-
మారుతీ, హ్యుండై వాటా తగ్గింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్యాసింజర్ వాహన రంగంలో దేశవ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో రిటైల్లో రెండు ప్రధాన కంపెనీల మార్కెట్ వాటా తగ్గింది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) ప్రకారం.. మారుతీ సుజుకీ 2022–23లో 14,79,221 యూనిట్లతో 40.86 శాతం వాటాకు వచ్చి చేరింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో 12,39,688 యూనిట్లతో 42.13 శాతం వాటా నమోదు చేసింది. ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత ఎదుర్కొంటున్నామని, 3.8 లక్షల యూనిట్ల పెండింగ్ ఆర్డర్లు ఉన్నాయని కంపెనీ గతంలో వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో హ్యుండై మోటార్ ఇండియా 5,25,088 యూనిట్లతో 14.51 శాతం వాటాకు పరిమితమైంది. 2021–22లో కంపెనీ 4,79,027 యూనిట్లతో 16.28 శాతం వాటా పొందింది. ఇతర కంపెనీలు ఇలా.. టాటా మోటార్స్ మార్కెట్ వాటా 11.27 నుంచి 2022–23లో 13.39 శాతానికి ఎగబాకింది. విక్రయాలు 3,31,637 యూనిట్ల నుంచి 4,84,843 యూనిట్లకు చేరాయి. మహీంద్రా అండ్ మహీంద్రా వాటా 6.77 నుంచి 8.94 శాతానికి ఎగసింది. విక్రయాలు 1,99,125 నుంచి 3,23,691 యూనిట్లకు పెరిగాయి. కియా ఇండియా వాటా 5.3 నుంచి 6.42 శాతానికి, విక్రయాలు 1,56,021 నుంచి 2,32,570 యూనిట్లకు చేరాయి. టయోటా కిర్లోస్కర్ మోటార్, స్కోడా ఆటో, ఫోక్స్వ్యాగన్ గ్రూప్ సైతం మార్కెట్ వాటాను పెంచుకున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 1,435 ఆర్టీవోలకుగాను 1,349 కార్యాలయాల నుంచి ఈ సమాచారాన్ని సేకరించినట్టు ఎఫ్ఏడీఏ తెలిపింది. -
ఏసీ అమ్మకాలపై అకాల వర్షాల దెబ్బ
న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కనిపిస్తున్న అసాధారణ వర్షాలతో ఎయిర్ కండీషనర్ల (ఏసీలు) అమ్మకాలు తగ్గినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో ఫిబ్రవరి మధ్య నుంచి ఏసీల అమ్మకాలు పుంజుకున్నాయి. అయితే, ప్రస్తుత పరిస్థితులు తాత్కాలికమేనని, ఏప్రిల్ నుంచి ఏసీల అమ్మకాలు పెరుగుతా యనే అంచనాలు కంపెనీల్లో నెలకొన్నాయి. వర్షాలతో మార్చి రెండో వారంలో ఏసీల అమ్మకా లు తగ్గాయి. ఇది కొన్ని రోజుల పరిణామమేనని, తిరిగి ఏప్రిల్ ద్వితీయార్థం నుంచి పెరిగే ఉష్ణోగ్రతలతో డిమాండ్ గరిష్టానికి వెళుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. 2022లో మొత్తం మీద 82.5 లక్షల యూనిట్ల ఏసీలు అమ్ముడయ్యాయి. ప్రస్తుత సీజన్లో అమ్మకాల పరంగా రెండంకెల వృద్ధి ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఎల్నినో ప్రభావంతో వేసవి కాలం ఎక్కువ రోజుల పాటు ఉండొచ్చని, ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదు కావచ్చన్న అంచనాలు విక్రయాలకు మద్దతుగా నిలుస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొంత తగ్గాయి.. అకాల వర్షాలకు తమ ఏసీల అమ్మకాలు కొంత తగ్గాయని ప్యానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ తెలిపింది. ‘‘అయినప్పటికీ అధిక వేసవి కాలం ముందుంది. ఈ తరహా వాతావరణ ప్రతికూలతలు మరిన్ని లేకపోతే మాత్రం మా అమ్మకాల లక్ష్యాలను చేరుకుంటామనే నమ్మకం ఉంది’’అని ప్యానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా బిజినెస్ హెడ్ గౌరవ్ షా అన్నారు. అమ్మకాలు తగ్గితే అది 5–6 రోజులే ఉంటుందని డైకిన్ ఇండియా చైర్మన్, ఎండీ కేజే జావా తెలిపారు. దీని ప్రభావం పెద్దగా ఉండదన్నారు. పెంటప్ డిమాండ్ (గతంలో నిలిచిన) బలంగా ఉన్నందున బుల్లిష్గా ఉన్నట్టు చెప్పారు. ఈ ఏడాది ఏసీల మార్కెట్ 20 శాతం వృద్ధి చెందుతుందున్న అంచనాను వ్యక్తం చేశారు. అలాగే డైకిన్ ఏసీల అమ్మకాలు 30 శాతం పెరగొచ్చన్నారు. ఈ ఏడాది మొదటి రెండు నెలల్లో ఏసీల అమ్మకాలు పెరగడం గమనార్హం. దీంతో రిటైలర్లు నిల్వలను పెంచుకున్నారు. ప్రస్తుత వర్షాలు తమ వ్యూహాత్మక విధానాన్ని మార్చుకునేందుకు సరైన సమయం ఇచ్చినట్టు హయర్ అప్లయెన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ సతీష్ ఎన్ఎస్ పేర్కొన్నారు. వచ్చే కొన్ని వారాల్లో వాతావరణ పరిస్థితులు సాధారణంగా మారతాయని, ఏసీలు, రిఫ్రిజిరేటర్ల అమ్మకాలు పెరుగుతాయని భావిస్తున్నట్టు చెప్పారు. ఇండోర్, గృహ కూలింగ్ ఉత్పత్తులు తప్పనిసరిగా పేర్కొన్నా రు. మార్కెట్ ధోరణులు చూస్తుంటే 30–40 శాతం మేర అమ్మకాలు పెరగొచ్చని, ఏసీలు, రిఫ్రిజిరేటర్ల మార్కెట్లో హయర్ ఈ మేర ప్రగతి సాధిస్తుందని చెప్పారు. విక్రయాలు తగ్గాయని, అయినా ఇది తాత్కాలికమేనని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అప్లయ న్సెస్ మ్యానుఫాక్చరర్స్ అసోసియేషన్ (సీఈఏఎంఏ) పేర్కొంది. ఈ ఏడాది మేలో తీవ్రమైన వేసవి సీజన్ను చూస్తామని, నివేదికలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నట్టు సీఈఏఎంఏ ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజ తెలిపారు. మరో వారం రోజుల తర్వాత నుంచి ఉష్ణోగ్రతలు పెరగడం మొదలవుతాయని, అమ్మకాలు కూడా పుంజుకుంటాయని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఏప్రిల్లో తీవ్ర ప్రతికూలతలు ఎదురైతే తప్ప అమ్మకాలపై పెద్దగా ప్రభావం ఉండబోదన్నారు. ‘‘మొత్తం మీద వేసవి అమ్మకాలపై ఇప్పుడే అంచనాకు రావడం తొందరపాటు అవుతుంది. దేశవ్యాప్తంగా వేసవి విక్రయాలు జూన్, జూలై వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతాయి’’అని వోల్టాస్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. చానల్ భాగస్వాములు కూలింగ్ ఉత్పత్తులను ముందుగా నిల్వ చేసి పెట్టుకోవాలని, అప్పుడు పెరిగే ఉష్ణోగ్రతలతో ఒక్కసారిగా డిమాండ్ వచ్చి నా, ఎదుర్కోవడానికి ఉంటుందన్నారు. -
Tech layoffs మరో టాప్ కంపెనీ నుంచి 6650 ఉద్యోగులు ఔట్!
సాక్షి,ముంబై: టెక్ ఉద్యోగులకు మరో చేదు వార్త. గ్లోబల్ ఆర్థిక మాంద్యం భయాలు, ఆదాయాల క్షీణత పలు టెక్ కంపెనీ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. దీంతో ఖర్చుల నియంత్రలో భాగంగావేలాది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో కంప్యూటర్ల సంస్థ డెల్ నిలిచింది. పీసీ అమ్మకాలు పడిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6,650 ఉద్యోగాలను తొలగించనుంది. ఈ మేరకు కంపెనీ ఉద్యోగులకు ఈమెయిల్ సమాచారం అందించింది. బ్లూమ్బెర్గ్ కథనం ప్రకారం మొత్తం సిబ్బందిలో 5 శాతం ఉద్యోగులను ఉద్వాసన పలుకుతోంది. కంపెనీ మార్కెట్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందనీ ఈ అనిశ్చితి భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని కో-చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ క్లార్క్ ఉద్యోగులకు తెలిపారు. కోవిడ్ సంక్షోభం తరువాత, కంప్యూటర్లు ఇతర హార్డ్వేర్ ఉత్పత్తుల డిమాండ్ పెరిగి నప్పటికీ 2022 నాల్గవ త్రైమాసికంలో వ్యక్తిగత కంప్యూటర్ షిప్మెంట్లు బాగా పడిపోయాయని పరిశ్రమ విశ్లేషకులు అంటున్నారు. ప్రధానంగా డెల్ కంపెనీ అమ్మకాలు భారీ క్షీణించాయని ఐడీసీ పేర్కొంది. తొలగింపుల తర్వాత, డెల్ ఉద్యోగుల సంఖ్య కనీసం ఆరేళ్లలో కనిష్టంగా 1,26,300గా ఉంటుందని బ్లూమ్బెర్గ్ నివేదించింది. కాగా 2021లో ఇదే కాలంతో పోలిస్తే డెల్ తన పర్సనల్ కంప్యూటర్ షిప్మెంట్లలో 37 శాతంతో అతిపెద్ద క్షీణతను నమోదు చేసింది. డెల్ ఆదాయం దాదాపు 55 శాతం పీసీల నుంచే వస్తుంది. -
ఆ ఐఫోన్ను కొనే దిక్కులేదు!..తయారీ నిలిపేసిన ‘యాపిల్’!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ ఐఫోన్ 14 ప్లస్పై పెట్టుకున్న అంచనాలు తారుమారయ్యాయి. డిమాండ్ లేకపోవడంతో ఫోన్ల తయారీని నిలిపివేయాలని మ్యానిఫ్యాక్చరింగ్ సంస్థలకు యాపిల్ ఇప్పటికే సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఐఫోన్ 14సిరీస్లోని ప్లస్తో పాటు గతంలో కొనుగోలు దారుల్ని అంతగా ఆకట్టుకోని ఫోన్లను సైతం ఇలాగే నిలిపి వేసింది. సెప్టెంబర్ 16న అమెరికా క్యాలిఫోర్నియా యాపిల్ ప్రధాన కార్యాలయం క్యూపర్టినో వేదికగా యాపిల్ సంస్థ ఐఫోన్ 14 ను విడుదల చేసింది. గత నెలలో ఐఫోన్ 14 ప్లస్ సేల్ ప్రారంభించింది. అయితే ఈ సేల్లో 6.7 అంగుళాల డిస్ప్లే, సింగిల్ ఛార్జ్తో ఎక్కువ రోజులు ఫోన్ను వినియోగించే సామర్ధ్యం ఉన్న ఈ ఫోన్ అమ్మకాలు ఊహించని విధంగా జరుగుతాయని యాపిల్ అంచనా వేసింది. వాస్తవానికి నిపుణులు సైతం పెద్ద డిస్ప్లే ఫోన్లకు డిమాండ్, తక్కువ ధర ($899) దానికి తోడు హాలిడేస్ రావడంతో ఐఫోన్ 14 ప్లస్ సేల్స్ జరుగుతాయని అనుకున్నారు. కానీ యాపిల్, నిపుణుల అంచనాలు తారుమారయ్యాయి. పెద్ద స్క్రీన్ ఫోన్ను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఇంటస్ట్ర్ చూపించలేదు. దీంతో యాపిల్ తన ఐఫోన్ 14ప్లస్ ప్రొడక్షన్ను తగ్గించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. యాపిల్ సంస్థ ఈ ఏడాది ప్రారంభంలో 900 లక్షల యూనిట్ల ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లను తయారీ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఊహించిన దానికంటే 30 లక్షల ఫోన్ల తయారీని తగ్గించాలని భావిస్తోంది. యాపిల్ సంస్థ, ఐఫోన్లను సప్లయి చేసే సంస్థలు ఇప్పుడు 870 లక్షల యూనిట్లు లేదా అంతకంటే తక్కువగా తయారు చేయాలని భావిస్తున్నారు.సేల్స్ లేకపోవడంతో ఐఫోన్ 14లోని ఐఫోన్ 14, 14 ప్లస్ మోడళ్ల ప్రొడక్షన్ను తగ్గించనుందని నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. డిమాండ్ లేకపోవడంతో సేల్స్ తగ్గినప్పటికీ యాపిల్ గతంలోనే ఈ లేటెస్ట్ వెర్షన్ ఫోన్ల తయారీని భారీగా తగ్గించింది. గతంలో ఐఫోన్8, ఐఫోన్ 12 మినీ మోడల్ ఫోన్లు ఆకట్టుకోకపోవడంతో తయారీని తగ్గించేసింది. చదవండి👉 ‘ఐఫోన్’ పరువు తీసిన యాపిల్ బాస్ కూతురు, సమర్ధించిన టిమ్ కుక్ -
మరీఘోరంగా టూ వీలర్స్ అమ్మకాలు
November 2021 Record Lowest wholesales In automobile industry Due To Chip Shortage: ఆటోమొబైల్ రంగంలో మునుపెన్నడూ లేనంత తీవ్ర ప్రతికూల పరిస్థితులు నడుస్తున్నాయి ఇప్పుడు. దాదాపు పదకొండేళ్ల తర్వాత ఒక నెలలో ద్విచక్ర వాహనాలు రికార్డు స్థాయిలో తక్కువగా అమ్ముడుపోవడం విశేషం. అంతేకాదు దాదాపు ఏడేళ్ల తర్వాత ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకాల్లోనూ ఇదే ప్రతికూల ప్రభావం కనిపిస్తోంది. 2021 నవంబర్ నెల ఆటోమొబైల్ రంగానికి అచ్చి రాలేదు. ఓవైపు పండుగ సీజన్ కొనసాగినా.. ఊహించినంత వాహన అమ్మకాలు లేకపోవడం విశేషం. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చురర్స్ (SIAM) నివేదికల ప్రకారం నవంబర్ నెలలో.. ప్యాసింజర్ వెహికిల్ అమ్మకాల మొత్తం 18.6 శాతం పడిపోయింది. అదే విధంగా టూ వీలర్స్ ఏకంగా 34 శాతం తగ్గింది. కిందటి ఏడాదితో పోలిస్తే ఈ డౌన్ఫాల్ దారుణంగా నమోదు అయ్యింది. ►ప్యాసింజర్ వెహికిల్స్ ఈ నవంబర్లో 2, 15, 626 యూనిట్లు అమ్ముడుపోగా.. కిందటి ఏడాది ఆ సంఖ్య 2, 64, 898గా ఉంది. ఇక ఉత్పత్తి కూడా 9.5 శాతం పడిపోయింది (2,94,596 యూనిట్ల నుంచి 2,66,552కి). ►టూ వీలర్స్ ఈ నవంబర్లో 10, 50, 616 యూనిట్లు మాత్రమే సేల్ అయ్యాయి. కిందటి ఏడాది నవంబర్లో ఈ సంఖ్య 16 లక్షల యూనిట్లకు పైనే ఉంది. ఇక ఉత్పత్తి కూడా 29 శాతం పడిపోయి.. పదకొండేళ్ల తర్వాత పతనం నమోదు చేసుకుంది. 19, 36, 793 యూనిట్లకు గానూ 13, 67, 701 యూనిట్లను ఉత్పత్తి పడిపోయింది. ►ఇక త్రీ వీలర్స్ విషయానికొస్తే.. ఈ నవంబర్లో 6.64 శాతం క్షీణత కనిపిస్తోంది. 22, 471 యూనిట్లు అమ్ముడుపోగా.. కిందటి ఏడాది ఆ సంఖ్య 24, 071 యూనిట్లుగా ఉంది. ఉత్పత్తి మాత్రం 6 శాతం పడిపోయింది. 65, 460 యూనిట్ల నుంచి 61, 451 యూనిట్లకు పడిపోయింది. పెరిగిన ఎగుమతి.. అమ్మకాల సంగతి ఎలా ఉన్నా.. ఎగుమతుల విషయంలో మాత్రం కంపెనీలు అస్సలు తగ్గట్లేదు. మొత్తంగా ఈ మూడు కేటగిరీలను పరిశీలిస్తే.. ప్యాసింజర్ వెహికిల్స్లో 15.5 శాతం పెరుగుదల (44, 265 యూనిట్లు), టూ వీలర్స్లో 9 శాతం (3, 56, 659 యూనిట్లు), త్రీ వీలర్స్లో 14 శాతం (42, 431 యూనిట్లు) ఎగుమతి శాతం పెరిగింది. కారణం.. సెమీ కండక్టర్ల కొరత. కరోనా సమయంలో చిప్ ఉత్పత్తి ఫ్యాక్టరీలు మూతపడి.. ఈ ప్రభావం ఏడాది తర్వాత కూడా వెంటాడుతోంది. చిప్ల సమస్య కారణంగా ఉత్పత్తి.. డెలివరీలు దెబ్బతింటోంది. మన దేశంలోనే కాదు.. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇదే సమస్యను ఎదుర్కొంటోంది. అయితే నవంబర్లో అదీ పండుగ సీజన్లో ఈ రేంజ్ ప్రతికూల ప్రభావం చూడడం 19 ఏళ్లలో ఇదే తొలిసారి అని సియామ్(SIAM) డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ చెప్తున్నారు. ముఖ్యంగా త్రీ వీలర్స్ అమ్మకాలు మరీ దారుణంగా ఉన్నాయని చెప్తున్నారాయన. చదవండి: గూగుల్, యాపిల్ను తలదన్నే రేంజ్ ప్లాన్.. 17 బిలియన్ డాలర్లతో చిప్ ఫ్యాక్టరీ -
చిప్ చిన్నదే.. కానీ దాని ఎఫెక్ట్ చాలా పెద్దది
ముంబై: పండుగ సీజన్పై గంపెడు ఆశలు పెట్టుకున్న ఆటో కంపెనీలకు నిరాశ ఎదురైంది. పరిశ్రమను సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ చిప్ల కొరత వేధించడంతో సెప్టెంబర్ విక్రయాల్లో క్షీణత నమోదైంది. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రాతో సహా ఆటో పరిశ్రమలో పలు కంపెనీల విక్రయాలు తగ్గాయి. సమీక్షించిన నెలలో మారుతీ సుజుకీ 86,380 యూనిట్ల వాహనాలను అమ్మగా.. గతేడాది సెప్టెంబర్లో మొత్తం 1,60,442 యూనిట్లను విక్రయించింది. ‘‘ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత కారణంగానే సెప్టెంబర్ అమ్మకాలు తగ్గాయి. ఈ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటాము’’ అని మారుతీ తెలిపింది. ఇదే నెలలో హ్యుందాయ్ మోటార్ అమ్మకాలు 23 శాతం క్షీణించి 45,791 వాహనాలకు చేరాయి. అయితే వార్షిక ప్రాతిపదికన టాటా మోటార్స్, ఎంజీ మోటార్స్, నిస్సాన్ మోటార్స్ విక్రయాలు వరుసగా 26%, 28%, 100% చొప్పున వృద్ధిని సాధించాయి. చదవండి: జియోకు కొత్త చిక్కులు,పెరగనున్న 'జియో నెక్ట్స్' ఫోన్ ధరలు? -
బంగారం ధరలు: మరింత ప్రియం!
Gold Rates Increase: బంగారం ధర ఆకాశాన్నంటింది. దీంతో కొనుగోళ్లు లేక అమ్మకందారులు గత 6 నెలల నుంచి అందోళన చెందుతున్నారు. దీనికి తోడు వివిధ షాపింగ్ మాల్స్లో రెడిమెడ్ బంగారు అభరణాలు అందుబాటులో ఉండటంతో ప్రజలు అటువైపు మొగ్గు చూపుతున్నారు. శ్రావణమాసంలో అనేక పెండ్లిళ్లు శుభకార్యాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు భారీగా ఉంటాయని ఊహించిన అమ్మకందారులు నిరాశ చెందుతున్నారు. గత రెండేళ్ల నుంచి కరోనా, లాక్డౌన్, ఆన్సీజన్ తదితర కారణాలతో బంగారు అమ్మకాలు భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్లో గత ఐదు రోజుల నుంచి జిల్లా బులియన్ మార్కెట్లో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,500 ఉంది. వెండి రూ. కిలో 64,100 నడుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడిరేటు పైకి చేరడంతో దేశీయ మార్కెట్లోను ఇదే ట్రెండ్ కొనసాగుతుందని బులియన్మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. బ్యాంకులు బంగారంపై తక్కువ రేటుకు రుణాలుస్తున్నాయి. రానున్న రోజులలో బంగారం ధరలు రూ. తులం 50వేలు చేరుకునే అవకాశం ఉందని అమ్మకందారులు చెబుతున్నారు. తగ్గిన అమ్మకాలు 2020 మార్చిలో కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో చాలా వ్యాపారాలు కుదేలయ్యాయి. దీంతో కొంత మంది ఉపాధి కోల్పొగా... కొంత మంది వేతన కోతలను ఎదుర్కొన్నారు. చిన్న వ్యాపారస్తులు తనాఖ పెట్టి తీసుకున్న రుణాలతో ప్రతికూల పరిస్థితులను అధిగమించే ప్రయత్నం చేశారు. మరికొంత మంది శుభకార్యాల కోసమని తక్కువ మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేశారు. దీంతో అమ్మకాలు ఆశించిన విధంగా జరుగక వ్యాపారులు అందోళన చెందుతున్నారు. పెరిగే అవకాశం ఉంది బులియన్ మార్కెట్లో బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయి. దీంతో రానున్న దసరా, దీపావళి పండుగకు 10గ్రాముల, 24 క్యారెట్ల బంగారం రూ. 50వేలకు పైగా పెరిగే అవకాశం ఉంది. పండుగలతో సంబంధం లేకుండా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డిమాండ్ బాగా ఉంది. – చిలుక ప్రకాష్, బంగారం వ్యాపారి, కుమార్గల్లి అవసరానికే కొనుగోళ్లు కరోనా, ఈ మధ్య కాలంలో శుభకార్యాలకు ముహూర్తాలు లేకపోవడంతో బంగారం కొనుగోళ్లు భారీగా తగ్గాయి. షాపింగ్మాల్స్లలో రెడిమెడ్ బంగారు అభరణాలు లభిస్తుండటంతో అవసరానికి అక్కడ అభరణాలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఈ వృత్తిని నమ్ముకున్నవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. – శ్రీనివాస్, బంగారం అమ్మకందారుడు రెడీమేడ్ ఆర్నమెంట్స్పై మక్కువ బంగారాన్ని కొనుగోలు చేసి అభరణాలను తయారుచేయడం ఇబ్బందిగా మారింది. దీంతో అనేక మంది ఆర్నమెంట్ బంగారం వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. బంగారం ధరలు భారీగా పెరగడం అందోళన కలుగజేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ధరలను నియంత్రిచాలి. పెరుగుతున్న ధరలను తగ్గించాలి. – శారద, గృహిణి, ప్రగతినగర్ చదవండి : యస్.. మేం ఆన్లైన్ బానిసలం -
ఫ్యాషన్ మార్కెట్ ఢమాల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 సెకండ్ వేవ్ అన్ని రంగాలనూ దెబ్బ తీసింది. ముఖ్యంగా ఫ్యాషన్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. మొదటి వేవ్ నుంచి పరిశ్రమ కోలుకుంటున్న సమయంలో సెకండ్ వేవ్ ఒక్కసారిగా ముంచెత్తడంతో విక్రయాలు ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. దుస్తులు, పాదరక్షలు, సుగంధ పరిమళాలు, చేతి గడియారాలు, లెదర్ వస్తువులు, యాక్సెసరీస్.. వస్తువు ఏదైనా గతంలో వీటి కోసం ఇబ్బడిముబ్బడిగా ఖర్చు చేసిన కస్టమర్లు ఇప్పుడు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. విక్రయాలు తగ్గడంలో వర్క్ ఫ్రం హోమ్ ప్రభావమూ ఉంది. అత్యవసరాలకే ప్రాధాన్యత.. మహమ్మారి లక్షలాది కుటుంబాలను ఆర్థిక కష్టాల్లోకి నెట్టింది. దీంతో ప్రజలు అత్యవసరాలకే ప్రాధాన్యత ఇస్తుండడంతో ఫ్యాషన్ మార్కెట్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. సెకండ్ వేవ్ దెబ్బకు దాదాపు 49 శాతం మంది ఆర్థిక కష్టాలతో సావాసం చేస్తున్నట్లు వే2న్యూస్ ఇటీవలి సర్వేలో తేలింది. విపరీతంగా పెరిగిన ఆస్పత్రి ఖర్చులు, ఉద్యోగాలు కోల్పోవడం, సరైన వేతనాలు లేక, జీతాల్లో కోత పడటంతో కొనుగోలు శక్తి తగ్గిందని కస్టమర్లు తెలిపారు. పౌష్టికాహారం, ఇంటి అవసరాలు, పరిశుభ్రత ఖర్చులు పెరిగినట్లు వారు చెప్పారు. ఫ్యాషన్ రంగంలోని రిటైలర్లకు కోవిడ్–19 ముందస్తు స్థాయి రికవరీకి రెండేళ్లు పడుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఇటీవలి తన నివేదికలో వెల్లడించింది. డిసెంబర్ త్రైమాసికంలో 70 శాతం అమ్మకాలు నమోదు చేసిన పరిశ్రమ.. మార్చి నుంచి ఒక్కసారిగా కరోనా కేసులు పెరగడంతో కుప్పకూలిందని తెలిపింది. రద్దు అవుతున్న ఆర్డర్లు.. సాధారణ విక్రయాలతో పోలిస్తే ఏప్రిల్లో అమ్మకాలు 25 శాతం లోపే నమోదయ్యాయని క్లాతింగ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. 50 శాతంపైగా ఆర్డర్లు రద్దు అయ్యాయని, బాకీలు 25 శాతంలోపే వసూలు అవుతున్నాయని వెల్లడించింది. దీనినిబట్టి రిటైల్ మార్కెట్లో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. లెనిన్ దుస్తులు, పర్ఫ్యూమ్స్, లెదర్ వస్తువులు, యాక్సెసరీస్ అమ్మకాలు దాదాపు లేనట్టేనని విక్రేతలు అంటున్నారు. దుస్తుల అమ్మకాలు 10–15 శాతం మించట్లేదని వారు అంటున్నారు. రెండేళ్ల వరకు పరిశ్రమకు ఇబ్బంది తప్పదని సీఎంఆర్ షాపింగ్ మాల్స్ చైర్మన్ మావూరి వెంకటరమణ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. వ్యయాలను నియంత్రించడం ద్వారా నష్టాలను తగ్గించుకోవడం తప్ప మరో మార్గం లేదన్నారు. చిన్న బ్రాండ్స్ కనుమరుగు.. దేశంలో ఫ్యాషన్ మార్కెట్లో తయారీతోపాటు విక్రయంలో 10 శాతం కంపెనీలు ఉన్నట్టు సమాచారం. 90 శాతం కంపెనీలు మార్కెటింగ్కే పరిమితమయ్యాయి. ఇక బ్రాండ్ ఔట్లెట్ల విషయంలో కంపెనీల నిర్వహణలో 35 శాతం దుకాణాలు ఉన్నాయి. మిగిలినవి ఫ్రాంచైజీలు నిర్వహిస్తున్నారు. బ్రాండ్ వాల్యూ, బ్రాండ్ ఈక్విటీ, ప్రకటనల వాటా, ప్రమోషన్స్ పేరుతో లక్షలాది రూపాయలు ఫ్రాంచైజీలు చెల్లించుకోవాలి. ఇంత పెద్ద మొత్తంలో వ్యయం చేసి ఔట్లెట్లను తెరిచిన ఫ్రాంచైజీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నగదు చెల్లించి కొనుగోలు చేసిన స్టాక్ అమ్ముడుపోకుండా పేరుకుపోయాయి. కస్టమర్లు ఆన్లైన్కు మళ్లడం, ఆఫ్లైన్ సేల్స్ లేకపోవడం, అద్దెల భారంతో వర్తకులు నష్టాలను మూటగట్టుకుంటున్నారని రిటైల్ రంగ నిపుణులు కలిశెట్టి నాయుడు తెలిపారు. సెకండ్ వేవ్ ప్రభావంతో చిన్న బ్రాండ్స్ కనుమరుగు అవుతాయని అన్నారు. నష్టాలను భరించగలిగే విక్రేతలు మాత్రమే నిలదొక్కుకుంటారని చెప్పారు. -
Air Cooler Sales: ఏసీల విక్రయాలు ఢమాల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్ కండీషనర్స్ (ఏసీ), రిఫ్రిజిరేటర్ల విక్రయాలపై కరోనా–19 ఎఫెక్ట్ పడింది. అమ్మకాలు పడిపోవడం వరుసగా ఇది రెండవ ఏడాది. వైరస్ వ్యాప్తి చెందడం, లాక్డౌన్స్ కారణంగా అత్యంత కీలకమైన వేసవి సీజన్లో సేల్స్ లేకపోవడం పరిశ్రమకు కోలుకోలేని దెబ్బపడింది. 2019తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్లో అమ్మకాలు 75 శాతం పడిపోయాయని తయారీ సంస్థలు చెబుతున్నాయి. ఇక మే నెలలో విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో వినియోగదార్లలో సెంటిమెంట్ పడిపోవడం పరిస్థితిని మరింత దిగజార్చిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. కోవిడ్–19 తగ్గే వరకు ఖర్చులను నియంత్రించుకోవాలన్నది కస్టమర్ల భావనగా ఉందని చెబుతున్నాయి. భారత్లో గృహాల్లో వినియోగించే ఏసీల వార్షిక మార్కెట్ 70–75 లక్షల యూనిట్లు. 15కు పైగా కంపెనీలు పోటీపడుతున్నాయి. గతేడాది నుంచీ కష్టాలే.. భారత్లో ఏసీలు, రిఫ్రిజిరేటర్ల విక్రయాలు 2020 ఏప్రిల్లో పూర్తిగా నిలిచిపోయాయి. 2019తో పోలిస్తే గతేడాది మే నెలలో 10 శాతానికే అమ్మకాలు పరిమితమయ్యాయి. జూన్లో 25 శాతం జరిగాయి. ఇక ఈ ఏడాది ఏప్రిల్లో సేల్స్ 75 శాతం పడిపోయాయి. లాక్డౌన్స్, కర్ఫ్యూలతో మే నెల అమ్మకాలు పూర్తిగా కనుమరుగు అయినట్టేనని పరిశ్రమ చెబుతోంది. సంవత్సరం పొడవునా జరిగే ఏసీ, రిఫ్రిజిరేటర్ల విక్రయాల్లో ఏప్రిల్–జూన్ వాటా 35 శాతం దాకా ఉంటుంది. దేశంలో కేవలం 15 శాతం మార్కెట్ మాత్రమే తెరిచి ఉందని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, అప్లయెన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కమల్ నంది తెలిపారు. స్టోర్లకు వచ్చే వినియోగదార్లు అతి తక్కువ అని వివరించారు. ముడి సరుకు భారం అవుతున్నందున ఏసీల ధరలు 8 శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే వీటి ధరలు 12 శాతం వరకు అధికమయ్యాయి. లాక్డౌన్స్ ముందు వరకు ఏసీల డిమాండ్ ఉన్నప్పటికీ చిప్ కొరతతో సరఫరా 10 శాతమే ఉందని ఐటీ మాల్ ఎండీ మొహమ్మద్ అహ్మద్ తెలిపారు. అంచనాలు తారుమారయ్యాయి.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి ఉంటుందని భావించినట్టు వోల్టాస్ తెలిపింది. సెకండ్ వేవ్, పరిమితుల కారణంగా లక్ష్యాలను పునర్ పరిశీలించుకోవాల్సి వస్తోందని వివరించింది. తొలి త్రైమాసికం అమ్మకాలు తుడిచిపెట్టుకు పోయినట్టేనని ఆందోళన వ్యక్తం చేసింది. 2019లో సాధించిన విక్రయాలు ఈ ఏడాది కూడా నమోదు చేస్తే అదే ఎక్కువ అని దైకిన్ అంటోంది. మార్చిలో ఏసీ సేల్స్ సానుకూలంగా ప్రారంభమయ్యాయని ప్యానాసోనిక్ ఇండియా సీఈవో మనీష్ శర్మ తెలిపారు. ఒక్కసారిగా కోవిడ్ కేసులు అధికం కావడం, పాక్షిక లాక్డౌన్లతో వేసవి అమ్మకాలు క్షీణించాయని చెప్పారు. ఏప్రిల్–జూన్ కాలంలో 50% నష్టం అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు. స్టాక్ సరిపడ ఉందని గుర్తు చేశారు. లాక్డౌన్స్, కర్ఫ్యూలు జూన్ వరకే ఉంటాయి. అయితే అప్పటికే సీజన్ పూర్తి అవుతుందని హాయర్ అభిప్రాయపడింది. కీలకమైన మే నెలలో సేల్స్ సాధించకపోతే తరువాత చేయలేమని వివరించింది. గతేడాది జూలై, ఆగస్టులో మార్కెట్ పుంజుకుంది. ఈ ఏడాది అటువంటి పరిస్థితి లేదు అని హాయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా తెలిపారు. -
ప్రీ–కోవిడ్ స్థాయికి పెట్రోల్ డిమాండ్
న్యూఢిల్లీ: కరోనా ప్రభావంతో దారుణంగా పడిపోయిన పెట్రోల్ డిమాండ్ క్రమంగా పెరుగుతుంది. ఆరోగ్య భద్రతల దృష్ట్యా ప్రయాణికులు ప్రజా రవాణా కంటే వ్యక్తిగత రవాణాకే ప్రాధాన్యత ఇస్తున్నందున ఈ సెప్టెంబర్ ప్రథమార్థంలో పెట్రోల్ అమ్మకాలు పెరిగాయి. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్ అమ్మకాలు ప్రీ–కోవిడ్ స్థాయిని అందుకున్నాయని ప్రిలిమినరీ ఇండస్ట్రీ గణాంకాలు చెబుతున్నాయి. ఈ సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు అమ్మకాలు 9.45లక్షల టన్నులుగా ఉన్నాయి. గతేడాది ఇదే కాలంలో నమోదైన 9లక్షల విక్రయాలతో పోలిస్తే ఇది 2.2శాతం అధికం. ఇక నెలవారీ పరిశీలిస్తే ఆగస్ట్ 1–15 మధ్య మొత్తం అమ్మకాలు 9లక్షల టన్నులుగా ఉన్నాయి. కరోనా ప్రేరేపిత లాక్డౌన్ విధింపు(మార్చి 25)తర్వాత ఈ స్థాయిలో అమ్మకాలు పెరగడం ఇదే తొలిసారి. మరోవైపు డీజిల్కు డిమాండ్ పెరగడం లేదు. సమీక్షించిన కాలంలో వార్షిక ప్రాతిపదిక డీజిల్ అమ్మకాలు 6శాతం క్షీణత నమోదు చేశాయి. ఇక నెలవారీగా ఆగస్ట్తో పోలిస్తే అమ్మకాలు 19.3శాతం పెరిగాయి. అదే విధంగా వార్షిక ప్రాతిపదికన జెట్ ఫ్యూయల్ అమ్మకాలు 60శాతం క్షీణత చవిచూడగా, ఎల్పీజీ గ్యాస్ అమ్మకాలు 12.5శాతం వృద్ధిని సాధించాయి. కార్ల అమ్మకాలు 14శాతం పెరగ్గా, ద్విచక్ర వాహన అమ్మకాలు 3శాతం తగ్గాయి. లాక్డౌన్ సడలింపులతో భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా గాడిలో పడుతుంది. అయితే రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు పరిమితులతో కూడిన లాక్డౌన్ విధింపులు డిమాండ్ పుంజుకునేందుకు ఆటంకాన్ని కల్గిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అన్లాక్ ప్రక్రియతో డిమాండ్ రికవరీ సంకేతాలు కన్పిస్తున్నాయని అయితే నెలవారీ వినియోగ వృద్ధిని అధిగమించేందుకు ఈ ఏడాది చివరి వరకు పట్టవచ్చని ఐఓసీ చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య అన్నారు. -
ప్యాసింజర్ వాహన అమ్మకాల్లో 25% క్షీణత
అటో పరిశ్రమను కరోనా సంక్షోభం వెంటాడుతూనే ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జూలైలో ప్యాసింజర్ వాహనాల విక్రయాలు భారీగా క్షీణించాయి. ఈ జూలైలో ప్యాసింజర్ వాహనాల రిటైల్ అమ్మకాలు 1,57,373 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది(2019)లో ఇదే జూన్లో అమ్ముడైన 2,10,377 యూనిట్లతో పోలిస్తే 25శాతం తక్కువని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. కరోనా ఎఫెక్ట్ జూలైలోనూ కొనసాగడం వాహన విక్రయాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు ఎఫ్ఏడీఏ చెప్పుకొచ్చింది. ద్విచక్ర వాహన అమ్మకాలు జూలైలో 37.47శాతం క్షీణించి 8,74,638 యూనిట్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే జూలైలో మొత్తం అమ్మకాలు 13,98,702 యూనిట్లుగా ఉన్నాయి. వాణిజ్య వాహన అమ్మకాలు ఏకంగా 72.18శాతం పడిపోయి 19,293 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇదే జూలైలో త్రిచక్ర వాహనాల విక్రయాలు క్షీణతను చవిచూశాయి. గతేడాది జూలైలో పోలిస్తే అమ్మకాలు 74.33శాతం పతనమై 15,132 యూనిట్లుగా నమోదయ్యాయి. అన్ని విభాగాలు కలిపి మొత్తం అమ్మకాలు 11,42,633 యూనిట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే నెలలో నమోదైన 17,92,879 యూనిట్లతో పోలిస్తే 36.27శాతం తగ్గదల చోటుచేసుకుంది. వాహన విక్రయాలపై ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ ఆశిష్ హర్షరాజ్ కాలే మాట్లాడుతూ ‘‘జూన్తో పోలిస్తే జూలైలో రిటైల్ వాహన అమ్మకాలు ఊపందుకున్నాయి. వార్షిక ప్రాతిపదికన పరిశీలిస్తే విక్రయాలు సాధారణ స్థాయిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు వాస్తవ డిమాండ్ను తగ్గిస్తున్నాయి. గతేడాది జూలైలో లోబేస్ ఉన్నప్పటికీ అమ్మకాలు డబుల్ డిజిట్ క్షీణతను చవిచూశాయి’’ అన్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా విస్తారమైన వర్షాల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ట్రాక్టర్, చిన్న వాణిజ్య వాహనాలు, మోటర్ సైకిల్ విభాగాల్లో అమ్మకాల వృద్ధి కొనసాగిందని ఖేల్ తెలిపారు. డిమాండ్ను పెంచే విధివిధానాలను ప్రకటించాలని ఎఫ్ఏడీఏ మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేస్తుందన్నారు. ప్రోత్సాహక ఆధారిత స్క్రాపేజ్ విధానం కోసం పరిశ్రమ ఆత్రంగా ఎదురుచూస్తోందని ఇది మధ్య, భారీ వాణిజ్య వాహనాల అమ్మకాలకు గొప్ప ప్రోత్సాహాన్ని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. అటో తయారీ హబ్స్లో లాక్డౌన్ విధింపు లేకపోతే అగస్ట్ అమ్మకాలు ఆశాజనకంగా ఉండొచ్చని కాలే అభిప్రాయపడ్డారు. -
67 శాతం పడిపోయిన ఇళ్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తొమ్మిది ప్రధాన పట్టణాల్లో ఇళ్ల విక్రయాలు ఈ ఏడాది ఏప్రిల్–జూన్ కాలంలో 67 తగ్గినట్టు ప్రాప్ఈక్విటీ అనే సంస్థ తెలిపింది. ఈ కాలంలో 21,294 ఇళ్ల యూనిట్లు అమ్ముడుపోయినట్టు గణాంకాలను విడుదల చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 64,378 యూనిట్లు (ఇళ్లు/ఫ్లాట్లు)గా ఉన్నట్టు తెలిపింది. ‘‘నోయిడాను మినహాయిస్తే మిగిలిన ఎనిమిది ప్రధాన పట్టణాల్లో అమ్మకాలు పడిపోయాయి. గురుగ్రామ్లో అత్యధికంగా 79 శాతం క్షీణత నెలకొంది. కేవలం 361 ఇళ్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇక హైదరాబాద్లో 74 శాతం తగ్గి 996 ఇళ్ల విక్రయాలు నమోదు కాగా, చెన్నైలోనూ ఇంతే స్థాయిలో అమ్మకాలు తగ్గాయి. బెంగళూరులో 73 శాతం, కోల్కతాలో 75 శాతం చొప్పున అమ్మకాలు క్షీణించాయి. ముంబైలో 63 శాతం తగ్గి కేవలం 2,818 యూనిట్లకే విక్రయాలు పరిమితమైనట్టు’’ ప్రాప్ఈక్విటీ తెలిపింది. నోయిడాలో మాత్రం గతేడాది ఇదే కాలంతో పోలిస్తే విక్రయాలు 5 శాతం పెరిగి 1,177 యూనిట్లుగా నమోదైనట్టు పేర్కొంది. -
సిమెంటు కంపెనీల పల్లెబాట
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 దేశవ్యాప్తంగా అన్ని రంగాలనూ అతలాకుతలం చేసింది. ఇందులో సిమెంటు రంగం కూడా ఒకటి. కార్మికులు లేక నిర్మాణ రంగం కుదేలైంది. దీంతో సిమెంటుకు డిమాండ్ లేకుండా పోయింది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణాలు సాగుతుండడం కంపెనీలకు కాస్త ఊరటనిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి పొరుగు రాష్ట్రాలకు సిమెంటు రవాణా ఆగిపోవడంతో ఇప్పుడు కంపెనీలు గ్రామాలపై దృష్టిపెట్టాయి. అయితే కార్మికులు తిరిగి వస్తేనే నిర్మాణ రంగం గాడిన పడుతుందన్నది కంపెనీల మాట. జనవరి–మార్చి నాటికి మార్కెట్ సాధారణ స్థితికి వస్తుందని పరిశ్రమ ఆశాభావంతో ఉంది. గ్రామీణ ప్రాంతాలే ఆధారం... ప్రస్తుతం జరుగుతున్న సిమెంటు వినియోగంలో అత్యధికం గ్రామీణ ప్రాంతాల నుంచే జరుగుతోందని భారతి సిమెంట్ మార్కెటింగ్ డైరెక్టర్ ఎం.రవీందర్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. పట్టణాల్లో నిర్మాణాలు చాలా మందకొడిగా సాగుతున్నాయని చెప్పారు. ఊహించినదానికంటే అధికంగా పట్టణేతర ప్రాంతాల్లో నిర్మాణాలు సాగుతున్నాయని వివరించారు. నిర్మాణ రంగంలో ఇప్పుడు 30% మాత్రమే పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. కార్మికులు తిరిగి వస్తేనే సిమెంటుకు మంచి రోజులని వ్యాఖ్యానించారు. ప్లాంట్లలో తయారీ 25–30 శాతానికి పడిపోయిందన్నారు. ఇది జూలై–సెప్టెంబరులో 40–50%కి చేరుతుందన్న విశ్వాసం ఉందని చెప్పారు. కార్మికుల ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మౌలిక రంగ ప్రాజెక్టులపై పెట్టుబడులు చేస్తుందని తాము భావిస్తున్నామని సాగర్ సిమెంట్స్ జేఎండీ శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి–మార్చికల్లా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని విశ్వసిస్తున్నట్టు చెప్పారు. పదేళ్లుగా ధర అక్కడే..: తెలుగు రాష్ట్రాల్లో పదేళ్లుగా సిమెంటు బస్తా ధర రూ.350 చుట్టూ తిరుగుతోందని రవీందర్ రెడ్డి అన్నారు. ‘ద్రవ్యోల్బణం ప్రకారం చూసుకున్నా ఆ స్థాయిలో ధర పెరగలేదు. ప్లాంట్లలో ఉత్పత్తి 60–65 శాతమైతే బస్తా ధర రూ.350 ఉన్నా సరిపోతుంది. తయారీ 10% తగ్గితే బస్తాపైన వ్యయం రూ.25–30 అధికం అవుతుంది. ఇప్పుడు ప్లాంట్ల సామర్థ్యం 25–30%కి పరిమితమైంది. ఉత్పత్తి లేకున్నా సిబ్బంది వేతనాలు పూర్తిగా చెల్లించాం. ఇవన్నీ కంపెనీలకు భారమే. గతేడాది సగటుతో పోలిస్తే ధర 1% మాత్రమే పెరిగింది. జీఎస్టీ 28 శాతం ఉంది. దీనిని తగ్గించాలని ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో కోరుతున్నాం’ అని వివరించారు. ఇక రవాణా సమస్యలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి పొరుగు రాష్ట్రాలకు సిమెంటు సరఫరా దాదాపు నిలిచిపోయింది. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాలకు సరఫరాపై కంపెనీలు దృష్టిపెట్టాయి. కరోనా నియంత్రణలోకి వస్తేనే రవాణా సమస్యల నుంచి గట్టెక్కుతామనేది కంపెనీల మాట. సిమెంటు అమ్మకాలు ఇలా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో జనవరిలో 23 లక్షల టన్నులు, ఫిబ్రవరిలో 17, మార్చిలో 14 లక్షల టన్నుల సిమెంటు అమ్ముడైంది. కోవిడ్–లాక్డౌన్ ప్రభావంతో ఏప్రిల్లో ఇది 3.65 లక్షల టన్నులకు దిగొచ్చింది. అమ్మకాల పరంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో ఇదే తక్కువ పరిమాణం. మే నెలలో ఇరు రాష్ట్రాలు చెరి 7 లక్షల టన్నుల విక్రయాలు సాధించాయి. ఇందులో ఒక లక్ష టన్నుల మేర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్డర్లే ఉంటాయి. ఇక 2019 మే నెలలో 22 లక్షల టన్నులు కాగా, అదే ఏడాది జనవరిలో అత్యధికంగా 31 లక్షల టన్నుల సిమెంటు విక్రయాలు నమోదయ్యాయి. గత నెలతో పోలిస్తే జూన్ అమ్మకాల్లో 10 శాతం వృద్ధి ఉంటుందని పరిశ్రమ భావిస్తోంది. -
టాటా మోటార్స్ నష్టాలు 9,864 కోట్లు
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ కంపెనీకి గత ఆర్థిక సంవత్సరం(2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.9,864 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. అంతకుముందటి ఆర్థిక సంవత్సరం(2018–19) ఇదే క్వార్టర్లో రూ.1,109 కోట్ల నికర లాభం ఆర్జించామని టాటా మోటార్స్ తెలిపింది. కరోనా వైరస్ కల్లోలంతో దేశీయ వ్యాపారమే కాకుండా లగ్జరీ కార్ల విభాగం, జేఎల్ఆర్ వ్యాపారం కూడా దెబ్బతినడంతో గత క్యూ4లో భారీగా నష్టాలు వచ్చాయని వివరించింది. కార్యకలాపాల ఆదాయం రూ.86,422 కోట్ల నుంచి 28 శాతం క్షీణించి రూ.62,493 కోట్లకు తగ్గిందని పేర్కొంది. సాధారణ ఆర్థిక మందగమనం, లిక్విడిటీ ఒత్తిడి, బీఎస్–సిక్స్ నిబంధనల అమలు కారణంగా నిల్వలకు సంబంధించి సమస్యలకు తోడు లాక్డౌన్ కారణంగా అమ్మకాలు భారీగా పడిపోయాయని వెల్లడించింది. చైనాలో సేల్స్ పుంజుకుంటున్నాయని జేఎల్ఆర్ సీఈఓ రాల్ప్ స్పెత్ పేర్కొన్నారు. ► జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్)కు గత క్యూ4లో 50 కోట్ల పౌండ్ల (సుమారు రూ. 4,750 కోట్లు) నికర నష్టాలు, 540 కోట్ల పౌండ్ల (సుమారు రూ.51,300 కోట్లు) ఆదాయం వచ్చింది. ► స్డాండ్ అలోన్ పరంగా, 2018–19 క్యూ4లో రూ.106 కోట్ల నికర లాభం రాగా, గతేడాది క్యూ4లో రూ.4,871 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ► పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2018–19లో రూ.28,724 కోట్ల నికర నష్టాలు రాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.11,975 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ఆదాయం రూ.3 లక్షల కోట్ల నుంచి రూ.2.61 లక్షల కోట్లకు తగ్గింది. ► మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వచ్చాయి. బీఎస్ఈలో టాటా మోటార్స్ షేర్ 4.5% నష్టంతో రూ.100 వద్ద ముగిసింది. అయితే న్యూయార్క్ స్టాక్ ఎక్సే ్చంజ్లో లిస్టైన టాటా మోటార్స్ ఏడీఆర్ మాత్రం 7% ఎగసి ఏడు డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
మారుతీ లాభం 28 శాతం డౌన్
న్యూఢిల్లీ: దేశీయ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం గత ఆర్థిక సంవత్సరం(2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో 28 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2018–19) క్యూ4లో రూ.1,831 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.1,322 కోట్లకు తగ్గిందని మారుతీ సుజుకీ తెలిపింది. అమ్మకాలు తగ్గడం, ప్రమోషన్ వ్యయాలు పెరగడం, తరుగుదల వ్యయాలు కూడా అధికం కావడంతో నికర లాభం తగ్గిందని వివరించింది. నికర అమ్మకాలు రూ.21,473 కోట్ల నుంచి 15 శాతం క్షీణించి రూ.18,208 కోట్లకు తగ్గాయని పేర్కొంది. ఒక్కో ఈక్విటీ షేర్కు రూ. 60 డివిడెండ్ను ప్రకటించింది. ► గత క్యూ4లో మొత్తం కార్ల అమ్మకాలు 16 శాతం తగ్గి 3.85 లక్షలకు చేరాయి. ► పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2018–19లో రూ.7,651 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 26 శాతం క్షీణించి రూ.5,678 కోట్లకు తగ్గింది. ► నికర అమ్మకాలు రూ.86,069 కోట్ల నుంచి రూ.75,661 కోట్లకు తగ్గాయి. ► ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో మారుతీ షేర్ 1.8 శాతం లాభంతో రూ.5,035కు పెరిగింది. ఉద్యోగాలు, వేతనాల్లో కోత లేదు: గత ఏడాది నుంచి వాహన పరిశ్రమ సుదీర్ఘ సంక్షోభాన్ని ఎదుర్కొంటొందని, కరోనా ప్రభావం ఉన్నప్పటికీ ఉద్యోగాల్లో, వేతనాల్లో ఎలాంటి కోత విధించలేదని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్.సి. భార్గవ వ్యాఖ్యానించారు. -
‘తీపి’ తగ్గింది!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నష్టాల ఊబిలో ఉన్న చక్కెర కంపెనీలకు లాక్డౌన్ మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టింది. డిమాండ్ లేకపోవడం, సరఫరా సమస్యలు పరిశ్రమకు కొత్తగా తోడయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా 50 శాతం మేర అమ్మకాలు పడిపోయాయని పరిశ్రమ ప్రతినిధులు చెబుతున్నారు. ఫ్యాక్టరీల వద్ద షుగర్ నిల్వలు పేరుకుపోయాయి. ఆదాయం తగ్గడం, కార్మికుల వేతనాలు, వడ్డీలు.. వెరసి చేతిలో ఉన్న మూలధనం కాస్తా ఆవిరైందని కంపెనీలు అంటున్నాయి. ఇప్పట్లో ఈ రంగం కోలుకోవడం కష్టమేనని కంపెనీల ప్రతినిధులు వ్యాఖ్యానిస్తున్నారు. దేశవ్యాప్తంగా నెలకు సుమారు 22 లక్షల టన్నుల చక్కెర అమ్ముడవుతోంది. ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం గత సీజన్లో భారత్లో 172 మిల్లులు చక్కెర ఉత్పత్తి చేయగా.. ప్రస్తుత సీజన్లో ఈ సంఖ్య 139కి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నష్టాల్లోనే కంపెనీలు.. బస్తా (100 కిలోలు) చక్కెర ఉత్పత్తి వ్యయం ప్రస్తుతం రూ.4,000 పైమాటే. మిల్లుల వద్ద విక్రయ ధర రూ.3,400 ఉంది. అంటే ఒక్కో బస్తాపై కంపెనీలు రూ.600 నష్టం మూటగట్టుకుంటున్నాయి. చిన్న కంపెనీలకైతే∙రూ.700 వరకు నష్టం వస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో 100 కిలోల బస్తాకు మిల్లు వద్ద అమ్మకం ధర రూ.4,200 ఉంటేనే కంపెనీలు మనగలవని కేసీపీ షుగర్, ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జి.వెంకటేశ్వర రావు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఉత్తర ప్రదేశ్కు చెందిన ఒకట్రెండు కంపెనీలు మినహా మిగిలినవన్నీ భారీ నష్టాల్లో ఉన్నాయని చెప్పారు. శానిటైజర్ల తయారీని కొన్ని కంపెనీలు చేస్తున్నప్పటికీ, వీటి ద్వారా వచ్చే ఆదాయం తాత్కాలికమేన న్నారు. రికవరీ ఇప్పట్లో కష్టమే..: కౌలు ధర అధికంగా ఉండడం, కూలీ ఖర్చులు తడిసిమోపెడు అవడం, ఉత్పత్తికి ధర లేకపోవడంతో చెరకు పంట వేయడానికి రైతులు ముందుకు రావడం లేదని వెంకటేశ్వరరావు తెలిపారు. ‘రైతులకు మిల్లులు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోతున్నాయి. దేశంలో అప్పులు లేని కంపెనీలు ఒకట్రెండు మాత్రమే ఉంటాయి. వైరస్ భయానికి ఫ్యాక్టరీల్లో పనిచేయడానికి కార్మికులు రావడం లేదు. లాక్డౌన్ తదనంతరం తిరిగి సాధారణ స్థితికి రావడానికి ఆరు నెలలకుపైగా సమయం పడుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఉద్యోగుల కోత, వేతనాల కుదింపు తప్పదు. మిల్లు వద్ద విక్రయ ధర పెరిగితే తప్ప ఈ పరిశ్రమ రికవరీ ఇప్పట్లో కనపడడం లేదు’ అని చెప్పారు. అక్టోబర్ నాటికి..: దేశంలో 2019 అక్టోబరు 1 నాటికి 110 లక్షల టన్నుల చక్కెర నిల్వలు ఉన్నాయి. 2019–20 (అక్టోబర్–సెప్టెంబర్) క్రషింగ్ కాలంలో దేశవ్యాప్తంగా 270 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుందని సమాచారం. ఈ ఏడాది 50–60 లక్షల టన్నుల చక్కెర ఎగుమతి కావచ్చని పరిశ్రమ భావించగా, ఇప్పటికి సుమారు 30 లక్షల టన్నులే ఎగుమతైంది. అంతర్జాతీయంగా తక్కువ ధర, సరఫరా సమస్యల కారణంగా 10 లక్షల టన్నుల చక్కెర ఎగుమతి ఆగిపోనుందని ఓ కంపెనీ ప్రతినిధి వ్యాఖ్యానించారు. దీంతో ఈ ఏడాది అక్టోబరు 1 నాటికి చక్కెర నిల్వలు దేశంలో సుమారు 75 లక్షల టన్నులు ఉంటాయని ఆయన చెప్పారు. -
యాపిల్కు కరోనా దెబ్బ
బెర్కిలీ, అమెరికా: కరోనా వైరస్ వ్యాప్తిపరమైన ప్రతికూల పరిణామాలతో టెక్ దిగ్గజం యాపిల్ ఉత్పత్తుల విక్రయాలు మందగించాయి. జనవరి–మార్చి త్రైమాసికంలో ఐఫోన్ విక్రయాలు గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 7 శాతం తగ్గాయి. సంస్థ లాబాలు 2 శాతం క్షీణించి 11.2 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. సరఫరాపరమైన సమస్యలు, వైరస్ వ్యాప్తి కట్టడి కోసం ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అమలవుతున్న లాక్డౌన్ కారణంగా స్టోర్స్ మూతబడటం తదితర అంశాలు ఇందుకు కారణం. అయితే, ఆదా యం స్వల్పంగా 1 శాతం పెరిగి 58.3 బిలియన్ డాలర్లకు చేరింది. 2007– 2009 కాలంలో తలెత్తిన మాం ద్యం నాటి పరిస్థితి కన్నా ప్రస్తుత మందగమ నం మరింత తీవ్రంగా ఉండవచ్చని యాపిల్ సీఈవో టిమ్ పేర్కొన్నారు. అయితే, అనలిస్టుల అంచనాలకన్నా యాపిల్ కాస్త మెరుగైన ఫలితాలు సాధించినట్లు పరిశ్రమవర్గాలు తెలిపా యి. జనవరి–మార్చి త్రైమాసికంలో కంపెనీ ఆదా యం 6% పడొచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. -
రియల్టీకి లక్ష కోట్ల నష్టం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటివరకు దేశీయ రియల్టీ రంగానికి కరోనా వైరస్ కలిగించిన నష్టం అక్షరాలా లక్ష కోట్లు. రోజు రోజుకూ ఈ లాస్ మరింత పెరుగుతుందని ప్రాపర్టీ డెవలపర్లు, కన్సల్టెంట్లు అభిప్రాయపడ్డారు. దేశీయ రియల్టీ ఎదుర్కొంటున్న కరోనా ప్రభావాన్ని అధిగమించడానికి, నష్టాలను తగ్గించడానికి ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించాలని క్రెడాయ్, నరెడ్కో సంఘాలు కేంద్రాన్ని కోరాయి. వ్యవసాయం తర్వాత అతిపెద్ద ఉద్యోగ అవకాశాల రంగం రియల్ ఎస్టేట్. లాక్డౌన్ నేపథ్యంలో నగదు కొరత తీవ్రమవుతున్న నేపథ్యంలో ఈ రంగంలోనూ ఉద్యోగుల తొలగింపు, వేతనాల తగ్గింపు వంటివి తప్పవని క్రెడాయ్ నేషనల్ చైర్మన్ జక్షయ్ షా తెలిపారు. లాక్డౌన్ కొనసాగే కాలాన్ని బట్టి తొలగింపు నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు. 25 శాతం తొలగింపులు.. అమ్మకాల క్షీణతతో కంపెనీలు చేసే మొదటి నిర్ణయం వేతనాల తగ్గింపే. లిక్విడిటీ కొరత కారణంగా డెవలపర్లు రుణాల చెల్లింపులు చేయడంలో డిఫాల్ట్ అవుతారు. ఫలితంగా కంపెనీలు దివాళ తీస్తాయి. దీంతో ఉద్యోగుల తొలగింపులు తప్పవని నరెడ్కో అధ్యక్షుడు నిరంజన్ హిర్నందానీ తెలిపారు. ప్రభుత్వం రియల్టీ రంగానికి ఉద్దీపన ప్యాకేజీ ప్రకటిస్తే.. కంపెనీలు దివాలా తీయడం, ఉద్యోగాలు కోల్పోవటం వంటివి జరగవని తెలిపారు. లాక్డౌన్ కంటే ముందు శ్రామిక శక్తిలో ఉద్యోగుల తొలగింపు 15 శాతంగా ఉంటే.. ప్రస్తుతమిది 25 శాతానికి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పారు. -
ఇంటి ఈఎంఐలు చెల్లించట్లేదు..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత కొన్నేళ్లుగా తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్న రియల్ ఎస్టేట్ రంగానికి కరోనా వైరస్ రూపంలో కొత్త కష్టాలొచ్చాయి. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్లలో గృహ కొనుగోలుదారులు 65% వాయిదా చెల్లింపులు చేయటం లేదని ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్(ఐసీసీ) తెలిపింది. కొత్త ప్రాజెక్ట్లలో గృహ అమ్మకాలు క్షీణించడంతో పాటూ వాయిదా చెల్లింపుల్లేక నిర్మాణ సంస్థలు పీకల్లోతు కష్టాల్లో ఉన్నాయని ఐసీసీ డైరెక్టర్ రజనీష్ షా తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో గృహ కొనుగోలుదారులు కూడా లిక్విడిటీ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. దీంతో చాలా మంది కస్టమర్లు తమ చెల్లింపులను వాయిదా వేయాలని డెవలపర్లను కోరుతున్నారు. వచ్చే కొన్ని నెలల్లో ఈ తరహా అభ్యర్థనలు మరింత పెరిగే సూచనలున్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశీ రియల్టీ రంగం విలువ 12 బిలియన్ డాలర్లుగా ఉంది. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో రియల్టీ రంగం వాటా 5%గా ఉంటుంది. రియల్టీకి పేమెంట్ యాక్ట్ తేవాలి.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలకు(ఎంఎస్ఎంఈ) మాదిరిగానే ఆలస్యం చెల్లింపు చట్టం (డిలేయిడ్ పేమెంట్ యాక్ట్) రియల్ ఎస్టేట్ రంగానికి కూడా వర్తింపజేయాలని.. ఈ మేరకు కొన్ని సిఫార్సులను ఐసీసీ కేంద్రానికి సూచించింది. ఈ చట్టంతో కస్టమర్ల డిఫాల్ట్ పేమెంట్స్ను నిరుత్సాహపరుస్తుందని.. ఒకవేళ డెవలపర్లు అంగీకరించిన కాలానికి వాయిదా చెల్లింపులు మించిపోతే గనక సంబంధిత ఆలస్య చెల్లింపులపై జరిమానా వడ్డీని వసూలు చేయడానికి వీలవుతుందని రజనీష్ తెలిపారు. రియల్టీకి అత్యవసర ప్రాతిపదికన సహాయ ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. గడువును 6 నెలలు పొడిగించాలి.. కార్మికులు, ముడిసరుకుల కొరత కారణంగా నివాస ప్రాజెక్ట్లను పూర్తి చేయడం కష్టమవుతుంది. అందుకే సంబంధిత ప్రాజెక్ట్ల నిర్మాణ గడువు తేదీని రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) నుంచి 6 నెలల కాలం పొడిగించాలని షా కోరారు. కనీస ఒక త్రైమాసికం పాటైనా మున్సిపల్ పన్నులను మాఫీ చేయాలని సూచించింది. పన్నులు, బిల్లులు చెల్లించలేని సంస్థలకు జరిమానాలు విధించరాదని, ఆయా సంస్థలు తిరిగి చెల్లించడానికి 3–6 నెలల సమయం ఇవ్వాలని సూచించారు. వడ్డీ లేని రుణ వాయిదాలను 6 నెలల పాటు అందించాలన్నారు. -
స్మార్ట్ఫోన్కు ‘కరోనా’ ముప్పు
న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి కట్టడి కోసం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో దేశీ స్మార్ట్ఫోన్స్ పరిశ్రమ తీవ్రంగా నష్టపోనుంది. ఇది సుమారు 2 బిలియన్ డాలర్ల మేర ఉండొచ్చని కౌంటర్పాయింట్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. మార్చి, ఏప్రిల్లో విక్రయాలు గణనీయంగా మందగించడం ఇందుకు కారణంగా ఉంటుందని పేర్కొంది. మార్చి మధ్య దాకా కరోనా మహమ్మారి ప్రభావం ఒక మోస్తరుగానే ఉన్నప్పటికీ.. ఆ తర్వాత విజృంభిస్తుండటంతో లాక్డౌన్ అనివార్యమైందని వివరించింది. దీని ఫలితంగా 2020లో స్మార్ట్ఫోన్ల విక్రయం గతేడాది నమోదైన 15.8 కోట్లతో పోలిస్తే 3 శాతం తగ్గి 15.3 కోట్లకు పరిమితం కావొచ్చని అంచనా వేసింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే మార్చిలో 27 శాతం తగ్గనుండగా, ఏప్రిల్ 14 దాకా లాక్డౌన్ కొనసాగితే ఈ నెలలో దాదాపు 60 శాతం తగ్గుదల నమోదు కావొచ్చని కౌంటర్పాయింట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారికి మూలకేంద్రమైన చైనా నుంచి విడిభాగాల సరఫరా దెబ్బతినడం వల్ల ఈ ఏడాది తొలి త్రైమాసికంలో స్మార్ట్ఫోన్ తయారీ సంస్థలు తీవ్రంగా ఇబ్బందిపడ్డాయి. లాక్డౌన్ పెంచితే మరింతగా నష్టాలు.. ఒకవేళ లాక్డౌన్ను పొడిగించిన పక్షంలో నష్టాలు మరింత పెరగవచ్చని పాఠక్ చెప్పారు. మొత్తం సరఫరా వ్యవస్థ, ఆదాయాలు, చెల్లింపులు మొదలైనవన్నీ దెబ్బతినడమే ఇందుకు కారణమన్నారు. పైపెచ్చు వినియోగదారులు ఎక్కువగా పొదుపునకు ప్రాధాన్యమిచ్చి, కొనుగోళ్లను వాయిదా వేసుకోవడం వల్ల డిమాండ్ పడిపోవచ్చని పాఠక్ వివరించారు. భారత్ను ఎగుమతుల హబ్గా చేసుకున్న ఫ్యాక్టరీలపై ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అయితే, పరిస్థితి మెరుగైతే ఉత్పత్తిని వేగంగా పెంచుకోవాల్సిన అవసరం ఉండటంతో ఫ్యాక్టరీలు.. ఉద్యోగాల్లో కోతలు విధించడానికి మొగ్గు చూపకపోవచ్చన్నారు. పండుగల సీజన్ దాకా ఇంతే.. ఈ ఏడాది ద్వితీయార్థానికి గానీ స్మార్ట్ఫోన్లకు డిమాండ్ ఉండకపోవచ్చని పాఠక్ చెప్పారు. ‘ఈ ఏడాది మధ్య నాటికి పరిస్థితి మెరుగుపడినా కూడా.. పండుగల సీజన్ దాకా వినియోగదారులు కొనుగోళ్లను వాయిదా వేసుకోవచ్చు‘ అని ఆయన పేర్కొన్నారు. పరిస్థితి సాధారణ స్థాయికి తిరిగొస్తే .. ఆన్లైన్ విక్రయాలూ మెరుగుపడొచ్చన్నారు. ఆఫ్లైన్ విక్రేతలకు ఆకర్షణీయ ఆఫర్లివ్వడంతో పాటు ఆన్లైన్లోనూ స్టాక్స్ సత్వరం అందుబాటులో ఉంచేందుకు స్మార్ట్ఫోన్ తయారీ సంస్థలు ప్రయత్నిస్తాయని చెప్పారు. -
వాహన విక్రయాలు లాక్‘డౌన్’
న్యూఢిల్లీ: కరోనా కట్టడికి నిర్దేశించిన లాక్డౌన్ మార్చి వాహన విక్రయాలపై తీవ్రంగానే ప్రభావం చూపించింది. దీనికితోడు బీఎస్6 పర్యావరణ నిబంధనలు అమల్లోకి రానుండటంతో వాహన అమ్మకాలు భారీగానే తగ్గాయి.మారుతీ సుజుకీ, హ్యుందాయ్ అమ్మకాలు దాదాపు సగం వరకూ తగ్గగా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా కిర్లోస్కర్ (టీకేఎమ్) కంపెనీల అమ్మకాలు 40–90% రేంజ్లో క్షీణించాయి. -
పౌల్ట్రీకి 1,750 కోట్ల నష్టాలు
న్యూఢిల్లీ: చికెన్ వల్ల కరోనా వైరస్ (కోవిడ్–19) ప్రబలుతోందన్న వదంతుల మూలంగా పౌల్ట్రీ పరిశ్రమ గణనీయంగా దెబ్బతింది. నెల రోజుల వ్యవధిలో ఏకంగా రూ. 1,750 కోట్ల మేర నష్టాలు చవిచూసింది. ఈ నేపథ్యంలో తక్షణం సహాయక ప్యాకేజీ ఇవ్వాలంటూ కేంద్ర పశు సంవర్ధక శాఖకు పౌల్ట్రీ రంగం విజ్ఞప్తి చేసింది. చికెన్కు డిమాండ్ తగ్గిపోవడంతో కోళ్ల ధరలు కేజీకి రూ. 10–30 స్థాయికి (ఫాం గేట్) పడిపోయినట్లు అఖిల భారత పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ (ఏఐపీబీఏ) వెల్లడించింది. మరోవైపు సగటు ఉత్పత్తి ధర కేజీకి రూ. 80గా ఉంటోందని వివరించింది. ‘సోషల్ మీడియాలో పదే పదే వదంతులు వ్యాప్తి కావడంతో.. చికెన్పై వినియోగదారుల నమ్మకం సడలింది. చికెన్ ఉత్పత్తుల డిమాండ్ పడిపోయింది’ అని ఏఐపీబీఏ చైర్మన్ బహదూర్ అలీ తెలిపారు. దీంతో జనవరి మూడో వారం నుంచి ఫిబ్రవరి మూడో వారం మధ్య కాలంలో బ్రాయిలర్ రైతులు, బ్రీడింగ్ సంస్థల నష్టాలు దాదాపు రూ. 1,750 కోట్లకు చేరాయని ఆయన వివరించారు. ఈ భారీ సంక్షోభంతో పౌల్ట్రీ రంగం దివాలా తీసే పరిస్థితి వచ్చిందని అలీ ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగిన పక్షంలో ప్రతి నెలా రూ. 1,750 కోట్ల నష్టాల భారం పడుతుందన్నారు. దేశీ పౌల్ట్రీ లో 10 లక్షల మంది పైగా రైతులు ఉపాధి పొందుతున్నారు. దేశీయంగా జొన్న, సోయాబీన్ల వినియోగం ఎక్కువగా పౌల్ట్రీ రంగంలోనే ఉంటోందని.. ఇది గానీ దెబ్బతిందంటే ఆయా రైతులకూ కష్టం తప్పదని అలీ తెలిపారు. -
ఆటో రంగానికి వైరస్ కాటు...!
న్యూఢిల్లీ: దేశీ ఆటో పరిశ్రమకు కోవిడ్–19 (కరోనా) వైరస్ కుంగదీసింది. గతేడాదిలో భారీ పతనాన్ని నమోదుచేసి.. ఈ ఏడాది ప్రారంభంలో కాస్త పర్వాలేదు అనిపించిన ఈ రంగాన్ని తాజాగా కరోనా వైరస్ మళ్లీ పడేసింది. దిగ్గజ ఆటో సంస్థ మారుతి సుజుకీ దేశీయ వాహన విక్రయాలు ఫిబ్రవరి నెలలో 1.6 శాతం పడిపోయాయి. గత నెల్లో 1,36,849 యూనిట్లకు పరిమితమయ్యాయి. మహీంద్ర అండ్ మహీంద్ర (ఎం అండ్ ఎం) అమ్మకాలు ఏకంగా 42 శాతం క్షీణించాయి. కరోనా వైరస్ కారణంగా చైనా నుంచి సప్లై తగ్గడం వల్ల ఈ స్థాయి పతనం నమోదైందని సంస్థ చీఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ (ఆటోమోటివ్ డివిజన్) వీజయ్ రామ్ నక్రా వెల్లడించారు. వైరస్ కారణంగానే తమ కంపెనీ ఫిబ్రవరి విక్రయాలు తగ్గాయని టాటా మోటార్స్ ప్యాసెంజర్ వెహికిల్స్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ మయాంక్ పరీక్ తెలిపారు. -
కోవిడ్ ఎఫెక్ట్... శాంసంగ్ దూకుడు!
న్యూఢిల్లీ: కోవిడ్–19(కరోనా) వైరస్ చైనా ఎలక్ట్రానిక్ కంపెనీలను కలవరపెడుతుంటే.. భారత మార్కెట్లో ఆధిపత్యం కోసం తీవ్రంగా శ్రమిస్తున్న దక్షిణ కొరియా కంపెనీ శాంసంగ్ ఈ వైరస్ రూపంలో లాభపడనుంది.! చైనా మొబైల్ తయారీ కంపెనీలు, ఎలక్ట్రానిక్ సంస్థల ప్రణాళికలపై కోవిడ్ ప్రభావం చూపిస్తోంది. యాపిల్తోపాటు చైనాకు చెందిన షావోమీ, ఒప్పో, వివో, రియల్మీ తదితర ప్రముఖ కంపెనీలు తమ ఉత్పత్తుల విడుదల ప్రణాళికల ను సమీక్షించుకుంటున్నాయి. కానీ, శాంసంగ్ మాత్రం తన ప్రణాళికలను వాయిదా వేసుకోకుండా మరింత దూకుడుగా ఉత్పత్తులను విడుదల చేసే కార్యక్రమంలో ఉంది. భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) గణాంకాల ప్రకారం.. శాంసంగ్ ఇండియా 2020 ప్రారంభంలోనే 9 నూతన మొబైల్ ఫోన్లకు సంబంధించి బీఐఎస్ రిజిస్ట్రేషన్కు దరఖాస్తు చేసుకుంది. కానీ, ఇదే సమయంలో షావోమీకి చెందిన రెడ్మీ, దక్షిణ కొరియాకు చెందిన మరో సంస్థ ఎల్జీ రెండేసి ఉత్పత్తులకు రిజిస్ట్రేషన్ కోరడం చూస్తుంటే.. శాంసంగ్ దూకుడు పెంచినట్టు తెలుస్తోంది. ఇక ఇదే కాలంలో మోటరోలా, కూల్ప్యాడ్ సంస్థలు ఒక్కొక్క ఉత్పత్తి రిజిస్ట్రేషన్కు దరఖాస్తు పెట్టుకున్నాయి. దేశీయ కంపెనీలదీ దూకుడే..: ఈ సమయంలో దేశీయ కంపెనీలు కూడా తమ ఉత్పత్తుల విడుదలలో వేగాన్ని పెంచడాన్ని పరిశీలించాలి. ఢిల్లీకి చెందిన సెల్కార్ జనవరి 1 నుంచి ఇప్పటికే 15 మోడళ్లకు బీఐఎస్ రిజిస్ట్రేషన్ తీసుకుని చార్ట్లో అగ్రస్థానంలో ఉంది. మరో స్థానిక బ్రాండ్ హైటెక్ కూడా మూడు మోడళ్లకు ఈ కాలంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం గమనార్హం. ‘‘పెద్ద తయారీ సంస్థలు (ఓఈఎంలు) తమ ఉత్పత్తుల విడుదలను జాప్యం చేస్తున్నట్టు కనిపిస్తోంది. సాధారణంగా బీఐఎస్ రిజిస్ట్రేషన్ తర్వాత ఉత్పత్తుల విడుదలకు 4–6 వారాలు తీసుకుంటుంది. ప్రస్తుత పరిస్థితి శాంసంగ్కు అనుకూలం. ఎందుకంటే ప్రముఖ తయారీ కంపెనీగా కొరియా, ఇతర ప్రాంతాల నుంచి విడిభాగాలను సమీకరించుకుంటుంది. దీంతో కంపెనీ సరఫరా వ్యవస్థపై వైరస్ ప్రభావం ఉండదు’’ అని టెక్ఆర్క్కు చెందిన ముఖ్య అనలిస్ట్ ఫైసల్కవూసా తెలిపారు. చైనా కంపెనీలకు ఇబ్బందులు.. చైనాలో కోవిడ్ వైరస్ తీవ్రతతో కొన్ని ప్రాంతాల్లో తయారీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇది సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపించనుంది. దీని తాలూకూ వేడి భారత్లో కార్యకలాపాలు కలిగి ఉన్న చైనా కంపెనీలకు ఇప్పటికే తాకింది. చైనాకు చెందిన ప్రముఖ కంపెనీలకు భారత్లో తయారీ కేంద్రాలు ఉన్నప్పటికీ.. విడి భాగాల కోసం అవి మాతృదేశంపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. కానీ, వైరస్ ప్రభావం శాంసంగ్పై తక్కువే ఉండనుంది. ఎందుకంటే అధిక శాతం మొబైల్ ఫోన్లను ఈ సంస్థ నోయిడాలోని కేంద్రంలోనే తయారు చేస్తోంది. పైగా 2018లో తయారీ సామర్థ్యాన్ని కూడా గణనీయంగా పెంచుకుంది. అంతకుముందు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 68 మిలియన్ యూనిట్లుగా ఉంటే, 120 మిలియన్ యూనిట్లకు విస్తరించింది. ఇక విడిభాగాలను కూడా స్థానికంగానే సమీకరించుకుంటోంది. అలాగే, వియత్నాంలో భారీ తయారీ కేంద్రం కూడా కలిగి ఉంది. ‘‘చైనా సంస్థలతో పోలిస్తే శాంసంగ్ కార్యకలాపాలు ఎన్నో ఖండాల్లో విస్తరించి ఉన్నాయి. కనుక అతిపెద్ద నిల్వలను కలిగి ఉంటుంది. చైనా నుంచి సరఫరా పరంగా ఉన్న ఇబ్బందులు మొదటి త్రైమాసికంలో శాంసంగ్కు కలసి రానున్నాయి’’ అని రీసెర్చ్ సంస్థ ఐడీసీ డైరెక్టర్ నవకేందర్సింగ్ తెలిపారు. పెద్దగా ప్రభావం ఉండదు.. ‘‘చాలా వరకు విడిభాగాలను భారత్లోనే తయారు చేస్తున్నాం. అంతేకాదు వియత్నాంలో భారీ తయారీ కేంద్రం కూడా ఉంది. కరోనా వైరస్ సంక్షోభ ప్రభావం మా కార్యకలాపాలపై పెద్దగా ఉండదు’’ అని శాంసంగ్ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు. ఫ్లాగ్షిప్ మోడళ్లు అయిన గెలాక్సీ జెడ్ ఫ్లిప్, ఎస్20 ప్లస్ మోడళ్లను మార్చి నాటికి విడుదల చేయనున్నట్టు చెప్పారు. ఒకప్పుడు దేశీయ మార్కెట్లో టాప్లో ఉన్న శాంసంగ్ 2019 డిసెంబర్ నాటికి మూడో స్థానానికి పడిపోయింది. షావోమీ, వివో తొలి రెండు స్థానాలను ఆక్రమించేశాయి. 2019 జూన్ క్వార్టర్ నాటికి శాంసంగ్కు 25.3% మార్కెట్ వాటా కలిగి ఉండగా, డిసెంబర్ నాటికి అది 15.5%కి తగ్గింది. భారత మార్కెట్లో ‘గెలాక్సీ జెడ్ ఫ్లిప్’ ధర రూ.1.10 లక్షలు న్యూఢిల్లీ: శాంసంగ్.. ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ ‘గెలాక్సీ జెడ్ ఫ్లిప్’ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. గతవారంలోనే అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో తన ఆల్ట్రా–ప్రీమియం స్మార్ట్ఫోన్ను ప్రదర్శించిన కంపెనీ.. ఇక్కడ మార్కెట్లో దీన్ని గురువారం విడుదలచేసింది. ధర రూ. 1.10 లక్షలు కాగా, రెండు యాప్లను ఒకేసారి తెరవగలిగే సౌలభ్యం ఇందులో ఉందని, సాంకేతిక ఆవిష్కరణలో మైలురాయిగా నిలిచిపోయే హ్యాండ్సెట్గా జెడ్ ఫ్లిప్ నిలిచిపోనుందని ఈ సందర్భంగా కంపెనీ ఇండియా డైరెక్టర్(మొబైల్) ఆదిత్య బబ్బర్ వ్యాఖ్యానించారు. ఇక స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. 6.7 అంగుళాల పూర్తి హెచ్డీ డైనమిక్ అమోలెడ్ ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్ప్లే, 8 జీబీ ర్యామ్, 256 స్టోరేజ్, ఆండ్రాయిడ్ 10 ఓఎస్, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, వెనుకవైపు రెండు 12 మెగాపిక్సెల్ కెమెరాలు, 10ఎంపీ సెల్పీ కెమెరా ఉన్నాయి. -
చైనాలో వాహన విక్రయాలు డౌన్
బీజింగ్: చైనాలో వాహన విక్రయాలకు కరోనా వైరస్ సెగ తగులుతోంది. జనవరిలో ఆటో అమ్మకాలు .. గతేడాది జనవరితో పోలిస్తే ఏకంగా 20.2 % పడిపోయాయి. 16 లక్షలకు పరిమితమైనట్లు చైనా వాహన తయారీ సంస్థల సమాఖ్య సీఏఏఎం ప్రకటించింది. అమ్మకాలు పడిపోవడంతో కంపెనీలు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాయని పేర్కొంది. అమెరికాతో వాణిజ్య యుద్ధం, వృద్ధి మందగమనం, ఉద్యోగాల కోత వంటి సమస్యలతో చైనా సతమతమవుతుండగా.. తాజాగా మరిన్ని కష్టాలు చుట్టుముడుతున్నాయి. కరోనా వైరస్ మరింత విస్తరించకుండా కట్టడి చేసేందుకు నూతన సంవత్సర సెలవులను మరింతగా పొడిగించడం.. ఫలితంగా ఫ్యాక్టరీలు, డీలర్షిప్లు మూతబడటం మొదలైన పరిణామాలు ఆటోమొబైల్ పరిశ్రమను మరింతగా కుదేలు చేస్తున్నాయి. సాధారణంగా జనవరిలో సెలవుల సీజన్ తర్వాత ఫిబ్రవరిలో అమ్మకాలు భారీగా నమోదవుతాయి. అయితే, ప్రస్తుతం ఫిబ్రవరి సగం గడిచిపోయినా.. కంపెనీలు ఇంకా తయారీ కార్యకలాపాలు ప్రారంభించలేదు. స్వల్పకాలికంగా వాహనాల ఉత్పత్తి, అమ్మకాలపై గణనీయంగా ప్రతికూల ప్రభావం పడుతోందని, పరికరాల సరఫరా వ్యవస్థకు సమస్యలు తప్పవని సీఏఏఎం తెలిపింది.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు
కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (15-05-2024)
స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
గర్భస్త శిశువుకూ జీవించే హక్కుంది: సుప్రీం సంచలన తీర్పు
స్వాతి మలివాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనమేల?
పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
Buddy First Single: పాటతో రూమర్స్కి చెక్ పెట్టిన అల్లు శిరీష్!
మిస్ యూఎస్ఏ విజేతల వరుస రాజీనామాలు! రీజన్ ఏంటో చెప్పిన తల్లులు
ఇన్ఫోసిస్ ప్రైజ్.. 40 ఏళ్లకు తగ్గించిన వయో పరిమితి
తప్పక చదవండి
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- యంగ్ హీరోతో మృణాల్ డేటింగ్? ఏంటి విషయం!
- టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement