన్ సహకారం అందించారు. ఓలా, ర్యాపిడో తరహాలో రెంటల్ బైక్ (బైక్ ట్యాక్సీ) సర్వీసులు డోవ్లీ అందిస్తుంది. అయితే డోవ్లీలో రైడర్గా మహిళలే ఉండగా ఇందుగా కస్టమర్లకు కూడా కేవలం మహిళలే కావడం డోవ్లీ ప్రత్యేకత. అంటే మహిళల కోసం మహిళల చేత ఇక్కడ సేవలు అందివ్వబడతాయి. సెక్యూరిటీ కీలకం శాంతిభద్రతలు ఎంతగా మెరుగైనా ఇప్పటికీ మహిళల భద్రత విషయంలో సరికొత్త సవాళ్లు ఉదయిస్తూనే ఉన్నాయి. అందుకే విమెన్ సెక్యూరిటీకి పెద్ద పీట వేస్తూ డోవ్లీని అందుబాటులో తెచ్చారు. రైడ్ మొదలైనప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు ప్రతి క్షణం ప్రయాణాన్ని మానిటర్ చేస్తుంటారు. అప్పటి వరకు రైడర్ లైవ్ లొకేషన్ను ఆన్లోనే ఉంచాల్సి ఉంటుంది. వాట్సాప్ వేదికగా వాట్సాప్ వేదికగా డోవ్లీ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. డోవ్లీ పేరుతో యాప్ కూడా అందుబాటులో ఉన్నప్పటికీ ఇంకా ప్లేస్టోర్, యాప్స్టోర్లలో అందుబాటులోకి తేలేదు. ప్రస్తుతం డోవ్లీలో కస్టమర్ల సంఖ్య నాలుగు వందలు ఉండగా రైడర్ల సంఖ్య ఇరవైకి పైగా ఉన్నారు. అతి త్వరలోనే రైడర్ల సంఖ్యను రెండు వందల వరకు తీసుకుళ్లి నగరంలో విరివిరిగా సేవలు అందించే యోచనలో డోవ్లీ ఫౌండర్లు ఉన్నారు. చదవండి: ఇది చాలా సీరియస్ ప్రాబ్లెమ్.. పట్టించుకోక పోతే అంతే సంగతులు -
‘భార్యను కొట్టినా పర్వాలేదండి’.. తెలుగు రాష్ట్రాలే టాప్..
సాక్షి, అమరావతి: దేశంలో మహిళా రక్షణకు ప్రభుత్వాలు అనేక చట్టాలు చేస్తుంటే.. అదే సమయంలో మహిళలు కొన్ని సందర్భాల్లో గృహ హింస పర్వాలేదని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్)–5లో చాలా మంది భార్యలు కొన్ని సందర్భాల్లో తమ భర్తలు చేయి చేసుకోవడాన్ని సమర్థించడం గమనార్హం. ఇందులో తెలుగు రాష్ట్రాల్లోని మహిళలు ఎక్కువగా ఉన్నారు. భర్తకు చెప్పకుండా బయటకు వెళ్లడం, ఇంటిని, పిల్లలను నిర్లక్ష్యం చేయడం, భర్తతో వితండవాదం, నమ్మకద్రోహం, అత్తమామలను అగౌరవ పరచడం తదితర సందర్భాల్లో భర్త అవసరమైతే భార్యపై చేయి చేసుకోవచ్చని దేశ వ్యాప్తంగా 45.4 శాతం మంది మహిళలు, 44 శాతం మంది పురుషులు అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని గత సర్వేతో పోలిస్తే మహిళల్లో 7 శాతం తగ్గగా, పురుషుల్లో రెండు శాతం పెరిగింది. చదవండి: సిద్దిపేట జిల్లా గుడాటిపల్లిలో ఉద్రిక్తత, పోలీసుల లాఠీఛార్జ్ తెలుగు రాష్ట్రాలే టాప్.. నిర్దిష్ట కారణాలతో భార్యను కొట్టడాన్ని సమర్థించే మహిళల్లో తెలంగాణ (83.8 శాతం) అగ్ర స్థానంలో, ఏపీ (83.6 శాతం) రెండో స్థానంలో నిలిచింది. కర్ణాటకలో అత్యధికంగా పురుషులు (81.9 శాతం) భార్యలపై చేయి చేసుకోవచ్చన్నారు. హిమాచల్ ప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయూలో మాత్రం అతి తక్కువ మంది భార్యలు మాత్రమే భర్తలు కొట్టడాన్ని సమర్థించారు. భర్తలు చేయి చేసుకోవచ్చనే అభిప్రాయం మహిళల్లో వయసుతో పాటు పెరుగుతుండగా, పురుషుల్లో తగ్గుతోంది. భర్తలు దాదాపు 25 శాతం భార్యలను చెంప దెబ్బ కొడుతున్నట్టు సర్వే పేర్కొంది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా భర్యను కొట్టడంలో తప్పులేదనే అభిప్రాయం వ్యక్తమైంది. అత్తమామలను సరిగా చూసుకోని సందర్భంలో భార్యను కొట్టొచ్చని 32 శాతం మహిళలు, 31 శాతం పురుషులు చెప్పారు. -
Women Safety: ఈ ‘బ్రేస్లెట్’, ‘లాకెట్’ మీ దగ్గర ఉన్నాయంటే..
ధర్మం వైపు నిలిస్తే దర్భపోచ కూడా గర్జిస్తుంది...అనేది పెద్దల మాట.ఆపద చుట్టుముడితే ఈ చిట్టిపొట్టి ఆభరణాలు కూడా ఆయుధాలై గర్జిస్తాయనేది నేటి మాట... రివోలర్: దీన్ని కీచైన్కు తగిలించుకోవచ్చు. దుస్తులకు స్టైలీష్గా పిన్ చేసుకోవచ్చు. ఇది వైఫైతో పనిచేస్తుంది. అత్యవసర సమయంలో సింగిల్క్లిక్తో మన కుటుంబసభ్యులకు ప్రమాద హెచ్చరిక వెళ్లిపోతుంది. ‘అవసరం నుంచే ఆవిష్కరణ’ అన్నట్లు ఆపద సమయం నుంచి పుట్టుకువచ్చిందే ఈ రివోలర్. ఈ కంపెనీ సీయివో జాక్వీలైన్ రోజ్ సోదరి రెండుసార్లు లైంగిక వేధింపుల ప్రమాదం నుంచి బయటపడింది. ఆ చేదు జ్ఞాపకాలను దృష్టిలో పెట్టుకొని, చాలామంది సర్వైవర్లతో మాట్లాడి ఈ ‘రివోలర్’ను డిజైన్ చేసింది జాక్వీలైన్. న్యూ డీల్ డిజైన్ అనే డిజైనింగ్ స్టూడియో ఆకట్టుకునే రకరకాల సేఫ్టీ డివైజ్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. వీటి డిజైన్లో పాలుపంచుకున్న జెనిఫర్ లాంగ్ ఒకప్పుడు లైంగిక వేధింపుల బాధితురాలే. ‘సొనాటా వాచ్ ఏసీటి’ అనేది టైమ్ చూపించడమే కాదు. మన టైమ్ బాగో లేనప్పుడు రక్షణగా నిలుస్తుంది. ఆపద సమయంలో వాచ్ని క్లిక్ చేస్తే కుటుంబసభ్యులకు మనం ప్రమాదంలో ఉన్నట్లు తెలియజేసే సమాచారం చేరిపోతుంది. స్టిలెట్టో: ఈ వేరబుల్ టెక్ను బ్రేస్లెట్లాగా చేతికి ధరించవచ్చు. స్టైలీష్ లుక్తో నెక్లెస్లా మెడలో వేసుకోవచ్చు. ఆపద సమయంలో దీన్ని సింగిల్ప్రెస్ చేస్తే చాలు ఎమర్జెన్సీ కాంటాక్ట్ లీస్ట్లోని వారికి సమాచారం చేరవేసి అలార్ట్ చేస్తుంది. అథెనా: లాకెట్లా అందంగా కనిపించే ఈ నల్లని గ్యాడ్జెట్ను మెడలో వేసుకోవచ్చు. అవసరం అనుకుంటే పర్స్కు పిన్ చేయవచ్చు. దీని సహాయంతో మనం ప్రమాదకరమైన పరిస్థితులలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులకు మెరుపువేగంతో సమాచారం చేరవేయవచ్చు. సేఫ్లెట్: ఈ సేఫ్లెట్కు రెండు బటన్లు ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో వీటిని నొక్కడం ద్వారా, సమాచారం మనవాళ్లకు చేరిపోతుంది. ఇది యూజర్ సెల్ఫోన్కు సింకై ఉంటుంది. ఆడియో రికార్డింగ్ చేస్తుంది. చదవండి: సైబర్ టాక్: కొనకుండానే లాటరీ వచ్చిందా?! -
మహిళలకు అండగా ‘దిశ’ స్టేషన్లు
పీఎం పాలెం (భీమిలి): దిశ పోలీస్స్టేషన్లు మహిళల రక్షణకు నిరంతరం అండగా ఉంటాయని రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత చెప్పారు . శనివారం విశాఖలోని ఎండాడ దిశ పోలీస్స్టేషన్ను ఆమె సందర్శించారు. మహిళలు, బాలికలపై జరుగుతోన్న అమానుష ఉదంతాలు తనని తీవ్రంగా కలిచి వేస్తున్నాయన్నారు. దిశ పోలీస్స్టేషన్లు రాష్ట్రవ్యాప్తంగా ఆపదలో ఉన్న 900 మంది మహిళలకు రక్షణ కల్పించాయని వివరించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1.24 కోట్ల మంది ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నట్లు చెప్పారు. విశాఖ దిశ పోలీస్ స్టేషన్ పరిధిలో 7.31 లక్షల మంది ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలిపారు. దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తరవాత విధిగా దిశ పోలీస్ స్టేషన్లో రిజిస్ట్రేషన్ (ఎస్వోఎస్) చేయించుకోవాలని సూచించారు. ఎస్వోఎస్ సమయంలో కొంత సమాచారం ఇవ్వవలసి ఉంటుందని అంతమాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మహిళలకు అవగాహన కల్పించడానికి స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆమె తిలకించారు. -
తేడా వస్తే.. ఆ బటన్ను రెండుసార్లు నొక్కితే చాలు.. వాళ్లకు అలర్ట్ వెళ్లిపోద్ది
ఆరోజు రాత్రి పనిఒత్తిడి వల్ల శ్వేతకు ఆఫీసు నుంచి బయటకు రావడం బాగా ఆలస్యం అయింది. ఆ సమయంలో వాళ్ల ఏరియాకు వెళ్లే బస్సులు లేవు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆటో ఎక్కాల్సి వచ్చింది. కొంత దూరం వెళ్లాక డ్రైవర్ ప్రవర్తనలో మార్పు కనిపించింది. అట్టే ఆలస్యం చేయకుండా తన మెడలోని లాకెట్ను రెండుసార్లు నొక్కింది శ్వేత. ప్రమాదం నుంచి బయటపడింది. అది మంత్రం దట్టించిన లాకెట్ కాదు. మామూలు లాకెట్టే...కాకపోతే టెక్నో లాకెట్టు! ‘ఆభరణాలు అందం కోసం’ అనేది నిన్నటి మాట. ‘అభరణాలు అందం కోసమే కాదు స్వీయరక్షణ కోసం కూడా’ అనేది నేటి మాట. ‘ఏ పుట్టలో ఏ పాము ఉందో’ అన్నట్లుగా ఎక్కడ, ఎప్పుడు, ఎలా ప్రమాదాలు పొంచి ఉంటాయో తెలియదు మనకు. వైద్యసూక్తి ‘చికిత్స కంటే నివారణ ముఖ్యం’లాగే మన వ్యక్తిగత భద్రత విషయంలోనూ నివారణ అనేది ముఖ్యం కావాలి. ప్రమాదాలను నివారించడంలో అందమైన ఆభరణాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. మచ్చుకు కొన్ని... మీ మెడలో కనిపించే ఇన్విసావేర్ లాకెట్ను చూసిన వాళ్లు ‘ఎంత బాగుందో’ అంటారు. అయితే ఈ లాకెట్పని అందంగా కనిపించడం మాత్రమే కాదు అంతకంటే ఎక్కువ. మీరు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దీనిలోని హిడెన్ బటన్ను రెండుసార్లు నొక్కితే చాలు మీ కుటుంబసభ్యులు, స్నేహితులలో అయిదుమందికి మీరు ప్రమాదంలో ఉన్నట్లు తెలియజేసే మెసేజ్ చేరుతుంది. బ్లూటూత్తో అనుసంధానమై ఉన్న ఈ లాకెట్ జీపిఎస్ లొకేషన్ తెలియజేస్తుంది. ఈ గోల్డ్ప్లేటెడ్ లాకెట్ మన భద్రత విషయంలో బంగారంలాంటి విలువైనది అని చెప్పుకోవచ్చు. ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ‘పెండెంట్ విత్ వైట్సేఫర్ వీఐ.0’ లాకెట్ గురించి... గ్రీన్కలర్లో మెరిసిపోయే ఈ లాకెట్లోని బాక్స్లో మైక్రో యుఎస్బి అమర్చబడి ఉంటుంది. బ్లూటూత్ టెక్నాలజీతో, ‘సేఫర్ బీ లీఫ్’ యాప్తో కలిసిపనిచేస్తుంది. ప్రమాదపరిస్థితుల్లో ఈ లాకెట్ బటన్ను రెండుసార్లు నొక్కితే చాలు మన వాళ్లకు సమాచారం చేరిపోతుంది. సమీపంలో ఉన్న పోలిస్స్టేషన్, హాస్పిటల్ను యూజర్ నేవిగేట్ చేసే ఆప్షన్ ఉంది. మెడలో సులభంగా ఇమిడిపోయి, ఆకర్షణీయంగా కనిపించే గ్లాస్ పెండెంట్ ‘సేఫర్’ కూడా ప్రమాద సమయాలలో మన వాళ్లను అప్రమత్తం చేయడానికి ఉపయోగపడుతుంది. ఐఐటీ–దిల్లీ, దిల్లీ టెక్నలాజికల్ యూనివర్శిటీ విద్యార్థులు దీనికి రూపకల్సన చేశారు. ‘ఒంటరి సమయంలో కూడా నా చుట్టూ పదిమంది ఉన్నారు అనే ధైర్యాన్ని సేఫర్ ఇస్తుంది’ అంటున్నారు. ‘ఏదో కొన్నామంటే కొన్నాం అన్నట్లుగా కాకుండా ప్రతిరోజు విధిగా లాకెట్ను మెడలో ధరించాలి’ అంటున్నారు భద్రత నిపుణులు. -
మహిళల అభివృధ్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
-
ముంబైలో మరో 7 వేల సీసీ కెమెరాలు.. ఎందుకంటే?
సాక్షి, ముంబై: మహిళలు, ఆడ పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని ముంబైలో అదనంగా మరో 7 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మహారాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి సతేజ్ పాటిల్ వెల్లడించారు. ఏటా ముంబైలో వందలాది మంది ఆడ పిల్లలు అదృశ్యమవుతున్నారు. గడిచిన మూడేళ్లలో 3,519 మంది ఆడ పిల్లలు అదృశ్యమయ్యారు. ఆధారాలు, సీసీ కెమెరాలు అనేక చోట్ల లేకపోవడంతో వారి ఆచూకీ లభించడం లేదు. ఫలితంగా ఆ అదృశ్యమైన కేసులు చేధించడంలో పోలీసులు సఫలీకృతం కాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నగరంలో ఉన్న 5 వేల సీసీ కెమెరాలకు అదనంగా మరో 7 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సతేజ్ పాటిల్ వివరించారు. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇదే క్రమంలో నగరంలో నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. పరీక్ష తప్పడంతో తల్లిదండ్రులు మందలించారని కొందరు, గొడవ పడి, ప్రేమలో పడి మరికొందరు ఇళ్ల నుంచి పారిపోతారు. ఆ తరువాత ఇంటికి వెళ్లలేక, ఎక్కడికెళ్లాలో తెలియక రోడ్లపై, బస్టాండ్లలో, రైల్వే స్టేషన్ ఆవరణల్లో, ప్లాట్ఫారాలపై తిరుగుతుంటారు. ఆ తరువాత ఎవరి మాయలోనో పడి అదృశ్యమవుతారు. (చదవండి: 15-18 యేళ్ల వయసు వారికి జనవరి 3 నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్!) ఇలాంటి కేసులు నిత్యం ముంబైలోని వివిధ పోలీసు స్టేషన్లలో నమోదవుతూనే ఉంటాయి. ఇందులో కొన్ని కేసులను పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా చేధిస్తారు. మరికొన్ని కేసులు ఆధారాలు లేక అలాగే పెండింగులో ఉంటాయి. దీంతో అదనంగా మరిన్ని సీసీ కెమెరాలు అమర్చితే అదృశ్యమైన యువతులు, బాలికలు ఎలా వెళ్లారు, ఏ మార్గంలో వెళ్లారో ఆచూకీ వెంటనే కనుక్కొని కేసులను సత్వరమే పరిష్కరించవచ్చని సతేజ్ పాటిల్ అభిప్రాయపడ్డారు. కేసులు చేధించకపోవడంతో ఇప్పటికే అనేక రంగాల నుంచి పోలీసు శాఖ విమర్శలు ఎదుర్కొంటోంది. ఇక అలాంటి అవకాశం ఇవ్వకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. (చదవండి: పరిస్థితి చేయి దాటుతోందా? ఒక్క రోజులోనే లక్ష కోవిడ్ పాజిటివ్ కేసులు..) -
కన్నీటిని కన్నీటితోనే తుడవలేం! స్త్రీలపై జరిగే హింసకు వ్యతిరేకంగా పోరాడుదాం..
International Day for the Elimination of Violence against Women: ఒకరోజు వెనక్కి వెళితే... కేరళలోని ఎర్నాకుళంలో పర్వీన్ అనే లా స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంది. తన చేతిరాతతో కూడిన ఒక సూసైడ్ నోట్ సంఘటన స్థలంలో దొరికింది. భర్త, అత్తమామలు పెట్టే హింసను తట్టుకోలేక చనిపోతున్నానని రాసింది. రెండు రోజులు వెనక్కి వెళితే... కెన్యాలో అకియో అనే పేరుగల స్త్రీ హత్యకు గురైంది. చంపింది ఎవరో కాదు... భర్తే. అనుమాన పీడితుడైన భర్త అకియోను తరచు హింసించేవాడు. ఒకరోజు బాగా తాగి వచ్చి అందరూ చూస్తుండగానే భార్యను హత్య చేశాడు. కేరళ నుంచి కెన్యా వరకు, అమెరికా నుంచి చైనా వరకు...దేశాల మధ్య భౌగోళిక దూరాలు ఉండొచ్చుగానీ, స్త్రీలపై జరిగే హింస విషయంలో మాత్రం ఎలాంటి దూరాలు లేవు. ఇక్కడెంతో అక్కడంతే! అక్కడెంతో ఇక్కడ అంతే!! బాల్యవివాహాలు, వరకట్న వేధింపులు, వర్ణవివక్షతతో కూడిన హింస, లింగనిర్ధారణ పరీక్షలు, భ్రూణహత్యలు, పరువు హత్యలు... ఇలా వివిధ రూపాల్లో స్త్రీలపై జరిగే హింసను నిరోధించడానికి ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం స్త్రీ హింసా వ్యతిరేక దినం (నవంబర్ 25) సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది, ఈ సంవత్సరం ‘ఆరేంజ్ ది వరల్డ్: ఫండ్, రెస్పాండ్, ప్రివెంట్, కలెక్ట్’ గ్లోబల్ థీమ్తో నేటి నుంచి డిసెంబర్ 10 (మానవ హక్కుల దినోత్సవం) వరకు 16 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వీటిలో ప్రపంచవ్యాప్తంగా 6000కు పైగా ఉమెన్ ఆర్గనైజేషన్స్, 180 దేశాల ప్రతినిధులు, మరెంతో మంది స్త్రీ ఉద్యమ కార్యకర్తలు పాల్గొంటారు. చదవండి: Winter Heart Attacks: అందుకే శీతాకాలంలో హార్ట్ అటాక్స్ అధికంగా సంభవిస్తాయి..! కన్నీటిని కన్నీటితోనే తుడవలేం...కార్యాచరణ కావాలి...ప్రణాళిక కావాలి. ఆచరణ వైపు వడివడిగా అడుగులు పడాలి. ఈ సమావేశాలు అలాంటి పనే చేస్తున్నాయి. లోకల్, కంట్రీ, గ్లోబల్ నేపథ్యంలో ఆలోచనలు, ఆచరణలను సమన్వయం చేస్తున్నాయి. ‘ఇదిగో మా దగ్గర ఇలా చేశాం. మీ దగ్గర మాత్రం ఎందుకు చేయరు’ అని ఒక సూచన ఇస్తాయి. హింసకు వ్యతిరేకంగా పోరాడే స్త్రీ యోధురాళ్ల ఉపన్యాసాలు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తాయి. ‘ఎక్కడో మహిళలపై జరిగే హింస గురించి మాట్లాడడానికి ముందు, మీ ఇంట్లో అలాంటి హింస జరగకుండా చర్యలు తీసుకోండి’ అని దేశ దేశాలకు ఉపదేశం ఇస్తాయి. కాలంతో పాటు హింసా రూపాలు మారుతున్నాయి. కొత్తగా ‘డిజిటల్ వయొలెన్స్’ వచ్చింది... ఇలాంటి ఎన్నో వికృతరూపాల గురించి ఈ సమావేశాలు లోతుగా చర్చిస్తాయి. నిర్మాణాత్మకమైన పరిష్కార మార్గాలు ఆలోచిస్తాయి. ‘ఎండ్ వయొలెన్స్ అగెనెస్ట్ ఉమెన్ నౌ’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదం ఇచ్చేలా చేస్తాయి. చదవండి: Octopus Unknown Facts: 9 మెదడులు, 3 గుండెలు.. ఐనా పాపం పిల్లలు పుట్టగానే మరణిస్తుంది!! -
SHE Teams: ఏడేళ్లుగా ‘ఆమె’కు నిరంతరం రక్షణగా..
సంతోషకరమైన జీవనం వైపుగా అడుగులు వేయడానికి భద్రమైన మార్గంలో పయనించడానికి సమాజం మనందరికీ చేదోడు వాదోడుగా నిలుస్తుంది. కానీ, ఈ సమాజంలో మహిళ రక్షణ ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే ఉంటోంది. దీనికి సమాధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైంది ‘షీ టీమ్’. ఉమెన్ సేఫ్టీ వింగ్ కార్యక్రమాల్లో భాగంగా స్త్రీల రక్షణ కోసం 24 గంటలూ పనిచేస్తూ మహిళా నేస్తంగా మారిన ‘షీ టీమ్’ సేవలకు ఏడేళ్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో మహిళల భద్రత ఏవిధంగా ఉంది? పెరుగుతున్న నేరాలు, మారుతున్న విధానాలు తీసుకుంటున్న చర్యల గురించి పూర్తి సమాచారంతో మన ముందుంచింది తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్. వేధింపులకు చెక్పెట్టడమే లక్ష్యం – స్వాతి లక్రా ► తెలంగాణలో ‘షీ టీమ్’ ఏర్పాటై ఏడేళ్లు పూర్తయ్యాయి. దీనికి సంబంధించిన ఫలితాలను చూసినప్పుడు మీకేమనిపించింది? ‘షీ టీమ్’ గురించి 90 శాతం ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో అవగాహన రావడం చాలా సంతోషాన్ని కలిగించింది. ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇదే విషయం మీద సర్వే చేశాం. దాంట్లో మంచి రేటింగ్ వచ్చింది. ప్రజలకు ‘షీ టీమ్’ సేవలు బాగా నచ్చాయి. మంచి ఫలితాలు వచ్చాయి. ప్రతి యేటా 5 వేలకు పైగా ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటున్నాం. మహిళల రక్షణ, వారి భద్రతకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఒక వేదిక ఉండాలనుకుని ప్రభుత్వం అక్టోబర్ 24, 2014లో హైదరాబాద్లో షీ టీమ్ను ప్రారంభించింది. ఏప్రిల్, 2015లో తెలంగాణ మొత్తంగా షీ టీమ్ సేవలను విస్తృతం చేసింది. ► ఇన్నేళ్లుగా వచ్చిన మహిళలకు సంబంధించిన ఫిర్యాదులు, ఇటీవల మహిళలపై నేరాలకు పాల్పడుతున్న సంఘటనలు ఎలాంటివి? గతంలో భౌతిక దాడులు, లైంగిక వేధింపులు, ఈవ్ టీజింగ్కు సంబంధించినవి మొదటి జాబితాలో ఉండేవి. దాదాపు వందలో 60 శాతం ఫోన్ వేధింపులు, సామాజిక మాధ్యమాలకు సంబంధించిన ఫిర్యాదులు ఉంటున్నాయి. ఈ ఫిర్యాదుల్లో వాట్సప్ ద్వారా వచ్చేవి ఎక్కువ ఉండగా, డయల్ –100, ఫేస్బుక్, హ్యాక్ ఐ యాప్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్ నుంచి కూడా ఫిర్యాదులు అందుతున్నాయి. ► సామాజిక మాధ్యమాల ద్వారా పెరిగే వేధింపులకు అడ్డుకట్ట వేయడానికి తీసుకుంటున్న చర్యలు? మహిళలు చాలా మంది వేధింపుల బారిన పడుతున్నామని తెలిసినా ఫిర్యాదు చేయడానికి ఇంకా ముందుకు రావడం లేదు. ముందు వాళ్లలో చాలా మార్పు రావాలి. ఏ వేధింపులైనా వెంటనే మాకు తెలియజేయడం ద్వారా సత్వర పరిష్కారం లభిస్తుంది. ఉమన్ సేఫ్టీ వింగ్లో ప్రత్యేకంగా సైబర్ క్రైమ్కు సంబంధించి ‘షీ ల్యాబ్’ను కూడా ప్రారంభిస్తున్నాం. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ వేధింపులను సైబర్ నిపుణుల ద్వారా కనిపెట్టి, వీటికి అడ్డుకట్ట వేస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచీ సైబర్ నేరస్తులు ఉంటున్నారు. ఇలాంటప్పుడు వారిని పట్టుకోవడానికి ఇతర రాష్ట్రాల పోలీసుల సాయమూ తీసుకుంటున్నాం. ఏఅగిఓ ఉ్గఉ మొబైల్ అప్లికేషన్ ఉంది. ఇది ఇప్పటికే 30 లక్షల మందికి పైగా రీచ్ అయ్యింది. మా వెబ్సైట్లో సోషల్మీడియాలో మహిళలు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలిపే విధానాలపై పూర్తి సమాచారం ఉంచాం. వాటిని చదివి తెలుసుకోవచ్చు. ‘షీ టీమ్’ సమావేశం అనంతరం సభ్యులతో స్వాతి లక్రా ► షీ టీమ్లో మహిళా భద్రత కోసం ఎంత మంది వర్క్ చేస్తుంటారు? 33 శాతం మహిళలకు రిజర్వేషన్ వచ్చాక మహిళలు అధిక సంఖ్యలో పోలీసు విభాగంలోకి వస్తున్నారు. కానీ, ఇంకా తక్కువమంది మహిళా పోలీసులు ఈ విభాగంలో ఉండటం ఆలోచించ వలసిన విషయం. షీ టీమ్ బృందాలుగా రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తారు. ఒక బృందంలో 5 గురు సభ్యులు, ప్రతి బృందంలో తప్పనిసరిగా ఒక మహిళ ఉంటారు. వీళ్లు యూనిఫామ్లో కాకుండా సివిల్ డ్రెస్లో డిప్యూటీ సూపరిండెంట్ ఆఫీసర్ పర్యవేక్షణలో విధులను నిర్వర్తిస్తుంటారు. ఇదే విధానం తెలంగాణ మొత్తం ఉంటుంది. సుశిక్షితులైన వారే ఈ టీమ్లో ఉంటారు. అలాగే, సమాజంలో మహిళల స్థానం పట్ల అవగాహన, వారి పట్ల నడుచుకునే విధానం, ఆపరేషన్ నైపుణ్యాలు, పద్ధతులు, సాంకేతిక నైపుణ్యం, న్యాయపరమైన, చట్టపరమైన నిబంధనల పట్ల పూర్తి సమాచారం కలిగి ఉంటారు. ► మన సమాజ మూలాల్లోనే కుటుంబాల్లోనూ అమ్మాయిల పట్ల ఒక వివక్ష ఉంది. షీ టీమ్ ఏర్పాటై ఇన్నేళ్ల తర్వాత ఈ విధానంలో ఏమైనా మార్పు వచ్చిందంటారా? చాలా మార్పు వచ్చింది. వివక్ష లేకపోలేదు. కానీ, వివక్ష తీవ్రత తగ్గింది. 2016–17 సమయంలో అమ్మాయిలను వేధించేవారిలో చాలా మంది మైనర్ అబ్బాయిలను మేం పట్టుకున్నాం. వారికి కౌన్సెలింగ్ చేస్తూ వచ్చాం. దీంతో వారిలో మార్పు తీసుకురావడానికి జూనియర్, డిగ్రీ స్థాయి కాలేజీల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాం. స్వచ్ఛంద సంస్థలతో కలిసి ప్రోగ్రామ్లు చేశాం. ఇప్పుడు సర్వే చేస్తే మైనర్ అబ్బాయిలు వేధింపులకు పాల్పడటం లేదని తెలిసింది. అవగాహన కావచ్చు. కౌన్సెలింగ్ కావచ్చు. అన్నీ దోహదం చేస్తున్నాయి. కాలేజీల్లో అబ్బాయిలు కూడా షీ టీమ్ కార్యక్రమాల సమయంలో పాల్గొనడానికి స్వచ్ఛందంగా ముందుకువస్తున్నాయి. అమ్మాయిలను ఎలా చూడాలనే ఆలోచనల్లో మార్పు రావడానికి మేం చేస్తున్న కార్యక్రమాలు దోహదం చేస్తున్నాయి. ఇళ్లలో చూస్తే ఈ మార్పు చాలా నెమ్మదిగా ఉంది. మరొక బాధాకరమైన విషయం ఏంటంటే.. బధిరులను వేధించడం, వారిపై లైంగిక దాడులకు పాల్పడటం వంటివి జరుగుతున్నాయి. బధిరుల పట్ల ఎలా నడుచుకోవాలనే విషయాల పట్ల కుటుంబాల నుంచే అబ్బాయిల్లో అవగాహన పెంచితే మరింత బాగుంటుంది. ► ఇటీవల చిన్నపిల్లలపై లైంగిక దాడుల సంఘటనలు ఎక్కువ వింటున్నాం. తెలిసినవారే నిందితులుగా ఉంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? నిజమే, పిల్లలపై దాడులు చేసేవారు 90 శాతం కంటే ఎక్కువ ఆ కుటుంబాలకు తెలిసినవారే ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే కుటుంబాల నుంచి ఫిర్యాదు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇంట్లో, ఇంటి చుట్టుపక్కల ఉండే ‘అంకుల్స్’ వల్ల ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. పిల్లలపై లైంగిక దాడి జరిగిందని తెలిసినప్పుడు తప్పనిసరిగా ఫిర్యాదు చేయాలి. ఆ నేరాన్ని దాచిపెట్టాలని చూసినా అది నేరమే. ఈ విషయాలు పిల్లలకు కూడా తెలియాలని పాఠశాలల్లో ‘సేఫ్–అన్ సేఫ్ టచ్’ పట్ల అవగాహన కల్పిస్తున్నాం. సమస్య తెలిసినప్పుడు టీచర్లు కూడా ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత గురించి తెలియజేస్తున్నాం. ► మహిళకు సమస్య వచ్చి, మిమ్మల్ని కలిసిన తర్వాత ఆమె జీవితంలో నిలదొక్కుకోవడానికి ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు? బాధితుల్లో ఎలాంటి అండ లేనివారికి ప్రభుత్వం నుంచి పరిహారం ఉంటుంది. వారు నిలదొక్కుకోవడానికి చదువు, జీవననైపుణ్యాలను కల్పించేందుకు తగిన శిక్షణ కూడా ఉంటుంది. ► చాలా వరకు మహిళా బాధితుల్లో ఇప్పటికీ పోలీసు స్టేషన్కి రావాలంటే ఒక తెలియని సందిగ్ధత ఉంటుంది. షీ టీమ్ వచ్చాక ఈ విధానంలో మార్పు వచ్చిందంటారా? గత పోలీసు స్టేషన్లు, నేటి పోలీసు స్టేషన్లను చూస్తే ఆ తేడా మీకే అర్థమవుతుంది. ఒక మంచి వాతావరణంలో మా సిబ్బంది పనిచేస్తున్నారు. ముఖ్యంగా లింగసమానతలు, సున్నితమైన విషయాల గురించిన అవగాహనతో పనిచేస్తున్నారు. ఒక మహిళ పోలీస్ స్టేషన్కు వస్తే ఆమెతో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలనే విషయాల పట్ల మార్పు వచ్చింది. అలాగే, ప్రతీ పోలీసు స్టేషన్ రిసెప్షన్లో ఒక మహిళ ఉంటుంది. దీని వల్ల మంచి మార్పుతోపాటు గతంలో ఉన్న సందిగ్ధతలు చాలా వరకు తగ్గాయి. ఒక మహిళ ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేస్తే, మేం వారిని నేరుగా సంప్రదించి వివరాలన్నీ తీసుకుంటున్నాం. అంటే, మహిళ పోలీసు స్టేషన్కు రాకుండానే ఆమెకు న్యాయం జరిగేలా చూస్తున్నాం. ► ఇతర రాష్ట్రాల్లో ‘షీ టీమ్’ లాంటి మహిళా రక్షణ కోసం చేస్తున్నæ విభాగాలున్నాయా? మనం వారి నుంచి స్ఫూర్తి పొందినవి ఉన్నాయా? తప్పకుండా ఉంటాయి. మన సెంటర్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయో తెలుసుకోవడానికి ఇతర రాష్ట్రాల పోలీసు విభాగం నుంచి వచ్చి చూస్తుంటారు. మేం కూడా మహిళా రక్షణలో ఇతర రాష్ట్రాల పోలీసు విభాగం చేస్తున్న కార్యక్రమాల గురించి తెలుసుకుంటుంటాం. ఇది రెండువైపులా ఉంటుంది. ► ఇక్కడి మహిళలు వేరే దేశాల్లో వేధింపులకు గురైన సందర్భాల్లో వచ్చిన ఫిర్యాదులు.. ఈ విధానంలో ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి? ఉమెన్ సేఫ్టీ వింగ్లోనే ‘ఎన్ఆర్ఐ సెల్’ కూడా ఏర్పాటు చేశాం. ఎన్ఆర్ఐ లను పెళ్లి చేసుకున్న మహిళలు విదేశాలకు వెళ్లిన తర్వాత వారిని వదిలేయడం, అదనపు కట్నం కోసం వేధించడం వంటి సంఘటనలు చూస్తున్నాం. ఇలాంటి వారి కోసం ఒక టీమ్ పని చేస్తుంది. లాయర్ ద్వారా, స్వచ్ఛంద సంస్థల నుంచి, ఎంబసీస్, విదేశీ మంత్రిత్వ శాఖ, ఆర్పీఓ .. అందరినీ సంప్రదించి ఆ సదరు మహిళకు ఎలా సాయం అందించాలో చూస్తున్నాం. కొన్ని విషయాల్లో టైమ్ పడుతుంది కానీ, మంచి ఫలితాలు వస్తున్నాయి. ► మహిళా రక్షణ విషయంలో ఇప్పటి వరకు ఉన్న చట్టాలు సరిపోతాయా? అదనంగా కొత్త చట్టాలను చేర్చాల్సిన అవసరం ఉందా? చట్టాలు చాలా ఉన్నాయి. వాటిని అమల్లో పెట్టడం ముఖ్యం. ఈ విషయంపైనే మేం దృష్టి పెడుతున్నాం. విచారణ త్వరగా పూర్తి చేయాలి. చార్జ్షీట్ ఫైల్ చేశాక త్వరగా బాధితులకు న్యాయం జరగాలి.. ఈ విధానంలోనే మేం పనిచేస్తున్నాం. ► సమాజంలో చోటు చేసుకోవాలనుకుంటున్న మార్పుల గురించి? దేశవ్యాప్తంగా పోలీసు విభాగంలో మహిళల సంఖ్య తక్కువే ఉంది. ఇప్పుడిప్పుడే మహిళా పోలీసుల సంఖ్య పెరుగుతోంది. మన సమాజంలో 50 శాతం మహిళలు ఉంటే అంత శాతం పోలీసు విభాగంలోనూ ఉండాలి. దీనివల్ల సమాజంలో ఉన్న మహిళలకు మరింత మేలు జరుగుతుంది. ఏ సమయంలోనైనా మహిళ ధైర్యంగా తన పనుల నిమిత్తం వెళ్లగలిగే పరిస్థితి రావాలనుకుంటున్నాను. ఆ రోజు తప్పక వస్తుంది అన్న నమ్మకమూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మహిళల రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న ‘షీ టీమ్’, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇన్చార్జ్, అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా, డిఐజీ సుమతి ఇంటర్వ్యూలతో షీ టీమ్ గురించిన సమగ్ర సమాచారం. ఎంబీయే చేస్తున్న నాకు మా కాలేజీలో చదువుతున్న సురేష్ (పేరు మార్చడమైనది) ప్రేమిస్తున్నానంటూ దగ్గరయ్యాడు. ఏడాదిగా బాగానే ఉన్న సురేష్ అనుమానంతో విసిగిస్తుండటంతో భరించలేక బ్రేకప్ చెప్పేశాను. ఆనాటి నుంచి తన దగ్గరున్న ఫొటోలతో నన్ను బెదిరించడం మొదలుపెట్టాడు. నా ఫోన్లో ఉన్న మా బంధుమిత్రుల నెంబర్లన్నీ ట్యాప్చేసి, తీసుకొని వారందరికీ మా ప్రేమ గురించి, ఫొటోల గురించి చెబుతానని బెదిరించేవాడు. ఇది నా భవిష్యత్తుకే ప్రమాదం అనుకున్నాను. మా ఫ్రెండ్ ఇచ్చిన సలహాతో ‘షీ టీమ్’ను వాట్సప్ నెంబర్ ద్వారా సంప్రదించాను. పోలీసులు సురేష్ను హెచ్చరించి, అతని వద్ద నాకు సంబంధించి ఉన్న ఫొటోలు, వీడియోలు డిలీట్ చేయించారు. ఇక నుంచి ఎలాంటి వేధింపు చర్యలకు పాల్పడబోనని రాతపూర్వకంగా రాయించుకొని, అతని మీద నిఘా పెట్టారు. రెండు నెలలుగా ఈ సమస్యతో నరకం చూసిన నాకు, షీ టీమ్ ద్వారా ఒక్క రోజులోనే పరిష్కారం దొరికింది. ఇప్పుడు హాయిగా ఉన్నాను. – బాధితురాలు మా అమ్మాయి ఏడవ తరగతి చదువుతుంది. సెలవులకు మా అమ్మ వాళ్ల ఊరు వెళ్లింది. అదే ఊళ్లో ఉంటున్న తెలిసిన వ్యక్తే మా అమ్మాయి పట్ల దారుణంగా ప్రవర్తించడమే కాకుండా, ఫొటోలు, వీడియోలు తీసి మమ్మల్ని మానసికంగా వేధించేవాడు. భరించలేక షీ టీమ్ను ఫోన్ ద్వారా సంప్రదించాం. షీ టీమ్ సదరు వ్యక్తి నుంచి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా సరైన విధంగా బుద్ధి చెప్పారు. ఏడాది నుంచి సమస్యేమీ లేకుండా మనశ్శాంతిగా ఉన్నాం. – మరో బాధితురాలి తల్లి అవగాహన తీసుకొస్తున్నాం– బి. సుమతి ► మహిళల వేధింపులకు సంబంధించి రోజూ ఎన్ని కేసులు ఫైల్ అవుతుంటాయి? రోజూ దాదాపు 20 నుంచి 25 కేసుల వరకు ఉంటాయి. వీటిలో లైంగిక వేధింపులు ఎక్కువ. స్నేహం, ప్రేమ పేరుతో దగ్గరయ్యి ఫొటోలు, వీడియోలు నలుగురిలో పెట్టి పరువు తీస్తామనే బెదిరింపులూ ఎక్కువే. పదేళ్ల లోపు చిన్నపిల్లలకు సంబంధించిన కేసులు కూడా ఉంటున్నాయి. వీటిలో తీవ్రత శాతాన్ని బట్టి మానిటరింగ్ ఉంటుంది. ప్రధానంగా నేరాల తీవ్రతను బట్టి ఒక షెడ్యూల్ను రూపొందించాం. పిల్లలు, మహిళలపై పబ్లిక్గా జరిగే దాడులు, లైంగిక హింస, మనుషుల అక్రమరవాణా, సైబర్క్రైమ్, గృహహింస ప్రధానమైనవి. ► షీ టీమ్ ఆధ్వర్యంలో పిల్లల భద్రత కోసం చేస్తున్న కార్యక్రమాలు గురించి? చిన్న పిల్లల్లో అవగాహన కల్పించడానికి రాష్ట్రస్థాయిలో స్కూళ్లను ఎంచుకున్నాం. షీ టీమ్, సైబర్ నిపుణులు, స్వచ్ఛంధ సంస్థ భాగస్వామ్యంతో ఇప్పటికి 1650 స్కూళ్లలో ‘సైబర్ కాంగ్రెస్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశాం. తెలంగాణలోని 33 జిల్లాల్లోనూ ప్రతి స్కూల్ నుంచి విద్యార్థులు పాల్గొనేలా చూస్తున్నాం. ► టీనేజర్లు, యువతలో మహిళల భద్రతకు సంబంధించి చేస్తున్న కార్యక్రమాలు? యువతలో 19 నుంచి 25 ఏళ్ల లోపు అమ్మాయిలపై వేధింపులు ఎక్కువున్నాయి. అందుకని, కాలేజీల్లో ‘గర్ల్ సేఫ్టీ క్లబ్స్’ ఏర్పాటు చేస్తున్నాం. దీంట్లో 25 మంది విద్యార్థులను తీసుకుంటే సగం అమ్మాయిలు, సగం అబ్బాయిలు ఉండేలా చూస్తున్నాం. ఒక కాలేజీలో 25 మంది సేఫ్టీ క్లబ్గా ఉంటే వారి చుట్టుపక్కల, కాలేజీలో ఏదైనా సమస్య వస్తే ఎలా స్పందించాలి, అనే విషయాల పట్ల శిక్షణ ఇస్తాం. వాళ్లు పరిష్కరించలేని సమస్యలను మా దగ్గరకు తీసుకువచ్చేలా శిక్షణ ఇస్తున్నాం. ► ఆన్లైన్ మోసాలకు గురయ్యేవారిలో గృహిణులూ ఉంటున్నారు. వీరి రక్షణ కోసం చేస్తున్న కార్యక్రమాలు? గృహిణులు సైబర్ మోసాల బారినపడకుండా, అవగాహన కల్పించేందుకు ‘సైభర్’ కార్యక్రమం రూపొందించాం. ఆన్లైన్ మాధ్యమంగానే చేసిన ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 50 లక్షల మందికి రీచ్ అయ్యాం. స్లమ్స్లలో కూడా అక్కడి అమ్మాయిల భాగస్వామ్యంతో గృహిణుల రక్షణ కోసం అవగాహనా కార్యక్రమాలు చేస్తున్నాం. వీటి విస్తృతి పెంచేందుకు మరికొన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ► గ్రామస్థాయిల్లో మహిళలకు రక్షణ కల్పించేందుకు, అవగాహన పెంచేందుకు చేస్తున్న కృషి? పట్టణ, గ్రామీణ స్థాయిలోనూ షీ టీమ్ ద్వారా నేరుగా దాదాపు 30 లక్షల మందికి రీచ్ అయ్యాం. స్థానిక జానపద కళాకారులతో కలిసి గ్రామస్థాయిలో కార్యక్రమాలు చేశాం. వీటిని మరింతగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. షీ టీమ్ మీ కోసమే.. ► పబ్లిక్ ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులు (ఈవ్ టీజింగ్.. వంటివి) జరిగినా ► ఫోన్కాల్, మెసేజ్లు, ఇ–మెయిల్స్, సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురిచేసినా ► మహిళ ఒంటరిగా ప్రయాణించే సందర్భాలలో వెంటనే పోలీసు సాయం అందాలన్నా షీ టీమ్ వెంటనే స్పందిస్తుంది. ► మహిళలపై తీవ్రమైన నేరాలను అరికట్టడానికి నిరోధక శక్తిగా పనిచేస్తుంది. ► తప్పుదారి పట్టిన యువతను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి నిపుణులచే కౌన్సెలింగ్ ద్వారా అవగాహన కల్పింస్తుంది. వారిని తమ నిఘానేత్రంతో నిశితంగా గమనింఇస్తుంది. ► మహిళకు హక్కుల పట్ల షీ టీమ్ వివిధ వేదికల ద్వారా అవగాహన కలిగిస్తుంది. భద్రత... సురక్షితం ► బృందాలుగా తెలంగాణ వ్యాప్తంగా ‘షీ టీమ్’ పనిచేస్తుంది. ప్రతి టీమ్లో ఒక మహిళా పోలీస్ అధికారి ఉంటారు. ► బస్స్టాండ్లు, రైల్వేస్టేషన్లు, స్కూళ్లు–కాలేజీలు, లేడీస్ హాస్టల్స్, పార్కులు, ఆసుపత్రుల చుట్టుపక్కల ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించి నిఘాను ఉంచుతుంది. ► చట్టం, న్యాయం, సాంకేతిక విషయాల్లో సుశిక్షితులైన వారు ఈ బృందంలో తమ విధులను నిర్వర్తిస్తుంటారు. ఎప్పటికప్పుడు షీ టీమ్కు నిఘా విభాగం నుంచి సమాచారం చేరుతూనే ఉంటుంది. ► మహిళలు ఆన్లైన్ వేదికల ద్వారా తమ ఫిర్యాదులను అందజేయవచ్చు. షీ టీమ్ బృందం సివిల్ డ్రెస్సులో బాధితులను నేరుగా కలిసి, తదుపరి విచారణ కొనసాగిస్తుంది. ► ఒకసారి ఒక వ్యక్తిపై మొదటిసారి నేరారోపణ వస్తే సుమోటోగా బుక్ చేసి, తగిన చర్యలు తీసుకుంటారు. అదే నేరసుడిపై మరోసారి ఫిర్యాదు వస్తే.. ఆ కేసును నిర్భయ యాక్ట్ కింద బుక్ చేసి, మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటారు. అందుకని, బాధితులు వెనుకంజ వేయకుండా తమ సమస్యను నివేదించి, సరైన పరిష్కారం పొందవచ్చు. ► సమాజంలో మహిళలకు సంబంధించిన సమస్యలను పరువుగా చూస్తారు. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఆ వివరాలు బయటకు వచ్చి, తమ కుటుంబ పరువు పోతుందేమో అని భయపడతారు. షీ టీమ్ లోబాధితుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతారు. సామాజిక మాధ్యమాలు, ఫోన్ నెంబర్, నేరుగా.. ఫిర్యాదులను స్వీకరించడమే కాకుండా, అత్యంత వేగంగా పరిష్కారం చూపుతారు. అందుకని మహిళలు తమను వేధించేవారిని ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటే వారికై వారుగా ముందుకు రావాలి. ► మహిళా రక్షణ కోసం షీ టీమ్ వివిధ వేదికల ద్వారా ప్రజలలో అవగాహన కలుగజేస్తుంది. ఆ కార్యక్రమాలలో పాల్గొని తమ అభిప్రాయాలనూ పంచుకోవచ్చు. ఫిర్యాదులకు వేదికలు తెలంగాణ మొత్తానికి మహిళకు రక్షణకవచంలా ఉంది షీ టీమ్. సమస్య వచ్చినప్పుడు సందేహించకుండా సత్వర పరిష్కారం కోసం సంప్రదించాల్సిన వేదికలు.. ఇన్స్టాగ్రామ్:telanganasheteams ఫేస్బుక్, ట్విటర్:@ts-womensafety మెయిల్: womensafety-ts@tspolice.gov.in య్యూట్యూబ్: Women Safety Wing Telangana Police వాట్సప్ నెం. 944 166 9988 క్యూ ఆర్ కోడ్.. వంటి వేదికల ద్వారా ఫిర్యాదు చేయచ్చు. లైంగిక వేధింపులు, దాడులు, సైబర్ నేరాల నుంచి ‘ఆమె’ను రక్షించడానికి నిరంతరాయంగా కృషి చేస్తున్న షీ టీమ్కు ‘సాక్షి’ సెల్యూట్. – నిర్మలారెడ్డి, ఫొటోలు: నోముల రాజేష్రెడ్డి -
భద్రతకు ‘దిశ’ నిర్దేశం
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో ఓ యువకుడు ఇద్దరు బాలికలను మంగళవారం రాత్రి 7.20 గంటలకు వారి ఇంటి మేడ మీదకు తీసుకువెళ్లి అసభ్యకరంగా తాకుతూ వేధించాడు. వెంటనే ఓ బాలిక కిందకు దిగొచ్చి, అమ్మమ్మకు విషయం చెప్పింది. అంతకు రెండు రోజుల ముందే వార్డు వలంటీర్ ఆమె మొబైల్ ఫోన్లో దిశ యాప్ను డౌన్లోడ్ చేశారు. దాంతో ఆమె 7.26 గంటలకు దిశ యాప్లోని ఎస్వోఎస్ బటన్ నొక్కారు. 7.30 గంటలకు పోలీసులు అక్కడికి చేరుకుని ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. పోస్కో, నిర్భయ చట్టాల కింద కేసు నమోదు చేశారు. ‘వామ్మో పోలీసులా.. కంప్లైంట్ ఇవ్వాలంటే పోలీస్ స్టేషన్కు వెళ్లాలా.. అంతకంటే మౌనంగా ఉండటమే నయం.’ ఇదీ రాష్ట్రంలో రెండున్నరేళ్ల క్రితం వరకు మహిళల పరిస్థితి. తమకు అన్యాయం జరిగినా, వేధింపులకు గురైనా.. ఇతరత్రా సమస్యలు వచ్చినా సరే పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మహిళలు జంకేవారు. పోలీస్ స్టేషన్కు వెళ్లాలంటేనే హడలిపోయేవారు. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యలు స్వీకరించాక పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆపదలో చిక్కుకున్న మహిళలు దిశ యాప్లో ఎస్వోఎస్ బటన్ నొక్కితే చాలు.. క్షణాల్లో పోలీసులు వచ్చి రక్షణ కల్పిస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్.. స్పందన ద్వారా ఆన్లైన్లో ఫిర్యాదు చేస్తే చాలు.. సమస్య ఇట్టే పరిష్కారమైపోతోంది.. సైబర్మిత్ర వాట్సాప్ నంబరుకు సమాచారం ఇస్తే చాలు.. సైబర్ వేధింపులకు అడ్టుకట్ట పడుతోంది. ప్రతి గ్రామ/ వార్డు సచివాలయంలోనే మహిళా పోలీసులు తోబుట్టువులా అందుబాటులో ఉంటున్నారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మహిళ మిత్ర గ్రూప్ సభ్యులు మేమున్నాంటున్నారు. పోలీస్ స్టేషన్లో సేవలన్నీ కూడా పోలీస్ సేవా యాప్ ద్వారా అరచేతిలోకి వచ్చాయి. పోలీస్ స్టేషన్కు వెళితే హెల్ప్ డెస్క్ సిబ్బంది సాదరంగా పలకరించి సమస్యను పరిష్కరిస్తున్నారు. దీంతో మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయగలుగుతున్నారు. మొత్తంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మహిళా భద్రత కోసం చిత్తశుద్ధితో అమలు చేస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాలు సత్ఫలితాన్నిస్తున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాలలో మహిళా పోలీసులు, దిశ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు వంటి విప్లవాత్మక రీతిలో వ్యవస్థాగత సంస్కరణలు, మౌలిక వసతుల కల్పన... మరోవైపు సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ దిశ యాప్, ఆన్లైన్లో ఫిర్యాదుల కోసం స్పందన పోర్టల్ వంటి అద్భుత ఆవిష్కరణలతో రాష్ట్రంలో కొత్త చరిత్రకు నాంది పలికారు. సత్వరమే దోషులకు శిక్ష పడేలా తగిన వ్యవస్థను ఏర్పాటు చేశారు. భద్రత దిశగా కీలక నిర్ణయాలు ► రాష్ట్రంలో ప్రత్యేకంగా 18 దిశ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు. ► గస్తీని పటిష్టం చేసేందుకు ప్రత్యేకంగా 900 స్కూటర్లు. ► దిశ గస్తీ కోసం రూ.16.60 కోట్లతో 145 మహింద్రా స్కార్పియో వాహనాలను కొనుగోలుకు నిర్ణయం. ► మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడ్డ రికార్డు ఉన్న 2,11,793 మందిని జియో ట్యాగింగ్ ద్వారా నిఘా. ► దాడులు, వేధింపులకు అవకాశం ఉన్న సున్నిత ప్రాంతాల మ్యాపింగ్. ► దిశ ఫోరెన్సిక్ ల్యాబ్లను ఏర్పాటు. 58 మంది ఫోరెన్సిక్ నిపుణుల పోస్టుల భర్తీ తక్షణ భద్రత.. వేగంగా దర్యాప్తు ► దిశ యాప్ ద్వారా ఇప్పటివరకు 3,68,771 కాల్ రిక్వెస్టులు వచ్చాయి. కొత్తగా యాప్ డౌన్లోడ్ చేసుకున్న వారు చేసే టెస్టింగ్ కాల్స్ను మినహాయిస్తే, 4,366 కాల్స్ చర్యలు తీసుకునేవి ఉన్నాయి. వాటిపై పోలీసులు సత్వరం స్పందించి తగిన చర్యలు తీసుకున్నారు. ► దిశ యాప్ ద్వారా నమోదు చేసిన కేసుల విచారణ పట్ల పోలీసు శాఖ ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. రికార్డు స్థాయిలో ఎఫ్ఐఆర్లు నమోదు చేసి, కేసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు 589 ఎఫ్ఐఆర్లు నమోదు కావడం విశేషం. ఇందులో మహిళల గౌరవానికి భంగం కలిగించినవి 149, భర్త వేధింపులకు సంబంధించి 118, మహిళలను అవమానించడంపై 77 కేసులున్నాయి. ► మహిళలపై నేరాలకు పాల్పడిన ఘటల్లో ఏడు రోజుల్లోనే 1,136 మందిపై చార్జిషీట్లు, 15 రోజుల్లో 2,265 చార్జిషీట్లు దాఖలు చేశారు. ► బాధితులు ఏ పోలీస్ స్టేషన్ నుంచి అయినా సరే ఫిర్యాదు చేసేందుకు జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తోంది. 2019లో 59, 2020లో 338, 2021లో ఇప్పటి వరకు 224 జీరో ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ► దిశ యాప్ విజయవంతం కావడంతో రాష్ట్రంలో బుధవారం నాటికి రికార్డు స్థాయిలో 53,75,075 మంది ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. ► స్పందన కార్యక్రమం/పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు 1,40,341 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 1.32 లక్షల కేసులను పరిష్కరించారు. లక్ష కేసులను కేవలం వారం రోజుల్లోనే పరిష్కరించడం విశేషం. 35,581 కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ► పోలీస్ సేవా యాప్తో 87 సేవలు అందిస్తున్నారు. ఒక ఫిర్యాదు నుంచి పరిష్కారం వరకు మొత్తం 24 ఎస్ఎంఎస్లు ఫిర్యాదుదారులకు ఇస్తుండటం పోలీసుల నిబద్ధతకు నిదర్శనం. ► సైబర్ మిత్ర వాట్సాప్ నంబరు 9121211100, సీఐడీ విభాగం వాట్సాప్ నంబరు 9701666667 ద్వారా కూడా ఫిర్యాదులకు అవకాశం కల్పించారు. ► గ్రామ, వార్డు సచివాలయాల్లో 15 వేల మంది మహిళా పోలీసులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో 10 మంది సభ్యులతో మహిళా మిత్ర బృందాలను ఏర్పాటు చేశారు. ► మహిళలపై దాడుల కేసుల్లో 148 మందిలో ముగ్గురికి ఉరి శిక్ష, 17 మందికి జీవిత ఖైదు, ముగ్గురికి 20 ఏళ్ల జైలు శిక్ష, 10 మందికి పదేళ్ల జైలు, మిగిలిన వారికి ఇతర శిక్షలు విధించారు. -
మహిళల రక్షణకై నిర్భయ స్క్వాడ్: ముంబై
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని సాకినాకలో మహిళపై పాశవికంగా హత్యాచారం చేసిన సంగతి తెసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ముంబై పోలీసులు నగరంలో మహిళల రక్షణ కోసం నిర్భయ స్క్వాడ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ స్క్వాడ్ టీంలో ఒక మహిళా ఆఫీసర్, పీఎస్ఐ లేదా ఏఎస్ఐ ఉంటారని తెలిపారు.(చదవండి: ముళ్లపందితో పోరులో పులి మృతి ) ఈ క్రమంలో ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక మహిళా భద్రతా సెల్(విమెన్ సేఫ్టీ సెల్) ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. మహిళల భద్రత సమీక్షించటం కోసం ప్రతినెల మొదటివారం నిర్భయ స్క్వాడ్ సమావేశాన్ని సంబంధిత ప్రాంతీయ అదనపు డివిజనల్ కమిషనర్ ఏర్పాటు చేస్తారని వెల్లడించారు. మహిళలపై నేరాలు ఎక్కువుగా జరిగే ప్రాంతాల్లో ఇలాంటి చర్యలు మరింత ముమ్మరం చేస్తామని ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నగ్రాలే తెలిపారు. (చదవండి: నిమిషాల వ్యవధిలో రెండు సార్లు వ్యాక్సిన్.. తట్టుకోలేక) -
రమ్య కుటుంబానికి ఐదు సెంట్ల ఇంటి స్థలం
గుంటూరు ఈస్ట్: మృగాడి చేతిలో హత్యకు గురైన రమ్య కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో ఐదు సెంట్ల నివేశన స్థలం మంజూరైంది. ఇంటి స్థలం పట్టాను శనివారం హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత పరమాయ కుంటలోని రమ్య నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు అందజేశారు. గుంటూరు రూరల్ మండలం ఏటుకూరు గ్రామంలోని 5 లే అవుట్లో స్థలాన్ని కేటాయించారు. ఈ సందర్భంగా మంత్రి సుచరిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతగానో స్పందించి.. రమ్య కుటుంబానికి అండగా అనేక చర్యలు చేపట్టారని చెప్పారు. రమ్య తల్లిదండ్రులు కోరిన విధంగా నిందితుడికి త్వరగా శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని వివరించారు. ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ప్రకారం రమ్య తల్లిదండ్రులకు త్వరలో ఐదెకరాల భూమిని ప్రభుత్వం అందజేస్తుందని స్పష్టం చేశారు. వచ్చే సంవత్సరం రమ్య సోదరి మౌనిక డిగ్రీ పూర్తవుతుందని, అయితే మానవీయ కోణంలో సీఎం సూచన మేరకు డిగ్రీ పూర్తికాక ముందే సాంఘిక సంక్షేమ శాఖలో ఉద్యోగం ఇచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రమ్య కుటుంబానికి అన్ని విధాలుగా పూర్తి స్థాయిలో సహాయం అందజేశాక, వారితో కలిసి టీ తాగుతానని సీఎం చెప్పారని వివరించారు. అందరూ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ప్రతి మహిళ, యువతి సహా పురుషులు సైతం ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని, అనుకోని ఘటనలు జరిగినప్పుడు పోలీసుల సాయం కోరవచ్చని హోం మంత్రి సూచించారు. మేడికొండూరు ఘటనలో పోలీసులు సమర్థవంతంగా విచారణ చేస్తున్నారని, ఆ విషయాలు బయటపెడితే నేరస్తుడు తప్పించుకునే అవకాశం ఉంటుందని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. రమ్య ఘటనలో సీఎం స్పందించిన తీరు తమందరి హృదయాల్లో నిలిచి పోతుందన్నారు. అట్రాసిటీ యాక్ట్లో పేర్కొన్న పరిహారం కన్నా ఎక్కువగా సహాయం చేయడం సీఎం గొప్పతనాన్ని చాటిందన్నారు. ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా.. అంటూ గత ప్రభుత్వ పెద్దలు చేసిన వ్యాఖ్యలు ఎవరూ మరచిపోలేదన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు షేక్ మొహమ్మద్ ముస్తఫా, మద్దాళి గిరిధర్, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ రాతంశెట్టి రామాంజనేయులు (లాలుపురం రాము), తూర్పు తహసీల్దారు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళల భద్రత కోసం ‘దిశ’ చట్టం: సుచరిత
సాక్షి, గుంటూరు: మహిళల భద్రత కోసం ‘దిశ’ చట్టం తీసుకొచ్చినట్లు హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. శాసనసభ, మండలిలో దిశ చట్టాన్ని ఆమోదించి కేంద్రానికి పంపాం.. కేంద్రం ఆమోదించగానే వెంటనే అమలు చేస్తామని పేర్కొన్నారు. దిశ యాప్తో ఇప్పటికే చాలామంది మహిళలను రక్షించినట్లు చెప్పారు. దిశ చట్టాన్ని కేంద్రం ఇంకా ఆమోదించలేదనే విషయం చంద్రబాబు నాయుడు, లోకేశ్ తెలుసని తెలిపారు. దిశ చట్టాన్ని అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. దిశ చట్టం కింద కొన్ని ప్రత్యేకమైన నేరాలు వస్తాయని ముందుగా లోకేష్ తెలుసుకోవాలని హితవు పలికారు. తెలుగుదేశం హయాంలో మహిళల రక్షణ ఏ విధంగా ఉందో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. చదవండి: నూతన విద్యా విధానం అమలుపై సిద్ధం కావాలి: సీఎం జగన్ విద్యాదీవెన, ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్లపై అప్పీల్కు వెళ్తాం.. -
మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చాం: హోంమంత్రి సుచరిత
-
నువ్వంటే క్రష్.. ‘ఓయో’లో కలుద్దామా: ఉద్యోగినికి బాస్ వేధింపులు
సాక్షి, హైదరాబాద్: మహిళలు, చిన్నారులపై వేధింపులు, అఘాయిత్యాల నివారణకు సైబరాబాద్ పోలీస్ విభాగం ప్రత్యేక దృష్టి సారించింది. ఐటీ పరిధిలో ఉద్యోగినులు కూడా వేధింపులకు గురవుతున్నాయి. తమ భవిష్యత్... సమాజంలో గౌరవం వంటి విషయాలతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోతున్నారు. అలాంటి వారి కోసం వాట్సప్ నంబర్తో ఫిర్యాదు స్వీకరించేందుకు సైబరాబాద్ పోలీసులు నిర్ణయించారు. ఆ వాట్సప్కు స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో వాట్సప్కు వచ్చిన ఫిర్యాదు చూస్తుంటే పని ప్రాంతాల్లో ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అర్థమవుతుంది. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ను కూడా సైబరాబాద్ మహిళ, చిన్నారుల రక్షణ వింగ్ ట్విటర్లో బహిర్గతం చేసింది. ఓ ఉద్యోగినికి వాట్సప్లో ఆమె బాస్ మెసేజ్ చేశాడు. హలో.. అంటూ ప్రాజెక్ట్ వర్క్పై మాట్లాడాడు. నీ పర్ఫామెన్స్ పూర్గా ఉందని చెప్పాడు. దీంతో ఆమె లేదు సార్ మొత్తం నేనే చేశానని చెప్పగా కాదు అని చెప్పాడు. దీంతో భయాందోళనకు గురయిన ఆమె నా భవిష్యత్ అంటూ వాపోయింది. హేం కంగారొద్దు.. నీకు ప్రమోషన్, జీతం పెంపు చేస్తా అని వరాలు కురిపించి కానీ అని గ్యాప్ ఇచ్చాడు. ఆ ‘కానీ’లో ఎంతో దురుద్దేశం దాగి ఉంది. (చదవండి: రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లెలు బంగారం అన్న చోరీ) కానీ ఏంటి సార్ అని అడగా అతడి వక్రబుద్ధి బయటపడింది. ఆమెను ఓయో రూమ్లో కలుద్దామని అడిగాడు. దీంతోపాటు మొదటి నుంచి నీపై క్రష్ ఉందని చెప్పాడు. దీనికి ఆ యువతి ‘క్షమించండి సార్’ అనగా సరే ‘నీ ప్రమోషన్, జీతం పెంపు విషయంలో కూడా సారీ’ అని ఆ బాస్ చెప్పేశాడు. అతడి స్పందనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ బాధితురాలు ‘నీ కెరీర్ను కాపాడుకో’ అంటూ పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం-2003 కింద కేసు నమోదు చేశా అని సమధానం చెప్పింది. అయితే అతడి వేధింపులు ఎప్పటి నుంచో ఉన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే అతడి పేరు డైనో‘సార్’ అని పెట్టుకోవడం చూస్తుంటే అర్థమవుతోంది. (చదవండి: ప్రో కబడ్డీకి పాలమూరువాసి: ఏ జట్టుకు ఆడనున్నాడంటే..?) ఈ చాట్కు సంబంధించిన స్క్రీన్షాట్ మహిళలకు కార్యాలయాల్లో కూడా భద్రత లేదని అర్థమవుతోంది. ‘నేను కూడా అలాంటి వాడిని కాదు. బట్.. నువ్వంటే క్రష్ ఉంది నాకు... ఫ్రమ్ ద ఫస్ట్ డే’ అని సైబరాబాద్ మహిళా, శిశు రక్షణ వింగ్ తన ఖాతాలో పోస్టు చేసింది. అయితే ఆ స్క్రీన్ షాట్ నిజమైన ఫిర్యాదా? లేక అవగాహన కల్పించేందుకు చేసిన చిత్రమా? అనేది తెలియలేదు. ఒకవేళ ఫిర్యాదు అయితే ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించలేదు. మహిళలను అప్రమత్తం.. అవగాహన కల్పించేందుకు సృష్టించిన చాటింగ్లా కనిపిస్తోంది. ఏది ఏమున్నా మహిళలు మీ రక్షణకు పోలీసులు ఉన్నారనే విషయం మరచిపోకండి. వేధింపులు ఎదుర్కొంటుంటే నేరుగా పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయలేకపోతే ఆన్లైన్లో కూడా చేయవచ్చు. మీ వివరాలను గోప్యంగా ఉంచుతారు. నేను కూడా అలాంటి వాడిని కాదు. But నువ్వంటే క్రష్ ఉంది నాకు... From the first day. #Dial100 #cyberabadsheteam #WomenSafety pic.twitter.com/LUpKRjucLa — Women & Children Safety Wing Cyberabad (@sheteamcybd) August 31, 2021 -
లోకేశ్ రచ్చ.. సామాన్య కుటుంబానికి శిక్ష
సాక్షి, అమరావతి: రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారుతామని ప్రతిపక్ష టీడీపీ మళ్లీ మళ్లీ రుజువు చేస్తోంది. అందుకోసం సామాన్య మహిళలు, కుటుంబాల పరువు ప్రతిష్టలను భంగపరచడానికి సైతం వెనుకాడని దుష్ట రాజకీయానికి పాల్పడుతోంది. దిశ వంటి పటిష్ట వ్యవస్థతో మహిళా భద్రతకు నిర్మాణాత్మక చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వానికి ప్రజల్లో మంచిపేరు రావడాన్ని ఏమాత్రం సహించలేకపోతోంది. గుంటూరులో ఓ విద్యార్థినిపై అత్యాచారం జరిగిందంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అవాస్తవ ప్రచారాన్ని ప్రముఖంగా లేవనెత్తడం.. దానికి టీడీపీ శ్రేణులు తానా తందాన అంటూ రాజకీయ లబ్ధికి తెగబడటం నివ్వెరపరుస్తోంది. తన రాజకీయ ప్రయోజనం కోసం ఇలా దుష్ప్రచారం చేయడం ద్వారా అభం శుభం తెలియని ఓ విద్యార్థిని అవమాన పరుస్తున్నానని, ఆమె కుటుంబాన్ని వీధిలోకి లాగుతున్నాననే కనీస ఇంగిత జ్ఞానం లోకేశ్కు లేకపోవడం విస్మయపరుస్తోంది. చదవండి: తాలిబన్ల దమనకాండ ఇదీ అసలు విషయం.. గుంటూరులో ఓ కానిస్టేబుల్ ఎంతగా వారిస్తున్నా తమ కుమార్తెతో చనువుగా మాట్లాడుతున్నారని ఆమె తల్లిదండ్రులు జిల్లా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్కు ఈ నెల 19న ఫిర్యాదు చేశారు. శారీరకంగా, మానసికంగా ఎలాంటి ఇబ్బందులకు గురి చేయలేదని చెప్పారు. తాము వారిస్తున్నా సరే మాట్లాడుతుండటం మాత్రమే తమ అభ్యంతరం అని స్పష్టంగా చెప్పారు. దీంతో ఆ కానిస్టేబుల్ను ఈ నెల 20న సస్పెండ్ చేశారు. అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించారు. ఈ నెల 21న ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. దీంతో ఆ విద్యార్థిని తల్లిదండ్రులు తమ సమస్య పరిష్కారమైందని పోలీసు ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. లోకేశ్ రాజకీయ రచ్చ... ఈ అంశాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేందుకు ఆ కానిస్టేబుల్ ఆ విద్యార్థినిని అత్యాచారం చేశాడంటూ నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడంతో అందరూ విస్తుపోయారు. దీనికి వంత పాడుతూ అత్యాచారం జరిగిందంటూ టీడీపీ అనుకూల పత్రికలు, టీవీ చానళ్లలో హడావుడి మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతూ ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. సాధారణంగా విద్యార్థినులు, యువతులు, మహిళలు ఎవరైనా వేధింపులకు గురైతే వారి పేర్లను మీడియాలో ప్రచురించరు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు పోలీసులు, న్యాయస్థానాలు, పత్రికలు ఈ నియమావళిని కచ్చితంగా పాటిçస్తూనే ఉన్నాయి. కానీ నారా లోకేశ్ ఈ కనీస సంస్కారాన్ని కూడా ప్రదర్శించ లేదు.చదవండి: ఐటీ పోర్టల్ లోపాలు.. ఇన్ఫోసిస్పై కేంద్రం గరం ఆ విద్యార్థినిపై అత్యాచారం జరగ లేదు.. ఆమె ఏ విధంగానూ వేధింపులకు గురికాలేదు.. కేవలం తల్లిదండ్రులు వద్దని చెప్పినా సరే ఆమెతో కానిస్టేబుల్ మాట్లాడారు. ఆ అంశాన్ని కూడా పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆమెపై అత్యాచారం జరిగిందని ప్రచారం చేస్తుండటంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. లోకేశ్ వైఖరితో తమ కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగిందని వాపోతున్నారు. లోకేశ్ తీరును రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం కూడా తీవ్రంగా ఖండించింది.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement